Skip to main content

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక --1)

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక --1)
ఈ ధారావాహిక గురించి పరిచయ వాక్యాలు.
ఈ రచన వ్రాసి పుష్కర కాలం దాటింది ! మొదట దీనిని స్త్రీ పాత్ర లేని ( అప్పట్లో స్త్రీ పాత్రధారులు లభించేవారు కారు ) నాటకంగా వ్రాసి, ఆంధ్ర ప్రదేశ్ నాటక కళా అకాడమీ నాటక పోటీలకి పంపాను. అయితే ఈ నాటకం వారు గిరి గీసిన మూడు ప్రధాన విషయాలు --- ౧) వరకట్న దురాచారం ౨) సమ సమాజ స్థాపన ౩) కుల మత సామరస్యం-- దేనికీ సంబంధించినది కాదని, పోటీకి అనర్హమైనదిగా ప్రకటించి తిరిగి పంపారు.
ఆ తరువాత ఒక ప్రవాసాంధ్ర నాటక సమాజానికీ, మరొక ప్రసిధ్ధ నాటక సమాజానికీ పంపాను. దీనిలో స్త్రీ పాత్ర లేక పోవడం చప్పగా ఉందనీ, హాస్యం శ్రుతి మించిందనీ, ఏ ప్రధాన విషాయానికీ అద్దం పట్టలేదనీ వారు ప్రదర్శనకి అంగీకరించ లేదు.
  దానితో నిరాశ చెంది దీనిని మార్పులు చేర్పులు చేసి నవలగా మలచాను. ఈ నవలని ‘ చతుర’,‘ స్వాతి’. ‘ఆంధ్ర భూమి’.‘ ప్రజా డైరీ’ మాస పత్రికలకి ప్రచురణార్థం పంపాను. కాని పంపన ప్రతీ చోటినుండి ఇది శాఖా చంక్రమణం చేసి తిరిగి వచ్చి నన్ను చేరింది. పత్రికా సంపాదకులు ఎందికు స్వీకరించలేదో తెలియ జేయరు, కాని ‘ ఆంధ్ర భూమి’ మాత్రం చిన్న కామెంట్ వ్రాసింది ఇంగ్లీషు భాషలో -- అది ఏమంటే ---
navol is good but abusing words are more అని.
నేను నిజాయితీగా నా నవలను పునః పరిశీలించాను, కాని నాకు అలాంటి వేవీ కనిపించ లేదు. ఇక సరియైన వేదిక అంతర్జాలమేనని తోచి దీనిని దైనందిన ధారావాహికగా ( డైలీ సీరియల్’గా) నా బ్లాగి ‘ క్షీరగంగలో ’ పచురిస్తున్నాను.
దానిలో ముదటి భాగం చదవండి. ‘  పూల దండలూ, చెప్పు దెబ్బలూ ( వ్యాఖ్యల రూపంలో) బహుమతిగా పంపండి.’ ఇట్లు మీ అభిమాన బ్లాగు ‘ క్షీరగంగ’ రచయిత -- అయల సోమయాజుల శ్రీధర్-


    ఇనస్పెక్టర్ ఇంద్రనీల్ , తన కెదురుగా చేతులు కట్టుకొని నిల్చొన్న, ముకబీర్ ‘ మురుగన్’ వైపు, తల పైన టోపీ తీసి, కుడి చేతితో  స్టయిల్గా పట్టుకొని , కనుబొమలు విల్లులాగ వంచి, కళ్లు పైకెత్తి, నుదురు ముడతలు పడేలాగ కుంచించి, పరిశీలనాత్మకంగా చూసాడు, “ మురుగన్ ! విశేషాలేమైనా ఉన్నాయా ?” అంటూ.
    మురుగన్ పాత ఖైదీ, జైలు శిక్ష అనుభవించి వచ్చాక ముకబీరుగా మారిపోయాడు. రోజూ ఉదయం వచ్చి, ‘ పోలీసు ఠాణాలో’, ‘ హాజిరీ’ వేయించు కోవడం అతని దినచర్య. ఇంద్రనీల్  ప్రశ్నకి ,        “ లేదండీ ! అంతా మామూలే !” అని జవాబిచ్చాడు.
    “  చూడు మురుగన్ ! ” అంటూ టోపీని టేబిలు మీద పెట్టాడు ఇంద్రనీల్. మురుగన్ వెంటనే ఆ టోపీని భక్తి శ్రద్ధలతో చూసాడు. తన అభిప్రాయాన్ని అర్థం చేసుకో లేని , మురుగన్ అవివేకానికి నవ్వాలో, ఏడవాలో తెలియ లేదు ఇంద్రనీల్ కి. ‘అది’ తన ‘ ట్రయినింగులో’ లోపమా ! లేక వాని అసమర్థతా ! ’ అని ఆలోచించి, అసమర్థతేనని సర్ది చెప్పుకొని, మురుగన్ కి వివరించాడు.
    “ మురుగన్ ! చూడు అంటే ‘చూడమని ’ అర్థం కాదు, ‘ వినమని’ అర్థం ! సినిమాలకి మాటలు వ్రాసే చతుర సంభాషణా రచయితలు, మామూలు పదాలకి సైతం ,విశేషార్థాలు స్ఫురింఛేలాగ , నాటకీయత  కోసం అలాంటి డైలాగులు వ్రాసి,వాటి అర్థాలు మార్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మామూలు విషయాలలో కూడ, మనం కనిపెట్ట గలిగే రహస్యాలు ఇమిడి ఉంటాయని చెప్పడానికి. అలా కూర్చో చెప్తాను” అన్నాడు.
     కూర్చోమంటే ,‘ కూర్చోవాలా, వద్దా !’ అని సందేహించి, ఎందుకైనా మంచిదని, ‘ ఇంద్రనీల్ లాఠీకి’ దూరంగా, ఒక బెంచీ మీద, కూర్చొన్నాడు మురుగన్.
    “ మురుగన్ ! ప్రతీ నేరం వెనుక ఒక పథకం ఉంటుంది. నేరస్థులు ‘ పాముల లాంటి’ వాళ్లు అనుకొంటే  ఆ పథకం వేసిన వాళ్లు ‘ పురుగుల లాంటి వాళ్లు. ‘ పాముల’ వరకు వెళ్లాలంటే, ఈ ‘పురుగుల్ని’ ముందు పట్టు కోవాలి, తెలిసిందా ?” 
    “ సారూ ! పురుగుల్ని ఎరవేసి, ‘చేపలని’ పట్టడం తెల్సండి. ‘మేకల్ని’ ఎరవేసి ‘ పులుల్ని’ పడతారని చూసానండి ( విన్నానండి ) కాని మీరు అన్నట్లు, ‘పురుగుల ’నుండీ, ‘పాముల ’వరకు
 చూడలేదండి ( విన లేదండి ).
    ‘ ఓహో !’ నుదుటి మీద అరచేతితో కొట్టుకొన్నాడు ఇంద్రనీల్.“ నీకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణ విషయాలలో, అసాధారణ వివరాలు దాగి ఉంటాయి.ముందు ఇది చెప్పు,నువ్వు స్టేషన్కి  వచ్చే ముందు ఏదైనా సంఘటన జరిగిందా ?”
    “ మీరు పాము ఊసెత్తాక, ఙ్ఞాపకం వచ్చిందండి. ‘ టేక్సీ స్టాండు’  లోని , ఒక ‘టేక్సీలో’ పాము దూరిందండి. అది చూసిన మరొక టేక్సీ డ్రయివరు, నేర్పుగా తలుపులు అద్దాలు వేసేసాడండి. ఆ తరువాత తన టేక్సీలో ముగ్గురు పాములు పట్టే  ‘బంజారీలని’ తీసుకొని వచ్చాడండి. ఆ బంజారీలు, టేక్సీ చుట్టూ తిరుగుతూ, నాగ స్వరం ఊదుతూ, తలుపు తీసి, ఆ పాముని ఒడుపుగా పట్టుకున్నా రండి. ”
    “ గుడ్ !” ఇంద్రనీల్ కి  వెంటనే అందులో పురుగు కనిపించింది. “ ఒక టేక్సీ డ్రయివరుకి పాములు పట్టే బంజారీలతో పరిచయమా ! ఆ డ్రయివరు పేరేమిటి, మురుగన్ ?” అని అడిగాడు.
    “ సలీం అక్తర్ షేక్ అండి. చాల మంచివాడండి. పరోపకారం చేస్తూ ఉంటాడండి”.
    “ ఎలాగుంటాడు ?”
    “ తెల్లగా, పొడవుగా గుబురు గడ్డం,సూది ముక్కు, చురుకైన కళ్లతో, ‘వినడానికి’ ( చూడడానికి ) బాగుంటాడండి !”
    “ వాడి టేక్సీ నెంబరు ఎంత ?”
    “ 3456  అండి.”
    “ డ్రైయివరు పేరు , టేక్సీ నెంబరు ఙ్ఞాపకం ఉంచుకోవడానికి చిన్న చిట్కా చెప్తానుండు. చూడు (విను) మూడు అంటే ముక్కాలి పీట అనుకో, , నాలుగు అంటే నాలుగు చక్రాల టేక్సీ, అయిదు అంటే చేతి వేళ్లకి తొడిగే గ్లవ్సు, ఇక ఆరు అంటే ఆరు బుల్లెట్లు ఉండే గన్ను, వీటితో ఒక వాక్య నిర్మాణాన్ని చెయ్యి. ‘ఒక డ్రైవరు , ముక్కాలి పీట మీద నిలబడి, టేక్సీలోని గ్లవ్సు కంపార్టు ఇంద్రమెంటులో, గన్నును పెట్టాడు., షేక్ అవుతున్న వేళ్లతో.’ అని. దీని ద్వారా , టేక్సీ నెంబరు 3456  అని, డ్రైవరు పేరు,‘ షేకు’ అని.తెలుస్తోంది కదూ !” ఎలాగుంది ?” అంటూ గర్వంగా మురుగన్ వంక చూసాడు ఇంద్రనీల్.
    వరుస అంకెలు గల టేక్సీనెంబరు గుర్తు పెట్టుకోవడానికి ఇంత కసరత్తు దేనికో, అర్థం కాలేదు మురుగన్కి, అయినా “ చాలా బాగుంది సారూ !” అంటూ మెచ్చుకొన్నాడు.
    ఇంతలో పోలీసు ఠాణాకి , ఎదురుగా అదే నెంబరు గల టేక్సీ వచ్చి, నిలబడింది. దాంట్లోంచి  ఒక నలభై ఏళ్ల వయస్సు గల వితంతు స్త్రీ, పద్దెనిమిది ఏళ్ల కుర్రాడు దిగారు. టాక్సీ డ్రైవరు వాళ్లని నెమ్మదిగా పోలీసు ఠాణా గేటు దగ్గర దింపి, టేక్సీని పార్కు చేసి వచ్చి, వాళ్లని కలిసాడు. తరువాత ముగ్గురూ కలసి, ఠాణాలోకి  ప్రవేశించారు.
    వాళ్లని చూడగానే, మురుగన్ ,ఇంద్రనీల్ కి దగ్గరగా వచ్చి, మెల్లగా చెప్పాడు “ సార్ ! అదుగోనండి, ‘ముక్కాలి పీట మీద ఎక్కి, టేక్సీ గ్లవ్సు కంపార్టుమెంటులో గన్నుని దాచిన షేకు డ్రైవరు  అతనే నండి. ప్రక్కనున్న వాళ్లెవరో తెలియదండీ,” అని.
    “ ఇంటరెస్టింగ్ !” అన్నాడు ఇంద్రనీల్.
    డ్రయివరు షేకు అతని దగ్గరగా వచ్చి, ఎదురుగా నిలబడి, “ సార్ ! ఈ రంగమ్మకి అన్యాయం జరిగిందండి. దగా చేసి, ఆమె కూడబెట్టిన రెండు లక్షలు అపహరింఛారు,” అన్నాడు.
    “ ఎవరు అపహరించారు ?” 
    “ పాములు పట్టే బంజారీ వాళ్లు అయి ఉంటారని అనుమానం సార్ !”
    ఉలిక్కి పడ్డాడు ఇంద్రనీల్. “ పాములు పట్టే బంజారీలా, వాళ్లు నీకు తెలిసే ఉండాలే ?”
    “ తెలుసునండీ, అందుకే టేక్సీ ఎక్కించానండి.”
    “ వివరంగా చెప్పు.”
    “ ఈ రంగమ్మ, ఈమె కొడుకు సుధాకరు, ఈ రోజు నా టేక్సీ దగ్గరకి వచ్చి, ‘ ఫార్మశిస్టు పార్వతీశం’ గారి  ఇంటికి తీసుకెళ్లమని అడిగారండి. అప్పటికే  మా టేక్సీ స్టాండు లోని ఒక టేక్సీలో దూరిన పాముని నేర్పుగా ఒడిసి పట్టుకొన్న పాముల వాళ్లని, వాళ్ల గుడిశె దగ్గర దింపడానికని, ఎక్కించుకొన్నానండి. దారి ఒకటే గనుక, ‘రంగమ్మని, నా ప్రక్క సీటులో కూర్చో బెట్టుకొని, ఆమె కొడుకుని, వాళ్ల మధ్య వెనక సీటులో  ఎక్కించానండి. రంగమ్మ తెచ్చిన ‘ రేకు డబ్బాని’ పెట్టేందుకు, జాగా చాలక, దానిని డిక్కీలో పెట్టించానండి. ఆ డబ్బాలో రెండు లక్షలు ఉన్నాయండి ! బంజారీల గుడిశెల దగ్గర టేక్సీ ఆపి, పాములోళ్లని దింపేసానండి. వాళ్లల్లో ఒకడు నా దగ్గరకి వచ్చి,బీడీ,అగ్గి పెట్టె,ఇమ్మని అడిగి,నన్నుమాటల్లో పెట్టాడండి.అదే సమయంలో  తక్కిన ఇద్దరూ, టేక్సీ వెనకగా వెళ్లి, డిక్కీలోని డబ్బాని దొంగలించి ఉంటారండి, ఎందుకంటే ---”
    “ ఎందుకంటే, ఫార్మా పార్వతీశం ఇంటి దగ్గర చూసేందుకు టేక్సీ దిగి, డిక్కీ తెరచే సరికి, అందులో
 డబ్బా లేదు, అంతేనా ?”
    “ అవునండీ ! వాళ్ల మీదే అనుమానమండి.”
    “ డబ్బాలో ఎంత ఉంది ?”
    “ రెండు లచ్చలండీ !” ఈ సారి  రంగమ్మ, కళ్ల వెంబడి కన్నీరు ధారగా కట్టగా, శరీరమూ  మాటలు కంపిస్తూ ఉండగా చెప్పింది. “ సానా కట్టబడి కూడ బెట్టినానండి ఇనస్పెటరు బాబూ ! పదేసి చొప్పున లెక్క పెట్టి, ఇరవై  ప్లాస్టిక్ సంఛీలలో పెట్టి, డబ్బాలో  ఇమ్ము సేసినానండి. ఆ ముదనట్టపు పాములోళ్లు ---”
    “ సరి, సరి ! అర్థమయింది. ఏడవకు రంగమ్మా ! ‘ టూ నాట్ త్రీ ! ’ జీపు బయటికి తీయమను. ఇదుగో  షేకు డ్రయివరూ ! నువ్వు నీ టాక్సీలో రంగమ్మనీ, సుధాకర్నీ, మురుగన్నీ  కూడా  కూర్చో బెట్టుకొని, ముందుగా  దారి తియ్యి. నేను జీపులో ఫాలో అవుతాను.’’ అన్నాడు ఇంద్రనీల్.
    వాహనాలు రెండూ బంజారీల గుడిశెల ముందు ఆగాయి. ఇంద్రనీల్  జీపు దిగగానే అధికార స్వరంతో అడిగాడు , “ ఎక్కడ్రా ? ఆ పాములు పట్టేవాళ్లు ?”అంటూ.
    “ ఆల్లెందుకు ఇనస్పెట్టర్ బాబూ ! ” అడిగాడు ఒక ముసలాడు.
    “ పోలీసు ఠానాలో పాములు దూరాయిరా ! ఖైదీలు బెదిరిపోతున్నారు. వాటిని పట్టి బంధించాలి.”
    “ సెల్ లో పెడతారా బాబూ ?”
    “ అవును, ముందు వాళ్లని పిలు.”
    “ ఆ ముసలాడు , గుడిశెల మధ్యకి వెళ్లి, ఆ ముగ్గురునీ తీసుకొని వచ్చాడు. వాళ్లు ఇంద్రనీల్ ముందుకు వచ్చి నిలబడ్డాక, టేక్సీలోంచి  దిగారు, ‘ రంగమ్మ, సుధాకర్, మురుగన్లు.’ వాళ్లని చూడగానే పాముల వాళ్లకి విషయం అర్థమయింది. వాళ్లు ముగ్గురూ చేతులు కట్టుకొని , జాయింటుగా మోకరిల్లుతూ అన్నారు. “ బాబ్బాబు ! పొరపాటు అయి పోయింది సారూ ! ఆ రెండు లచ్చలూ ఎత్తుకొచ్చి, డబ్బా తాళం మాత్రమే తీసాం. అందులో ఏదీ ముట్టుకో లేదండీ ! ”
    “ ముందు ఆ డబ్బా ఇలా పట్టుకు రండిరా !”
    వాళ్లలో ఒకడు  వెళ్లి, రేకు డబ్బాని పట్టుకొచ్చాడు. దాని కొక్కేనికి ఉన్న తాళం విరగ గొట్టినందు వల్ల కాబోలు ,ఉరి పోసుకొన్న శవం లాగ వేలాడుతోంది !
    “ రంగమ్మా ! డబ్బా చెక్ చెయ్యి. ఏ మాత్రం తక్కువ ఉన్నా చెప్పు, దొంగ వెధవల్ని ఇక్కడి కిక్కడే భూస్థాపితం చేస్తాను ” అన్నాడు అధికార స్వరంతో.
    రంగమ్మ సంతోషంతో ముఖాన్ని చాటంత చేసుకొని, అందులోని ప్లాస్టిక్ సంచీలను లెక్క పెట్టింది, తిరిగి డబ్బాలో సర్దేసింది , “ సరిగానే ఉన్నాయి బాబూ ! అంటూ.
    “ సంచీలు కాదే వెర్రి ముఖమా! సంచీ ముడి విప్పి చూడు, మొత్తం రెండు లక్షల చిల్లర ఉన్నాయో  లేదో ! అయినా అంత చిల్లర ఇరవై సంచీలలో ఎలా పెట్టావే ?”
    “ సాల కట్టబడి , పదేసి వేల చొప్పున ,ఇరవై సంచీలలో రెండు లచ్చలు ఎట్టానండి,” అంది రంగమ్మ.
    “ అది సర్లేవే ! పదివేల చిల్లర అంత చిన్న సంచీలో ఎలా పెట్టావ్ ? ముందు తీసి చూపించు,” అడిగాడు  ఇంద్రనీల్.అతను అతనితో పాటు వచ్చిన పోలీసులు, ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా, రంగమ్మ ఒక సంచీకి కట్టిన ‘ పురికోస తాడు’ విప్పింది. ఆశ్చర్యం ! అందులో ఉన్నవి చిల్లర డబ్బులు కావు ! నల్లని ‘ టీ గుండ ’ లాంటి పదార్థం ! మూత విప్పగానే గుప్పున వాసన వెదజల్లింది. 
    “ ఏమిటి రంగమ్మా ! ఇది ? తులసి వాసన వస్తోందేమిటి ? ”
    “ ఇయి తులసి విత్తనాలు బాబూ ! సాన కట్టబడి, పదేసి వేల చొప్పున లెక్కకట్టి, ఇరవై సంచీలలో పెట్టినాను బాబూ ! ఇయి లెక్క కట్టడానికి నాను, నా కొడుకు సుధాకరు ఎంతో కట్టబడ్డాం బాబూ ! ” అంది రంగమ్మ చేతులు త్రిప్పుకొంటూ , తానెంత కష్టపడిందో చూపించింది. ( వినిపించింది )
    ఇంద్రనీల్ కి పట్టరాని కోపం వచ్చింది. “ ఒరేయ్ ! షేకు డ్రైవరూ ! గొప్ప షాకు ఇచ్చావురా ! దొంగతనం చేసింది రెండు లక్షల తులసి విత్తనాలని నాతో ఎందుకు చెప్పలేదు ?”
    “ క్షమించండి సారూ ! అవి తులసి విత్తనాలని చెప్తే, మీరు  కేసు  వ్రాసుకొని, కదలి  వస్తారా బాబూ ?” అన్నాడు  షేకు.
    “ తులసి విత్తనాలకి ఈ లెక్కలేమిటే రంగమ్మా?”
    “ ఏమో బాబూ ! నా కేమి ఎరుక ? రెండు లచ్చల తులసి విత్తనాలు తెచ్చి ఇస్తే, నా కొడుకుకి , ఉద్యోగం  ఇస్తానన్నాడు  బాబూ, ఆ ఫార్మా బాబు  పార్వతీశం గారు.”
    “ సరే ! ముందు కారెక్కు, ఇదుగో, షేకు డ్రైవరూ ! రంగమ్మనీ, ఆ డబ్బానీ , ఫార్మశిస్టు  పార్వతీశం
 ఇంటికి తీసుకు పద ! ఈ విత్తనాల వెనక ఏదో మిస్టరీ ఉంది, అది కనిపెట్టాలి,” అన్నాడు ఇనస్పెక్టర్ ఇంద్రనీల్.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద