Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --4

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --4

( దృశ్యము—12 )

( భూలోకంలో భృగు మహర్షి ఆశ్రమం )

( మహర్షి భృగు గొప్ప జ్యోతిష సంహిత రచించిన వాడు. ఆగతానాగత వర్తమానాలు క్షుణ్ణంగా తెలిసిన మహా ద్రష్ట. అతనికి ఎదురుగా శిష్యుడు ద్వారకా ఋషి కూర్చొని ఉంటాడు. భృగుడు తన సంహితలోని పాఠం చెప్తూ ఉంటాడు )

భృగుడు ---- వత్సా, ద్వారకా !

ద్వారక ----- గురుదేవా !

భృగుడు ----- జాతక చక్రం పరిశీలించి. ఆయుర్దాయ నిర్ణయం చెయ్యడం తెలుసుకొన్నావు గదా !

ద్వారక ----- మీ దయవల్ల అంతా కరతలామలకం అయింది.

భృగుడు ---- నీ వంటి శిష్యుడు దొరికితే, అధ్యయనం నల్లేరు మీద బండిలా నడిచి పోతుంది ! ఇక ఈ రోజు నుంచి నవమ భావం గురించి చెప్తాను, విను.

ద్వారక ---- చిత్తం గురుదేవా !

భృగుడు ------- (శ్లోకం ) -- “ భాగ్య, ధర్మ, దయా, పుణ్య తపస్తాత్, సుతాత్మజః
దానోపాసన, సౌశీల్య, గురవో నవమాదమీ “”

( అదే సమయానికి కుటీరంలోకి ఒక పాము ప్రవేశిస్తుంది . ఆ పాము మహర్షికి ఎదురుగా రాబోయి, శిష్యుడు ద్వారకని చూసి, తిరిగి వచ్చిన దారినే వెనుకకు మళ్లిపోతుంది . ద్వారక దానిని చూస్తాడు. )

ద్వారక ---- గురుదేవా ! అధ్యయనానికి అవాంతరం కలిగిస్తున్నందుకు మన్నించాలి.

భృగుడు ---- ఏమయింది ద్వారకా ?

ద్వారక --- ఒక పాము తమ దర్శనానికి వచ్చి, సంకోచంతో తిరిగి వెళ్లిపోతోంది !

( భృగుడు ఆ పాము వంక చూస్తాడు. మహర్షి చూపు పడగానే పాము ఆగుతుంది. తిరిగి ముందుకు వచ్చి నిలిస్తుంది, భృగుడు దాని వంక తేరిపార చూసి, పిలుస్తాడు )

భృగుడు ------ ఆదిశేషా ! ఎందుకిలా వచ్చావు ?

ఆదిశేష ------(మానవ రూపం దాల్చి ) మహర్షీ ! నా నవమ భావాన్ని క్షుణ్ణంగా పరిశిలించండి.

భృగుడు --- నీ కేమి ఆదిశేషా ! శివ—కేశవుల సన్నిధిని పొందిన భాగ్యశాలివి ! భాగ్య పరీక్ష నీ కేల ?!

ఆదిశేష ---- మహర్షీ ! నా శిరస్సు పైన, పాద స్పర్శ కలిగేలాగ , నేను శ్రీ మహావిష్ణువును వర మడిగాను.---

భృగుడు ---- ఆదిశేషా ! నీకు వాయువుతో యుద్ధం ఎన్నాళ్లు జరిగింది ?

ఆదిశేష ----- సహస్రాబ్దములు మహర్షీ !

భృగుడు ----- యుద్ధములో పడి, విష్ణు సన్నిధిని అన్ని అబ్దములు విడిచి మనగలిగిన వాడివి, --- ఇప్పుడీ తొందర పాటు ఎందులకయ్యా?

ఆదిశేష ---- (సిగ్గుతో తల దించుకొని ) మీకు తెలియని దేమున్నది మహర్షీ ! పగ – ప్రతీకారములకు లోనైన నా మనసులో, పరమాత్మ గురించి ఆలోచించే వ్యవధి లేక పోయింది.

భృగుడు ----- ఆదిశేషా ! అదే విష్ణు మాయ ! ఆ మాయాజాలము నుండి తప్పించుకొనుట, సాధ్యము కాదు .

ఆదిశేష ----- మహర్షీ ! మీ మాటలు నాకు కొంత ఊఁరట కలిగించినది. కాని నా కోరిక తీరు మార్గము—

భృగుడు ----- చాల కష్ట సాధ్యము అనంతా ! ఎందరో త్యాగధనులు, ఎన్నెన్నో త్యాగాలు చేస్తేనే గాని, వైకుంఠ వాసుని కదల్చుట ---- ( భావ గంభీరంగా ) -- వీలు కాని పని.

ద్వారక ----- మహర్షీ ! ఎందరో మహానుభావులు ఎన్నెన్నో త్యాగాలు చేయాలన్నారు ! వారందరూ ఎవరు ? ఏక కాలంలో ఎలా చెయ్యగలరు ?

(సరిగ్గా అదే సమయానికి ద్వారకా ఋషి చెయ్యిమీద చేరిన ఒక చీమ అతని చేతిని, కరుస్తుంది. ద్వారక చీమని విదిలిస్తాడు. అది వదలధు . ఆ దృశ్యాన్ని చూసిన భృగుడు ద్వారకని ప్రశ్నిస్తాడు)

భృంగుడు ---- ఏమయింది ద్వారకా ?

ద్వారక ---- ( నవ్వుతూ ) చీమ కరిచింది మహర్షీ !

భృగుడు ------ దానినలా విదిలించి వేయకు ద్వారకా ! శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని తెలుసుగా !

ద్వారక ----- నిజమే మహర్షీ ! ఈ చీమ నన్ను ఎందుకు కుట్టిందో , తెలుసుకోవాలని ఉంది !

భృగుడు ------ అలాగయితే దానికి నీ వాణిని ఇయ్యి, నాను రూపాన్ని ఇస్తాను .

( ద్వారక, భృగులిద్దరూ, ఆ చీమను తదేకంగా చూస్తారు, చీమ క్రిందకు జారి మానవ రూపం ధరిస్తుంది )

చీమ ---- మహర్షులారా ! ధన్యవాదములు !

భృగుడు ----- వత్సా ! ఎవరు నీవు ? ద్వారకుని అలా కుట్టి, భాదించధానికి కారణమేమిటి ?

చీమ ----- మహర్షీ ! ఈ సృష్టిలో అత్యల్ప ప్రాణినైన నా నివాసం--- హిమాచలం !

భృగుడు ---- ఏమి హిమాలయమా !!

చీమ ----- అవును, నా వయసెంతో నాకే తెలియదు ! అమృత సేవనం వల్ల నేను అమరుణ్ని అయ్యాను !

ఆదిశేష ----- చిన్న పిపీలకమైన తమరు, అమృత పానం ఎలా చెయ్యగలిగారు ?

చీమ ----- అదొక చిత్రమైన కథ ఆదిశేషా ! పరమేశ్వరుడు , సతీ వియోగ దుఃఖంతో కలత పడి, హిమపన్నగం పైన అచేతనావస్థలో నా పుట్ట ప్రక్కనే పడిపోయాడు ! అప్పుడు అతని శిరస్సు పైని చంద్రవంక నేల తాకింది ! అలా నేలని తాకిన చందమామలోని, అమృతాన్ని నేను తనివితీరా జుర్రుకున్నాను !

భృగుడు ----- ( శ్లోకం ) సతీ వియోగేన విషణ్ణ చేతసః ప్రభో శయానస్య హిమాలయా గిరౌ
శివస్య చూడా కలితం సుధాశయం పిపీలికా చుంబతి చంద్ర మండలం
అన్న శ్లోకాన్ని నేను కవి చమత్కారమని అనుకొన్నాను ! ఇప్పుడీ పిపీలికోత్తముడు చెప్పినది వింటే నిజంగానే జరిగిందని తెలుస్తోంది !!

చీమ ---- చిత్తం మహర్షీ ! అలా నేను చిరంజీవి నయ్యాను ! శివ స్పర్శ భాగ్యవశమున కలిగింది. కాని లభ్యమయిన మహదవకాశం వల్ల, నాకు తృప్తి కలుగ లేదు !

భృగుడు ----- ఇంకా ఏం కావాలనుకొంటున్నావు ?

చీమ ----- శివ స్పర్శ కలిగినట్లే, కేశవ స్పర్శ కూడా కలగాలనుకొన్నాను. అందుకే హిమాలయం నుండి బయలుదేరిన కొందరు ఋషుల, దుస్తులలో దాగి , ఆనందగిరిని చేరుకొన్నాను---

భృగుడు ---- ఆనంద గిరినే ఎందుకు చేరుకొన్నారు పిపీలికోత్తమా ?

చీమ -----మహర్షీ ! మీరు సర్వజ్ఞులయి కూడ నా వంటి అజ్ఞానిని ఇలా ప్రశ్నించడం, ఆశ్చర్యంగా ఉంది !! వైకుంఠం లోని శ్రీ మహావిష్ణువు క్రీడాద్రిని, స్వామివారి ఆజ్ఞతో వైకుంఠం నుండి తరలించి గరుత్మంతుడు భూలోకానికి తరలించారట ! మేరువు కుమారుడైన ఆనందుడే ఆ పర్వతమట ! దానిపై స్వామి భూలోకానికి, వచ్చినప్పుడల్లా తన దేవేరులతో వాహ్యాళి చేస్తారట ! ఈ కథని నేనా ఋషుల పుంగవుల వద్దనే విని, ఏదో ఒక రోజు , కేశవ దర్శనం కావచ్చునని తలచి, వారితో పాటు ఆ గిరిని చేరుకొన్నాను.

భృగుడు ------ ఆ తరువాత ఏమయింది ?

చీమ ---- ఆ గిరిని ఆదిశేషుడు వచ్చి, చుట్టగా చుట్టి పట్టుకొని వాయువు బారి నుండి రక్షించాడు ! నేను కూడ అతని శరీరాన్నే ఆశ్రయించి, స్మామివారి స్పర్శకు ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను. ఈ రోజు ఆదిశేషునితో పాటు, నా భాగ్య పరీక్ష చేసుకోవాలనే, ద్వారకా ఋషిని కుట్టి బాధించాను !

భృగుడు ---- పిపీలికోత్తమా ! మీ కోరిక, ఆదిశేషుని కోరిక రెండూ ఒకటే కావడం, ఇద్దరూ విష్ణు సన్నిధి కోసం ఒకే చోటికి చేరడం, చిత్రంగా ఉంది !!

చీమ ------ మహర్షీ ! మీరు ఆగతానాగత వర్తమానాలు చెప్పగలిగిన ప్రతిభా సంపన్నులు ! శ్రీ మహాలక్ష్మికి జనకులు !! మీరు నా కోరిక తీరునో లేదో తెలియ జేసి, నా మనసుకు ఊఁరట కలిగించండి !

( అదే సమయంలో ఒక చింత చెట్టు రెమ్మ ఎగురుతూ వచ్చి, వారి మధ్య పడుతుంది. భృగు మహర్షి ఆ చింతాకు రెమ్మని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసి, తన ప్రక్కనే పెడతాడు )

భృగుడు ----- మహానుభావులారా !! ఈ చింతాకు రెమ్మ కూడ మీలాగే ఆనందగిరి నుండి వచ్చింది ! శ్రీ మహావిష్ణువు అశ్వద్థ వృక్షానికి కలిగించిన భాగ్యమే , ‘తనకి’ కూడ కలిగించమని వేడుకోడానికి వచ్చింది !! నేడు నా ఆశ్రమ సీమ పవిత్రమయింది ! హరి దర్శనాతురులైన వారి సన్నిధి పొందే భాగ్యము నాకు కలిగింది ! ఆదిశేషా ! పిపీలికోత్తమా ! ! ఓ చింత్రిణీ దళమా !!! మీరందరూ వినండి.

ఆదిశేష, చీమ --- సావధానులమై ఉన్నాము మహర్షీ !

భృగుడు ----- స్వామి ఆనందగిరి యందలి పుష్కరిణికి దక్షిణమున గల ఈ చింతచెట్టు క్రింద, విశ్రమింప గలవారు !! అందు వలన ఆ చెట్టు క్రింద ఒక చక్కని వల్మీక భవనమును నిర్మింపండి ! ఏమి పిపీలికోత్తమా , మీరా పని చెయ్యగలరు గదా !?

చీమ ----- అహో ! నా భాగ్యము,! అటులనే చేసెదను మహర్షీ !

భృగుడు ---- ఆదిశేషా ! స్వామి చింత చెట్టు క్రింద, వల్మీకము నందు రానున్నారు గనుక, నీ వీ చింత చెట్టునందు నీ యంశను నిలిపి, దీనిని నిద్ర పోనీయకము ! (ఎప్పుడూ అన్ని కాలాల లోనూ, చిగురించి ఫలించే చెట్టును నిద్ర ఎరుగని చెట్టు అంటారు ) నీవు శయనించిన రీతిగానే యీ వృక్ష శాఖలను కూడ మలచుకొనుమని చెప్పుము ! ( నాలుగు దిశల వైపు, నాలుగు శాఖలు ఉంఢే యీ ‘చింత’, అంటే నిత్య చింతన గలిగి ఉండేడట ! )

ఆదిశేష ----- అటులనే మహర్షీ ! ( అంటూ ఆదిశేషుడు మహర్షి దగ్గర నుండి, ఆ చింత రెమ్మను తీసుకొని తన కన్నులకు అద్దుకొంటాడు. )

చీమ ---- మహర్షీ ! నాకు మరల నా రూపమును ప్రసాదించండి ! యీ మానవ శరీరము నాకు దుర్భరముగా ఉన్నది !!

భృగుడు ----- తథాస్తు ! ఇష్ట కామ్య సిద్ధిరస్తు !

( చీమ తన రూపాన్ని పొందుతుంది. ద్వారకా ఋషికి, తిరిగి తన వాణి లభిస్తుంది. )

ద్వారక ----- భృగు మహర్షీ ! నాకీ రోజు చాల సందేహములు పొడ చూపుచున్నవి ! యీ పిపీలికోత్తమునకు తెలిసిన విషయము, నాకు తెలియక పోవుట నా అజ్ఞానమునకు పరాకాష్ట అని అనిపించుచున్నది !

భృగుడు ----- వత్సా ! ద్వారకా ! దిగులు చెందకుము. యీ పన్నగ శ్రేష్టుడు, పిపీలికోత్తముడు సామాన్యులు కారు ! పరమాత్మ సన్నిధిని పొందిన మహా మహితాత్ములు !! వారితో పోలిక మనకు కూడదు. నీకు కావలసిన విషయము నన్నడిగి తెలుసుకొనుము !

ద్వారక ----- మహర్షీ ! ఈ పిపీలకోత్తముడు మిమ్ములను శ్రీ మహాలక్ష్మికి జనకులుగ పేర్కొన్నాడు ! క్షీర సాగర మథనమున శ్రీ మహాలక్ష్మి సముద్రము నుండి, ఉద్భవించెననునది లోక విదితము కదా !! ఆమె మీ కుమార్తె ఎట్లయినది ?

భృగుడు ------ ( నవ్వి ) అదియా నీ సందేహము !! అదొక చిత్రమైన వృత్తాంతము !!

ఆదిశేష ----- మహర్షీ ! నాకు కూడ ఈ వృత్తాతము తెలియదు ! దయతో చెప్పి మమ్ములని కృతార్థులను చేయుడు.

భృగుడు ----- అటులనే కానిండు ! నేను దక్షుని కుమార్తె అయిన ఖ్యాతిని భార్యగా పొంది, ఆమెయందు ధాతృ, విధాతృలనే కుమారులను, లక్ష్మియను కుమార్తెకు జనకుడ నయితిని ! లక్ష్మి జన్మతోనే సంపదలకు అధిష్టాన దేవతయై, ఆ సంపదలకు, ప్రభువైన ఇంద్రుని లోకములో ఉండేది ! ఇలా ఉండగా ఒక రోజు దూర్వాస మహర్షి, ఇంద్ర లోకమునకు విహారార్థము వెడలినాడు.

ద్వారక ----- ఆ పైన ఏమయినది మహర్షీ ?

భృగుడు ----ఒక విధ్యాధర కాంత చేతిలోని పారిజాత మాలని చూసి , ముగ్ధుడైన దూర్వాసుడు, ఆ మాలను ఆమెనడిగి తీసుకొన్నాఢు. అదే సమయమున ఇంద్రుడు ఐరావతము నెక్కి అనుచరులు వెంట రాగా అక్కడికి వచ్చినాడు. దూర్వాసుడు ఆ ఇంద్రునికి పారిజాత మాలను బహూకరించినాడు. ఇంద్రుడు ఆ మాలను ఐరావతము నుండి దిగక, నిర్లక్ష్యముతో తన అంకుశముతో నందుకొని, మీదకు లాగే సమయంలో , పారిజాత సుమ సౌరభాలకు చేరిన తుమ్మెదలు రొద చేస్తూ, ఐరావతానికి చికాకు కలిగించాయి.దాంతో ఐరావతము ఆ దండను లాగి, ముక్కలు ముక్కలు చేసి విసిరి వేసినది ! ఆ దృశ్యము చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది, ఇంద్రుని శపించాడు.

ద్వారక ---- ఏమని శపించారు, మునీంద్రా ?

భృగుడు ----- ఇంద్రుని సంపదలు రాళ్లుగా మారి, సముద్ర గర్భంలో మినిగి పోతాయని, అతడు పదవీ చ్యుతుడవుతాడనీ, శపించాడు.

ద్వారక--- ఇప్పుఢర్థమయింది మహర్షీ ! సంపదలతో పాటు వాటి అధిస్థాన దేవతయైన లక్ష్మి కూడ, సముద్రమందు పడి, తిరిగి క్షీరసాగర మథనము నాడు, బయట పడిందన్నమాట !?

భృగుడు ----- అవును ! అప్పుడు కూడ లక్ష్మికి కన్యాదానము నేనే చేసాను !

ఆదిశేష ---- శ్రీ మహాలక్ష్మి జన్మ వృత్తాంతము విని, నా కెంతో సంతోషము కలిగినది. పిపీలకునితో పరిచయము కథా శ్రవణము జరిగాయి. ఇక మాకు తరుణోపాయము చెప్పి సెలవీయండి.

భృగుడు ----- ఆదిశేషా ! శ్రీ మహావిష్ణువు వైకుంఠము వదిలి, భూలోకానికి నీ శిరస్సు పైన నెలకొనాలంటే దానికి శ్రీ మహాలక్ష్మి సహకారము కావలె ! లక్ష్మి కదలనిదే విష్ణువు కదలజాలడు ! అందుచేత నీకు వారివురినీ ప్రసన్నం చేసుకొనే మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను, విను ! “ ఓం, హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః “ ! ఈ మంత్రాన్ని గాని జపం చేయ్యి. పిపీలికోత్తమా ! మీరు కూడ విన్నారు కదా ?

( పిపీలిక. ఆదిశేషులు తలలు ఊపి, మహర్షికి అభివాదం చేస్తారు. )

ఆదిశేష ----- మహర్షీ ! ఇక సెలవియ్యండి, ఈ నాటి నుంచి, నేనీ మంత్రమును జపించెదను గాక ! ( అంటూ పిపీలికాన్ని తన మీదకి ఎక్కించుకొని , చింత రెమ్మను పట్టుకొని నిష్క్రమిస్తాడు )

ద్వారక ---- మహర్షీ ! ఈ పామును, చీమను చూసాక, నాకు కూడ ఆ మంత్రాన్ని, జపించాలనే కోర్కె బలీయమైంది ! మీరు అనుమతిస్తే------

( ద్వారకా ఋషి ఆ మాట అంటూ ఉండగానే , అతని నెత్తి మీద, రెండు ‘కుంకుడుకాయలు’ పడతాయి. ద్వారకుడు వాటిని అందుకొని చూస్తాడు. )

భృగుడు ----- ద్వారకా ! ఆ మంత్రము నీ ముందు ఉపదేశించినది, అందుకే సుమా ! ఈ కుంకుడు కాయలు నీ మీద పడి, నీవే చెట్టుని ఆశ్రయించాలో, చెప్పక చెప్తున్నాయి ! ఎందరో తపస్సంపన్నులు ఎన్నెన్నో త్యాగాలు చేస్తేనే గాని, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మితో సహా భూలోకానికి తరలి రావడం జరగదు !

ద్వారక ---- మహర్షీ ! శ్రీ మహాలక్ష్మి మీ పుత్రికే కదా !! ఆమెను పుడమికి పిలిపించలేరా ?

భృగుడు ------ నా పుత్రిక నాథుని సేవలో పడి, అతని హృదయ సీమలో చేరి, నివసించి అంతర్ముఖియై-- లోకాలను చూడడం మానేసింది ! అందుకే యీ లోకం భాగ్యహీనమై, నానాటికీ దిగజారి పోవుచున్నది !! ఆమెను నా ‘ అక్షికుక్షి’ విద్య ద్వారా, జాగృతం చేస్తేనే గాని, పని నెరవేరదు !!!

ద్వారక ----- మహర్షీ ! అక్షికుక్షి విద్య అంటే ఏమిటి ?

భృగుడు ----- కంటి చూపుతో ఎదుటివారి ఆలోచనలను స్తంభింప జేసి, వారిని సమ్మోహితులుగా చేసి, మనం చెప్పాలనుకొన్నది చెప్పి, ఆదేశించి జాగృతం చేయడం !!

ద్వారక ----- శ్రీ మన్నారాయణుని హృదయాంతర వాసిని అయిన, శ్రీదేవిని , మీరు అంతలా ఎలా సమ్మోహనం చేయగలరు ? శ్రీ హరి అట్లు మిమ్ములను చేయనిస్తారా మహర్షీ ?!

భృగుడు ------ మంచి ప్రశ్నే వేసావు , ఇంకొకరు తేరిపార చూడగల వక్షస్థలమా అది !!!

ద్వారక ---- మహర్షీ ! మరి--- మరి--- మీరా విద్యను ఎలా ప్రయోగించ గలరు ?

భృగుడు ----- ద్వారకా ! నా ఎడమ పాదంలో ఒక కన్ను ఉంది ! ఆ కంటితోనే --- నేనా విద్యను ప్రయోగించ గలను.

ద్వారక ---- మహర్షీ ! యీ వార్త నా కెంతో సంతోషము కలిగించినది ! మరి---- మరి----

భృగుడు ----- ఏమిటి ద్వారకా ?

ద్వారక ----- నా తపోభూమి ఏదో దయతో సెలవిస్తే-----

భృగుడు ---- నాకు తెలిసినచో చెప్పకుందునా వత్సా ! నీపై ఆశీర్వచనము వలె పడిన ఆ కుంకుడు కాయలు ఏ చెట్టువో, నీవే గ్రహించి తెలుసుకోవాలి ! ఆ వృక్ష మూలమే నీ తపోభూమి కాగలదు !

ద్వారక--- ( నమస్కరించి ) ధన్యోస్మి, గురుదేవా , ధన్యోస్మి !!!

( అదే సమయానికి కుటీరం బయటి నుండి పిలుపు వినిపిస్తుంది )

బయటినుంచి ---- “ భృగు మహర్షీ ! భృగు మహర్షీ !!”

( ద్వారక కుటీరం బయటికి వెళ్లి, తిరిగి కాసేపటికి వచ్చి, సంతోషంతో అంటాడు )

ద్వారక ---- గురుదేవా ! బయట అత్రి, వశిష్ఠ, జమదగ్ని మహర్షులు నిలిచి ఉన్నారు, ప్రవేశానికి తమ అనుమతి కోరుతున్నారు.

భృగుడు ----- ఎంతమాట ! నా అశ్రమ ప్రవేశానికి సప్తర్షి ప్రముఖులకు అనుమతి దేనికి ? వారిని సాదరంగా లోనికి ఆహ్వానించు !

(ద్వారక బయటికి వెళ్తాడు. అతను దారి చూపిస్తూ ఉండగా, అత్రి, వశిష్ఠ, జమదగ్నులు లోనికి వస్తారు. భృగు దిగ్గున లేచి వారిని ఎదుర్కొని, కూర్చో పెడతాడు.)

భృగుడు ---- ఋషి పుంగవులారా !! రండు, ఆశీనులు కండు ! ---నా కుటీరం, మీ రాకతో పావనమయింది ! వచ్చిన కారణం సెలవీయండి.

వశిష్ఠ ------ భృగు మహర్షీ ! భూలోకంలో ఆదిశేష, వాయువుల చిరకాల పోరాటం వల్ల, విష వాయువులు వ్యాపించి, జనులలో రకరకాల వ్యాధులు అంకురించాయి.

అత్రి ------ మునీంద్రా ! ఆ విష వాయువులు ప్రజల శరీరాల్నే కాదు, మనస్సులను సైతం మలినం చేసి, వారిని పాప కర్మలకు పురిగొల్పుతోంది !

జమదగ్ని ------ భృగు మహర్షీ ! ఆగతానాగత వర్తమానాలు తెలిసిన మీకు చెప్ప వలసినది ఏముంది ? లోక కళ్యాణం కోసం మేమందరం కలిసి, “ సత్ర యాగాన్ని “ చేయ సమకట్టాము !

వశిష్ఠ ----- ఆ యజ్ఞానికి , యజ్ఞ పురుషుని ఎంపిక మాకు అసాధ్యమయినది !

అత్రి ----- త్రిమూర్తులలో ఎవరు దానికి అర్హులో తెలియజేసే, బారాన్ని మీపై వేయడానికి. మేమిలా వచ్చాము !

జమదగ్ని ----- లోక కళ్యాణం కోసం, మీరా భారాన్ని వహించి, యజ్ఞ పురుషుని ఎంపిక చెయ్యక తప్పదు !

( భృగుడు కళ్లు మూసుకొని ధ్యానంలో పడతాడు )

భృగుడు- -------- ముని పుంగవులారా ! మీ ప్రయత్నము సమంజసము, కడుంగడు ప్రశంసనీయము ! అయినను మీరు నాపై మోపిన భారము, ఎంతో కష్ఠతరమైనది ! వినయము, వివేకము, సహనము మొదలయిన సత్త్వగుణ సంపన్నులు త్రిమూర్తులలో ఎవరో, వారిలో మేటి ఎవరో, పరీక్షించిగాని, నిర్ణయించుట జరగదు !!

వశిష్ఠ ----- మహర్షీ ! ఆ పరీక్ష మీరే చెయ్యాలి !

అత్రి ----- మునీంద్రా ! మీరే దానికి సర్వ సమర్థులు !

జమదగ్ని ----- నిగ్రహానుగ్రహ తపోబల సంప న్నులు, భవిష్యావలోకన ప్రతిభా ధురీణులు------

ముగ్గురూ ------ యజ్ఞ పురుషుని నిర్ణయించి, నిర్దేశింపగల న్యాయ నిర్ణేతలు మీరే కావలెను !! ( అంటూ అతనికి నమస్కరిస్తారు )

భృగుడు ----- మహర్షులారా ! లోక కళ్యాణం కోసం, మీరు చేసే మహత్కార్యంలో, నా వంతు సేవ నిర్ణయించి, నాకు మహోపకారం చేసారు ! మీరు కోరినట్లుగ త్రిమూర్తులను పరీక్షించి, వారిలో సత్త్వ గుణ సంపన్ను లెవరో తేల్చి చెప్పెదను గాక !

( ఋషులు ముగ్గురూ వెళ్లిపోతారు. )

ద్వారక ----- గురుదేవా ! ఎందరో మహానుభావులు ఎన్నెన్నో త్యాగాలు చేయాలని , మీరన్న మాటలకు అర్థం ఇప్పుడు తెలిసింది ! అందరి కంటె మహత్తరమైన త్యాగాన్ని, మీరే చెయ్యబోతున్నారు, -- అవునా ?

భృగుడు ----- ద్వారకా !! భూలోకానికి “ లక్ష్మీ వాసుదేవులను” రప్పించడానికి, నా శరీరము , నా విద్య --- నశించిపోతే మాత్రం --- ఏం ?! చేసేది బృహత్క్యార్యమైనప్పుడు, చెల్లించే మూల్యము కూడ గొప్పదే అయి ఉండాలి !!! --- నీవు కూడ , ఆదిశేష, పిపీలక చింత్రిణీ వృక్షముల వలె. విష్ణు సన్నిధి కొరకు, నీ తపస్సును వినియోగించు ! నీ చరిత్ర అజరామరమై నిలుచుగాక !! --

( ద్వారకా ఋషి గురుదేవుల పాదాభివందనం చేస్తాడు )

*********************

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద