(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ ఇంద్రనీల్ దగ్గ్గరకు , టాక్సీ డ్రైవరు షేకు వచ్చి, రంగమ్మ కష్టపడి కూడబెట్టిన రెండు లక్షలు ,ఊరి చివర పాములు పట్టే బంజారీలు దొంగలించారని చెప్తాడు. ఇంద్రనీల్ బంజారీలని బెదరించి రంగమ్మ రేకు డబ్బాని బయటికి తీయిస్తాడు, తీరా చూస్తే అందులో ‘రెండు లక్షల తులసి విత్తనాలు’ ఉంటాయి ! దొంగలింప బడినవి అవే అని తెలిసాక, ఇంద్రనీల్ వాటి గురించి కూపీ తీయగా వాటిని ‘ఫార్మశిస్టు పార్వతీశం’ కోసం సేకరించానని చెప్తుంది రంగమ్మ. ఆ తులసి విత్తనాల వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించిన ఇంద్రనీల్ అది తెలుసుకోవడానికి పార్వతీశం దగ్గరకు బయలుదేరుతాడు.----- ఇక చదవండి )
మొసలి కొలను మ్యూజియం2
వాహనాలు రెండూ వాళ్లని ఎక్కించుకొని ఫార్మశిస్టు పార్వతీశం ఇంటికి బయలు దేరాయి ఫార్మశిస్టు పార్వతీశం. ఇంటి ముందు , ఒక బోర్డు తగిలించి ఉంది.
‘ తులసి విత్తనాలు లక్షల సంఖ్యల సంఖ్యలో కావలెను. రెండు లక్షలకి తక్కువ కాకుండా తెచ్చిన వాళ్లకి, ఉచిత బహుమతి ఇవ్వబడును. ’ అని వ్రాసి ఉందా బోర్డు మీద !
“ అదుగో బాబూ ! ఆ బోరుడు సూడండి. దానిని సూసేకే, సుధాకర్ నాకు సెపితే, నాను ఆ ఫార్మా బాబుతో. మాటాడానండి. రెండు లచ్చల విత్తనాలు తెచ్చి ఇస్తే, వాడికి ఉద్యోగం ఇస్తానన్నాడండి,” అందుకే సానా కట్టబడి, పదేసి వేల చొప్పున ,ఇరవై సంచీలలో ఇమ్ము సేసానండి ,రెండు లచ్చల విత్తనాలని,” అంది రంగమ్మ
ఈ సారి డ్రయివరు షేకు మాట్లాడాడు. “ రంగమ్మ , రేకు డబ్బాతో, నా టాక్సీ దగ్గరకు వచ్చి, ‘రెండు లక్షలు, కూడబెట్టి డబ్బాలో పెట్టాను. ఆ ఫార్మా బాబు దగ్గరకు తీసుకెళ్లు,’ అని నన్ను అడిగిండండి. ఆ మాటలు అప్పుడే టేక్సీలో కూర్చొన్న పాములోళ్లు విన్నారండి. విత్తనాలని తెలియక వాళ్లు దొంగతనం చేసారండి.”
“ సరే ! ఈ మిస్టరీ విడి పోయింది. ఇక విత్తనాల వెనక నున్న రహస్యం తెలుసుకోవాలి, రంగమ్మని డబ్బాతో పాటు లోపలికి పంపించు,” అన్నాడు ఇంద్రనీల్.
ఫార్మశిస్టు పార్వతీశం బయటికి వచ్చి, వాళ్ల నందరినీ చూసి లోపలికి ఆహ్వానించాడు. తులసి విత్తనాలని ఒక కార్టన్లో పెట్టి, ఇంద్రనీల్ ని మాత్రం తన ఛాంబర్ లోకి, తీసుకెళ్లాడు. ఆ విత్తనాలతో తానేం చేయ దలచుకొన్నాడో చెప్పి, విషయాన్ని గోప్యంగా ఉంచమని, పబ్లిక్ కి గాని, ప్రెస్ కి గాని ఇప్పట్లో చెప్ప వద్దని బ్రతిమాలాడు,
ఫార్మా పార్వతీశం విప్పిన రహస్యం విన్న మీదట పోలీసు స్టేషనుకి తిరిగి వచ్చిన ఇంద్రనీల్ , తన కేసు డైరీలో ఈ క్రింది విధంగా వ్రాసుకొన్నాడు.
కేసు పేరు ‘పురుగు నుండి పాము వరకు.’
నేరం ‘ రెండు లక్షల తులసి విత్తనాల దొంగతనం’
పరిశోధనా సమయం ‘ కేవలం నాలుగు గంటలు’
దొంగలు ‘పాములు పట్టే బంజారీలు’
విత్తనాల ప్రయోజనం ‘ మెడిసన్ తయారు చెయ్యడం’
పురుగు ‘ నిజంగానే పురుగు ( హెచ్ 1 ఎన్ 1 వైరస్ -- H1 N1 virus )
పాము ‘ ‘ స్వెయిన్ ఫ్లూ !
బ్రెయిన్ ‘ ఫార్మా పార్వతీశం’
రివార్డు ‘ కేవలం ఆత్మ తృప్తి’: హ హ హ !, హి హి హి !
ఆత్మ తృప్తి అనేది కష్ట సాద్యమయిన వరం. కొందరికి అది వృత్తిలో లభ్యమయితే, కొందరికి ప్రవృత్తిలో లభ్య మవుతుంది. కొందరికి ధనార్జన లోనూ, ఇంకా కొందరికి ‘బాబాలు, అమ్మలు’ లాంటి, విశిష్ట వ్యక్తుల సత్సాంగత్యం లోనూ, మరి కొందరికి భజనలు, నాటకాలు లాంటి వాటి లోను, చాల కొద్ది మందికి మాత్రమే ,‘ అది’ మానవ సేవ’ లోనూ, లభ్య మవుతుంది. ఒక సారి ఆ వరాన్ని పొందిన వ్యక్తికి అదొక వ్యసనంగా మారినా ఆశ్చర్యం లేదు
ఇంద్రనీల్ అలాంటి అతి కొద్దిమంది కోవలోకి వస్తాడు . అతను స్ఫురద్రూపి, ఆరడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ వ్యాయామ విభక్తములయిన శరీరాంగ సౌష్టవము, అతని స్వంతం. సూది ముక్కు, చురుకైన కళ్లు, గుంద్రని ముఖం, సన్నని మీసం, ఎత్తైన చిబుకం, అతని ముఖ సౌందర్యానికి ప్రత్యేక ఆకర్షణలని చెప్ప వచ్చు. వృత్తి రీత్యా అతను పోలీసే అయినా , ఆ ఉద్యోగం అతని అభిరుచికి భిన్నమయినది.
సమాజానికి చీడ పురుగు ల్లాంటి నేరస్థులని పట్టి బంధించినపుడు, అతనికి కలిగిన ఆనందం, పై అధికారుల ఒత్తిడికి గురయి వారిని వదిలి వేయాల్సి వచ్చినప్పుడు, ఆ నేరస్థులు కోర్టులలో, న్యాయ వాదులని ఆశ్రయించి, తప్పించు కొన్నప్పుడు ఆవిరయి పోయేది ! అందు వలన అతను పడే అశాంతి, వేదన, వృత్తి ధర్మం పట్ల అవహేళనకి గురి చేసేవి. అయితే తృప్తిని కలిగించే కొన్ని కేసులు అప్పుడప్పుడు తారస పడేవి. అలాంటి వాటిలో ‘ పురుగు నుండి పాము వరకు’ కేసు ఒకటి ! అలాంటి కేసులనే అతను తన కేసు డయిరీలో వ్రాసుకొని, హ హహ, హి హిహి ! అని ఆనంద పడుతూ ఉంటాడు.
ఆ రోజు అతను స్టేషన్లో కూర్చొని ఉండగా, రంగమ్మ కొడుకు సుధాకర్ ఒక పదమూడేళ్ల బాలుడిని తీసుకొని ఠాణాలోకి వచ్చాడు. ఆ బాలుడు భయంతో బిక్కు బిక్కు మంటూ, సుధాకర్ చేయి పట్టుకొని, లోపలికి అడుగు పెట్టగానే , యూనిఫారంలో ఉన్న, ఇనస్పెక్టర్ని చూసి భయంతో, పారిపోబోయాడు. కాని సుధాకర్ వాని చెయ్యి గట్టిగా పట్టుకోవడంతో వీలు కాక, వణికి పోయాడు .
ఇంద్రనీల్ కి ఆ కుర్రవాని పరిస్థితి అర్థమయింది. వెంటనే కుర్చీ లోంచి లేచి నిల్చొన్నాడు., “ భయం లేదు బాబూ ! నేను నిన్నేం చేయను. ఇలా వచ్చి కూర్చో !” అని. “ సుధాకర్ ! ఆ అబ్బాయిని నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కాక, దూరంగా ఉన్నబెంచీ మీద కూర్చోపెట్టు.పాపం ! భయంతో వణికి పోతున్నాడు” అన్నాడు.
సుధాకర్ ఆ బాలుని బెంచీ మీద కూర్చోబెట్టాడు. ఇంద్రనీల్ తన టేబిల్ మీద మంచినీళ్ల బాటిల్ని తీసి, ఆ కుర్రాడికి ఇచ్చాడు. “ ముందు ఈ మంచి నీళ్లు త్రాగు బాబూ !” అంటూ.
కుర్రాడు మంచినీళ్లు అందుకొన్నాడు. ఆ నీళ్లు గొంతులో దిగగానే కాస్త ధైర్యం వచ్చింది.
“ సుధాకర్ ! ముందు నువ్వు చెప్పు. ‘ ఆ పిల్ల వాడికి ఏమయింది ?”
“ ఇనస్పెక్టర్ సర్ ! ఈ కుర్రాడి పేరు ‘బాలరాజు’ వాళ్ల నాన్నగారి పేరు రంగరాజు, కాని అందరూ ‘ పూల రంగడు’ అనే పిలుస్తారు అతనిని. మార్కెట్ సెంటర్లో వాళ్లకి పువ్వుల వ్యాపారం ఉంది. ఈ రోజు బాలరాజు మెడలోని, ‘ బంగారు గొలుసుని’ ఒక మనిషి మోసం చేసి ఎత్తుకు పోయాడండి. ఏం చేయాలో తోచక ఏడుస్తున్న బాలరాజుకి నేను ధైర్యం చెప్పి, తీసుకొని వచ్చాను. వాడికి పోలీసులంటే వల్లమాలిన భయం ! మీరు నాకు, మా అమ్మకు చేసిన న్యాయం గురించి చెప్పాక, వాడికి నమ్మకం కలిగి, నాతో పాటు మీ దగ్గరకి వచ్చాడు.”
“ వాళ్ల నాన్నగారు తీసుకొని రావచ్చు కదా ! నువ్వు మేజర్ వే అయినా , ‘ఎఫ్ ఐ ఆర్’ని రంగరాజు గారు ఇస్తేనే బాగుంటుంది.”
“ వాళ్ల నాన్నగారికి ఇంకా ఈ విషయం తెలియదు సార్ ! హారం పోగొట్టుకొని ,పిచ్చివాడిలాగ మార్కెట్ సెంటర్లో ఆ మనిషిని వెతుకుతూ తిరుగుతూ ఉంటే , నేను చూసి, పలకరింఛానండి. నేను అలా అడగగానే వలవల ఏడ్చి తన గోడంతా చెప్పుకొన్నాడు. వీడి నాన్నగారు మీ దగ్గరకి రాలేరు సార్ ! అతనికి కారు ఏక్సిడెంటులో రెండు కాళ్లూ పోయాయండి. అతను దుకాణంలో కూర్చొని , ఫ్లవరు బొకేలు తయారు చేస్తూ ఉంటారు. దుకాణంలో వ్యాపారమంతా వీడే చూసుకొంటాడు.”
“ బాల రాజూ ! నీ గొలుసు ఎప్పుడు పోయింది ?” అడిగాడు ఇంద్రనీల్.
“ ఈ రోజే పోయింది సార్ !”
“ ఎలా పోయింది ?”
“ అతను మోసం చేసి నా గొలుసు పట్టుకొని పారిపోయాడు సార్ !”
“ అతను అంటే ఎవరు ? ఏం జరిగిందో వివరంగా చెప్పు.”
“ అతను పెద్దాయనే సార్ ! నలభై, నలభై అయిదు సంవత్సరాల వయస్సు ఉంటుంది సార్ ! నీలం రంగు సూటు, నల్లని బూట్లు , బ్రౌను కలరు హేటు పెట్టుకొన్నాడు. చారల ‘టై’ కట్టుకొన్నాడు. ఉదయాన్నే తొమ్మిదిన్నర గంటలకి మా దుకాణానికి వచ్చాడు. మా ‘ నాయన ’ ఎప్పటిలాగే పువ్వుల బుట్ట ముందు కూర్చొని ‘ బొకేలు ’ కడుతున్నాడు . నేను దుకాణం ముందున్న, రేక్ మీద , బొకేలు సర్దుతున్నానండి. నా దగ్గరకు వచ్చి, “ పువ్వుల రంగరాజు అంటే ఎవరు ?” అని అడిగాడు. నేను మా నాయనని చూపించాను. “ మీ కేం కావాలి ? ” అని అడిగాడు మా నాయన.
“ డెకరేషన్ కి చాలా పువ్వులు కావాలి బాబూ ! ” అని నవ్వి , “ పెద్ద డెకరేషన్ ఆర్డరు ఉంది, ఎవరు చేస్తారు, నువ్వా లేక మీ నాయనా ?” అని అడిగాడు.
“ నేనే చేస్తాను , మా నాయన దుకాణం వదిలి ఎక్కడికీ రాలేరు. ఇంతకీ ఎక్కడ చేయాలి ? కారుకా , కళ్యాణ మండపానికా ?”
“ నిన్ను చూస్తుంటే ముచ్చట వేస్తోంది పూల బాలరాజూ ! డెకరేషన్ ఆర్డర్లు తీసుకొనేంతటి పెద్దవాడి వయి పోయావన్న మాట ! చెప్తానువిను , నువ్వు ‘ మగ ధీర ’ సినిమా చూసావా ?”
“ చూసానండీ ! రామ చరణ్ తేజ చాలా బాగా చేసాడు .”
“ మరి, అరుంధతి సినిమా చూసావా ?”
“ చూసాను, అనుష్క అందులో అద్భుతంగా చేసింది.”.
“ మగ ధీర, అరుంధతి హీరో హీరోయిన్లు, అదే రామ్ చరణ్ తేజ, అనుష్కలు కలిసి ఒక సినిమాలో చేస్తున్నారు. ఆ సినిమా షూటింగు మీ ఊర్లోని ,‘ ఇంద్రలోకం ’ ఎ.సి. కళ్యాణ మంటపంలో అవుతుంది. ఈ సంగతి ఇప్పుడిప్పుడే ఎవరికీ చెప్పకు సుమా ! ఆ మండపానికి డెకరేషన్ చేయాలి .” అన్నాడండి. నాకు బళే సరదా వేసింది.
(ఇంకా ఉంది తరువాయి భాగం రేపటి టపాలో చదవండి)
Comments
Post a Comment