Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—8

( దృశ్యము 29)

( మధురలో కృష్ణాలయము. పూజారి, వైఖానస సాంప్రదాయానికి చెందిన గోపీనాథుడనే ఋషి ఉంటారు)

( వైఖానస ఋషి గర్భగుడి ద్వారం ముందు నిల్చొని ఉంటాడు. పూజారి హారతి ఇస్తూ ఉంటాడు )

( ప్రవేశం-- విష్ణువు. నుధుటి మీద ఒకే ఒక నిలువు నామంతో సామాన్య బాలకునిలాగ ఉంటాడు )

( అతను ప్రవేశిస్తూ ఉండగానే , వైఖానస ఋషి అతనిని చూస్తాడు. ఇద్దరి చూపులు కలుసుకొంటాయి )

( వైఖానసునుకి అతను ‘బాల కృష్ణుని’ లాగ, కనిపిస్తాడు.)

( విష్ణువు కృష్ణుని విగ్రహానికి నమస్కరించి మధురాష్టకం చదువుతాడు )

విష్ణు ------ శ్లోకం-- అధరం మధురం, వదనం మధురం, /నయనం మధురం, హసితం మధురం,
హృదయం మధురం, గమనం మధురం, / మధురాధిపతే రఖిలం మధురం
వచనం మధురం, చరితం మధురం/ వసనం మధురం, వలితం మధురం
చలితం మధురం, భ్రమితం మధురం / మధురాతి పతే రఖిలం మధురం.

(విష్ణువు మధురాష్టకం చదువుతున్నంత వరకు వైఖానస ఋషి, విష్ణువు ముఖాన్ని, కృష్న విగ్రహాన్ని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు )

విష్ణు ----- వేణూర్మధురో, రేణూర్మధురో / పాణీర్మధురో, పాదౌ మధురో
నృత్యం మధురం, సఖ్యం మధురం / మధురాధి పతే రఖిలం మధురం
గీతం మధురం, పీతం మధురం / భుక్తం మధురం, సిప్తం మధురం
రూపం మధురం, తిలకం మధురం / మధురాధిపతే రఖిలం మధురం

( వైఖానసునికి విష్ణువు ముఖంలో, కృష్ణుని యొక్క రక రకాల రూపాలు కనిపిస్తూ ఉంటాయి )

విష్ణు ---- కరణం మధురం, తరణం మధురం / హరణం మధురం, రమణం మధురం
నమితం మధురం, శమితం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
గుంజా మధురా, మాలా మధురా / సలిలం మధురా, వీచీ మధురా
సలిలం మధురం, కమలం మధురం / మధురాధిపతే రఖిలం మధురం

( పూజారి హారతి ఇస్తూ ఉండగా వైఖానసుడు ఆ హారతి వెలుగులో విష్ణువు ముఖం చూస్తాడు )

విష్ణు ---- గోపీ మధురా, లీలా మధురా / యుక్తం మధురం, ముక్తం మధురం
దృష్టం మధురం, శిష్టం మధురం / మధురాధిపతే రఖిలం మధురం
గోపా మధురా, గావో మధురా / యష్టిర్మధురో, సృష్టిర్మధురా
దళితం మధురం , ఫలితం మధురం / మధురాధిపతే రఖిలం మధురం

( హారతి కళ్లకి అద్దుకొన్నాక, వైఖానసుడు, విష్ణువుని పలకరిస్తాడు )

వైఖానస ---- బాబూ ! నా పేరు గోపీనాధుడు, వైఖానస సాంప్రదాయ వాదిని ! యీ ఆలయ సమీపంలోని కుటీరంలో ఉంటాను. వైష్ణవ సాంప్రదాయాలు, పూజలు, సమయాచారాలు, ఆగమానుసారంగా చేయగల, చేయించగల సామర్థ్యం నాకు ఉంది ! నా కంటికి మీరు ఆ మధురాధిపతి లాగ, బాల కృష్ణుని లాగ కనిపిస్తున్నారు ! కృష్ణున్ని సశరీరంగా పూజించాలనే వింత కోరిక నాది !! --ఈ రోజు మిమ్మల్ని చూసాక , నా అవయవాలు అదిరి, నా కోరిక తీరుతుందేమోనన్న ఆశ చిగురించేలా సూచనలిస్తున్నాయి !!-- ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా ?!

విష్ణు ---- వైఖానస ఋషీ ! నే నిప్పుడు చాలా అలిసిపోయి ఉన్నాను. దయచేసి ఆ వివరాలేవీ అడగకండి.

( వైఖానసుడు పూజారి ముఖాముఖాలు చూసుకొంటారు. పూజారి వైఖానసుని ఒక ప్రక్కగా తీసుకెళ్తాడు )

( విష్ణువు అక్కడే ఒక రాతి స్తంభానికి చేరబడి కూర్చొంటాడు )

పూజారి ---- వైఖానస ఋషీ ! చూసారా, ఆ యువకుని నిర్లక్ష్య పూరిత సమాధానం ! మీరేమో అతనిని చూసి, ఎన్నడూ స్పందించిన విధంగా స్పందించి, మీ చిరకాల వాంఛను కూడా సిగ్గుపడ కుండా చెప్పుకొన్నారు. దానికతడు --

వైఖానస --- పూజారిగారూ ! అతని చాల అలసిపోయి ఉన్నాడు----

పూజారి ---- ఎంత అలసిపోతే మాత్రం పేరు చెప్పడానికేం ?

వైఖానస --- పూజారిగారూ ! అతనిలో నాకు నా ఆరాధ్య దైవం కనిపించాడు ! --- నా దైవం బాల కృష్ణుడు ఎంతో అల్లరివాడు ! అల్లరి పెట్టి శోధించడం అతనికి పరిపాటి !!

పూజారి ---- అయితే ఏం చేస్తానంటారు ?

వైఖానస ---- అతనిని తీసుకెళ్లి, నా ఇంట ఆతిథ్యమిస్తాను.

పూజారి ---- మంచిదే ! ఎవరి పిచ్చి వారికే అనందం !! అతనిని ఏమని పిలుస్తారు ?

వైఖానస ----- అతను, నా బాలకృష్ణుడే !! గనుక ‘ బాలాజీ ‘ అని పిలుస్తాను ! ( అంటూ ఉద్వేగంతో విష్ణువు దగ్గరగా వెళ్తాడు )

వైఖానస --- బాలాజీ !! నాతో రండి, నా కుటీరంలో విశ్రాంతి తీసుకోండి.

విష్ణు ---- ఏమని పిలిచారు, బాలాజీ అనా ?

వైఖానస ---- అవును బాబూ ! అడ్డుపెట్ట వద్దు ! మిమ్మల్ని ఆ పేరుతో పిలువ నివ్వండి ! మీ అసలు పేరు, చిరునామా వివరాలు అడుగను ! నా కుటీరంలో అతిథిగా మీ ఇచ్చవచ్చినంత కాలం ఉండి, నన్ను తరింప చేయండి ! రండి--- బాలాజీ ! రండి !

( బాలాజీ చెయ్యి పట్టుకొని లేవ దీస్తాడు . విష్ణువు మంత్ర ముగ్ధునిలా అతనిని అనుసరిస్తాడు )

*******************
( దృశ్యం 30 )

( వైఖానసుని కుటీరంలోని ఒక గది. విష్ణువు ఆ గదిలోని మంచంపేన పడుకొని ఉంటాడు )

( మహర్షి కశ్యపుని సూక్ష్మ శరీరం ఆ గదిలోకి ప్రవేశిస్తుంది. పడుకొని ఉన్న విష్ణువును తట్టి లేపుతుంది )

( విష్ణువు పడుకొనే ఉంటాడు, అతని ఆత్మ లేస్తుంది. కశ్యపుని చూసి ప్రశ్నిస్తుంది )

విష్ణు---- మహర్షీ మీ రెవరు ?

కశ్యప ---- నేను కశ్యపుడను ! నీవు శ్రీనివాసుడవు ! గతించిన యుగాలలో నీ విభూతి ఎన్నో అవతారాలు ఎత్తింది ! ఆ అవతారాలలో కొన్నిటికి నేను నా భార్య అదితి, మా భాగ్య వశాన తల్లి తండ్రుల మయ్యాము !! జ్ఞప్తికి తెచ్చుకో ! నీవు రాముడవు, నేను దశరథుడను, నీవు కృష్ణుడవు, నేను వసుదేవుడను !

విష్ణు ---- లేదు ! జ్ఞప్తికి రావడం లేదు ! మీరు నాకు గతంలోని జనకులని చెప్పారు !! ఇది ఏ జన్మ ? యీ జన్మలో నే నెవడను ??

కశ్యప--- ఇది నీకు మరో జన్నకాదు ! మరో అవస్థ ! నీ పేరు చెప్పానుగా, శ్రీనివాసుడని !

విష్ణు ----- నే నెవరో, నా జ్ఞాపకాలేవో మరిచి పోయిన అవస్థ నాకు ఎలా వచ్చింది !

కశ్యప ---- సప్తర్షులు చేసిన సత్రయాగ ఫలితాన్ని, నిర్ద్వంద్వంగా ఎలాంటి రక్షణ, పరిరక్షణ లేకుండా స్వీకరించడం వల్ల, నీకీ అవస్థ కలిగింది !

విష్ణు--- అయితే నేను శ్రీనివాసుడనా ?

కశ్యప --- అవును, నీవే శ్రీ మహావిష్ణువువి ! వేంకటాచలం పైన అవతరించి, వేంకటేశ్వరుడవు కానున్నావు !

విష్ణు ---- వేంకటాచలమా ! నేనా కొండపై నివసించాలా , ఎందుకని ?

కశ్యప ------ శ్రీనివాసా ! మందుగా నిన్ను నువ్వు తెలుసుకో !

( అంటూ కశ్యపుడు శ్రీనివాసుని తలపై ‘ హస్త దీక్ష’ ఇస్తాడు )

( శ్రీనివాసునికి గతం గుర్తుకి వస్తుంది. భృగు మహర్షి వచ్చి తన్నడం, లక్ష్మి అలగడం, నారదుఢు కలహాన్ని రెచ్చగొట్టడం, ఆదిశేషుని తపస్సు వగైరా ఘట్టాలు జ్ఞాపకానికి వస్తాయి. )

కశ్యప ---- శ్రీనివాసా !

విష్ణు ---- నన్నా పేరుతో పిలువకండి. ‘సిరి’ , నా నుండి విడివడిన తరువాత నేను శ్రీనివాసుడను ఎట్లు కాగలను ?

కశ్యప ----- కాదు వత్సా ! నీవు ఎప్పుడూ శ్రీనివాసుడవే ! సిరి నిన్ను వదిలి వెళ్ళలేదు, కొంత కాలం పాటు ఎడమయింది ! అదీ లోక కళ్యాణం కోసం !

విష్ణు ----- ఆమె కనిపించదేమి , ఎక్కడుంది ?

కశ్యప ---- ఆమె కనిపించదు. ఎందుకంటే నీ కన్న ముందుగా కర్తవ్యోన్ముఖురాలు అయింది. తపస్సులో కాలం గడుపుతోంది !

విష్ణు ----- కర్తవ్యమా ! ఆమె ఉన్ముఖురాలు, నేను విముఖుడనా ! -- తండ్రీ మీ మాటలు నాకు అర్థం కావడం లేదు .

కశ్యప ---- శ్రీనివాసా ! నీవు సప్తర్షులు చేసిన యజ్ఞ ఫలాన్ని, స్వీకరించావు కదా ! ఆ ఋషుల సంకల్పాన్ని సఫలం చేసేందుకు, వేంకటాచలంపై అవతరించ వలసి ఉంది .అదియే నీ కర్తవ్యము ! నిన్ను శరణు వేడు భక్తుల భోగభాగ్యములను కాపాడు భారము లక్ష్మిది . అది ఆమె కర్తవ్యము !

విష్ణు ----- తంఢ్రీ ! సప్తర్షుల సంకల్పమును నే నెటుల సఫలము చేయగలను ? అది వేంకటాచలము పైననే ఎందులకు జరుగ వలెను ?

కశ్యప ---- ఎందుకంటే, వేంకటాచలం పాపాలు పోగొట్టే కొండ ! దానికి ఇంకా చాల పేర్లు ఉన్నాయి !

విష్ణు ------ తండ్రీ, ఎన్నో పేరులు గల ఆ కొండ విశిష్ఠతను చెప్పండి .

కశ్యప ---- శ్రీనివాసా ! కృత యుగానికి ముందు, నీ ఆజ్ఞ పైన వైకుంఠము నందు యుండెడు, క్రీడాద్రిని, గరుత్మంతుడు తెచ్చి, భూమిపై నిలుపుట వలన అది ‘ గరుడాద్రి’ అయినది ! ఆ గరుడాద్రి పైన ధర్మదేవత తపస్సు చేసి, తఫః ఫలితమును ఆ కొంఢకే ధారపోయుట వలన అది ‘వృషాద్రి’ అయినది ! వృషభుడనే రాక్షసునకు, నారసింహుడు ప్రత్యక్షమై, అతని కోర్కెపై దానిని కోరికలు తీర్చే కొండగా చేయుట వలన అది 'వృషభాద్రి’అయినది ! త్రేతాయుగమున అంజనా దేవి తపస్సు చేసి, పుత్రప్రాప్తి పొందుట వలన అది ‘ అంజనాద్రి’ అయినది ! వాయు ప్రకోపము నుండి ఆదిశేషుని వల్ల రక్షింపబడుట చేత అది ‘ శేషాద్రి’ అయినది !

విష్ణు ---- వేంకటాద్రి పాపాలు పోగొట్టే కొండ అని మీరు చెప్పారు ! ఆ పేరు దానికి ఎలా వచ్చింది ?

కశ్యప ---- ఎంతో మంది తపోధనులు తపస్సు చేసి, ఫలితములు ధార పోయుట వలన ఆ కొండ పాపములను పోగొట్టే కొండ అయింది ! ఆ కొండకి పశ్చిమాన నందనమనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ‘ పురంధరుడనే విద్వాంసుడు, తన పుత్రుడు ‘మాధవుడు,’ పుత్ర వధువు ‘ చంద్రలేఖలతో నివసిస్తూ ఉండేవాడు---

******************

( దృశ్యము 31 )

( నందన నగరంలో పురంధరుని ఇల్లు. పురంధరుడు, అతని కొడుకు మాధవుడు ఉంటారు )

పురంధర ---- మాధవా !

మాధవ ----- ఏమిటి నాన్నగారూ ?

పురంధర ------ సాయంత్రం కొండ మీదకి వెళ్లి, హోమ సమిధలు తీసుకొని రావాలి.

మాధవ ---- అలాగే నాన్నగారూ ! నేను నా భార్య చంద్రలేఖను కూడా తీసుకొని వెళ్తాను.

( చంద్రలేఖ ప్రవేశం. వచ్చి మామగారికి పాదాలకి నమస్కరిస్తుంది )

పురంధర ---- ( ఆశీర్వదించి ) ఏమమ్మా , ఇది నీ సలహాయేనా ? భర్తతో కలిసి. వాహ్యాళికి వెళ్దామనుకొంటున్నావా ?

చంద్రలేఖ ---- అవును మామయ్యగారూ ! మీరు అనుమతి నిస్తే----

పురంధర ----- అలాగే వెళ్లి రండి.

( అదే సమయానికి పెరట్లోంచి ఒక ‘గేదె’ అరుస్తుంది. )

పురంధర ------ మాధవా ! ఈ మహిషం అరుపు అపశకునం లాగ కనిపిస్తోంది. మీరు ఇవాళ వెళ్లక పోతేనేమి ?

మాధవ ---- నాన్నగారూ ! అలాగయితే నేను ఒంటరిగా వెళ్లి, హోమ సమిధలు తీదుకు వస్తాను.

( చంద్రలేఖ ముఖం ముడుచుకొంటుంది. పురంధరుడు ఆమెను చూస్తాడు )

పురంధర ---- వద్దులే మాధవా ! నీ భార్యను తీసుకొని వెళ్లు. దుఃశకున పరిహారానికి నారాయణ నామ స్మరణ చేసి వెళ్లు .

మాధవ ---- నాన్నగారూ, వెళ్లేది పవిత్రమైన పర్వతం మీదకి ! అక్కడ కూడ అనర్థాలు కలుగుతాయంటారా ?

పురంధర ----- మాధవా ! నేను నీకు అన్ని శాస్త్రాలు నేర్పాను. శాస్త్రాలు తెలిసిన వాడివి కనుక నేను నీతో వివాదానికి దిగను. కాని ఒక్కమాట ! శాస్త్రాలు తెలుసుకోవడమే కాదు, ఆచరణలో పెట్టడం తెలివైన పని!

( మాధవుడు మౌనంగా నిలుచుండి పోతాడు )

పురంధర ----- మంచిదే, అలాగే కానియ్యండి, ఇద్దరూ కలసే వెళ్లి రండి !

******************* .

( దృశ్యము 32 )

( కొండ దగ్గర తోట . మాధవుడు, చంద్ర లేఖ వన విహారం చేస్తూ ఉంటారు )

( మాలిని అనే యువతి అక్కడ చితుకులు ఏరుతూ ఉంటుంది )

( మాధవుడు మాలినిని చూస్తాడు. ఆమె రూపం అతనిని ఆకట్టుకొంటుంది. మాధవుడు ఆమె దగ్గరకు వెళ్తాడు )

మాధవ ---- సుందరీ , నీ పేరేమిటి ?

మాలిని ----- మాలిని.

మాధవ ----- పేరు చాలా బాగుంది ! నువ్వెక్కడ ఉంటావు ?

మాలిని ----- నగరం శివార్లలో నండి. నా కెవ్వరూ లేరండి. తోడుగా ఉండే అయ్య కాలం చేసాడండీ ! ఇలా ఈ అడవిలో చితుకు లేరుకొని, మద్యం కాచుతూ, మాంసం అమ్ముకొంటూ, బ్రతుకుతున్నానండి !

( చంద్రలేఖ వచ్చి మాలిని మాటలు వింటుంది )

చంద్రలేఖ ---- అంటే, నువ్వు పంచమురాలివా ?

మాలిని ---- అదేంటమ్మా, నేను మా అయ్యకు ఒక్కర్తే కూతురు నండి ! ఇప్పుడు ఒంటరిదాన్ని !

చంద్రలేఖ ---- అంటే చదువు, సంస్కారం, సామాన్యమైన తెలివి తేటలు కూడ లేవన్నమాట ! ( విసురుగా భర్త చెయ్యి పట్టుకొని ) దానితో మీకేం మాటలండీ ? మామయ్యగారు హోమ సమిథలు తెమ్మన్నారు మరచి పోయారా ?

మాధవ ----- అలాగే, చంద్రలేఖా ! పద ! ( అంటూ వెనక్కి, వెనక్కి చూస్తూ వెళ్తాడు )

( మాలిని కూడా అతని వైపు మనోహరంగా చూస్తుంది, కన్ను గీటి నవ్వుతుంది. )

******************

( దృశ్యము 33 )

( మాలిని గుడిసె ముందు నులక మంచం )

( మాధవుడు , మాలిని మంచం పైన ప్రక్క ప్రక్కనే కూర్చొని ఉంటారు )

( మాధవుడు ఆమెతో పాటు మద్యం త్రాగుతూ, మాంసం తింటూ, కనిపిస్తాడు )

(ఒక బ్రాహ్మణ బాలకుడు ఆ దృశ్యాన్ని, చూస్తాడు. పరుగు పరుగున నగరం వైపు వెళ్తాడు )

*****************

( దృశ్యము 34 )

( నందన నగరంలోని ఫురంధరుని ఇల్లు. పురంధరుడు కూర్చొని ఉంటాడు )

( ప్రవేశం ఒక బ్రాహ్మణ బాలకుడు పరుగు పరుగున వస్తాడు )

బాలకుడు ---- పురంధరాచార్యా ! నమస్కారములు !

పురంధర ----- విషయమేమిటి వత్సా ! పరుగు పరుగున వచ్చావు ?

బాలకుడు ---- ఆచార్యా ! మాధవుల వారు నగరం చివర, మాలిని అని ఒక కడజాతి స్త్రీ ప్రక్కన కూర్చొని , ఆమెతో పాటు మద్య- మాంసాలు సేవిస్తున్నారు !

( ఆ మాటలు వన్న పురంధరుడు స్థాణువులా నిలుచుండి పోతాడు. చంద్రలేఖ ఇంట్లోనుంచి వస్తుంది )

పురంధర ---- వత్సా ! నువ్వు చెప్పినదంతా నిజమేనా ?

( బాలకుడు అవునంటూ తల ఊపుతాడు )

చంద్రలేఖ ----- మామయ్యగారూ ! ఆ రోజు కొండకి వెళ్లవద్దని, మీరెంత చెప్పినా వినక, ఇంత అనర్థం తెచ్చి పెట్టుకొన్నాను ! ఆ మాలిని అతనికి ఆ రోజే పరిచయమయింది ! --- కాని ---ఇంతకి దిగజారి పోతారనుకోలేదు !! ( ఏడుస్తుంది )---- ఎవరితో చెప్పుకోను, మామయ్యగారూ ! మీ అబ్బాయి నా ముఖం కూడ చూడడం మానేసారు !

( పురంధరుడు ఆమెని ఓదారుస్తాడు )

********************

( దృశ్యము 35 )

( మాలిని గుఢిసె )

( మాలిని, మాధవుడు నులక మంచం మీద కూర్చొని మాంసం తింటూ, మద్యం త్రాగుతూ ఉంటారు )

( ప్రవేశం పురంధరుడు. ఆ దృశ్యాన్ని చూస్తాడు. మాధవుడు తండ్రిని చూసి, దిగ్గున లేచి నిల్చొంటాడు )

పురంధర ---- అర్థమయిందిరా ! అంతా అర్థమయింది !! నువ్వు పూర్తిగా--- పతితుడివి, భ్రష్టుడివి అయ్యావు ! ఇక నువ్వు నా ఇంటి గడప తొక్కడానికి వీలు లేదు ! నేను నిన్ను వెలి వేస్తున్నాను .

( పురంధరుడు కోపంతో వెళ్లిపోతాడు )

********************

( దృశ్యము 36 )

( శేషాచలం కొండ )

( మాధవుడు కొండ దిగువ మాలిని కోసం చితుకులేరుతూ ఉంటాడు )

( కొండ మీదనుంచి వస్తున్న ఒక తపస్వి అతనిని చూస్తాడు )

తపస్వి ----- మాధవా ! ఎంత దుస్థితికి దిగజారావు ?

మాధవ ----- మహానుభావా ! ఎన్నో పాపాలు చేసాను. కట్టుకొన్న ఇల్లాలిని , కన్న తండ్రిని కడగండ్ల పాలు చేసాను. నేర్చుకొన్న పాఠాలని కొరగానివి చేసుకొన్నాను.

తపస్వి ---- మాధవా ! చేసిన దానికి నిజంగా చింతిస్తున్నావా ?

మాధవ ---- అవును స్వామీ ! నాకు మార్గమేదైనా చూపించండి .

తపస్వి ------ మాధవా ! నాతో ఈ కొండ మీదకు రా ! అక్కడ కొంత మంది మునులు తపస్సు చేస్తున్నారు. వారి నడిగి సందేహ నివృత్తి చేసుకో !

( తపస్వి, మాధవుని తీసుకొని మునుల దగ్గరకు తీసుకొని వెళ్తాడు. మాధవుడు ఆ మునులకు, పర్వతానికి నమస్కరిస్తాడు )

మాధవ --- ( పద్యం ) సీ- విప్ర జన్మంబంది, విధి వంచితుడనైతి / వేద విద్యలు నన్ను విడిచి జనియె,
జనకుని మసటలు జవదాటి చరియిస్తి / కర్మ దూరుడనైతి, కాలవశత.
జాతి ఛండాలుడనైతి, జాయను బాపి / నీచురాలి పొందు నెంచుకొంటి,
లొల్లను ద్రావుచు, లోకదూరుడనైతి / చేసిన తప్పులు చెప్ప సిగ్గు,

ఆ. వె. వేడుచుంటినయ్య, వేంకటాచలపతీ,
పాప సంచయమును పారద్రోలి
బ్రతుకు నిల్పి, నన్ను బ్రోచు భారము నీది;
ఆదుకొనగ వయ్య అద్రిరాజ !

( పద్యం ముగియగానే చిత్రంగా అతని శరీరాన్ని, మంటలు చుట్టుముట్టుతాయి ! చిట పట లాడుతూ మండి, తిరిగి చల్లారి పోతాయి )

మునులు ----- మాధవా ! నీ పాపములను దహించిన యీ కొండ, నీవు సంభోధించినట్లే ‘ వేంకటాద్రి ‘ నామముతో ప్రఖ్యాతి నందును గాక !

******************

( దృశ్యము 36 )

( వైఖానస ఋషి కుటీరంలోని గది )

( కశ్యపుఢు , శ్రీనివాసుడు ఉంటారు )

కశ్యప ------ శ్రీనివాసా ! ఆ విధముగా మాధవుని పాపములను దగ్ధము చేసి, అతనిని పునీతుడను చేసిన పర్వతము పేరు. ‘ వేంకటాద్రి’ గా ప్రసిద్ధి పొందింది !

విష్ణు ----- తండ్రీ ! ఆ పర్వతానికి నారాయణాద్రి అనే పేరెలాగ వచ్చింది ?

కశ్యప ----- శ్రీనివాసా ! గుర్తుకి తెచ్చుకో ! నారాయణుడను విప్రుడు, ఆ పర్వతము పైన, పూర్వాభిముఖముగా కూర్చొని, వెన్నెముక నిటారుగా నుంచి, కంటి చూపులను భ్రూమధ్యమందు నిలిపి, చాలకాలము నీ గురించి తపస్సు చేసాడు ! కొంత కాలానికి అతనికి శ్రీమహావిష్ణువు కనిపించి, వరాలని అనుగ్రహించాడు .

*******************

( దృశ్యము 37 )

( గరుడాద్రి కొండ )

( నారాయణుడు అనే విప్రుడు తపస్సు చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్ష మవుతాడు )

విష్ణు ----- నారాయణా ! నీ తపస్సుకు మెచ్చి వచ్చాను. వరాలను కోరుకో !

నారాయణ ---- శ్రీ హరీ ! నీ దర్శన మాత్రమున , భక్తుల కోర్కెను తీర్చే పరమాత్మ స్వరూపంగా, యీ పర్వతం పైన అవతార మెత్తి, యీ పర్వతమునకు నా పేర, నీ పేర నారాయణాద్రిగా పిలువ బడేలా వరమియ్యి !

******************** .

( దృశ్యము 38 )

( వైఖానస ఋషి కుటీరము )

( కశ్యపుడు, శ్రీనివాసుడు ఉంటారు )

కశ్యప ---- శ్రీనివాసా ! నారాయణునికి ఇచ్చిన వరం అనుగ్రహించే సమయం ఆసన్నమయింది ! నీవు ఆ కొండను నివాసంగా చేసుకో !

విష్ణు ---- అటులనే తండ్రీ ! అక్కడకు వెళ్లి నేనేం చేయాలి ? లక్ష్మి అక్కడకు ఎలా వస్తుంది ?

కశ్యప ----- శ్రీనివాసా ! ఆ శేషాద్రి పైన, చింత చెట్టు క్రింద, పిపీలకుడు తయారు చేసిన వల్మీక భవనంలో నివసిస్తూ తపస్సు చెయ్యి. నిన్ను చూసీ చూడగానే భక్తుల పాపాలు నాశన మవాలంటే, నువ్వు అమోఘ తపోబల సంపన్నుడవు కావాలి ! కనుక భక్తులందరి వంతు తపస్సు నీవే చేయాలి ! లక్ష్మీదేవి కూడ నిన్ను చేరే భక్తుల భోగ భాగ్యాలను కాపాడేందుకు తపస్సు చేస్తోంది. మీ ఇద్దరి తపస్సు ఒక కొలిక్కి వచ్చేసరికి, మీ కలయిక తప్పక జరుగుతుంది ! అలా జరగాలంటే నీవు ఇంకొక పని కూడ చేయాలి !

విష్ణు ---- ఆనతినీయండి తండ్రీ !

కశ్యప ---- నీకు లక్ష్మీ ప్రసన్నమయి, ఆ కొండపై బహు కుటుంబీకుడవై, వర్థిల్లాలంటే , ఆ కొండ చరియల్లో నుండి, పారే ‘ దేవ తీర్థంలో’ శ్రవణా నక్షత్రయుత ఇందువారము నాడు, స్నానం చెయ్యాలి.

విష్ణు ---- తండ్రీ ! ఆ శుభముహూర్తం గురించి వివరంగా చెప్పండి !

కశ్యప ---- రాబోయే భాద్రపద మాసం, సోమవారం, ద్వాదశి తిథి, శ్రవణా నక్షత్రము సిద్ధయోగము నాడు, నీవు శేషాద్రిని చేరి, దేవ తీర్థంలో స్నానమాడి, పునీతుడవై , చింతచెట్టు క్రిందనున్న, వల్మీకమును నివాస స్థానము చేసుకొని, ప్రతీ నిత్యమూ జప, హోమ, తర్పణాది క్రియలను ఆచరిస్తూ, తపస్సు చేయుము !

విష్ణు ----- తండ్రీ ! తపస్సు ఎవరి నుధ్దేశించి చేయవలెను ! ఎంత కాలము చేయవలెను ! తపోఫలమును ఎవరు సమర్పించెదరు ?

కశ్యప ----- ముక్కోటి దేవతలను, నీలో నిలుపుకొన్న నీవు, వారందరి బల, వీర్య, తేజస్సులను పొందుటకు, వారి ప్రతినిధివై, లోక కళ్యాణము చేయుట కొరకు, ప్రతీ ఒక్కరి నిమిత్తము తపము చేయవలెను ! నీ తపో ఫలమును బ్రహ్మ తెచ్చి ఇచ్చునంత వరకు, తపము చెయ్యవలెను. ఇక కాలమందువా, అది ఎవరి వశమో నీకే తెలియగలదు !

( కశ్యపుని శరీరం మాయమవుతుంది. శ్రీనివాసుని ఆత్మ తిరిగి శరీరాన్ని చేరుకొంటుంది )

( అప్పుడు పాన్పుపై పడుకొని ఉన్న విష్ణువు లెచి కూర్చొంటాడు, తనని తాను చూసుకొంటాడు )

విష్ణు ---- ఓహో ! కశ్యప మహర్షి నాకు స్వప్న నిర్దేశము చేసెనా ? స్వప్నమందైనను, తండ్రి ఆజ్ఞ ఆజ్ఞయే కదా !! సత్వరము శేషాచలము చేరెదను గాక !

( గది తలుపులు తెరచుకొని బయటకు వెళ్లిపోతాడు )

*********************

( దృశ్యము 39 )

( వైఖానస కుటీరము )

( వైఖానస ఋషి ప్రాతః కాల కృత్యాలను తీర్చుకొని, విష్ణువు పఢుకొన్న గదికి వస్తాడు )

వైఖానస ----- బాలాజీ, బాలాజీ ! లేచిపోయారా బాలాజీ ?

( గదిలో బాలాజీని కానక ఆశ్చర్య పోతాడు )

వైఖానస ---- బాలాజీ ఎక్కడకు వెళ్లినట్లు ? బహుశా గది బయట కాల కృత్యల కోసం వెళ్లారేమో !!

( వైఖానసుడు ఇల్లంతా కలయ తిరుగుతాడు, బాలాజీని కానక, దిగులుతో , తిరిగి, గదిలోపలికి వస్తాడు )

( ఆ గది మధ్య మంచం మీద పద్మాసనం వేసుకొని కూర్చొన్న కశ్యప ఋషిని చూస్తాడు )

వైఖానస ---- మహాత్మా మీరెవ్వరు ! ఎప్పుడు వచ్చారు ? యీ గదిలో బాలాజీ అనే యువకుడు ఉంధాల్సింది. ఆయనను మీరు చూసారా ?

కశ్యప ----- వైఖానసా రా ! ఇలా వచ్చి కూర్చో !!

( వైఖానసుడు మంత్ర ముగ్ధునిలాగ వచ్చి కూర్చొంటాడు )

కశ్యప ----- నేను కశ్యప ఋషిని .

వైఖానస ----- ( లేచి సాష్టాంగ నమస్కారం చేసి )--- కశ్యప మహర్షీ ! ఏమి నా భాగ్యము !! నా ఆరాధ్య దైవమైన బాలకృష్ణుని జనకులు వసుదేవుల వారా మీరు ? నేడు చాల సుదినము !! ఇక వాసుదేవుల వారిని కూడా చూడవచ్చును.

కశ్యప ----- పిచ్చివాడా ! నీవు ముందు వాసుదేవుడినే చూసావు. ఆ తరువాతనే నన్ను చూసావు !

వైఖానస ----- (విస్మయంతో ) మహర్షీ ! ఏమిటి మీరంటున్నది ! ఆ ‘బాలాజీ’ నా ‘బాలాజీయేనా’ ? ఆయనే వాసుదేవ కృష్ణుడా ?

కశ్యప ---- అవును, నీ బాలాజీ , యీ బ్రహ్మీముహూర్తానికి లేచి వెళ్లిపోయాడు. నేనే వెళ్లమని నిర్దేశించాను !

వైఖానస --- ( దిగులుగా ) మహర్షీ ! నేనేం అపరాధం చేసాను ? నా దైవాన్ని అర్చించే భాగ్యం నాకు లేకుండా పోయింది !!

కశ్యప ---- వైఖానసా ! చింతించకు , స్వామిని సశరీరంగా అర్చింవాలనే నీ కోరిక, తీరే సమయం రానుంది ! నీ ఇంటికి వచ్చిన ‘ బాలాజీ ‘ పేరు శ్రీనివాసుడు ! అతనిని ఆ పేరుతోనే అర్చించు. కాని ‘మధురలో’ కాదు ! వేంకటాద్రి యందు !

వైఖానస --- బాలాజీ అదే శ్రీనివాసుల వారు, అక్కడికే వెళ్లారా ?

కశ్యప --- అవును. వేంకటాద్రి పైన, చింతచెట్టు క్రింద, వల్మీకంలో స్వామి తపస్సు చేయనున్నాడు ! అతని తపస్సుకు అంతరాయం కలుగకుండా చూస్తూ, సాధనను సులభం చెయ్యి ! పూజ అర్చన కైంకర్యాదులతో నీ కోరిక తీర్చుకొని తరించు ! యీ పనిలో ‘రంగదాసుడనే’ భృత్యుడు నీకు తోడవుతాడు !

వైఖానస ---- మహర్షీ, రంగదాసుడు నాకు ఎక్కడ లభింపగలడు ?

కశ్యప ----- కొండ దిగువన, నిన్ను వెతుకుతూ వస్తాడు .

వైఖానస --- అటులనే మహర్షీ ! నేను యీ నాడే వేంకటాద్రికి బయలుదేరి వెళ్లెదను .

( కశ్యపుడు మాయమవుతాడు )

******************
పౌరాణికము

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద