Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన –5

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన –5

( దృశ్యము----- 13 )

( బ్రహ్మ లోకం. బ్రహ్మ ఒక ఆసనం మీద కూర్చొని ఉంటాడు. ప్రక్కనే మరొక ఆసనం ఖాళీగా ఉంటుంది.)

( కొంత మంది ఋషులు అతనికి ఎదురుగా కూర్చొని ఉంటారు. బ్రహ్మ వారితో శాస్త్ర చర్చ చేస్తూ ఉంటాడు )

1 ఋషి ------ బ్రహ్మ దేవా ! సృష్టికి, ప్రతి సృష్టిని విశ్వామిత్ర మహర్షి చేసాడంటారు ! నిజమేనా ?

బ్రహ్మ ----- అవును, విశ్వామిత్రుడు, వశిష్ఠునితో సమానమైన బ్రహ్మర్షి అవాలని ఘోర తపస్సు చేసి, తనని వశిష్ఠుడు గుర్తించాలనే తపనతో ప్రతిసృష్టిని చేసాడు !

2 ఋషి ---- అతను బ్రహ్మర్షి ఎప్పుడయ్యాడు ?

బ్రహ్మ ----- గాయత్రి దర్శనం తరువాత ! గాయత్రి విశ్వామిత్రుని తపోబలం, సంకల్పం నుండి జన్మించిన, సత్త్వగుణ ప్రధానమైన దేవతగా, ప్రసిద్ధి పొంది, బ్రాహ్మణులకు ఆరాధ్య దేవత అయింది !

3 ఋషి ----- బ్రహ్మ దేవా ! గాయత్రీ దేవి రూపాన్ని విశ్వామిత్రుడు ఏ విధంగా ఊఁహించాడు !

బ్రహ్మ ----- చాల అధ్భుతంగా ఊఁహించాడు ! 5 ముఖములు, 8 భుజములు. ముఖములలో మొదటిది ముత్యపు రంగు, రెండవది ప్రవాళపు రంగు, మూడవది బంగారు రంగు, నాల్గవది నీలపు రంగు, అయిదవది ధవళము. ఆ విషయాన్నే శ్లోకంలో ఇలా వర్ణించాడు !
శ్లోకం ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయై ముఖై స్త్రీక్షణై
ర్యుక్తా విందు నిబద్ధ రత్న మకుటాం, తత్త్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం ! వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదా
శంఖం చక్ర మథార వింద యుగళం హస్తైర్వహంతీం భజే !!

( శ్లోకం నడుస్తూ ఉండగానే, భృగు మహర్షి ప్రవేశిస్తాడు. శాస్త్ర చర్చలో ఉన్న బ్రహ్మను, మునులను చూస్తాడు. )

( బ్రహ్మ ఋషులు అతనిని గమనింపరు )

భృగుడు ---- ( తనలో ) ఓహో ! వీరందరును చర్చలో మునిగి, నన్ను గమనింపరైరి ! విషయం సత్త్వగుణ ప్రధాన దేవత అయిన గాయత్రీ దేవిని గురించి ! --- సరి సరి, ఇదియే మంచి సమయము ! ఈ బ్రహ్మ సత్త్వగుణ పరీక్ష చేసెదను గాక !!

(భృగుడు మునుల ప్రక్క నుండి వెళ్లి, బ్రహ్మ ప్రక్కన ఖాళీగా ఉన్న ఆసనం పైన కూర్చొంటాడు. )

( బ్రహ్మ భృగుని చూస్తాడు. అతనికి కోపం వస్తుంది )

బ్రహ్మ ------ ఓ భృగూ ! నీవు నాకు వందనాదులు చేయక, స్వాతిశయము కలవాడవై, సర్వజ్ఞడవను గర్వమున, నా ప్రక్కనున్న సరస్వతీ పీఠము పైననే. ఆశీనుడవైనావు !! నీ చర్య బ్రాహ్మణ విరుద్ధముగా నున్నది ! ---నీవును, నీ వంశము వారును, ఏడు పురుషాంతరముల పిమ్మట, దారిద్ర్యమును అనుభవింతురు గాక !! ( అని శపిస్తాడు )

భృగుడు ----- ఓ బ్రహ్మా ! నీవు రజోగుణము కలవాడవు ! నీవు సృష్టికర్త నన్న అహంకారముతో, నన్ను పలుకరింపక, గౌరవించక, -- నిష్కారణముగ నా వంశము వారిని శపించితివి ! -- నా వంశమున బ్రహ్మ ద్వేషులు, అనాచార పరులు మాత్రమే నీ శాపమునకు గురి యగుదురు గాక !! సదాచార పరులు పరోపకారము చేయువారు నీ శాపమునకు గురి కాకుందురు గాక !!! -- నీవు నన్ను అగౌరవము చేసినందున , నీకు భూలోకమున దేవాలయాదులు పూజలు లేకపోవును గాక !!!
( అని ప్రతి శాపము ఇచ్చి నిష్క్రమిస్తాడు )

**********************

( దృశ్యము-- 14)

( కైలాసంలోని ఒక తోట)

( తోట బయట ‘ కాలభైరవుడు’ కాపాలా కాస్తూ ఉంటాడు)

( భృగు మహర్షి ప్రవేశించి కాలభైరవుని చూస్తాడు )

భృగుడు ------ కాలభైరవా ! నేను సప్తర్షుల పనుపున బృహత్కర్య నిర్వహణకై వచ్చితిని ! మహా దేవునితో మాట్లాడవలె !!

కాలభైరవ ----- మహర్షీ ! మీరు కాసేపు వేచి ఉండండి. నేను వారికి మీ రాక నెరిగించి, ప్రవేశమునకు అనుమతి నడిగి వచ్చెదను. ( అని కాలభైరవుడు లోపలికి వెళ్తాడు )

******************

( దృశ్యము --15)

( కైలాసం లోని తోటలోపలి రమ్యమైన లతా నికుంజము )

( కాలభైరవుడు అక్కడికి వస్తాడు. పార్వతీ దేవి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంటుంది. శివుడు ఆమె తొడపై, తల పెట్టి పడుకొని, ఆమె ముఖంలోకి చూస్తూ ఉంటాడు )

( పార్వతి శివుని జటాజూటము లోని, చిన్న పాయను తీసుకొని, జడ అల్లుతూ ఉంటుంది. జడ బిగించి లాగిన ఆమె, అల్లరికి శివుడు గుటక వేస్తాడు ! పార్వతి నవ్వుతుంది )

శివుడు ----- దేవీ ! నీ మందహాసమునకు కారణమేమి ?

పార్వతి ----- ప్రభూ ! ఏమియును లేదు !

శివుడు ---- కాదు, ఏదియో ఒకటి ఉన్నది !

పార్వతి ----- మరేమీయు లేదు ప్రభూ ! ఇప్పుడు గుటక వేసితిరి కదా ! మీ కంఠమున కాలకూట గరళము నిగళమగుట నుండి, ఎట్లు కాపాడుచున్నారో నని నవ్వుకొంటిని.

శివుడు ----- ( పరిహాసముగా ) దేవీ ! నేనా విద్యను నీ దగ్గరనే నేర్చితిని !

పార్వతి ------ ( ఆశ్చర్యంతో ) ఏమి స్వామీ ! నా కడనా ?

శివుడు ----- అవును దేవీ ! నీ అధరములందు మధు రసములను దాచుకొని, దానిని బయటికు చింద నియ్యక, కెంపు రంగు ద్వారములను ఎట్లు ఏర్పరిచితివో. --- అటులనే నేను కూడ గరళ నిగళము కాకుండా గళములో నీలి రంగు తెరలను ఏర్పరచుకొన్నాను !!

( శివుని మాటలకు పార్వతి కిల కిలా నవ్వుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన కాలభైరవుడు తన్మయత్వంతో తను వచ్చిన పని మరచిపోతాడు )

*********************

( దృశ్యము 16—దృశ్యము 14 లాగే ! కైలాసం లోని తోట బయటి గేటు )

( భృగు మహర్షి కాలభైరవుని రాకకు ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి విసుగెత్తుతుంది )

భృగుడు ------ ఎప్పడనగా వెళ్లిన , యీ కాలభైరవుడు ఇంకా రాడేమిటి ! అయినను వాని రాకకై నే నెందుకు ఎదురు చూడాలి ? పరీక్షించడానికి వచ్చి, ఇలా నిరీక్షిస్తూ కూర్చొంటే ఎలాగ ? -- లోపలికి వెళ్లి చూసి వచ్చెదను గాక ! ( భృగువు లోపలికి వెళ్తాడు )

**********************

( దృశ్యము 17 )

( కైలాసం లోని రమ్యమైన లతా నికుంజము , దృశ్యము 15 లాగే ! )

( భృగుని రాక కాలభైరవుడు చూస్తాడు )

కాలభైరవ ------ ( తనలో ) అయ్య బాబోయ్ ! మహర్షి విషయం మరచే పోయాను. ఇతను నారి సంధించి వదిలిన బాణంలాగ దూసుకొని వచ్చేస్తున్నాడు ! శివ శంకరునకీ విషయం చెప్పే వ్యవధి కూడా లేదు ! ఇప్పుడు కర్తవ్యమేమిటి ?---- ( ఆలోచించి ) ఆ ! అవును ! ప్రక్కకు తిరిగి పారిపోవడమే మంచిది !! (కాలభైరవుడు పారిపోతాడు )

( పార్వతీ పరమేశ్వరులు ప్రణయ సల్లాపాలలో ఉంటారు. పార్వతి కిల కిలా నవ్వుతుంది. శివుడు ఆమె నవ్వులో అందాన్ని, చూసి పరవశుడవుతాడు ! )

( భృగువు ప్రవేశిస్తాడు )

( భృగువు , ఉమా మందహాసాన్ని చూసి మైమరిచి పోతాడు ! అతని నోటి నుంచి ఆమె మందహాసాన్ని స్తుతిస్తూ, కవిత్వ ధార వెలువడుతుంది )

భృగుడు --( శ్లోకం ) సహాదరేణ యోవ లక్ష పారిజాత మాలయా
గలస్థలీ విభూషయా, ధ్వనిం వినైవ భాషతే,
మహేశ పుణ్య యోషితో మనోజ్ఞ హాస ఏషమే
విభూతయే ప్రకల్పితాం , విధూతయేచ పాప్మనాం !!
తల్లీ ! కంఠాభరణమై ప్రకాశించు , ధవళ వర్ణము గలిగియున్న పారిజాత పుష్పమాలలతో కూడి, ఆదరము గల్గి, ధ్వని లేకుండునట్లు, సంభాషించుచున్న మహేశ పత్నివగు నీ మందహాసము, నా ఐశ్వర్యమునకు, పాప ధ్వంసమునకు కారణమై , నన్ను రక్షించు గాక !

( భృగుని స్తోత్రానికి పార్వతీ పరమేశ్వరులు ఉలిక్కి పడతారు. పార్వతి నాథుని తలని పైకెత్తి, లేచి పోతుంది జరిగిన రస భంగానికి శివునికి కోపం వస్తుంది. )

శివుడు ----- ఓయి భృగూ ! నీవు అనుమతి లేక, నా కేళీవనమున ప్రవేశించి, సమయా సమయములు పాటింపక నా ప్రణయ దేవత, ఏకాంతములో నా కొసగిన మందహాసమును, వర్ణించి, రసభంగము చేసితివి ! నేను నిన్ను ఉపేక్షింప జాలను ! నా త్రినేత్రాగ్నిలో నిన్ను భస్మము చేయగలను.

భృగుడు ------ రుద్రా ! నే నామెను మాతగా భావించి , ఆమె మందహాసమును వర్ణించితిని. కవి హృదయము తెలియని నీ కది తప్పు అయినది ! నీ త్రినేత్రాగ్ని నన్నేమియు చేయజాలదు !

( శివుడు భృగుని మాటలకు మండి పడతాడు )

శివుడు ---- ఓయీ ! భృగూ !! నీ అహంకారము మితి మీరినది ! ఇక ఉపేక్షించుట తగదు. ( అంటూ శివుడు తన త్రినేత్రమును తెరుస్తాడు )

( అతని మూడో కంటి నుండి అగ్ని జ్వాలలు వెడలి, భృగుని వైపు వెళ్తాయి )

( భృగుడు భయ పడక తన ఎడమ కాలికున్న కన్ను తెరచి, ఆ మంటలకి ఎదురుగా పెడతాడు )

( అతని కాలికి ఉన్న జలనేత్రం నుండి, జలధారలు పడి శివుని త్రినేత్రాగ్ని చిత్రంగా వెనకకి మరలుతుంది !!)

భ్రుగుడు ---- శివా ! చూసితివి కదా ! నీ త్రినేత్రాగ్ని ప్రకోపము !! -- బ్రహ్మ హత్యా పాతకము నుండి, నీవీ విధమున బయట పడితివి !!

శివుడు ----- భృగూ ! నిజము పలికితివి ! బ్రాహ్మణుడ వగుట చూచి, నా త్రినేత్రాగ్నిని, నేనే మరల్చినాడను ! కాని ఇది నీ జలనేత్ర ప్రభావము కాదు !-- జల ప్రభావము వలన అగ్ని తిరోగమనము చెందుట కాంచితివా ? అయినను నీతో చర్చలేల !! బ్రాహ్మణుడవన్న అహంకారమునకు లోబడిన నీకును, నీ జాతికిని, బుద్ధి చెప్పవలె !! ---- “భూలోకమున నీ బ్రాహ్మణ జాతి కలియుగమున 6000 సంవత్సరముల నాటికి, నామ మాత్రమగుదురు గాక !!” (అని శపిస్తాడు )

భృగుడు ----- “ శివా ! నీవును కలియుగమున ఆకార స్వరూపునిగా కాక, లింగ రూపమున, శిరస్సునందు అభిషేకాదులతో పూజలందుదువు గాక ! “ (అని ప్రతి శాపం ఇచ్చి, వెళ్లి పోతాడు )

*************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద