Skip to main content

పడగ మీద మణి-౨


    నాగూరు  గ్రామంలోని  ‘శ్రీ కోదండ రామాలయం’ ఎదురుగా ఉన్న ఖాళీ  స్థలంలో  నలుగురు  పిల్లలు  ‘బిల్లా చెక్కా’  ఆట ఆడుతున్నారు.

    బిళ్ల అనేది  జానెడు  పొడవుండే వెదురుతో, రెండు కొసలూ  సూదిగా చెక్కిన కర్ర ! ఇక ‘చెక్క’ అనేది ధృడమైన గుగ్గిలం కలపతో  చెయ్యబడ్డ  మోచేయి పొడవు కలిగి, ఒక  చివరని సూదిగా చెక్కి తయారు చేసిన కర్ర..! నేల మీద చిన్న గొయ్యి తీసి ‘బిళ్లని’ దాని  మీద  అడ్డంగా పెట్టి, ‘ చెక్క  యొక్క  సూది మొనతో  దానిని   మీదకి ఎత్తి, అది మీదకి ఎగరగనే దానిని చెక్కతో బాది, విసురుతాడు.మిగతా  పిల్లలు ఆ బిళ్లని పట్టుకోవడానికి పరుగెడతారు. పట్టుకొంటే ,‘అవుటే ! పట్టుకోలేక పోతే, బిళ్ల ఎక్కడ పడిందో అక్కడకి వెళ్లి, ఆ బిళ్ళ చివరని చెక్కతో కొట్టి, అది మీదకి లేవగానే తిరిగి దూరంగా పడేలా కోడతాడు.మిగతా పిల్లలు దానిని పట్టుకోవడానికి  రకరకాల  స్థలాలలో నిలబడేవారు, వానిని  అవుట్ చేయడానికి.బిళ్ల పడిన చోటునుండి గొయ్యి వరకు దూరాన్ని చెక్కతోనే కొలిచే వారు. అది పది చెక్కల దూరంలో పడితే పది పాయింట్లు దొరికేవి. ఈ ఆటే నేటీ క్రికెట్ ఆటగా  రూపాంతరం చెందిందేమో తెలియదు  గాని,అప్పట్లో ఆ  ఆట పిల్లలకి చాల సరదా అయిన ఆట !

    ఆ ఆటని దూరం నుంచి చూస్తూ, నిలబ్డి ఉండేవాడు  ఒక కుర్రాడు.  బిళ్ల రామాలయం  గోడ దాటి, గన్నేరు  చెట్ల మధ్యలో  పడిపోతే, “ ఒరేయ్ ‘బండశీనూ’ ! వెళ్లి బిళ్ల పట్రా ! ”అని ఆర్డరు వేసేవారు ఆ కుర్రాళ్లు.

    మూగ ప్రేక్షకుడి  లాగ  నిలబడిన  బండశీను  పరుగు  పరుగున వెళ్లి, రామాలయం  గోడ  దాటి  వెళ్లి, గన్నేరు చెట్ల మధ్య వెతికి బిళ్లని తెచ్చి వాళ్లకి  ఇచ్చేవాడు. మళ్లీ ఆ కుర్రాళ్లు ఆట  మొదలు  పెట్టేవాళ్లు. ఆట  మధ్య  విరామ  సమయంలో  వాళ్లు బండశీనుని పిలిచే  వాళ్లు, “ ఒరేయ్, బండశీనూ, శర్మ గారి  పెరట్లోకి  వెళ్లి, వాళ్ల  జామ చెట్టెక్కి, జామకాయలు కోసి పట్టుకు రారా! ” అనే వారు. బండశీను  పాపం, తు,చ, తప్పక  అలాగే తెచ్చిఇచ్చేవాడు. .వాళ్లు  ఆ జామకాయలని  సమానంగా  పంచుకొని తినే వారు. బండశీనుకి  ఒక్కటైనా ఇచ్చేవారు  కాదు. పైపెచ్చువాడు ఎక్కడైనా  దాచుకొన్నాడేమోనని  శల్య పరీక్ష  చేసేవారు ! అయినా  పాపం  బండశీను నిశ్శబ్దంగా  జామకాయలు  తింటున్న  వారి  వంక  ఆనందంతో  చూస్తూ  నిలబడే  వాడు. వాళ్లతో  కలిసి ఆడుకోవాలని  అనిపించినా  సాహసం  చేయలేక  పోయేవాడు.వాళ్లు తనని ఆఙ్ఞాపించడమే తనని గుర్తించినట్లు అని,వాళ్ళ సేవ చేయడమే   తన  పని అని అనికొనేవాడు.బండశీను తల్లి తండ్రులు వాడికి అలాగే చెప్పి పంపించే  వారు.

    ఆ నలుగురు పిల్లలూ పెద్దవారయి, ‘వీరఘట్టం’ హైస్కూలుకి  వెళ్లేందుకు సిద్ధమయి నప్పుడు, బండశీను  వాళ్ల  స్కూలు  సంచీలు  మోసుకొని బస్సు వరకు దిగబెట్టే  వాడు. తిరిగి బస్సు వచ్చే  వేళకి  అక్కడికి వెళ్లి వాటిని  మోస్తూ ఇంటికి చేర్చేవాడు.అలా సేవలు  చేసినందుకు  బండశీనుకు  ప్రత్యేక  మయిన  జీతం ఉండేది  కాదు.అప్పుడప్పుడు  అతని  తండ్రికి  ఇచ్చే  బోనస్  తిండి  గింజలలో  మరో  కుంచం గింజలు అదనంగా పోసేవాళ్లు.ఆ ఊరి బుగతలు, తమ పిల్లలకి  వాడు  చేసే సేవలకి  ప్రతిఫలంగా !

    బండశీను  ఆ పిల్లలకి  నాగావళీ  నదిలో ఈత కొట్టడం నేర్పేవాడు. ములుగర్రతో  చేపలు  పట్టడం  నేర్పేవాడు. అయినా  వాళ్ల  కలిమి  కారణంగా  వాళ్లతో  చెలిమి  చేయలేక  పోయాడు.

    ఆ  పిల్లలే ఈ  నాటి  విష్ణు వర్ధన్, విరించి వర్మ, ద్యుతిధర్, రవి కాంతులు.

    బండశీను   ఏమయ్యాడో, ఎక్కడున్నాడో  కూడ   వాళ్లకి  తెలియదు. హైస్కూలు  చదువు   ప్రారంభ  సమయంలో  బండశీను  తల్లి  చనిపోయిందనీ, తండ్రి మరో పెళ్లి  చేసుకొన్నాడనీ  విన్నారు..వాళ్ల  హైస్కూలు  చదువు ముగిసే సమయానికి ,బండశీను సవతి  తల్లి  పెట్టే బాధలు  భరించలేక ఇంట్లోంచి  పారి ఫోయాడనీ   విన్నారు.అంతే ! ఆ తరువాత  వాళ్లెవరూ   అతని గురించి   ఆరా  తీయలేదు.

    పారిపోయిన కొడుకుని,తండ్రి  వెతికించే  ప్రయత్నం చెయనే  లేదు..కనీసం  పోలీసులకి  రిపోర్టు  కూడా  చెయ్యలేదు.

    ‘ అమ్మా ! ఎక్కడున్నవమ్మా ! చుక్కల్లో ఉన్నావని అందరూ చెప్పారు.ఏ చుక్కలో ఉన్నావమ్మా?’ అని మూలిగాడు బండశీను.అతను పార్వతీ పురం, సత్యనారాయణ  స్వామివారి ఆలయం దగ్గరున్న ఒక  పెంకుటింటి అరుగు మీద కాళ్లు  మునగ  దీసుకొని, చలికి  వణుకుతూ  మూడంకె  వేసి పడుకొని ఉన్నాడు. పన్నెండేళ్ల వయసున్న  ఆ  కుర్రవాడికి  తల్లి పోయింది. ఆ స్థానంలో. వచ్చిన  సవతి  తల్లికి  వాడు  కంటిలో  నలుసయ్యాడు. అంతే ! భర్త ఉన్నప్పుడు  వాని  మీద ప్రేమ నటించేది, లేనప్పుడు రాచి రంపాన  పెట్ట్టేది. రెందు రోజుల క్రితం జరిగిన సంఘటన వానికి  ఇంకా  గుర్తుకు  ఉంది. ‘ పిన్ని తన పైన దొంగతనం ఆరోపించింది. పోయిన సోమ్ము  ఒక్క  రూపాయి ! నాన్న ఆమె మాటలు నమ్మాడు. దడిలోంచి  ఒక పొడుగాటి  కర్ర  ఊడదీసి  దానితో కాళ్లమీద, చేతుల  మీద, నడుము మీద, ఇంకా ఎక్కడ పెడితే అక్కడ కొట్టాడు.వాని రోదనం అరణ్య రోదనం  అయిఫోయింది.లేని  డబ్బుని  ఎక్కడనుండి తెచ్చిఇవ్వ గలడు ! తన ఏడుపు విని జాలి  దలచే వారే లేక పోయారు, ఆ పేటలో అది మామూలు దినచర్యే మరి.‘

    బండశీనుకి నాన్న మీద  విరక్తి పుట్టింది.‘ కూలి పని చేసి అయినా బ్రతకవచ్చు’ అనే జీవిత  సత్యం వానికి  చిన్నప్పుడే తెలిసి పోయింది.అంతే, రాత్రి పూట ఇల్లు వదిలి,రోడ్డుమీద నడుచుకొంటూ  తోటపల్లి చేరుకొన్నాడు. ఆ తరువాత  ఒక గరిశె బండిలో, కామందుకి  తెలియకుండా,  కూర్చొని పార్వతీ పురం  చేరుకొన్నాడు.

    ఆ రెండు రోజులుగా వాడికి ఆహారం లేదు. ఒంటి మీద పడ్డ దెబ్బలు  వాతలు  తేరి, సలుపు పెట్ట సాగాయి. పైగా చలి, ఏమి చేయాలో  తెలియక, సత్యనారాయణ స్వామి మందిరం  చేరుకొని, కూర్చొన్నాడు. సాయంత్రానికి ఎవరో ఇంత ప్రసాదం ఇచ్చారు. అది తిని అక్కడే పడుకొన్నాడు. కాని  కాపలాదారు  ఒప్పుకో లేదు, వాడిని తరిమేసి గుడి తలుపులు మూసేసాడు. చేసేది  లేక  ప్రక్కనే ఉన్న పెంకుటిల్లు అరుగు  మీద పడుకొన్నాడు. చుక్కల్ని  చూస్తూ  అమ్మ  ఏ చుక్కలో  ఉందోనని  వాపోవ సాగాడు..

    ఆదిరాజు భాస్కర మూర్తి  ఆయుర్వేద వైద్యుడు. బహ్మచారి, నైష్టికుడు, నిస్వార్థ  సేవకుడు అయిన అతనిని తెలియని  వారు,  పార్వతీ పురం  లోనే కాక, చుట్టు  పట్ల గ్రామాల లోనే లేరంటే  అతిశయోక్తి  కాదు. అతని చిరునామా చాలా సులభం ! సత్యనారాయణ స్వామి  మందిరం  ప్రక్కన ఉండే పెంకుటిల్లు అంటే చాలు ! ఏ సమయంలోనైనా  ఎవరైనా తలుపు తట్టవచ్చు.రోగి రాలేని పరిస్థితిలో ఉంటే అతనే  రోగి దగ్గరకు వెళ్తాడు.

    ఆ రోజు అతను సీతానగరం లోని ఒక రోగి ఇంటికి వెళ్లి  తిరిగి  తన సైకిలు మీద ఇంటికి చేరాడు. తన ఇంటి అరుగు మీద మూలుగుతూ  ఒళ్లు తెలియని అపస్మారక  స్థితిలో పడుకొని ఉన్న బాలుణ్ని  చూడగానే  అతని మేను జలదరించింది.

    ఎవరో పాపం కుర్రాడు ! తన కోసం వచ్చి, తనని  కానక నిరీక్షణలో గడపుతూ, జ్వర తీవ్రత వల్ల తెలివి తప్పి పడి ఉన్నాడని’ తలంచిన అతను, వెంటనే దగ్గరగా వెళ్లి, బండశీను నాడి చూసాడు.

    కుర్రాడికి  సన్నిపాత జ్వరం వచ్చిందనీ,మరికొన్ని ఘడియలు  గడిస్తే  ‘ధనుర్వాతానికి  గురి చేయగలదని, అతడు కుర్రవాని నాడి పరీక్షించగానే కనిపెట్ట గలిగాడు.కుర్రాడితో పాటు ఇంకెవరైనా వచ్చారేమోనని  చుట్టూ చూసాడు. ఎవరూ కనబడ లేదు. ముందుగా రోగికి మందు వేసి, ఉపచారం  చెయ్యల్సిన అవసరం ఉందని గ్రహించిన  భాస్కర మూర్తి  ఆలస్యం చెయకుండా ఇంటి తలుపులకి  బిగించిన తాళం తీసి, లోపలికి వెళ్లి, ముందుగా పట్టెమంచం వాల్చాడు. తరువాత కుర్రవాడికి తన భుజాన్నిఆసరా ఇచ్చి, లోపలికి నడిపించి దాని మీద పడుకో బెట్టాడు. వాని పరిస్థి చూస్తే, కడుపులో ఆహారం పడినట్లు లేదు. “ఏమైనా తిన్నావా  బాబూ ?” అని అడిగాడు.భాస్కర మూర్తి. 

    బండశీను మూలుగే సమాధానంగా ఇచ్చాడు. పొట్టలో  ఆహారం లేనిదే, మందిస్తే వికటిస్తుందని తెలిసిన ఆ వైద్యుడు, వెంటనే వంటింట్లోకి  వెళ్లి, కిరోసిన్  స్టవ్వు వెలిగించి  అన్నం, చింతపండు చారు కాచి, తన వైద్య పరిఙ్ఞానాన్ని ఉపయోగించి, ఏవేవో చూర్ణాలు కలిపి, కేవలం చారు అన్నం కుర్రాడి  చేత తినిపించాడు. తరువాత వేడి నీళ్లతో దెబ్బలని తుడిచి, వాటిపై  లేపనం వ్రాసాడు.

    వైద్యోపచారం జరుగుతూ ఉండగానే, బండశీను నిద్రలోకి జారుకొన్నాడు. పొట్టలో పడిన ఆహారం, కాయానికి  తగిలిన మందు, గాయాలకి  వ్రాసిన లేపనం, వానికి  ఉపశమనాన్ని ఇచ్చి, చుక్కల్లోకి ,చేరిన అమ్మ ఒడి లోని  కమ్మదనాన్ని అనుభవానికి తెచ్చి, ఆదమరిచి నిద్రపోయేలా చేసింది.

    ఆ నిద్రమత్తు దిగడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఆ మధ్య సమయంలో వైద్యుడు తన చేత ఏం తినిపిస్తున్నాడో, ఏం తాగిస్తున్నాడొ  వానికి తెలియదు. వాని పరిస్థితి చూసిన భాస్కర మూర్తి  కుర్రవానిని మరే ప్రశ్నలు వేయకుండా మౌనంగానే తన విధులని నిర్వహించాడు.

    తెలివి రాగానే బండశీను, “అమ్మా !” అంటూ పిలిచాడు.

    భాస్కర మూర్తి కళ్లు ఆనందంతో విప్పారాయి ‘తన ప్రయత్నం  ఫలించింది. సన్నిపాత జ్వరం నుండి రోగిని చాలా తొందరగా రెండు రోజుల సమయం లోనే కోలుకొనేలా చేసాడు !’    “ ఏం బాబూ ! అమ్మ గుర్తుకి వచ్చిందా ” అని అడిగాడు.

    “ అవును అయ్యగారూ ! మా అమ్మ చనిపోయిందండీ ! నాన్న , పిన్ని  మంచి  వాళ్లు కారు. ఎప్పుడూ కొడుతూనే ఉంటారు. ” ఒక్క మాటలో తన పరిస్థితి అంతా కరతలా మలక మయ్యేలా చెప్పాడు.

    “ నీ పేరేమిటి బాబూ ?”

    “ బండశీను ”

    “ అదేం పేరు, బండ అంటే నీకు అర్థం తెలుసా ?”

    “ తెలుసండీ, కాని అందరూ అలాగే పిలుస్తారండీ.”

    “ నేను ఆ బండ బరువుని నీ పేరు లోంచి తీసేసి, నిన్ను ‘శ్రీనివాసా’ అని పిలుస్తాను. సరేనా ?”

    కుర్రవాడికి ఉత్సాహం కలిగింది. “ అలాగే అయ్యగారూ, మీ ఋణం తీర్చుకోలేనండీ.”

    “ ఋణానుబంధం ఒకరు తీర్చేదీ, తీర్చగలిగేదీ కాదు. శ్రీనివాసా ! అవి దైవ సంకల్ప జనితాలు ! నువ్వు మరో వారం రోజులలో బాగా కోలుకొంటావు . ఆ తరువాత  ఏం చేస్తావు, ఇంటికి పోతావా ?”

    “ శ్రీనివాసుని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. “ బాబుగారూ ! దయచేసి  నన్నా ఇంటికి పంపించకండి. అక్కడికి వెళ్తే నేను మళ్లీ , బండని అయిపోతాను.,” అన్నాడు.
కుర్రాడు ఆమాటలు యథాలాపంగా అన్నా భాస్కర మూర్తికి ఆ మాటలలో ఏదో జీవిత సత్యం నగ్నంగా గోచరించింది. “ మరయితే ఎక్కడికి వెళ్తావు ?”అని అడిగాడు.

    “మీ ఇంట ఉండనిస్తే ఉంటానండి. లేకపోతే ఎక్కడికైనా పోతానండి.”

    “ నేను బ్రహ్మచారిని, ఊరూరూ తిరిగి వైద్యం చేసేవాణ్ని. నా ఇంట్లో ఎలా ఉంటావు ?”

    “ ఈ ఇల్లు కనిపెట్టుకొని ఉంటానండి, ఇల్లు ఊడ్చి శుభ్రం చేస్తానండి, మీ బట్టలు ఉతికి ఆరేస్తానండి, ఇంకా మీ సైకిల్ని తుడిచి ఆయిలింగు చేస్తానండి ఇంకామీరు  ఏ పని చెప్తే ఆ పనే చేస్తానండి. ”

    “  ఈ పనులన్నీ చెసేందుకు జీతం ఎంత తీసుకొంటావు ?”

    “ జీతం ఎందుకండీ ! రెండు పూటలా  కూడు పెటి, గూడులో ఉండనిస్తే చాలండీ!.”

    “ శ్రీనివాసా!నేను కులరీత్యా బ్రాహ్మణున్ని.వృత్తిరీత్యా వైద్యుణ్ని,నా ఇంట్లో ఒకనిగా ఉంటానని అంటున్నావు. నీ కులం ఏమిటి ,ఎంత వరకు చదువుకొన్నావు ?”

    “నేను బ్రాహ్మల్ల ఇళ్లల్లో పని చేసేవాడి నండీ, అన్ని పనులూ చెసే వాడినండి. కులానికి గొల్లవాడినండి. చదువు నాకు ఎవరూ చెప్పించ  లేదండి.”

    ఆదిరాజు భాస్కర మూర్తి శ్రీనివాసుని కళ్లల్లోకి చూసాడు. ‘ తాను ఆరాధించే దైవం గొల్లవాడే ! వీడిలాగే  నల్లని  వాడు. కూడా ! ’ అనుకొన్నాడు. కులరీత్యా కాక, స్వభావరీత్యా కూడ బ్రాహ్మణుడయిన ఆ వైద్యునికి ‘కుల గజ్జి’ ఆమడ దూరంలోనే ఉంది. “సరే శ్రీనివాసా ! ముందునువ్వు బాగా కోలుకొని స్వస్థత చెందు.ఆ తరువాత మిగతా విషయాలు ఆలోచిద్దాం ,” అన్నాడు ఆ  వైద్యుడు.

    అయితే పూర్తిగా కోలుకోవడానికి ముందే, శ్రీనివాసుడు తన పనులు మొదలు పెట్టాడు. ఇల్లు ఊడ్చి, కసవు పోసి శుభ్రం చేసేవాడు. అయ్యగారి బట్టలు ఉతికి ఆరేసేవాడు. బావి లోంచి నీళ్లు తోడి తొట్టెలు నింపి, అతని స్నానానికి సిధ్ధం చేసేవాడు. సైకిలు తుడిచి నూనె పోసి తొక్కడానికి సులువుగా చేసేవాడు. అలా పనులన్నీ చేస్తూ  అతని హృదయాన్ని చూరగొన్నాడు.

    శ్రీనివాసునిపై మమకారాన్ని పెంచుకోవడం తప్పని అనిపించి, అతను నాగూరులో కుర్రవాని తండ్రి గురించి వాకబు చేయించాడు.కొడుకుని వెతికేందుకు ఏ ప్రయత్నమూ చేయక, వాడి పేరెత్తుతేనే బండ బూతులు తిట్టే  ఆ తండ్రి గురించి విన్నాక కుర్రవానిని అక్కడ  అప్పగించడమే  తప్పు అన్న నిర్ణయానికి వచ్చాడు  భాస్కర మూర్తి. దాంతో శ్రీనివాసుని తన దగ్గరే ఉంచి, ఆదుకొన్నాడు. 

    పలక , బలపం తెప్పించి , దానిమీద ‘ ఓం నమశ్శివాయ సిద్ధం నమః ’ అని వ్రాసి, శ్రీనివాసుని చెయ్యి పట్టుకొని దిద్దించాడు. ఆ మహా మంత్రాన్ని దిద్దిన మరుక్షణం , బండశీను జీవితంలో ఎన్నో సకారాత్మకమైన మార్పులు చోటు చేసుకొన్నాయి.

    ఒక ప్రక్క అక్షరాలు, అంకెలు నేర్చుకొంటూనే శ్రీనివాసుడు , భాస్కర మూర్తి పనులలో సాయ పడ సాగాడు. ‘ మూలికలు, చూర్ణాలు, గుళికలు ,అంజనాలు, లేపనాలు , ఆసవాలు , అరిష్టలు ’ తయారు చేయడం నేర్చుకో సాగాడు. సహజంగానే ప్రకృతి ప్రేమికుడైన ఆ కుర్రవాడు మూలికలని , త్వరితంగా పోల్చ గలిగాడు. భాస్కర మూర్తితో కలిసి ‘ నాగావళీ’ నదీ తీరాల వెంట తోటలలో తిరిగి, చివరకి వాటిని స్వతంత్రంగానే తీసుకు రాగలిగాడు.

    ఎక్కాలు, అంకెలతో వానికి పూర్వ జన్మలో ఏ సంబంధం ఉందో  తెలియదు గాని, ఎంతో సహజంగా అవి అతనికి పట్టు బడ్డాయి. అతడు పని చేస్తూ చదువు కొనేవాడు., చదువుకుంటూ పని చేసేవాడు. రాత్రి పూట చుక్కల వంక కన్నార్పకుండా చూసి నిట్టూర్పులు వదిలే వానిని చూసి,  భాస్కర మూర్తి  వానికి   ‘ధ్రువతారనీ , గొల్ల కావడినీ , సప్తర్షి మండలాన్నీ, గుర్తు పట్టడం నేర్పాడు. పన్నెండు రాశులనీ పేరు పేరున చూపెట్టాడు. ఆ విధంగా శ్రీనివాసుడు, ‘ సంస్కృతి , సాంప్రదాయాలు ,భాష , గణితములతో పాటు, ఆయుర్వేదాన్నీ, ఖగోళ శాస్త్రాన్నీ’ కూడా అధ్యయనం చేయ సాగాడు .

    శ్రీనివాసునికి  అది  ఆదర్శవంతమైన  ‘గురుకులం’ అయింది. తల్లి తండ్రులని వదిలి వచ్చి, గురు శుశ్రూష చేస్తూ , రోజు లోని ప్రతీ క్షణమూ , అధ్యయనాలతో నింపుకుంటూనే దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ,చేసే పురాతన భారతీయ సాంప్రదాయానికి , తన భాగ్య వశాన కట్టుబడ్డాడు.

    ‘విష్ణు మాధవ్ , విరించి వర్మ , ద్యుతిధర్ , రవికాంతులు’  హైస్కూలు చదువు పూర్తి  చేసి , ఇంజనీరింగు కాలేజీలలో చెరే వేళకి, శ్రీనివాసుడు కూడ ‘ ఆయుర్వేద వైద్యుడు, ద్విచక్ర శకట యాంత్రిక కార్య కుశలుడు, పాక శాస్త్ర నిపుణుడు , గృహ కార్య నిర్వాహణా దక్షుడు , గ్రహ నక్షత్ర గతుల గణకుడు , సఫల  పత్ర, ఫల, పుష్ప, పాషాణ, లవణ,.ధాతు మూలికా, గవేషకుడు ’అయ్యాడు.తన యజమానుల పిల్లలు,తనని ఏనాడైనా తలచేరో లేదో గాని, అతడు మాత్రం సతతమూ వారిని తలపోస్తూనే ఉండేవాడు.అతని హృదయం వారితో , సంపదలకి అతీతమైనదీ ,కలిమితో కూర్మిలేనిది అయిన స్నేహాన్నికాంక్షిస్తూనే ఉండేది.

Comments

  1. మాస్టారూ...
    ఇది ఏదో మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమయింది కదా...

    ReplyDelete
    Replies
    1. నిజమే నండి ! స్వాతి మాస పత్రిక ఏప్రిల్ నవలానుబంధంగా వచ్చింది. మీరు గమనించే ఉంటారు, దానిని నేనే వ్రాసాను. అంతే కాదు, స్వాతి వార పత్రికలో ప్రస్తుతం సీరియల్గా వస్తున్న నవల ‘రశన’ కూడా నేను వ్రాసినదే ! స్వాతిని చదవని/ చదవ లేని నా బ్లాగు మిత్రుల కోసం ఇక్కడ పోస్టు చేసాను.

      Delete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద