Skip to main content

ఆవు--దూడ

అది 1914వ సంవత్సరం.

కామేశం రెండో పుట్టిన రోజు చేసుకోకుండానే తల్లిని కోల్పోయాడు.

“ వీడి కింక తల్లి లేని లోటు ఎలా తీరుతుందో ఏమో ! “ అని వాపోయిన, అతని విధవ మేనత్త కాసులమ్మ, ఆరు నెలలు దాటకుండానే తండ్రి గోపాలానికి మరో పెళ్లి చేసింది. ప్రాయం రాకుండానే ఆడ పిల్లల పెళ్లిల్లు చేసే ఆచారం ఆ రోజులలో ఉండ బట్టి, ఇంకా పన్నెండు వసంతాలైనా నిండని, ‘ అనసుయ’ కామేశానికి తల్లి స్థానంలో వచ్చి చేరింది. “ పిల్ల మంచి ఏపరి ! మరో సంవత్సరానికి ఎదిగి పోయి సంసారానికి వచ్చేస్తుంది!” అని ఆశించింది కాసులమ్మ.

అయితే మనిషి ఒకటి తలస్తే, తానొకటి తలచే దేవుడు, అంతా తారుమారు చేసేసాడు !

అత్తారింటికి చేరి ఏడేళ్లు దాటినా, అనసూయ వ్యక్తురాలు కాకుండా అందరినీ నిరాశ పాలు చేసింది. అయినా కామేశానికి మాత్రం స్నేహితురాలై పోయింది, ఇద్దరూ కలసి, గచ్చకాయలు, గుజ్జనగూళ్లు ఆడుకొనే వారు. కామేశం తండ్రి గోపాలం కూడా పెద్దవాళ్లెవరూ చూడకుండా, వాళ్ల ఆటల్లో పాల్గొనేవాడు. కాని అతను పాల్గొంటే ఆట సమంగా జరిగేది కాదు. నిజానికి గోపాలం అనసూయని తాకడానికి, ఆమెతో ముచ్చట లాడడానికి తప్ప, ఆట కోసం ఎప్పుడూ ఆడేవాడు కాదు. ఫలితంగా తగవులు వచ్చేవి ! సహజంగానే గోపాలం అనసూయ పక్షం వహించి కామేశాన్ని కొట్టేవాడు. కామేశం తన కొడుకనీ, తానూ—అనసూయా అతని తల్లి—తండ్రుల స్థానంలో ఉన్నామనీ, ‘ లా’ చదువుతున్నా గోపాలానికి ఆ సమయంలో తట్టేది కాదు ! దెబ్బలు తిన్న కామేశం కాసులమ్మతో చెప్పి, అలా చెప్పినందుకు మళ్లీ దెబ్బలు తినేవాడు.

కాసులమ్మకి ఈ వింత సంసారం ఎలా చక్కబడుతుందో అర్థమయేది కాదు! “ నీ తల్లే గనుక బ్రతికి ఉంటే నీకీ అవస్థలు వచ్చేవి కాదుగదా ?” అని కామేశాన్ని కౌగలించుకొని ఏడ్చేది. ఆ విధంగా కామేశం చిన్న మనసులో తల్లి లేని లోటు క్రమక్రమంగా ముద్రవేసుకో సాగింది !

ఒకరి కలతలతో నిమిత్తం లేని కాలం మరికొంత కాలం ముందుకి జరిగి, అనసూయని వ్యక్తురాలిని చేసి కాసులమ్మని తన గర్భంలో దాచుకొంది. దాంతో కామేశం నిజంగానే తల్లి లేని వాడు అయ్యాడు.

కామేశం మిడిల్ స్కూలులో చేరే వేళకి, అతనికి ఒక తమ్ముడు, మరిద్దరు చిన్నారి చెల్లెల్లు పుట్టు కొచ్చారు. దాంతో ఇంటా బయటా కూడా, అతని భాద్యతలు పెరిగిపోయాయి.

ఇంట్లో వంట చెరుకు నుండి, క్రోసు దూరంలో ఉన్న కిరాణా కొట్టు నుండి కావలసిన వెచ్చాలు తేవడం అన్నీ, కామేశం పనులే ! సంవత్సరానికి నాలుగు నిక్కర్లు, నాలుగు చొక్కాలు కామేశానికి కుట్టించేవాడు గోపాలం. వాటితోనే ఏడాదంతా గడచి పోవాలి. అందుకని అతని కంటికి బాగా మన్నుతాయని తోచే బట్టలే కామేశం వంటి నలంకరించేవి. ఆ బట్టలకి వేరేగా ఒక పెట్టె కేటాయించ బడింది. పాపం ! అవి చేసుకొన్న దౌర్భగ్యం ఏమో గాని, వాటికి చాకలి పద్దులో కూడా చోటు ఉండేది కాదు!అంతెందుకు, గోపాలం ప్లీడరు బుర్రలో క్రమశిక్షణ, పొదుపు వగైరాల మీద వచ్చే ఆలోచనలని అమలులో పెట్టడానికి, కామేశం మొదటి— చివరి లేక, ఒకే ఒక విక్టిమ్ అయి, తల్లి లేని కొరత ఎంత పెద్దదో అతని నరనరానా జీర్ణించుకు పోయేలా చేసేది.

ఇంటర్ రెండో ఏడు పరీక్ష పాసవడంతో, కామేశం చదువు ఆగిపోయి, ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక దాని మీద ఒకటి పోటీ పడసాగాయి. అతని విలువ పెళ్లిళ్ల బజారులో 516 జార్జి వెంఢి రూపాయలు పలికి, అది ఇచ్చుకొన్న,’ వసుంధరతో’ ఎగ్రిమెంటు అయిపోయింది.

పెళ్లివారు తరలి వెళ్తున్నారనగా, లండన్లోని ప్రముఖ జోళ్ల కంపెనీ నుండి, కామేశం పేర ఒక‘ వి.పి. పార్సెల్ ‘ వచ్చింది.’వి.పి’ మొత్తం 26 రూపాయలు. పోస్టుమేన్ దగ్గర, పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేని గోపాలం దాన్ని విడిపించి, కామేశం ముందు పెట్టాడు.

మరుక్షణం పార్సెల్ కాగితాలు పరపరా చిరిగాయి. లోపలి గడ్డి గరగరా ఇల్లంతా పరచుకొంది ఇంకా లోపల నల్లనల్లగా నిగనిగ లాడుతున్న బూట్లు, ఒక పాలిష్ డబ్బా, బ్రష్ , తీసుకోవలసిన జాగ్రత్తలు వ్రాసిన ఒక బుక్ లెట్టు ఉన్నాయి.

తండ్రి తన కోసం తెప్పించాడేమో అని సంతోషంతో వాటిని అందుకోబోయిన కామేశం, గోపాలం కొట్టన దెబ్బకి, పెట్టిన శాపనార్థాలకి, విషయం అర్థమవక విస్మయానికి లోనయ్యాడు.

చివరికి సాహసించి, “ అదేమిటి నాన్నగారూ ! పార్సెల్ మీరే తెప్పించి, నా మీద కోపగించు కొంటారేం !?” అని అడిగాడు.

ఆ ప్రశ్న విన్న గోపాలం అగ్ని రుద్రు డయ్యాడు “ దగుల్బాజీ వెధవా ! నేనా తెప్పించాను వాటిని ! ఇదుగో ఆ కంపెనీ వాళ్లు వ్రాసిన లెటర్ చూడు. పత్రికలో వాళ్లిచ్చిన ప్రకటన చూసి, నువ్వు వ్రాసిన ఉత్తరం, ఇచ్చిన కొలతలని బట్టి, వాళ్లు దాన్ని పార్సెల్ చేసారు. చేసినదంతా చేసి, నంగనాచిలా ఎదురు ప్రశ్నకూడానా!?” అంటూ దగ్గరున్న తాంబూలం పళ్లెం విసిరి కొట్టాడు.

సుదర్శన చక్రంలా రివ్వున తిరిగి, కామేశం నుదురుని ‘ ఢీ’ కొట్టిందది ! పళ్లెం, తమలపాకులు, చెక్క, సున్నం అన్నీ రక్త లేపనం చేసుకొని తలొక మూలకి సర్దుకొన్నాయి.

దృశ్యం ఆ విధంగా భీభత్సంగా మారేసరికి అనసూయలోని స్త్రీత్వపు పొర కాస్త చలించింది కాబోలు ! పరుగున వచ్చి కామేశం తలని ఒడిలోకి తీసుకొంది “ శుభమా అని పెళ్లికి తరలి వెళ్తూ, ఇదేం పనండీ ! కొంటే కొన్నాఢు, గడ్డాలు మీసాలూ వచ్చాక కూడా మీరు గీసిన గీటు దాటకూడదంటే ఎలా ?” అంటూ.

కామేశానికి గాయం తాలూకు నొప్పి, బాధ ఏమీ తెలియలేదు ! స్వర్గం కూడా సరితూగని తల్లి ఒడిలోని మాధుర్యాన్ని మొదటి సారిగా చవి చూసాడతను. ఆ క్షణంలోనే అతను మనసులో భగవంతునికి అంజలి కూడ ఘటించాడు. ‘ భగవాన్ ! నా పిల్లలకి మాత్రం తల్లిని ఎడబాటు చెయ్యకు,’ అని.

మరో గంట రభస జరిగాక అసలు విషయం బయట పడింది. గోపాలం చిన్న కొడుకు ‘రమణ’ చేసిన పని అది ! పత్రికలోని ప్రకటన దారుకి, తన పేర ఉత్తరం వ్రాసే ధైర్యం లేక, కామేశం పేర తెప్పించాడట వాటిని.

తన చుట్టూ పడి ఉన్న పార్సెల్ల వంక, నిస్సహాయంగా చూసాడు, చూసాడు గూడ్స్ క్లార్కు కామేశ్వర రావు. ‘పని త్వరగా తెముల్చుకొని, బయట పడదామనుకొంటే వీలయ్యేలా లేదు.’ తన అదృష్టాన్ని తిట్టుకొన్నాడు అతను అతని తొందరకి కారణాలు లేకపోలేదు. అతనికి ఆ రోజు ఉదయమే ఒక. మగ శిశువుకు తండ్రి అయినట్లు తంతి ద్వారా కబురు అందింది. రాత్రి 8.30 గంటలకి బయలుదేరే పాసెంజరులో అత్తవారి ఊఁరు చేరుకోడానికి ఏర్పాట్లు కూడా జరిగి పోయాయి. బజారు పని మధ్యాహ్నం లంచి హవర్లో అయిపోయింది. కాని ముఖ్యమయిన పని ఒకటి ఉండి పోయింది, రాత్రి బండికి బయల్దేరే లోపల ఆ పని కాస్త అయిపోతే గాని అతనికి మనశ్శాంతి చిక్కదు!

సాయంత్రం అయిదు గంటల వరకు ముళ్లమీద కూర్చొన్నట్లు గడిపి, ఆఫిసు బయట పడ్డాడు కామేశ్వ్రర రావు. ఆఫిసు నుండి సరాసరి, సిద్ధాంతి గారింటికి బయలుదేరాడు.

గుమ్మం దగ్గర నిలబడ్డ క్లయింటుని సాదరంగా ఆహ్వానించారు సిద్ధాంత గారు, “ రండి, రండి !” అంటూ. కామేశ్వర రావు ఉపోద్ఘాతమేదీ లేకుండా తంతి కాగితాన్ని సిద్ధాంతి గారి చేతుల్లో పెట్టి జాతక చక్రం వేయమన్నాడు. సిద్ధాంతి గారు గంటలో జాతకం వేయడం పూర్తి చేసి, కామేశ్వర రావు వంక చిరునవ్వుతో తిలకించారు. “ కుర్రాడిది మంచి జాతకమేనండి. ఆయురారోగ్య , ధన, కళత్ర రాజ్య స్థానాలు బాగానే ఉన్నాయి--------” అంటూ మొదలు పెట్టి కుర్రవాడి సంగ్రహ జీవిత చరిత్రని చెప్పి ముగించారు, ఆయన.

అంత చెప్పినా కామేశ్వర రావు ముఖంలో సంతృప్తి కనిపించలేదు. సిద్ధాంతి గారు ఇబ్బందుగా ముఖం చిట్లించారు. 5 రుపాయల ఫీజు ఇచ్చి, ప్రతీ విషయాన్నీ కూలంకషంగా తెలుసుకోవాలని చూస్తారు అందరూ. కాని పుట్టినప్పుడే అన్ని వివరాలూ చెప్పడం కుదరని పని అని తెలుసుకోరు ! జాతక ఫలితాలు కూడా మనిషి పెరిగిన వాతావరణం, చదివే చదువు, సంస్కారం, వగైరాలని బట్టి స్వల్పంగా మారుతూ ఉంటాయని, వాటిని ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలసిందే తప్ప, మరొకలాగ జరగదని ఎలా చెప్పడం ? చెప్పినా ఎంత మంది తెలుసుకోగలరు !

“ పిల్లడి విద్య, ఉద్యోగం విషయాలలో నాకు చింత లేదండి. వాటిని గురించి తెలుసుకోవాలని కూడా లేదు.నా జాతకం మా పెద్దలు వేయించలేదు. నా భార్యది కూడా లేదు. అందుచేత పిల్లవాని జాతకం చూసి---”

“ ఏం చెప్పమంటారు?” కుతూహలంతో ప్రశ్నించారు సిద్ధాంతి గారు

“ పిల్లడికి తల్లి లేని లోటు లేకుండా ఉంటే చాలు. ఆ విషయం చూసి చెప్పండి.”

సిద్ధాంతి గారు విస్మయంతో చూసారు.‘ పిల్లవాడి జాతకం చూసి, నాకు ప్రమోషన్ వస్తుందో లేదో చెప్పండి, లేదా వాడి జాతకం చూసి నేను ఇల్లు కడతానా లేదా, ’ లాంటి, ప్రశ్నలకి అలవాటు పడ్డ అతనికి, పడిన అతనికి, కామేశ్వర రావు ప్రశ్న ఆశ్చర్యాన్ని కలిగించింది.

చక్రాన్ని ముందు పెట్థుకొని, ఉత్సాహంతో గుణించారు అతను.“ మాతృస్థానం బాగుందంఢీ రావుగారూ! స్థానానికి శుభార్గళం ఉంది. చంద్రుడు కృత్తిక ఆఖరు పాదంలో ఉచ్ఛలో ఉన్నాడు. అందువలన తల్లికి పూర్ణాయువు ! ఆ విషయంలో సందేహం లేదు.-------”

గభాలున జేబు లోంచి పది రూపాయల కాగితం తీసి, అతని చేతిలో పెట్టి, జాతకాన్ని మడిచి జేబులో పెట్టుకొంటూ, “ వస్తానండి ! రాత్రి పాసింజరు పట్టుకోవాలి,” అంటూ పరుగు పరుగున వెళ్లిపోయిన కామేశ్వర రావు వంక చేష్టలుడిగి, చూస్తూ ఉండి పోయారు సిద్ధాంతి గారు ! తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడడం అతనికదే మొదటిసారి !

అది 1974వ సంవత్సరం.

పొయ్యి ముట్టించి, కాఫీకి నీళ్లు పెట్టి గడియారం వంక చూసింది వసుంధర.. చిన్న ముళ్లు అప్పుడే ఆరు అంకె దాటుతూంది.

‘ కాఫీలోకి పాల చుక్కలు కావాలి. కొడుకు రాత్రి ఏ టైముకి వచ్చాడో ఏమో ! ఇప్పట్లో లేచేలా లేడు. అతనినే లేపాలి ‘ అనుకొంటూ భర్త గదిలోకి వెళ్లింది ఆమె.

కామేశ్వర రావుగారు అప్పటికే లేచి, పళ్లపొడి డబ్బా, చేతిలో దులుపుతున్నారు. వసుంధరని చూడగానే విషయం అర్థమయింది. “ ఏం వాడింకా నిద్ర లేవ లేదా ?” అని అడిగారు.

ఆమె మౌనంగా తల ఊఁపింది.

“ రాత్రి పన్నెండు దాకా వాడు చేసే రాచకార్యం ఏమిటో తెలుసా నీకు ? క్లబ్బులో పేకాట ! లేపి, పాలు తీసుకు వచ్చి పడుకోమను. నా కివాళ ఒంట్లో నలతగా ఉంది, వెళ్లలేను.”

“ సరే అయితే ! నేనే వెళ్తాను.వాడిని లేపి పంపడం నా వల్ల కాదు, కాఫీ త్రాగేసి, పోనీ సంతకైనా వెళ్లి రండి వాడు మంచి నిద్రలో ఉన్నాడు, లేపితే విసుక్కొంటాడు. ” దురుసుగా జవాబిచ్చింది వసుంధర.

“ నువ్వెందుకూ వెళ్లడం ? తే ! నేనే వెళ్తాను. అయినా ఎవరి భాద్యతలు వాళ్లకి తెలియాలి గాని, ఎంత కాలమని చెప్పగలం !” విసుగుతో ఆమె చేతిలోని పాల చెంబు అందుకొన్నారు అతను.

“ రేపు ఉద్యోగంలో చేరితే భాద్యతలు వాటంతటవే తెలుస్తాయి లెండి. ఏదో అందాకా రెస్టు తీసుకోనివ్వండి. “ సమర్థించింది వసుంధర.

మారు మాట్లాడక పాలచెంబు చేత పట్టుకొని, మేడ మెట్లు దిగారు కామేశ్వర రావుగారు. అతని వయసు ఇప్పుడు అరవై రెండు. నాలుగేళ్ల క్రితమే రిటైరయ్యారు. ఒక్కడే కొడుకు, ఇరవై ఏళ్ల వాడు. చదువు పూర్తి అయి ఇంకా ఉద్యోగ పర్వంలోనే ఉన్నాడు.

ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న, అతను మెట్లమీద తూలి పడబోయి నిలద్రొక్కుకొన్నారు. ‘ కొడుకుకి తల్లి పేరే పెట్టుకొన్నాడతను. తన జీవితంలో అనుభవించిన లోటు భగవంతుడు దయవల్ల వాడికి లేదు. తల్లి –తండ్రుల ప్రేమ పుష్కలంగా లభించింది వాడికి. పెంపకంలో లోపం ఎక్కాడా లేదు ! అయినా వాఢెందుకు ఇలా భాద్యతా రాహిత్యంగా తయారయ్యాడు !?’

పాలు చేపుకి రాగానే, బలవంతంగా దూడని విడదీసి, పాలు పితకడానికి ఉద్యుక్తుడయ్యాడు పాలవాడు

ఆ దృశ్యాన్ని చూసిన కామేశ్వర రావుగారుకు హఠాత్తుగా తన సమస్యకి సమాధానం స్ఫురించింది. తన ఆలోచన సవ్యమైనది, ఔనా కాదా అని మరొకసారి మననం చేసుకొని బాహాటంగానే ఒప్పుకొన్నారాయన !

‘ నిజమే ! తల్లి లేని లోటే తనకి బరువు భాద్యతలు తెలియజేసి, సరైన బాటలో నడిపించింది.. ఆ లోటు లాకనే, తన కొడుకు. తన కొడుకు భాద్యతా రహితంగా తయారయ్యాడు,’ అని.

అది 2010వ సంవత్సరం !

“ నాయనా, కామేష్ ! ను మమ్మీని మాట్లాడుతున్నానురా! “

“ఏంటి మమ్మీ ! ఇంత రాత్రి పూట చేసావు ? “

“ రాత్రా ! అయ్యో నా మతి మండా ! నీ నిద్ర పాడు చేసానా నాన్నా !ఇక్కడింకా పగలేన్రా----”’

“ సరే, సంగతేమిటో చెప్పు.”

“ నాన్నా కామేష్ ! నేనీ ‘ఓల్ద్ ఏజ్ హోం’ లో ఉండలేక పోతున్నానురా ! వీళ్లు సరిగా తిండి పెట్టడం లేదురా, మరుగు దొడ్లు కంపు కొడుతున్నాయి. రోగం వస్తే పట్టించుకోవడం లేదు.-----”

“ అయితే ఏంటంటావు మమ్మీ ?”

“ నన్ను కూడా అమెరికా తీసుకు పోరా ! మీ నాన్నగారు క్రిందటేడే పోయి, నన్న ఒంటరిదాన్ని చేసేసారు. నేను ఒంటరిగా ఇక్కడెందుకురా, నన్ను తీసుకు పోరా !”

“ కుదరదు మమ్మీ, సుషీకి నీతోపాటు ఉండడం ఇష్టం లేదు. నేను ఆ ఓల్డ్ ఏజ్ హోం సెక్రటరీతో మాట్లాడుతానులే ! కాస్త డబ్బులు ఎక్కువిస్తే సదుపాయాలు చేస్తారు,ఇంక పెట్టేయి మమ్మీ !”

టెలిపోను క్రెడిల్ చేసిన చప్పుడు విని దీర్ఘంగా నిట్టూర్చింది ఆమె ! ఒక్కడే కొడుకు, మామగారి పేరే పెట్దుకొంది. ఆరేళ్ల వయసులోనే కొడుకుని దూరంచేసి బోర్డింగు స్కూలులో పెట్టేసింది. తల్లి ప్రేమని చవి చూపించకుండా, ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం ! మామయ్యగారి ‘ ఆవు—దూడ’ న్యాయంలో నిజమెంత !?

**********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద