Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 34

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 34

( దృశ్యము 115)

( వేంకటాచలము పైన శిలా మందిరము )

( శ్రీనివాసుని ముందు తొండ మానుడు ,ఆ వెనకగా రణసింహుడు సాష్టాంగ పడతారు )

తొండమాన--- ప్రభూ ! దేవదేవా ! శ్రీనివాసా ! పాహిమాం,! రక్షమాం !

పంకజాసన ! పాకశాసన ! పద్మ బాంధవ పూజితా !
పంకజేక్షణ ! భద్ర లక్షణ ! పావనాంఘ్రి సరోరుహా !
శంకర స్తుత ! శాంతి సంభృత ! సాధు సంఘ నమస్కృతా !
వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! పాహిమాం !

శ్రీనివాస --- తొండమాను రాజా ! నీ హృదయమును నేనెరిగితిని ! నీవు పాపము చేసితివి ! నేనేమి చేయగలను ? నీవు మరలి నీ భవనమునకు పొమ్ము.

తొండమాన--- ప్రభూ ! డేవదేవా ! వేంకటేశా ! నా పాపమును ధగ్ధము చేయుము.

శంక వీడుచు, సర్వభూప్రజ సాకి కోరిక తీర్చుచున్
బింక మూడ్చుచు, బాప జాతిని, భస్మమౌనటు మాడ్చుచున్
జంకు లింకుచు శేషభూధర సానువందు, వసించుచున్
వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! పాహిమాం !

వేంకటేశ్వరా ! నీకు శిలాభవనము నిర్మించునప్పుడు, నా కొక వరము నిత్తునని, పలికితివి ! ఆ వరమును ఇప్పుడు అనుగ్రహింపుము ! నన్ను పాప విముక్తుని చేసి, రక్షించుము. లేదన్న నేను నీ పాదముల కడ మరణింతును.

రణసింహ--- దేవాది దేవా ! ఏడుకొండల వాడా ! ఆపద మొక్కులవాడా ! మా మహారాజుతో పాటు నేను కూడ, ఈ ఘోర పాతకమునకు భాధ్యుడనే ! మహారాజు కోరికే నా కోరిక ! నా కోరిక తీర్చిన యెడల ఈ మహారాజు నాకిచ్చు సంవత్సర భృతియందు షోడశ భాగము మీకు సమర్పించు కొందును. లేకున్న నేనును నా రాజునే అనుసరించి ఆత్మాహుతి చేసుకొందును.

శ్రీనివాస--- తొండమాను రాజా ! రణసింహా ! మీరు అకార్యము చేసితిరి ! మీరు చేసిన పాపము నేను చేసినట్లే అయినది !! ఏలననగా , చిన్నారి బాలకుడైన రాఘవుడు, నా పూజ చేసి ముగించిన గంట పలుమార్లు మ్రోగించి, సహాయ మర్థించినాడు. నేను పాపిని ! దురాచారిని ! నిత్య దుఃఖ యుక్తుడనై ఉన్నాను ! నేను అకాల మరణము నైన పొందవలయును, లేదా నరకమున కైన పోవలయును !

నా భక్తులకు సంభవించిన దౌర్భాగ్యము నా వలన రాకూడదు ! మీ రిద్దరూ పాపము చేసి, నన్ను కూడ భాగస్వామిని చేసినారు !! అందుచేత అకాల మరణము పొందిన బ్రాహ్మణ కుటుంబమును మరల సజీవులుగా చేసెదను !!! కలి యుగమున మహా పాతకులకు పాప విముక్తి యగునట్లు చేసెదనన్న కీర్తి, నాకు కలుగు గాక ! రాజా ! నీవు ముందు మరణించిన వారి యస్థికలను తెప్పింపుము.

తొండమాన--- దేవాధిదేవా ! అటులనే చేసెదను.

(అంటూ రణసింహుని వైపు చూస్తాడు )

రణసింహ ---- మహాప్రభూ ! నేను సత్వరము వెడలి, ఆ అస్థికలను తెచ్చెదను.

*******************

( దృశ్యము 115 )

( వేంకటాచలము దాపులోని పాండు తీర్థము )

( శ్రీనివాసుడు ,రణసింహుడు , తొండమానుడు ఉంటారు )

( బ్రాహ్మణ స్త్రీ, శిశువుల అస్థి పంజరములు ఒక తెల్లని వస్త్రములో, ఒక రాతి పలక మీద పేర్చి ఉంటాయి )

( శ్రీనివాసుడు పాండు తీర్థము లోని, లోతైన ప్రదేశములో, కంఠము మునిగే వరకు నిలబడి, రెండు చేతులు పైకెత్తి, నిలబడి, కాసేపు ధ్యానం చేస్తాడు. ఆ తరువాత ఆ తీర్థం లోని జలాలను అస్థికలను జల్లుతాడు )

( ఆ తీర్థ ప్రభావం వల్ల, శ్రీ వేంకటేశ్వరుని ప్రభావం వలన, ఆ అస్థి శకలాలు అతుక్కొని , బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి, ఆమె కొడుకు రాఘవుడు, గర్భస్థ స్త్రీ శిశువుతో సహా పునర్జీవితులౌతారు )

( ఆకాశం లోంచి, పుష్ప వృష్టి కురుస్తుంది. ఆకాశ వాణి పలుకుతుంది )

ఆకాశవాణి---- శ్రీనివాసుని ఛేత నిర్జీవములైన , అస్థి శకలములను ప్రోక్షించి సజీవులుగా చేసిన ఈ పాండు తీర్థము అస్థితీర్థముగా వ్యవహరింప బడును. నరకమునకు పోయిన మహా పాతకుల అస్థులను కూడ , యీ అస్థి తీర్థమున నిమజ్జనము చేసినచో,వారికి స్వర్గ ప్రాప్తి కలుగ గలదు !

( ఆకాశ వాణి ముగిసిన వెంటనే శ్రీనివాసుడు అంతర్ధాన మవుతాడు )

( బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి, తన శిశువు నెత్తుకొని, మహారాజునకు నమస్కరిస్తుంది )

తొండమాన---- తల్లీ ! నేను మీ నమస్కారాదులు అందుకొనుటకు తగను ! మిమ్ములను నిర్దాక్షిణ్యముగా మరణ యాతనకు గురి చేసిన నన్ను క్షమింపుము.

(అని తొండమాన మహారాజు బ్రాహ్మణ స్త్రీకి నమస్కరిస్తాడు )

మహాలక్ష్మి--- మహారాజా ! నేను మరణావస్థలో కూడ మిమ్ములను నిందింప లేదు. అది అంతయు నా స్వయంకృతమైన అపరాధము ! మీరు రాణీ వాసమున నన్ను పరిచారికల మధ్య, నివసింపమని కోరినను, నేను వారెవ్వరూ వలదని చెప్పి, ఏకాంత వసమును కోరి యీ విపత్తును తెచ్చుకొంటిని !

( ప్రవేశం కూర్మావధాని )

కూర్మ ---- తొండమాను మహారాజా ! మీకు జయమగు గాక ! మీ కీర్తి ఆచంద్ర తారార్కమగును గాక !!

( అకస్మాత్తుగా వచ్చిన కూర్మావధానిని చూసి, అతను పలికిన జయ వాదం విని తొండమానుడు నిర్ఘాంత పోతాడు )

తొండమాన--- విప్రోత్తమా ! మీరు ~~ మీరు ~~

కూర్మ --- మహారాజా ! నేను మీ ఆస్థాన పురోహితుల ఇంటి విడిది చేసిన మాట వాస్తవము ! ఆ ఇంటి ఇల్లాలి వలన మీ కన్నియ లెవరూ వేంకటాద్రి యాత్రకు పోలేదని తెలిసి, నేను మీ మాటల పట్ల అవిశ్వాసమునకు లోనయితిని ! ఆ పిమ్మట పురోహితుల వారి వల్ల, మీరు నా భార్యను ఏకాంత మందిరమున నుంచినట్లు తెలిసినది ! అక్కడకు వెడలి చూసిన నాకు రణసింహుడు , కొన్ని అస్థికలను మూటకట్టుకొని, వెళ్లినట్లు తెలిసినది ! నేనీ తీర్థరాజమునకు నా కుతూహలము పట్టలేక వచ్చితిని ! జరిగిన దంతయు చూసితిని !!

తొండమాన----భూసు రోత్తమా ! మీకు జరిగిన దంతయు తెలిసినది కదా ? మీ భార్య సాధ్వీమణి మహాలక్ష్మి గారు నా యపరాధమును నిండు మనసుతో క్షమించినారు ! మీరు కూడ నన్ను క్షమించినచో నాకు మనశ్శాంతి కలుగును.

కూర్మ ---- నేను మీకు ముందుగానే ‘జయవాదము’ పలికితిని. మీ కీర్తి ఆచంద్రతారార్క మగునట్లు దీవించితిని ! శ్రీనివాసునిపై గల మీ భక్తి ప్రపత్తులు అనన్య సామాన్యమైనవి ! నా భార్యా బిడ్డలకు పునర్జన్మ నొసగిన మీరు నన్ను, క్షమాభిక్ష అడుగుట పాడి కాదు ! మీ వలన యీ కలి యుగమున అసంభవమగు కార్యము సంభవ మయినది !!

ఈ అస్థి తీర్థ ప్రభావము ఆకాశవాణి మూలమున తెలిసినది. నేను కాశీ, గయ, ప్రయాగాదులు మా నాన్నగారి అస్థికలు తీసుకొని వ్యర్ధముగా తిరిగితిని !! సమీపము నందే, ఇంత మహిమ గల వేంకటాచల క్షేత్రము నుంచుకొని, అస్థి నిమజ్జనము చేయుటకు అడవులు పట్టి తిరిగితిని ! మహారాజా ! మీ అనుమతి లభించినచో , నేనొక విన్నపము చేసుకొనెదను !

తొండమాన--- బ్రాహ్మణోత్తమా ! విన్నపము కాదు, ఆఙ్ఞాపింపుడు ! నేను మీకు ఋణపడి ఉన్నాను.

కూర్మ ---- ఈ తీర్థ మహాత్మ్యము ఆకాశవాణి వలన వినిన వెనుక, నా కొక ఆలోచన వచ్చినది ! ఇక్కడనే స్థిర నివాస మేర్పరచుకొని, అస్థి నిమజ్జనము చేయుటకు ఇచటికి వచ్చు శ్రధ్ధాళువుల కొరకు, వారి వారి స్వజనుల అంత్య క్రియలు జరిపించు కార్యము నిర్వర్తింప దలచితిని. మీరు నా కొరకు, యాత్రికుల కొరకు ఒక శాల, సత్రము, నిర్మాణము చేయించిన బాగుండును.

తొండమాన --- భూసురోత్తమా ! బహు చక్కని ఆలోచన చేసితిరి ! ఈ అస్థి తీర్థమునకు నేనును ఋణపడియే ఉన్నాను, అందువలన మీరు కోరిన ఏర్పాట్లు చేసి, ఋణ విముక్తుడ నగుదును గాక ! మీరు నిశ్శంశయముగా ఇచ్చోటికి వచ్చి నివసించి, పితృ కార్యము నెరవేర్చుటకు వలయు ఏర్పాట్లను స్వయముగా పర్యవేక్షింపుడు

*********


( ఈ రచయిత అభిప్రాయము ~~ ‘ అస్థి తీర్థ ’ ప్రభావాన్ని టి.టి.డి వారు ప్రమోట్ చేస్తే బాగుంటుంది. కాశీ గయ ప్రయాగల కన్న ఎంతో మహిమాన్వితమైన యీ తీర్థము వల్ల జనావళికి ప్రయోజనము సమ కూరుతుంది.)

Comments

  1. chaalaa baagundi. manchi vishayamulu chepparu. krutajnatalu
    from
    srinivas postal department yellamanchili visakhapatnam district

    ReplyDelete
  2. mee blog choosthe kontha punyam vastundhi

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద