Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 36

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 36

( దృశ్యము 119 )

( భీముడనే కుమ్మరి వాని గుడిశె )

( భీముడు, అతని భార్య తమాలిని ఉంటారు. ఇద్దరూ వేంకటేశ్వరుని భక్తులు )

( వారి గుడిశె లోపల, గోడకి ఒక గూడు ఉంది.( భిత్తికా బిలం ) ఆ గూటిలో కర్రతో చేసిన వేంకటేశ్వర ప్రతిమ ఉంది )

( భీముడు, తమాలిని ఆ విగ్రహం ముందు కూర్చొని భజన చేస్తూ ఉంటారు. భీముని ముందు ఒక మూకుడు ఉంది. అందులో మట్టితో చేసిన తులసీ దళాలు ఉంటాయి )

( భార్యా భర్తలిద్దరూ భక్తి పారవశ్యంతో పాట పాడుతూ ఉంటారు )

పాట ---- శుభం ! శుభం ! శుభం ! శుభం ! శుభం ! శుభం ! శుభం ! శుభం !
శ్రీనివాసునకు శుభం ! శుభం ! వేంకటేశ్వరునకు శుభం ! శుభం !
పావన గిరులకు శుభం ! శుభం ! ప్రాకారాదులకు శుభం ! శుభం !
స్వామి పుష్కరిణికి శుభం ! శుభం ! పుణ్య తీర్థములకు శుభం ! శుభం !
గుడి దీపములకు శుభం ! శుభం ! గుడి గంటలకు శుభం ! శుభం !

( భజన జరుగుతూ ఉండగా తొండమానుడు మారు వేషంలో, అక్కడకు చేరుకొని, ఆ దృశ్యాన్ని చూస్తాడు )

( తొండమానుడు అలసిపోయి ఉంటాడు. ఆ ఇంటికి చేరగానే అతనికి అలసట ఎక్కువవుతుంది )

తొండమాన ---- భక్తాగ్రేసరా ! కులాలా !!

( భక్తి పారవశ్యంలో ఉన్న ఆ కుమ్మరి దంపతులు అతని పిలుపును వినిపించుకోరు )

తొండమాన --- ( తనలో ) ఆహా ! ఈ కులాలుడు ఎంత ధన్యుడు ! ఇతని గృహ భిత్తికా భిల మధ్య మందున్న దారు నిర్మిత వేంకటేశ్వర ప్రతిమ ముందు చేసిన పూజ, వేంకటాచల మందున్న మూల విరాట్టుకు గ్రాహ్యమయినది !! నేను నా అహంకారముతో వేంకటేశ్వరుని ధన కనకములతో, క్రయము చేయగలననుకొన్నాను ! కలియుగమున స్వామి అనుగ్రహము ధనమునకు తప్ప మరి ఏ సాధనమునకు దొరకదని తలచి, భంగ పడినాను ! ( ప్రకాశముగా ) స్వామీ ! శ్రీనివాసా ! నేను నిన్ను అర్థము చేసుకో లేక పోయాను !!

( దంపతులిద్దరూ ఆ మాటలకి తెప్పరిల్లి, అతని వంక చూస్తారు )

( తొండమానుడు తెలివి తప్పి పడిపోతాడు )

( భీముడు గభాలున వెళ్లి, అతన్ని పడిపోకుండా పట్టుకొంటాడు. తమాలిని ఒక నులక మంచం వాలుస్తుంది. దాని మీద తొండమానుని పడుకో బెడతారు. తమాలిని ఒక కుండతో నీళ్లు తెస్తుంది. భీముడు ఆ నీళ్లను తొండమానుని ముఖం మీద జల్లుతాడు )

( తొండమానునికి తెలివి వస్తుంది అది చూసి భార్యాభర్తల ముఖాలలో ఆనందం తాండవిస్తుంది )

భీముడు – అయ్యా ! తమరెవరు ? ఈ కుమ్మరి వానితో మీకు ఏమి అవసరము వచ్చింది ?

తొండమాన -- భక్తాగ్రేసరా ! మీ పేరేమి ?

భీముడు ---అయ్యా ! నా పేరు భీముడు, ఈమె నాభార్య తమాలిని !

తమాలిని --- ( భయం భయంగా ) అయ్యా ! తమరెవరో గాని కులీనుల లాగ ఉన్నారు. ఈ కుమ్మరి గుడిశెకి వచ్చి, తెలివి తప్పి పడిపోయారు ! తమరెవరో తెలియక , మేము మరో దారి లేక , ఈ గుడిశె లోనే తమకి సపర్యలు చేసాము !

భీముడు --- అవును స్వామీ ! మమ్మల్ని మన్నించండి. మీరెవరో తెలియక , మా చేతులతో, ఈ పవిత్ర దేహాన్ని తాకాము ~ ~ ~

తమాలిని --- మా తపేలా లోని నీటిని మీ ముఖం మీద జల్లాము ~ ~ ~

తొండమాన – భక్తాగ్రేసరా ! మిమ్మల్ని మీరు ఇంత తక్కువ చేసి మాట్లాడకండి. మీ ఇంటి భిత్తికా బిలం మధ్య దారు ప్రతిమకి , మృణ్మయ తులసీ దళాలతో మీరు చేసిన పూజ, వేంకటాచలము పైన వేంకటేశ్వరుని పాద పద్మాలకు చేరింది !! మీరు సామాన్యులు కారు !!

( భీముడు, తమాలిని అతని వంక ఆశ్చర్యంతో చూస్తారు )

భీముడు --- అయ్యా ! మీరు చెప్పినదేదీ మాకు అర్థం కాలేదు ! నేను అతి సామాన్యమైమ కుమ్మరిని.

తమాలిని --- అవునయ్యా ! మేము మట్టి పాత్రలు అమ్ముకొని పొట్ట గడుపుకొనే వాళ్లం ! మేము భక్తాగ్రేసరులము ~ ~ ~

బీముడు ---భక్తులము కూడ కాము !

తొండమాన --- పుణ్య దంపతులారా ! నేను తొండమానుడిని, యీ రాజ్యానికి రాజుని .

ఇద్దరూ ----- ( ఆశ్చర్య పోతారు ) ఆ ! మహారాజా వారా !?

తొండమాన --- అవును ! పది రోజుల క్రిందట చాటింపు వేయించాను, కొండ మీద దేవుడికి, సువర్ణ తులసీ దళాలతో అర్చన చేయిస్తానని, మీరు వినే ఉంటారు.

భీముడు --- చిత్తం మహారాజా ! విన్నాము, విన్నాము ~ ~ ~

తొండమాన --- ఆ చాటింపు ప్రకారం రోజుకి ౧౦౮ సువర్ణ దళాల చొప్పున దేవుని అర్చించాను. కాని ఇనాళ్లుగా పూజిస్తున్నా స్వామికి తృప్తి కలుగ లేదు.

భీముడు ---- అయ్యో ! అదేమి మహారాజా ! అంత బంగారం కూడ అతనికి తృప్తి కలిగించ లేదా ?!

తమాలిని-- వడ్డి కాసుల వానికి తృప్తి కలిగించ లేదా ?!

తొండమాన --- దానికి కారణం ఎవరో, ఏమిటొ ~ ~ ~

భీముడు --- ఏమిటది మహారాజా ?

తమాలిని -- ఎవరది మహారాజా ?

తొండమాన----- కారకులు మీరే ! కారణం మట్టి తులసీ దళాలు !

ఇద్దరూ --- మేమా ! మహారాజా ! మేము చేసిన తులసీ దళాలా ?

తొండమాన --- అవును. మీరు అర్చించిన తులసీ దళాలే , వేంకటేశ్వరునికి ప్రియమయ్యాయి ! అందుకే చెప్తున్నాను మీరు సామాన్యులు కారు ! పరమ భాగవతోత్తములు ! మీ గృహానికి ఆ స్వామి స్వయంగా వచ్చినా ఆశ్చర్యం లేదు !

(అదే సమయానికి, గోడ గూటిలో ఉన్న కొయ్య బొమ్మ క్రింద పడుతుంది)

(అందరూ అటువైపు చూస్తారు )

( నేలమీద ఉన్న కొయ్య బొమ్మ లేచి నిలబడుతుంది. శ్రీనివాసుడు ప్రత్యక్షమవుతాడు )

శ్రీనివాస --- తొండమానుడా ! నీవు చెప్పినది నిజము ! నే నీ దంపతులను , విష్ణులోకమునకు గొని పోవుటకు విమానముతో పాటు వచ్చితిని.

భీముడు --- ఓ పరమాత్మా ! నీ వేల శూద్రుడనగు నా గృహమునకు వచ్చితివి ! విదుర, శబర, గజేంద్ర , ఉధ్ధవ, విభీషణుల వలె ఙ్ఞానిని గానే ! నీ కియదగినది నా గృహమునందు ఏమున్నది ?!

తమాలిని—ఓ గోవిందుడా ! మా బుధ్ధి నీ యందే యున్నది ! మేము మంత్రముల నెరుగము ! కర్మములను చేయలేదు ! మా వంటి నీచ జాతి వారికి వేద మెక్కడిది ? నా యొక్కయు,, నా భర్త యొక్కయు భక్తికి సంతోషించిన వాడవయితే, నేను వండిన యన్నమును యదేఛ్ఛగా తినుము !

శ్రీనివాస --- ఓ భక్తులారా ! భక్తితో పెట్టిన అన్నమును తప్పక భుజించెదను !

( తమాలిని సంతోషంతో ఒక విస్తట్లో కేవలం అన్నం తచ్చి పెడుతుంది )

( శ్రీనివాసుడు , తన మూడు వ్రేళ్లతో ఆ అన్నం నుండి ఒక కట్టె తీసి, నోట్లో వెసుకొంటాడు )

( శ్రీనివాసుడు వదిలిన అన్నాన్ని ,తొండమానుడు, కుమ్మరి దంపతులు, కళ్లకి అద్దుకొని తింటారు )

( ఆ ప్రసాదం ఆరగించగానే, కుమ్మరి దంపతుల దుస్తులు మారిపోతాయి ! వారిద్దరూ దివ్య వస్త్రాలతో, అలంకారాలతో సుసజ్జితులవుతారు )

(ఆ దృశ్యాన్ని చూసిన తొండమానుడు శ్రీనివాసుని పాదాలకు మ్రొక్కుతాడు )

తొండమాన --- శ్రీనివాసా ! నేను నీ భక్తుడను కానా ?

శ్రీనివాస --- భక్తులకు ఈర్ష్యాసూయలు , అహంకారము , రాగ ద్వేషములు తగవు ! తొండమాను రాజా ! భక్తి యను పెన్నిధి, జన్మజన్మాంతరముల నుండి, తరుగని సంపద ! ఈ కుమ్మరి దంపతులు , మూడు జన్మలనుండి, నా భక్తిలో పరిపక్వత పొందినారు ! ముందు నీ మనమును నిర్మలము చేసుకొనుము ! ఈ దేహము విడిచి, మరియొక దేహము నాశ్రయింపుము ! మరు జన్మలో నీవు నా సన్నిధిని పొందగలవు !

(తొండమానుడు సంతోషంతో శ్రీనివాసునికి అశ్రుపూరిత నయనాలతో అంజలి ఘటిస్తాడు )

( తరువాత లేచి భీముని కౌగలించుకొంటాడు, తమాలినికి నమస్కరిస్తాడు )

తొండమాన --- పుణ్య దంపతులారా !నేడు మీ వలన నాకు ఙ్ఝానోదయము అయినది ! నేను రాబోవు ఏకాదశి నాడు నా పుత్రునికి రాజ్యము నప్పగించి, స్వామి పుష్కరణిలో మునిగి నా తనువు చాలింతును ! ఈ జన్మము ఇక నాకు దుర్భరము !!

శ్రీనివాస --- కుమ్మరి దంఫతులారా ! మీ కొరకు బయట వేచి ఉన్న దివ్య విమానము నధిరోహింపుడు.

( అందరూ శ్రీనివాసునికి ప్రణమిల్లుతారు )

( శ్రీనివాసుడు అంతర్ధానమవుతాడు )

*****************

( దృశ్యము ౧౨౦ )

( నైమిశారణ్యం )

( సూత పౌరాణికుడు ,శౌనకాది మునులు ఉంటారు )

శౌనక --- సూత మునీంద్రా ! శ్రీ వేంకటేశ్వర అవతరణమును , అవతార తత్వమును సవిస్తారముగా చెప్పి, మమ్ములను కృతార్థులను చేసితిరి.

౧ ఋషి --- తొండమానునికి, వసుధానునికి మధ్య సంధి చేసి,వారివద్ద సుంకమును గ్రహించి, వేంకతేశ్వరుడు తాను వడ్డి కాసుల వాడినని తెలియజేసాడు.

౨ ఋషి --- కుమ్మరి దాసు భీముని కడ మట్టి తులసీ దళములు స్వీకరించి, తనకు ధనముపై, ఆసక్తి లేదని, నిజమైన భక్తి గల చోట, ఆను అత్యంత సులభుడని నిరూపించుకొన్నాడు.

౩ ఋషి --- పంచముల కడ పాదరక్షలు స్వీకరించి తనకు కులభేదము లేదని కూడ చాటుకొన్నాడు.

౪ ఋషి -- ఆపదలో నున్నవారు, తనకి భక్తితో ముడుపు కట్టి, తన సన్నిధికి వచ్చి, అహంకార చిహ్నమైన కేశములను స్మర్పించిన చాలునని, తన హృదయ వైశాల్యమును చూపుకొన్నాడు.

సూతుడు --- వేంకటేశ్వరుడు కోరిన వారికి కొంగు బంగారము, నమ్మిన వారికి ఆప్త బంఢువు, ముక్కోటి దేవతా సమూహములను తనలోనే నిలుపుకొన్న సర్వ వ్యాపకుడు. కుల మత భేదములు లేక తనని ఆశ్రయించిన వారిని అనుగ్రహించెడి వాడు.

శౌనక --- సూత మునీంద్రా ! వేంకటేశ్వరేశ్వరునికి మత సామరస్యము కూడ కలదా ?

సూతుడు --- వేంకటేశ్వరుడు మతముల పట్ల భేదము పాటీంపని వాడనుటకు చాలా నిదర్శనములు కలవు ! ఆయన ‘త్రిపతి’ !! బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమగ్ర రూపము !! ఓంకారము లోని మూ,డు శబ్దముల ముచ్చట స్వరూపము !

ఆయన పేరులోని ఈశ్వర శబ్దము , నాగాభరణములు, బిల్వ పత్ర పూజ, జడలు కట్టిన జుట్టు, వరలక్ష్మీ వినాయక వ్రాతాలు ఆచరించే సాంప్రదాయం, పుట్టలో నివాసం వలన అతను శైవులకు ప్రియుడయ్యాడు !

అమ్మవారి లక్షణాలు కలిగి ఉండడం , ఆలయం మీద సింహాల ప్రతిమలు, నవరాత్రి బ్రహ్మోత్సవం, పసుపు వాడకం, వేపాకు, కుంభం పావడలతో తిరుప్పావడ , పీతాంబర ధారణ, ‘ బాలాజీ ’ శబ్దం లోని ‘ బాల’ అన్న పేరు, అతనిని శాక్తేయులకు దగ్గర చేసింది !

ఆలయం పైని సింహ నికేతనం, శ్రీవారి కుడి వక్ష స్థానములో శ్రీ వత్సము ఉండడం వల్ల, జైనులు కూడ అతనిని ఆరాధించెడి వారయ్యారు !

బీబీ నాంచారమ్మను పరిణయ మాడడం వల్ల అతను మహమ్మదీయులకు కూడ దగ్గర వాడయ్యాడు !

౧ ఋషి --- సూత మునీంద్రా ! బీబీ నాంచారమ్మను , శ్రీవారు ఏ విధంగా చేపట్టారు ?

౨ ఋషి --- మత సామరస్య ప్రబోధకమైన నాంచారమ్మ చరిత్రను చెప్పండి !

సూతుడు --- మునులారా ! శ్రధ్ధాభక్తులతో ఆలకించండి !!

******************

( రచయిత విన్నపం. బీబీ నాంచారమ్మ చరిత్రని మొదటిసారిగా పౌరాణిక నాటకంగా వ్రాసిన నేను , ఇప్పటికి ౧౩ సార్లు ప్రదర్శించడం కూడా జరిగింది. హైదరాబాదు లోనే రెండుసార్లు రవీంద్ర భారతి లోను , అయిదు సార్లు త్యాగరాయ గాన సభ లోను ప్రదర్శించడం జరిగింది. నాటక సమాజానికి కాపీ రైట్సు ఇవ్వడం వల్ల , ఆ కథని దృశ్య రూపంలో ఇక్కడ వ్రాయలేక పోతున్నందుకు విచారం గానే ఉంది. ఇంతటితో ‘ బాలాజీ అర్చావతార దృశ్యార్చన ౧౨౦ దృశ్య సుమాలతో చేసి' ప్రస్తుతానికి విరమిస్తున్నాను )

*******************

Comments

  1. అద్భుతం సర్.

    చాలా బాగా శ్రీనివాసుని కధను చెప్పారు.

    ReplyDelete
  2. మీరు వ్రాస్తున్న బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన చాలా బాగుందండీ. శ్రీ వెంకటేశ్వరుని వివాహ వైభవం, తిరుమల గిరులపై స్వామి వెలిసిన తీరు అద్భుతగా ఉనాయి. స్వామి కథలు కొన్నే తెలుసుగాని మీ ద్వారా మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. ధన్యవాదాలు

    శ్రీవాసుకి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద