Skip to main content

స్మిత నయన 3

అది క్రీ.శ. 1008 వ సంవత్సరం లోని డిసెంబరు 31 వ తారీఖు. హిందూ దేశ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి ఆ రోజే నాంది జరిగింది.

మహమ్మద్ గజనీ ‘ జీహాద్’ పేరిట భారత దేశంపై సాగించిన దండయాత్రలలో అదే మొదటిది.

ఆ దండయాత్రని ఎదుర్కోవడానికి ఉత్తర హిందుస్థానంలో ప్రజలంతా ఆనంద పాలుని నాయకత్వాన్ని అంగీకరించిన దినం కూడ అదే !

స్త్రీలు సైతం తమ తమ ఆభరణాలని మాతృదేశ రక్షణకై దానం చేసిన పవిత్ర దినం అది ! ఆనంద పాలుడు తన భద్రగజం ‘కళ్యాణి’ పైన ఎక్కి, మహోత్సాహంతో గట్లు తెగిన వెల్లువలా ‘ మహమ్మద్ గజనీ’ సేనల పైకి విరుచుకు పడ్డాడు.

దూరం నుండి ఆ దృశ్యాన్ని చూసిన మహామంత్రి, వృధ్ధ రాజగురువు ‘దాదాజీ’ లిద్దరూ ఏమి కీడు, మూడనున్నదో అని భయాందోళనలకు లోనయ్యారు.

ఐరావతం పైన దేవేంద్రుడిలా తురుష్క సేనా వాహినిని తాకిన ఆనంద పాలుని చూసి, మహమ్మద్ గజనీ రెండు క్షణాల పాటు భయకంపితుడయ్యాడు.

తురుష్క సేనాని ‘ కతలూ ఖాన్’ , మహమ్మద్ గజనీకి ధైర్యం చెప్పి, తన అరేబియన్ గుర్రంతో ఆనం పాలుని దిశగా, పరుగు తీసాడు.

కళ్యాణి దృష్టి శర వేగంతో వస్తున్న కతలూ ఖాన్ పైన పడింది.దాని కండ్లలో నిప్పులు కురిసాయి !

‘ హృదయ భేధ్యంగా గట్టిగా ఘీంకరించి , అది కతలూ ఖాన్ వైపు అడుగు వేసింది.

దాని ఆవేశాన్నీ, గమనాన్నీ అదుపులోకి తేవడం, వీరభద్రునికి అసాధ్యమయ పోయంది. అతడు దీనంగా ఆనంద పాలుని వంక చూసాడు.

ఆనంద పాలుడు ఏ మాత్రమూ ధైర్యాన్ని కోల్పోకుండా , భద్ర గజం పై నుండి , తురుష్క సేనా వహినిపై శర పరంపరలను కురిపిస్తున్నాడు.

వీరభద్రుడు చివరి ప్రయత్నంగా, అంకుశంతో కళ్యాణి కుంభ స్థలంపై గట్టిగా పొడిచాడు.అంకుశం విరిగి రెండు ముక్కలయింది.

కళ్యాణి కుంభస్థలం నుండి నిర్విరామంగా రక్తం స్రవించ సాగింది. అది తన తొండంతో, వీరభద్రుని చుట్టగా చుట్టి, ‘కతలూ ఖాన్’ అశ్వం పైకి విసిరింది.

‘ కతలూ ఖాన్’ అతి చాకచక్యంతో దాని పాటుని తప్పించుకొని పరుగెత్త సాగాడు.కళ్యాణి ఇనుమడించిన క్రోధంతో వానిని వెన్నంటింది.
సరిగ్గా అదే సమయంలో –

“ కళ్యాణీ !” అన్న పిలుపు దిగంతాలను చీల్చుకొంటూ, వినిపించింది.కళ్యాణి నిమేష కాలం స్తంభించి పోయింది. ఆ పిలుపు దానికి క్రొత్తది కాదు ! దాని గుండెల్లో దాని రక్తంలో. దాని ఆణువణువుల్లోనూ ఆ పిలుపు ప్రతిధ్వనించింది.

మహారాజు ఆనంద పాలుడు కూడ ఆ పిలుపుని విన్నాడు. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది !!

“ కళ్యాణీ !”

కళ్యాణి వెనుతిరిగింది.

మహారాజు ఆనంద పాలుడు ఒక్క క్షణంలో తెప్పరిల్లి, జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు. కళ్యాణి పరుగును అరికట్టేందుకు అతడు తన గదతో, దాని కుంభ స్థలంపై ఒక్క దెబ్బ కొట్టాడు. కుంభ స్థలం చిట్లి రక్తం వెల్లువై పారింది.

కళ్యాణి దానిని కూడ లక్ష్య పెట్టలేదు. అది ఆనంద పాలుని గదను ఒక్క విసురుతో క్రింద పడేసి, ఆ పిలుపు వినవచ్చిన దిక్కుగా శరవేగంతో పరుగు తీసింది.

దూరం నుండి ఆ దృశ్యం చూసిన మహామంత్రి కొంత సైనిక బలంతో, కళ్యాణి వైపు పరుగు తీసాడు.

పోరులో ఆనంద పాలుని సైనిక హృదయాలపై ఆ దృశ్యం చెరగని ముద్ర వేసింది. ఏదో అదృశ్య శక్తి వారి హృదయం లోని ధైర్య సాహసాలని మటు మాయం చేసి, వారిని నిర్వీర్యులుగా చేసేసింది .

అంతే ! మరుక్షణంలో పోరు స్వరూపమే మారి పోయింది ! మహారాజు, మహామంత్రులు యుధ్ధ రంగం నుండి వైదొలగి పారిపోతున్నారనే వార్త క్షణాలలో వ్యాపించింది

మొదటి రోజు యుధ్ధంలోనే అయిదువేల మంది తురుష్క సేనని పోగొట్టుకొని, నిరాశ నిండిన హృదయంతో పోరు కొన సాగిస్తున్న మహమ్మదీయ సేనా వాహిని నూతనోత్సాహంతో, ‘ పెషావర్’ నుండి ‘కాంగడాకు’ దగ్గరగా, దుర్గమ గిరి శిఖరాల మధ్య కట్టబడిన ‘ నగర్ కోట’ వరకు హిందువుల వెంట తరిమింది.

******************

కూలిన శిఖరాలతో విరిగిన స్తంభాలతో పగిలిన పూర్ణ కుంభాలతో, మహమ్మద్ గజనీ కిరాతక చర్యలకి తార్కాణంగా నిలిచిన,‘భగవతి జ్వాలాముఖి’ మందిర భగ్నావశేషాల మధ్య , విషణ్న హృదయంతో కూర్చొని ఉన్నాడు మహారాజు ఆనంద పాలుడు.

అతని చూపులు ఆ భగ్నావశేషాల మధ్య దేనినో వెతుక్కొంటూ , అప్రయత్నంగా ఒక తరుణ యువకునిపై పడ్డాయి !

ఆనంద పాలుడు అతనిని చూసి ఆశ్చర్యంతో అప్రతిభుడయి పోయాడు.

అతడు తురుష్క సేనాని కతలూ ఖాన్ కావడమే ఆనంద పాలుని విస్మయానికి కారణ మయింది,

కతలూ ఖాన్ కూడ ఆనంద పాలుని వంక చూసాడు. ఆనంద పాలుని సమీపించి అతని పాదాలపై పడి భోరున ఏడ్వ నారంభించాడు.

.ఆనంద పాలునికి విస్మయంతో నోట మాట రాలేదు !! అతని పాదాలు కతలూ ఖాన్ కన్నీట ప్రక్షాళిత మవుతున్నాయి.

“ బాబాయ్ ! నన్ను క్షమించు బాబాయ్ ! హిందువుల ఘోరమైన పరాజయానికి , కళ్యాణి యుధ్ధరంగం నుండి పారి పోవడానికీ, నేనే కారణం. భద్రకుని హత్య చేసినట్లు నమ్మించి, మరునాడు అతని చేతనే కళ్యాణిని పెలిపించింది నేనే ! నా పాపానికి నిష్కృతి లేదు. బాబాయ్, నన్ను క్షమించు !”

“ నువ్వంటున్నది ఏమిటి కతలూ ఖాన్ ! నువ్వు తెలివిగానే మాట్లాడుతున్నావా ?”

“ ఇంకా నన్ను పోల్చుకోలేదా బాబాయ్ ! నేను ‘ కుమార ప్రతర్దునుణ్ని. యుధ్ధ ఖైదీలుగా , నేనూ, నాన్నగారూ పట్టుబడ్డ తరువాత, అయిదేళ్ల వయసులో ఉన్న నన్ను, హిందువుననే విషయం తెలియ నీయకుండా, కట్టుదిట్టం చేసి పెంచాడు మహమ్మద్ గజనీ ! కతలూ ఖాన్ పేరుతో ఇస్లాం స్వీకరించిన నేను, కొద్ది కాలంలో గజనీ అభిమానానికి పాత్రుణ్నయి అతని సేనా పతులలో ఒకడిగా మారిపోయాను.‘భగవతి జ్వాలాముఖి’ మందిరాన్ని నేలమట్టం చేసి, వెండి బంగారాలను దోచుకోవాలనే మహమ్మద్ గజనీ ఆలోచనకు అడ్డు రావడం వల్ల, నిండు సభలో హిందువుననీ, ‘ కాఫిర్’ అనీ దూషించి, నా ఈ ప్రతిఘటనకి కారణం , నీచమైన విగ్రహ పూజ చేసే, ఛాందసులైన హిందువుల రక్త స్పర్శ కలిగి ఉండడమేనని హేళన చేసాడు.

నన్ను పెంచిన దాది ద్వారా, మహమ్మద్ గజనీ మాటల లోని నిజాన్ని తెలుసుకొని , భగ్న హృదయంతో మిమ్మల్ని అన్వేషిస్తూ, తిరుగుతున్నాను. ఈ నాటికి మీతో కలయిక సంభవించింది ! నా పాపాలను మన్నించి మీ పవిత్రమైన కరవాలంతో నా కంఠాన్నిఉత్తరించి, నన్ను ప్రాపంచిక బంధాల నుండి విముక్తుణ్ని చెయ్యండి బాబాయ్ ! నాకు విముక్తి ప్రసాదించండి.”

తన పాదాల మీద పడి దీనంగా విలపిస్తున్న కుమార ప్రతర్దునిణ్ని గ్రుచ్చి కౌగలించుకొన్నాడు మహారాజు ఆనంద పాలుడు.

చిన్నతనం నుండి ముసల్మానుల మధ్య పెరిగి, ఇస్లాం స్వీకరంచి, వారి జీహాద్ లలో పాల్గొని తద్వారా, తన మాతృ దేశ ధర్మానికీ, సంస్కృతికీ తన బంధువర్గానికీ, తీరని తలవంపుకి కారణమయినందుకు, తపించి పోతూ, హృదయం లోని ఆవేదనని ఏ విధంగా వ్యక్తం చేయాలో తెలియని ప్రతర్దునిణ్ని ----

హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో , సర్వస్వాన్నీ , అంత కంటె మూల్యమైన అభిమానాన్నీ పోగొట్టుకొని, పరితపిస్తున్న హృదయానికి తోడు, పశ్ఛాత్తాపాగ్నితో దహించుకు పోతున్న, కుమార ప్రతర్దునిణ్ని ఏ విధంగా అనునయించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిన మహారాజు ఆనంద పాలుణ్నీ ----.

స్వీయ లీలా నాటకాన్నీ చూచి, అనిమేష నయనాలతో నవ్వుతోంది భగవతి జ్వాలాముఖి !!

( బహుమతి పొందిన చారిత్రిక కథ – ‘ జాగృతి, దీపావళి సంచిక , 1966 )

**************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద