Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా! --15 (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2 )

ఫారం హౌసులో మూడు గదులు, ఒక పెద్ద హాలు, కిచెన్, ఉన్నాయి. రెండు రూములకి ఎటాచ్ టాయి లెట్లు, హాలుకి ఆనుకొని కామన్ టాయిలెట్ ఉన్నాయి. ముందుగా హాలు, కిచెన్, తరువాత వరుసగా మూడు గదులు ఉన్నాయి. ఆ గదులని కలుపుతూ పొడవైన కారిడార్ ఉంది. కారిడార్ చివర పెరటి వైపు ద్వారముంది. హౌస్ చుట్టూ పొలాలు, వాటి గట్ల మీద కొబ్బరి చెట్లు ఉన్నాయి. అన్ని ఆధునిక  వసతి  సౌకర్యాలు కలిగి, పట్టణ  జీవితానికి దూరంగా, పచ్చని ప్రకృతి వాతావరణం మధ్యన ఉందా హౌసు!

శ్రీ లలిత మనసే గాని గాయపడకుండా ఉండి ఉంటే, ఆ ఫారం హౌసు ఆమెకి ఎంతగానో నచ్చి ఉండేది! చరణ్ కారుని తీసుకొని, బిజినెస్ పని అంటూ వెళ్ళిపోయాడు. మంజీర తన గదిలో కూర్చొని, టి.వి. చూస్తోంది.

శ్రీ లలిత ఫారం హౌసు అంతా కలయ తిరిగి, దాని బయటికి వచ్చి చూసింది. ఆ ఇంట్లోని ప్రతీ గదినీ, హాలునీ,కిచెన్’నీ, తనదగ్గర ఉన్న మోబైలుతో ఫోటోలు తీసి, ఆ ఫోటోలని  సాగర్’కి ఎం.ఎం.ఎస్ ద్వారా పంపింది.

ఆ హౌసుకి  దూరంగా ఒక నిర్మాణాధీనమైన బిల్డింగు ఉంది. మూడు అంతస్తులు వరకు లేచిన ఆ బిల్డింగు పని ఎందుకు నిలిచి పోయిందో గాని, ఎన్నో సంవత్సరాలుగా ఆగి పోయినట్లు, దానిని చూస్తేనే తెలుస్తోంది! వానలకి తడిసి, పాకుడు పట్టిన గోడలు, చుట్టూరా విస్తారంగా పెరిగిన రెల్లుగడ్డి దుబ్బులు, సిమెంటు ప్లాస్టరు లేక మొండి వారిన ఇటిక గోడలు, ద్వారాలు ద్వార బంధాలు లేకుండా, బోసిగా కనిపిస్తున్న గదులు,  నగ్నంగా నిలబడి తపస్సు చేస్తున్న ఋషి పుంగవుల లాంటి స్తంభాలు, వాటి పైన అల్లుకొన్న పిచ్చిపిచ్చి తీగలు, అంతా కలసి మనుష్యుల నిర్లక్ష్యాన్నివేలెత్తి చూపిస్తున్నట్లుగా  ఉన్నాయి! ఆ బిల్డింగు ఎవరిది, పని ఎందుకు ఆగి పోయింది? ఇలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్తే చరణ్ మాత్రమే చెప్పాలి! మంజీరకి అవేమీ పట్టవు!      

శ్రీ లలిత మంజీర గదిలోకి వెళ్ళింది, “అక్కా! నేను అలా పొలాల్లో తిరిగి వస్తాను” అంది. మంజీర తల ప్రశ్న వచ్చిన  వైపు త్రిప్పి, “అలాగే చెల్లీ! జాగ్రత్త సుమా, పాములు ఉంటాయి!” అంది. వెళ్తూ వెళ్తూ శ్రీలలిత దృష్టి అక్కడ గోడకి వ్రేలాడుతున్న ‘బైనాక్యులర్స్’ మీద పడ్డాయి. వెంటనే వాటిని చేతిలోకి తీసుకొని పెరటి వైపు ద్వారం గుండా బయట పడింది ఆమె. తలుపు దగ్గరే ఉన్న ఒక పొడవాటి కర్రని కూడా తీసుకొంది , ఎందుకైనా మంచిదని!

నిజంగానే పొలంలో పాము కనబడింది! శ్రీ లలిత వైపు అనుకోని అతిథిని చూసినట్లు చూసి జరజరా ప్రాకి  వెళ్లి పోయింది. శ్రీ లలితకి ఆ దృశ్యం చూసాక వెన్ను లోంచి వణుకు వచ్చింది! ఇలాంటి వాటికి భయ పడితే తాను తన పథకాన్ని అమలుచేసి, పగ, ప్రతీకారాలని, ఎలా తీర్చుకో గలదు! అని తనకి తానే భుజం తట్టుకొని, కాసేపటికి ధైర్యం తెచ్చుకొని, ముందడుగు వేసింది!

బైనాక్యులర్స్ ద్వారా ఆ బిల్డింగు వైపు తేరిపార చూసిన ఆమెకి, స్తంభింప చేసే దృశ్యాలు కనబడ్డాయి ఆ మొండి గోడల భవనం తను అనుకొన్నట్లు నిర్మానుష్య మైనది కాదు! అక్కడ మనుష్యుల అలికిడి చాలా ఉంది! వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారో, తెలియలేదు గాని, చాలా చురుకుగా ఏవేవో ‘సామాన్ల కార్టన్లని’ ఒక ‘మినీ వేను లోకి’ ఎక్కిస్తున్నారు.

ఆ మినీ వేన్ చాటున నల్లని ఫోర్డ్ కారు కూడా కనిపించింది! అంటే చరణ్ కూడా అక్కడే ఉన్నాడన్న మాట! భవనం క్రింద అంతస్తు నిలువెత్తు రెల్లు గడ్డి దుబ్బుల మధ్య  మరుగున పడి ఉండడం వల్ల, ఆ యా సామాన్ల కార్టన్లని ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియడం లేదు గాని, మొత్తం మీద అక్కడ ఏదో రహస్య స్థావరం ఉన్నట్లు తెలుస్తోంది. నల్ల రంగు ఫోర్డ్ కారు కనబడ కుండా ఉంటే, ఆమె మరి కొంచెం దగ్గరకి వెళ్లి వాటిని స్పష్టంగా చూసి ఉండేదే!

అలా వెళ్లి చూడడం వల్ల చరణ్’కి అనుమానం కలుగు తుందని, మర్నాడు వెళ్లి చూడ వచ్చని తలచి, ఆ భవనాన్ని దూరం నుండే తన మొబైలుతో ఫోటోలు తీసి, ఆమె తిరిగి ఇంట్లోకి వెళ్లి పోయింది.

మంజీర ఆమెని చూసి, “ చూసావా చెల్లీ! పాములు ఏవైనా కనబడ్డాయా?” అని అడిగింది. శ్రీ లలిత ఆమె ప్రశ్నకి, “చూసానక్కా! భయంకరమైన పెద్ద పాడవైన పాము కనబడింది, కాని ఒకమాటు నన్ను తీవ్రంగా చూసి పారిపోయింది! మరికొన్ని డుండుభములు కూడా కనిపించాయి..” అంది.

“డుండుభములా! అంటే ఏమిటి చెల్లీ?”

“రెండు తలల పాముల్ని డుండుభములు అంటారు. అవి మనుష్యులని భయ పెడతాయి, కాని వాటికి విషం ఉండదు.”

“రెండు తలల పాములా! అవెలా ఉంటాయి చెల్లీ?” అడిగింది మంజీర అమాయికంగా!

“ఉంటాయిలే గాని, ముందు నీ విషయాలు చెప్పక్కా! నీకు చరణ్’కి పెళ్లి ఎప్పుడు అయింది. నువ్వు అత్తయ్య , మామయ్యలను చూసావా?”

“చూసాను చెల్లీ! నా పెళ్లి 2001  మే నెలలో జరిగింది. ఆ పెళ్ళికి ‘అత్తయ్య మామయ్యా,’ఇతని అన్నయ్య ‘సూర్యా’ వచ్చారు. మా పెళ్లి ఈ ‘జయనగరం లోనే’, సీతా రామ కళ్యాణ మండపంలో జరిగింది. మా అన్నయ్య ‘కేశవ్’ ఎంతో ఆడంబరంగా ఆ పెళ్లి చేయించాడు! అత్తయ్య నేను ఎంతో అందంగా ఉన్నానని మెచ్చుకొంది, ఆవిడ చాలా మంచిది! మామయ్య గారు ఎలాంటి వారో నాకు అంతు పట్ట లేదు. ఆయన ఎప్పుడూ గంభీరంగా ఉండేవారు. ఇతని పెళ్లి, సూర్య పెళ్లి రెండూ ఒకేసారి జరగాలని అతని అభిప్రాయ మట! నన్ను చూసి ఈయన ఇష్ట పడి, ఇల్లరికపు అల్లునిగా ఉండి  పోయేందుకు సిద్ధమవడమే దానికి కారణం! ‘నా అంద చందాలు, మా అన్నయ్య కేశవ్  యొక్క సిరి సంపదలే’ వైభవ్’ని ప్రలోభ పెట్టాయని, అందుకే  మామయ్యగారికి నేనంటే అయిష్టమని తరువాత తెలిసిందనుకో!”

“నిజంగానే మీరు అప్సరస లాంటి అందగత్తెలు అక్కయ్యా! అయితే మీరు అత్తవారింటికి వెళ్లి , వాళ్ళతో కాలం గడపనే లేదా? ”

“లేదు, ఆ అవసరం రానే లేదు, నా పెళ్లి అయిన  4 సంవత్సరాలకి ఆగస్టు 2005లో హఠాత్తుగా ఈయన మాయ మయ్యారు! ఎక్కడకి పోయారో, ఎందుకు వెళ్లారో నాకు తెలియక అయోమయంలో కాలం గడిపే దాన్ని! కేశవ్ అన్నయ్య  కూడా ఏమీ చెప్పేవాడే కాదు, దాంతో నాకు మతి పోయింది!”

“ఇప్పుడు మీ ఆరోగ్యం బాగు పడింది కాదా అక్కయ్యా?”

“అవును, ఈయన విదేశాలకి వెళ్లి, అక్కడ ఒక రోడ్డు దుర్ఘటనకి గురి అయి, కోమాలోకి వెళ్లి పోయి నన్ను మరచి పోయారనీ, తెలివి వచ్చాక నన్నే తలచుకొన్నారని తెలిసాక, నా మనసు కుదుట పడింది. నా ఉన్మాదం కూడా గోటితో తీసేసినట్లు పోయింది, అదిసరే!ఇంతకీ నీ ఆరోగ్యం ఎలాగుంది?”

“నా ఆరోగ్యానికేం బాగానే ఉన్నాను కదా?”

“లేదు, చెల్లెమ్మా! నువ్వు ఇంకా స్వస్థత చెందాలి, ఇందాకల పాముని చూసి కూడా భయపడలేదని చెప్తే నాకు ఎంతో సంతోషం కలిగింది తెలుసా! దాని అర్థం నీలో ధైర్య సాహసాలు ఉన్నాయని, అవి ఏమాత్రం దిగజార లేదని కన్ఫర్మ్ అయినట్లే కదా...”

మంజీర మాటలు,  శ్రీ లలితకి  ఆశ్చర్యాన్ని కలిగించాయి, ‘మంజీర ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది! నా ఆరోగ్యం గురించి ఎందుకు  ప్రశ్నలు ఎందుకు వేస్తోంది!’ అని అనుకొంది. అయినా ఆమెనే మాట్లాడనిస్తే విషయం బయట పడుతుందని మౌనం వహించింది.

“చెల్లెమ్మా! నా పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు వేసావు, అంటే  వైభవ్ నా భర్త అని, నువ్వు అంగీకరించి నట్లే కదా?” అడిగింది మంజీర.  

“అవును కదా!” అంది కాస్త వ్యంగ్యంగా శ్రీ లలిత.

మంజీరకి ఆ మాటల లోని వ్యంగ్యం అర్థం కాలేదు, పాపం సూటిగా మాట్లాడే వ్యక్తి ఆమె! “ అలాంటప్పుడు వైభవ్ నీకు కూడా భర్త ఎలా అవుతాడు?”

“ఏం, ఎందుకు కాకూడదు ?”

“ఇక్కడే నువ్వు పప్పులో కాలు వేస్తున్నావు,నేను నిజం చెప్తున్నాను విను! నీ భర్త పేరు సూర్యచరణ్! వైభవ్ చరణ్ కాదు! తెలిసిందా? సూర్య చరణ్ మన అత్త  మామలతో పాటు ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు. నువ్వు దానిని జీర్ణించుకోలేక పోతున్నావు. సూర్య, వైభవ్ ఇద్దరూ కవలలు,ఇద్దరి రూపు రేఖలు ఒకేలాగ ఉన్నందు వల్ల, నువ్వు భ్రమ పడే ఆస్కారం ఉంది. అంత మాత్రాన వైభవ్’నే, నీ భర్త అని డిమాండ్ చేయడం బాగుంటుందా?”

శ్రీ లలితకి ఇంత సేపటికి మంజీర చెప్ప బోతున్న విషయం అర్థమయింది! ‘తను పిచ్చిదని, అతనినే తన భర్త అనుకొంటున్నానని, ఆమెతో చరణ్ చెప్పాడన్న మాట! అలా చెప్పి, తనను బాగు చేయాలంటే కొన్నాళ్లు నాటకం ఆడ వలసి ఉంటుందని నచ్చచెప్పి ఉంటాడు! ఇదా చరణ్ చేసిన రాజీ మార్గం  అను కొంది. మంజీరకి నిజం తెలియకపోతే, ఇలాగే తనకి రోజూ నీతులు చెప్తూ ఉంటుందని, ఆమెకి వాస్తవాలని చెప్పయ్యడమే మంచిదని కూడా తల పోసింది.

“అక్కా! మన అత్త మామలు, ఇంకా సూర్య చరణ్ విమాన ప్రమాదానికి ఎప్పుడూ గురి అయ్యారో మీకు తెలుసా, 25.01.2007 రథ సప్తమి నాడు. ఇక నా పెళ్లి  అరటి పాడు గ్రామంలో 08.05.2008 నాడు, అయింది. విమాన ప్రమాదంలో చని పోయిన సూర్య చరణ్  నా మెడలో తాళి ఎలా కట్టగలడు? అందుకే చెప్తున్నాను విను! మీ మెడలోను నా మెడ లోను తాళి కట్టిన వ్యక్తి ఒక్కరే! అతనే వైభవ్ చరణ్!! మనమిద్దరం తోడి కోడళ్ళం కాదు, సవతులం! ఒకే వ్యక్తితో ఖర్మకొద్దీ  ముడి పడిన భార్యలం!! వైభవ్ విదేశాలలో దుర్ఘటనకి గురి అయి, కోమాలోకి వెళ్ళిన విషయం నిజం కాదు! అతను ఇక్కడే ఉండి మా ఊరు వచ్చి నన్ను పెళ్లి చేసుకొని నాతో సంసారం చేసిన, మన ఉమ్మడి ప్రియుడు  లేదా మొగుడు!!!”

అని సూటిగా చెప్పి ఆమె రియాక్షన్ కోసం ముఖం కేసి చూసింది.

మంజీర శ్రీ లలిత మాటలు నమ్మలేదు. “అదేమిటి అలా అంటావు, మా ఆయన విదేశాల నుండి నాకు ఆడియో రికార్డు చేసి, పంపిన టేపు నేను స్వయంగా విన్నాను. అంతే కాదు, ఆ మరుచటి రోజే అక్కడి ఆస్పత్రి నుండి పంపించిన వి.డి .యో. కూడా చూసాను. అలాంటప్పుడు నీ  పిచ్చి మాటలు ఎలా నమ్ముతాను?” అంది.

‘ఓహో! నన్ను పంపించి వేసాక, ఆడియో తరువాత వి.డి.యో కూడా రికార్డు చేసి పంపాడన్న మాట గురుడు!’  అనుకొంది శ్రీలలిత.

“అక్కా! ఆ ఆడియో రికార్డింగు నా సమక్షం లోనే జయనగరంలో మ్యూజిక్ & మిరకేల్స్ టి.వి. స్టూడియోలో జరిగింది. అందులో వైభవ్ మాట్లాడిన ప్రతీ మాటా నాకు తెలుసు! నీ పిచ్చి బాగు చేయడానికి ఇదంతా చేస్తున్నట్లు నాకు చెప్పారు. నాకు పిచ్చి ఉన్నట్లు నీతో చెప్పారు. నిజానికి అతనే ఒక పెద్ద డుండుభము! ఇలా మన ఇద్దరితోనూ ఆడుకొంటున్నాడు.”

“నాగు పాముల్ని ఆడించినట్లా?” అడిగింది మంజీర.

“అవునక్కా! మన పరిస్థితి ఇప్పుడు ఎలాగున్నదంటే, అదేదో కథలో ‘సనక, మేనకల’ లాగ ఉంది.”

“సనక మేనకల కథా, వైభవ్ చెప్పిందేనా?”

“కాదు, నేను చదివినది. నీకు వినాలని ఉంటే చెప్తాను.”

“చెప్పు చెల్లెమ్మా! నాకు కథలంటే బలే ఇష్టం!”

శ్రీ లలిత చెప్పసాగింది.

****************

“హే! సూర్య భగవాన్! ఎంతకాలం ఈ నిరీక్షణ తండ్రీ! వృద్ధ మండలాధీశ్వరు డైన పూర్ణ ప్రభుని జీవిత భానుడు, అస్తమించేదెప్పుడు ప్రభూ ?!”

పిపాసా తప్తములైన దృక్కులతో, అనుదినం సూర్యభగవానుని సమాధానం కోసం వేధించే ఈ వేదనా భరిత విలాపం, సోమపురీ మండలాంతర్గత మైన ఉద్యానవనంలో వసించే ఇద్దరు అభిసారికలది.

సోమపురీ మండలం సస్యశ్యామల భరితమే కాక, బౌద్ధులకు తీర్థయాత్రా స్థలం కూడ. ఇక్కడే జగత్ప్రసి ద్ధమైన ‘ సోమపురీ మహా విహారం’ ఉన్నది. పుణ్య సంచయార్థం వచ్చే యాత్రికుల సంఖ్య దిన దిన ప్రవర్థ మానం అవుతూండడం చూసి, మాండలిక ప్రభువైన పూర్ణప్రభుడు రాజధాని నుండి మహావిహారం వరకు విశాల రాజమార్గాన్ని నిర్మించాడు.

పూర్ణప్రభుడు ప్రజానురంజకుడైన పరిపాలకుడే కాక దయాళుడు. వ్యక్తిగతంగా కూడా ఎవరికీ అపకారమూ చేసి ఎరగడు. అంతెందుకు, యాత్రికులు ఆ విశాల రాజ మార్గ మధ్యంలో విశేష ధనంతో నిశ్చింతగా నిద్రించ గలరంటే, అతని పరిపాలన ఎంతటి శాంతియుతమైనదో ఒక్క మాటలో చెప్పినట్లవుతుంది.

ఆ రాజమార్గానికి ఒక ప్రక్కగా, దగ్గర దగ్గరగా పెంచబడిన రెండు ఉద్యానవనాలు,వాటిలో లతా పుష్పా ఛ్ఛాదితము లైన రెండు భవంతులు చూపరుల కంటిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి కట్టించినట్లుండే ఆ భవనాలు సమాన రూప వయో లావణ్యాలు కల ఇద్దరు నర్తకీమణుల నివాస గృహాలు.

సౌందర్యంలోనూ, సంగీతంలోనూ, నాట్యకళా ప్రావీణ్యంలోనూ,మనసు మెచ్చే విధంగా పూలమాలలు కట్టడంలోనూ, వారిద్దరూ ప్రతిద్వంద్వులే ! మహారాజు పూర్ణప్రభుని నుండి సామాన్య పౌరుల వరకూ, వారిరువురి నాట్యకళా ప్రౌఢిమని శ్లాఘించేవారే ! వారిరువురి రూపజాలంలో చిక్కి, మిథ్యాంగిక విన్యాసాలకి ముగ్ధులయి, సన్నిధిని సాధించలేక పరితపించే ప్రముఖులు కూడ లేక పోలేదా నగరంలో !

వారిలో ఒకరి పేరు సనక ! రెండవ తరుణి పేరు మేనక! సూర్యాస్తమయ సమయంలో  ఏకాకిగా ఉద్యానవన ప్రాంత సరోవర తటం నుండి, సంధ్యారుణ కాంతులతో మెరిసిపోయే రాజభవనం వంక దృష్టి సారిస్తూ, తనలో తనే మురిసిపోయేది సనక !

ఆ రాజమందిరంలో మహారాణి హోదాలో తిరుగాడ గలిగే భాగ్యం త్వరలోనే తనకి పట్టబోతుందనే ఆనందంతో! కారణం యువరాజు పుణ్యరత్నుడు ఆమెను తన హృదయ రాజ్ఞిగా స్వీకరిస్తానని ఇచ్చిన వాగ్దానమే! అయితే వృద్ధ మండలాధీశ్వరుడైన పూర్ణప్రభుని మరణానంతరమే తన ప్రతిన నెరవేర గలదనే షరతు కూడా సూచిస్తూ! సరిగా  ‘మేనకకి’ కూడా అటువంటి వాగ్దానాన్నే ఇచ్చాడు యువరాజు.  అనుదినం సూర్య భగవానునికి అంజలి ఘటిస్తూ, “ హే ! సూర్య భగవాన్ ! ఇంకా ఎంత కాలం ప్రభూ, ఈ దుస్సహ నిరీక్షణ, “ అంటూ ప్రార్థిస్తారా అభిసారికలు.

ఇరువరి హృదయాలలోని ఆవేదనా ఆకాంక్షా ఒకటే కావడం వల్ల ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టదు.

నిత్యమూ, కళ్లు మిరమిట్లు గొలిపేలా అలంకరించు కొనడంలోనూ, చూపులు నిలిపి వేసేలా పూలమాలలు కట్టడం లోనూ, వారిరువురి పోటీ చెప్పశక్యం కాదు !

కాని చీలి రెండు పాయలై ప్రవహించే నది, చివరకు ఒకే సముద్రాన్ని ఆశ్రయించేటట్లు, ఆ అందాన్ని చూసి ఆనందించే హక్కు ఒక్కరిదే !

అతడే యువరాజు పుణ్యరత్నుడు !!

సముద్రుడు అన్ని నదులనూ ఒక్కలాగే ఆదరిస్తాడు. తన గంభీరమైన హృదయంలో దాచుకొంటాడు. అలాగే పుణ్యరత్నుడు కూడా ఆ రెండు ప్రేమ వాహినులను తనలో కలుపుకొన్నాడు.అతడి ప్రేమ సముద్రుని ప్రేమ వలె గంభీరమైనది కాదు. అసలు అది ప్రేమ అని చెప్పడానికే వీలు కాదు.‘ అతడు వారివురినీ ప్రేమించినట్లు నటిస్తున్నాడు’, అని చెప్పినా ఆవ గింజంత అబద్ధం చెప్పినట్లే అవుతుంది !

ఆ ఇద్దరి నర్తకీమణుల ఆకాంక్షా, ఉచ్ఛాభిలాషా, పుణ్యరత్నుని మాటలనే నాగస్వరం విని నాట్యం చేసేవి. ఆ రెండు నాగినులనూ ‘మహారాణి పదవి’ అనే బుట్టలో పడవేసి, మిథ్యా ప్రేమ కలాపాలనే నాగస్వరంతో ఆడించేవాడు, పుణ్యరత్నుఢు.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద