Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంధ్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 1;బాపు వేసిన బొమ్మలతో సహా

ధరణి రవీంద్రుల ధర్త ఎవండు / పరశక్తి పౌలోమి భర్త ఎవండు,
ఒజ్జలు వర్ణించు నుత్తము డెవడు / ముజ్జగముల నేలు మొనకాడెవండు,

ధాతల ధాతయౌ తాత యెవండు / భూతంబులకు మూల భూతమెవండు,
జీవులు జీవించు జీవమెవండు / దైవంబులర్చించు దైవమెవండు,

యుధ్ధేశుడగు నాది యోధ్ధ ఎవండు / బుధ్ధీశుడగు నాది బోధ్ద ఎవండు,
అందరి లోపల నాత్మ యెవండు / మందులు గానని మర్మమెవండు,

జాతులేకంబగు జాతి ఎవండు / అఖిలము మించిన వ్యాపకుడెవడు,
నిఖిలము మించిన నిత్యుడెవండు / ఆకాశ తనువుచే నలరారు నెవడు,

పాకారి తనువుచే పాలించునెవడు / ఆ యాది దేవుని, అభవు, ననంతు,
మాయావి నింద్రుని మదిలో దలంతు.

అని స్వకృతియైన ఇంద్ర దశకాన్ని పాడుకుంటూ, కౌండిన్య సుచంద్రుని ఇరవై మూడవ రాజ్య వర్షాన, ‘విజయ సంవత్సర జ్యేష్ట శుధ్ధ పంచమీ సోమవారం నాటిరాత్రి పూర్వయామంలో,‘సత్యప్రభ’ ‘గణపవరగ్రామం నుండి,‘శ్రీకాకుళనగరానికి మరలి వస్తోంది! ఇప్పటికి నగరం అర క్రోసు దూరంలో ఉంది. ఆమె నడుస్తున్న స్థలం ఒక చిట్టడవి, దారి సంకుచితంగా ఉన్నా వెన్నెల్లో చక్కగా తెలుస్తూంది.

సత్యప్రభ పందొమ్మిది సంవత్సరాలు నిండిన యువతి. మహా సుందరిగా ఉన్నా, సుకుమారాంగి కాదు! వ్యాయామంఛే సంస్కారం పొంది, వజ్ర ధృడాలైన ఆమె అంగాలు వేరే శోభను పోషిస్తున్నాయి. ఆమె మంఛి బలవంతురాలే కాదు, ఆయుధ విద్యలన్నింటిలో నేర్పరి! ఆంధ్ర గీర్వాణ భాషల యందు వ్యుత్పన్నురాలు. అమృత వచనాలు సృజించు కవీశ్వరి!

ఆమె ధరించిన చీర ముతకగా ఉన్నా, నిర్మలంగా ఉంది. రవికె దానికి తగ్గట్లుగా ఉంది. చెవులకి ముత్యాల పోగులు, చేతులకు గాజులు, కాళ్లకి వెండి కడియాలు, మెడలో చిన్న వరాల పేరు.. ఇవి మాత్రమే ఆమె ధరించిన ఆభరణాలు. ఆమె వేషం నిరాడంబరమైనా ప్రసన్నంగా ఉంది.

కీర్తిశేషుడైన రాథీతర సత్యరథుని పెంపకపు కూతురు సత్యప్రభ. పదిహేడు సంవత్సరాల క్రిందట సత్యరథుడు ఆంధ్ర కళింగుల ఘోర సంగ్రామంలో అనేక శత్రువులను నురుమాడి రణహతుడై  వీర స్వర్గాన్ని అలంకరించాడు. సత్యప్రభను పెంచిన సత్యరథుని పత్ని పేరు చంపావతి. సత్యరథునికి సత్యప్రభ ఈ చిట్టడివి లోనే దొరికిందట! ఇట్టి సుందరాంగి శిశువుని ఏ తల్లి విడిచి వేసిందో! సత్యప్రభని గహించిన పిమ్మట చంపావతీ సత్యరథులకి మణిమాల అనే కూతురు పుట్దింది. ఆ పిల్ల సత్యప్రభ కంటె ఒక సంవత్సరం చిన్నది.

సత్యప్రభ వెళ్తున్న దారిలో వైరూప సోమదత్తుని ఆశ్రమం ఉంది. అతని బిరుద నామం అక్షోభ్య ముని. మునిని ఒకసారి చూసి వెళ్లాలని తలచింది సత్యప్రభ. సత్యప్రభా మణిమాలలకు అతడు మంత్ర గురువు. కాబట్టి అతని ఆశ్రమాన్ని దాటి వెళ్లడానికి ఆమె ఇష్టపడ లేదు. ఆమె త్రోవలో నుండి ఆశ్రమం వైపు తిరిగింది. ఆశ్రమ ద్వారం తెరచే ఉంది. ముని లోపల ఉన్నారని ఆమె నిశ్శబ్దంగా ప్రవేశించింది.

ముని లోపల కన్పడ లేదు. అచ్చట ఇంకొకడున్నాడు. అతడు సుందర యువకుడు, కులీనుడైన సంపన్నుడు, గర్వితుడైన సైనికాధికారి. అతని సంపూర్ణ నామధేయం మౌద్గల్య వీరసింహుడు.

సత్యప్రభని చూడగానే వీరసింహుడు కూర్చొన్నవాడు లేచి నిలబడ్డాడు. అతడు సత్యప్రభను అనేక పర్యాయాలు చూసాడు. కాని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూసి ఉండ లేదు. ఉజ్జ్వలమైన దీపం ఆమె ముఖాన్ని వానికి చక్కగా ప్ర్రదర్శిస్తూంది. వాడు ఆమెను చంపావతి పెద్ద కూతురని పోల్చాడు. సత్యప్రభ కూడ వాడెవడో తెలుసుకొంది, కాని సంభ్రమాన్ని చూపెట్టలేదు. ఆ పరస్పర దర్శనములో వీరసింహుడు తన దృష్టులతో ఆమె రూపాన్ని అర్చించడానికే పూనుకొన్నాడు. సత్యప్రభ తటస్థంగా నిలిచింది.

ఆ దర్శనోత్సాహంలో వీరసింహుని మనస్సు సత్యప్రభను ఈ విధంగా స్తుతించింది.

తాక్షక చంద్ర సేనుని కుమార్తె పర్ణినిని చక్కని చుక్క అని ఆ వాడ వారందరూ చెప్తారు. ఆ ఉత్తమ సుందరి ఈమె ముందు, సూర్యప్రభ కెదురైన కర దీపికవలె శోభింపదు.!

మహారాజు కుమార్తె రథినీ కుమారి ప్రపంచము లోని చక్కని కన్యల్లో అగ్రగణ్యురాలని రూప మర్మఙ్ఞుడైన గావల్గణి రూపచంద్రుడు తీర్పిచ్చి ఉన్నాడు. వాడు కాని ఈమెను నిదానించి చూచినప్పుడు, తన తీర్పును గురించి పునరాలోచన చేయకుండా ఉండలేడు.

చంపావతి పుత్రి మణిమాల అందరి కంటె చక్కనిదని నేను రూపచంద్రునితో వాదించడం కలదు. కాని ఈమె కంటె ఎక్కువ అని చెప్పజాలను. ఆమె ఎంత లావణ్యవతిగా ఉన్నా, దయనీయ తన్వంగి, ఈమె పరిపుష్ట భోగ క్షమాంగి! కండపుష్టి సౌందర్యంలో ప్రధానాంశమని నా అభిప్రాయం!

చంపావతికి రెండు రత్నాలు లభించాయి. ఆ రెండింటిలో దీని వెలయే ఎక్కువ! ఈమె మహా వజ్రం! మణిమాల పుష్యరాగం!

ఇట్లు హృదయంలో శబ్దించుకొంటూ వీరసింహుడు బహిరంగంగా ఇలా అన్నాడు:

భద్రముఖీ! మునిగారిని చూడడానికా వచ్చావు?”

ఔనుముక్తసరిగా జవాబిచ్చింది సత్యప్రభ.

ఈ పుష్యార్క యోగంలో ఒక మూలికను గ్రహించడానికి వారు అరణ్య మధ్యానికి వెళ్లి ఉన్నారు. వెళ్లి చాల సేపైంది. ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చో!

ముని వచ్చేవరకు ఉండడమా లేక వెళ్ళిపోవడమా అని ఆలోచిస్తూ, కొన్ని క్షణాలు సత్యపభ గడిపింది. కొసకు వెళ్లి పోవడానికే తీర్మానించి వీరసింహునితో ఇలా అంది:

నేను మరొకసారి మునీంద్రుని చూసుకొంటాను. ఇప్పుడు వెళ్లి పోతాను. నాకు ఉత్తరువు ఇప్పించండి.
సత్యప్రభ లోపలికి ప్రవేశించిన తక్షణమే తన్ను చూసి సిగ్గుపడి వెనక్కు తగ్గక, తన కభిముఖంగా నిలుచుండి, వెళ్తానని చెప్పి, తన ఉత్తరువును ఎదురు చూడడం వీరసింహునికి అపోహ కలుగచేసింది! ఆమె ఆభిముఖ్య వినయాలు కామ ప్రేరితాలని వాడు భ్రమించాడు!

మహా వీరవనిత సత్యప్రభకు స్త్రీ జాతి సహజమైన లజ్జ తక్కువ. వీర పరీక్షలో వీరసింహుడు మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయాడని, ఆమెకు వానిపై గౌరవం ఉంది. తన గురువైన అక్షోభ్య మునికి శిష్యుడని ప్రీతి కూడా ఉంది. ఈ రెండు భావాలూ ఆమెను వానికి అభిముఖంగా చేసాయి., వినయంతో మాట్లాడించాయి. బంధుత్వం లేని స్త్రీ తన పట్ల స్నేహం కొంచెం చూపితే చాలు, సాధారణంగా యువకుడు దానిని కామం అని ప్రాయికంగా శంకిస్తాడు. 

కామచ్ఛాయ లేని స్నేహం బంధువులుకాని స్త్రీ పురుషుల మధ్య ఉండగలదని నమ్మడానికి ఎంతో విశాల బుద్ధి కావలసి ఉంటుంది. వీరసింహునికి అంత విశాల బుధ్ధి లేదు. అందువలన సత్యప్రభ తనను కామించిందని వాడు శంకించడంలో ఆశ్చర్యం లేదు. ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని  భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.

కామింపబడ్డానని భ్రమించిన వీరసింహుడు సత్యప్రభను కామిస్తున్నాడు. వాని కామం స్థిరపడిన కొన్ని క్షణాలలో భ్రమ కొంత శిథిలమైంది.ఆమె తనను ప్రేమిస్తూందా లేదా అన్న సంశయం వానిలో ఉదయించింది. వెంటనే వాడు ఆమె మెల్లగా జారిపోతుందేమో అని సందేహించి, ముని వస్తున్నారేమో చూచే నెపంతో ద్వారదేశాన్ని ఆక్రమించుకొన్నాడు.

వాని దృష్టి బాహ్యప్రదేశం వంక లేదు. ముని వచ్చుచున్నారా, లేదా అనే గొడవే వానికి లేదు.వాని దృష్టి ఉన్మాదంతో సత్యప్రభ మీదకే దుముకుతూంది. ఉత్సాహంతో సత్యప్రభ అంగ సంధుల్లో ఆడుతూంది, పిపాసతో ఆమె లావణ్యామృతాన్ని త్రాగుతూంది.

సత్యప్రభ ఈ విషయాన్ని కనిపెట్టింది, ఆమెకు అనుమానం కలిగింది. కొన్ని క్షణాలలో కొండలా ఉన్న వీరసింహుడు ఆమె దృష్టిలో దూదిపింజై పోయాడు!

నీవు రాథీతర సత్యరథుని కుమార్తె సత్యప్రభవని నేను పోల్చుకొన్నాను, నా పోలిక సరేనా?” అనిప్రశ్నించాడు వీరసింహుడు.
 ఔను.                                                                                                                                                                       “నేనెవరో పోల్చుకొన్నావా?”

ఎవరు మీరు?” అని అఙ్ఞానాన్ని అభినయించి అడిగింది సత్యప్రభ.

మహాసమాహర్త (రెవిన్యూ మంత్రి) మౌద్గల హేమచంద్రుడు మా తండ్రి, నా పేరు వీరసింహుడు. ఆచార్య భవనంది గురుకులంలో శాస్త్రవిద్యల్నీ, ఆచార్య విషమసిధ్ధి గురుకులంలో శస్త్రవిద్యల్నీ చక్కగా అభ్యసించాను. రెండు మాసాలుగా రాజకీయ సేనలో సహస్ర పతిగా పనిచేస్తున్నాను.

ఓహో అలాగా! చాల సంతోషం.

రాథీతరీ! నేను నీతో కొన్ని సంగతులు మాట్లాడవలసి ఉంది. దానికి తగిన సమయ ప్రదేశాలు లభించిన దానికి సంతోషిస్తున్నాను.

ఆ సంగతులేమో?”

నా కనేకులు పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నా మనస్సు, రాథీతరీ.., నీపై లగ్నమై పోయింది. రాథీతరి ముఖం నుండి అనుకూల వాక్యాన్ని అపేక్షిస్తున్నాను. నీ అభిప్రాయం అనుకూలంగా ఉంటే, నేను ఘడియలో నా తల్లి తండ్రులతో చెప్పి సంబంధాన్ని స్థిర పరుస్తాను.

ఇప్పుడు వీరసింహుని భావం సత్యప్రభకి అర్థమయింది. అలాగు అడగడం తప్పని ఆమె భావించ లేదు. కాని అలాంటి ప్రసంగానికి తగిన దేశ కాలాలు అవి కావని ఆమె తలంచింది. తత్కాల కామోద్రేకమే దేశ కాలౌచిత్యాన్ని ఉల్లంఘించిన ప్రసంగానికి కారణమని ఆమె నిర్ణయం. అందువలన వీరసింహుని విషయంలో పడిపోయిన ఆమె గౌరవ బుధ్ధి తిరిగి తల ఎత్తలేక పోయింది. ఆమె భావ శూన్యమైనప్పటికిన్ని, మృదువుగానే ఇట్లు ప్రత్యుత్తరాన్ని ఇచ్చింది:

మీ అమ్మగారు మా అమ్మను ఈ విషయంగా అడుగునట్లు ఏర్పాటు చేయండి. మా తల్లి అంగీకరిస్తే నేను బధ్ధురాలి నవుతాను..

ప్రత్యుత్తరం ప్రతికూలంగా లేదు. కాబట్టి వీరసింహుని ఆశకు భంగం కలుగ లేదు. కాని సత్యప్రభ సూచించిన సంవిధానం వానికి నచ్చలేదు. వాని తాత్కాలికోద్రేకం విఘ్నాల్ని సహించలేక పోయింది.వాడు మరలా ఇట్లు అడిగాడు:

మనం ముఖాముఖిగా సంప్రతించుకొని పరస్పరాంగీకారానికి వచ్చిన తరువాత, పెద్దల సమ్మతికి అనుధావించ వచ్చును. నా అంగీకారాన్ని చెప్పివేశాను. నీ యందు ప్రేమాతిశయంచే నేను ఎట్టి త్యాగం చేస్తున్నానో గమనించు. మా ఆస్తి పది లక్షల విలువ కలిగి ఉంది సుమా! నీ ముఖచంద్రుని నుండి వచ్చు ప్రత్యుత్తరాన్ని నేను వినగోరుతున్నాను.

నా అభిప్రాయాన్ని వినాలనే మీ కుందా?”

ఔను రాథీతరీ!

ఆలోచించు కోవడానికి రేపు సాయంకాలం వరకు నాకు అవకాశం ఇవ్వండి.

సత్యప్రభ ఇప్పటికి వాని నుండి తప్పించుకొని పోవడానికి అలాగు మృదువుగా బదులిచ్చింది. ఎలాంటి విలంబాన్ని సహించలేక పోయాడు, ఆ ఉధ్ధత వీర యువకుడు. వాడు ఆ బిగువుతోనే ఇలా అన్నాడు:

ఇప్పటి నీ భావాన్ని నేను వినగోరుతున్నాను. నేను కపటం లేకుండా అడుగుతున్నాను. నీవు కూడా కపటం లేకుండా బదులు చెప్పాలి.

వీరసింహుని స్పష్ట ప్రశ్నకు స్పష్టమైన ప్రత్యుత్తరాన్నే ఇవ్వాలని సత్యప్రభ నిశ్చయించింది. ఆమె వీరసింహుని ఆశ పటాపంచలయేటట్లు ధృఢ స్వరంతో పలికింది:

స్పష్టంగా నా భావాన్ని మీరు వినగోరుతున్నారు కాబట్టి చెప్తున్నాను.. అధిక పరిచయం లేని ఒక కన్యకను ప్రథమ దర్శనంలోనే భావాన్ని చెప్పమని  బలాత్కరించే మీ స్వభావం నాకు నచ్చలేదు. అధికంగా ఒక కన్యకను ప్రేమించిన వాడు ఇట్టి విరసమైన చర్యను అవలంబించడు. విలంబాన్ని సహించని ఇట్టి ఉద్రేకం పశు స్వభావమే కాని, మానవ స్వభావం కాదు. నేనిప్పుడు మిమ్మల్ని ప్రేమించలేక పోతున్నాను. ఎన్నటికి కూడా ప్రేమించలేను. మీరు సహ ధర్మాచరణానికి మరొక కన్యను వెతుక్కోండి.

ముగ్ధురాలా, ఏమిన్నీ ఆలోచించకుండా నీవు తిరస్కరించ వద్దు. కొద్ది రోజుల్లో నేను దండనాయక పదవికి రావడం తథ్యం. ప్రసాదంలో మా కుటుంబానికి ఉన్న పలుకుబడి నీకు తెలిసే ఉంటుంది. మా  ఆస్తి కూడా అఖండ మయింది. నా వీరత్వం కూడా నీకు తెలియని విషయం కాదు.

ఈ విషయంలో ఆలోచనలు  పనికిరావని మీరే నిర్ణయించారు. కాబట్టి నేను ఆలోచించను. నా భావాన్ని స్పష్టంగానే చెప్పాను. దీని గురించి మరి మీరు మాట్లాడ వద్దు.మర్యాదగా దారి ఇవ్వండి, నేను వెళ్లాలి.”’

ఇంతటితో వీరసింహుడు మౌనం వహించిన బాగుండును. వాడు తాను అవమానింప బడినట్లు తలంచాడు. ఆ తలంపు రాగానే వాని యుక్తాయుక్త విచారం అస్తమించింది. సాధ్యాసాధ్య విచారం తలనే ఎత్తలేదు. కార్యాకార్య విచారం వెనక పడింది. లాభాలాభ విచారం సన్నగిల్లింది. ధర్మాధర్మ విచారం అసలే వానికి లేదు. నా అంత వాడు కోరి తిరస్కరింప బడడమా అన్న పట్టుదల వానిని ఉత్తర ప్రసంగానికి పురికొల్పింది.

నా మనస్సును దొంగలించిన కన్యను నేను ఉపేక్షింప జాలను. సుందరి యగు కన్యక వీరపురుషుని సొత్తు.

నిజమే! సుందరియగు కన్యక వీరపురుషుని సొత్తే అగును. నీవు మాత్రము వీరపురుషుడవు కావు. వీరపురుషులు రణరంగమున అద్భుత కృత్యాలను ఆచరింఛి సుందర కన్యకల మనస్సుల్ని ఆకర్షిస్తారు. వివిక్త ప్రదేశంలో స్త్రీలను భయపెట్టడం దస్యు లక్షణం. అది వీర లక్షణం కాదు. ఇలాంటి వివిక్త దేశ వీరుని నుంచి రాథీతరి సత్యప్రభ భయపడదు.

2 వ ప్రకరణం

సత్యప్రభ మాటలు విన్న వీరసింహుడు దండతాడిత సర్పం వలె క్రుధ్ధుడై ఇఅలా అన్నాడు !

“ నేనా వివిక్త దేశ వీరుణ్ని? నాకు సేనలో సహస్రపతి  పదవిని ఇచ్చిన ఆంధ్రేశ్వరునే నీవు అధిక్షేపిస్తున్నావు ! నాకు క్రోధం కలిగిన కొన్ని క్షణాల్లో బ్రహ్మకుల పరిషత్తు అధ్యక్షుని ఎదుట నికృష్టమైన నీ జన్మని రుజువు చేసి, నిన్ను బ్రాహ్మణ జాతిలో నుండి బహిష్కరింప చేయుట మా కసాధ్యం కాదు ! బాగా ఆలోచించికో, నన్ను పెండ్లాడి నీ కుటుంబాన్ని మహోన్నత స్థితికి  తెచ్చుకొంటావా లేక అధోగతి పాలు చేసుకొంటావా,?”

వీరసింహుని  ఈ వచనోపన్యాసం ఇంత వరకు శాంతంగా ఉండిన రంగ స్థలాన్ని భయంకరంగా మార్చింది. ప్రసన్నంగా ఉండిన రంగాన్ని కల్లోల పరచింది. పిమ్మట  వారిద్దరి సంవాదంలో మార్దవం పూర్ణంగా నశించింది.

“ నా జన్మ నికృష్టమో , నన్ను కన్నవారి జన్మలు నికృష్టములో కాలమే తెలియజెప్తుంది. నన్ను కన్న తండ్రి చెప్పుల్ని మొయ్యడానికి కూడా నీకు అర్హత లేదని నేను స్పష్టంగా చెప్పగలను. ప్రాసాదంలో మిక్కిలి పలుకుబడిగల నీ తల్లి నన్ను జాతి నుండి బహిష్కరింప వచ్చు. కాని మా కుటుంబం శక్తి సామర్థ్యాల నుంచి ఒక చిన్న లవాన్ని కూడా అపహరింప జాలదు. తల్లి తండ్రుల వచన ప్రతాపం పైన,ఆధార పడిన నీ వీరత్వం వంటిది కాదు నా వీరత్వం !”
ఈ మాటలు తీవ్ర బాణాల వలె వీరసింహుని మర్మాల్ని స్పృశించాయి !

సత్యప్రభను వశపరచుకోడానికి వాడు అవలంబించిన ఆశా ప్రదర్శన నీతిన్ని, బిభీషికా నీతిన్ని వ్యర్థాలై పోయాయి. ఇక మిగిలినవి రెండే మార్గాలు  తన ప్రయత్నం నుండి విరమించుకోవాలి. లేదా ఆమెను బలాత్కరించాలి. ఆ మధోధ్ధతుడు, ప్రయత్న విరమణ తన ప్రతాపానికి న్యూనత అని తలంచాడు.

మూలికాన్వేషణకి  వెళ్లిన ముని, అర్థరాత్రికి గాని తిరిగి రాడు. ఆ విషయం వీరసింహునికి బాగా తెలుసు. ఆ విధంగానే చెప్పాడు అక్షోభ్యముని. కాబట్టి ఆ వివిక్త ప్రదేశంలో ఒంటరిగా  చిక్కిన  ఆ  సుందరాంగిని బలాత్కరణ చేయడానికే వాని తత్కాల సంకల్పం ప్రేరేపించింది. ఈ దుశ్చర్యకు ప్రోత్సహించడంలో వాని కామమొక్కటే  భాధ్యత వహించ లేదు, క్రోధము కూడా అందులో భాగం కలిగి ఉంది. ఆ ఉచ్చృంఖల యువకుడు సత్యప్రభతో తుది మాటగా ఇలా అన్నాడు:

“వీరసింహుని భుజ ప్రతాపం తెలుసుకోకుండా నీవు జల్పిస్తున్నావు. మరొకమాటు నిన్ను అడుగుతున్నాను. నన్నుపెళ్లి చేసుకొని, శ్రీకాకుళ సంపన్న నారీమణులలో కెల్ల మిన్నగా జ్వలిస్తావా, లేక నా భుజబలాన్ని పరీక్షిస్తావా?”

“క్షుద్ర! ప్రాణాలు కావాలని కోరిక ఉన్నచో పారిపో. నా నుండి జవాబే కావాలన్నచో, ఈ కఠారి ఇస్తుంది.ఇది నీ బలం ఎంత ఉందో పరీక్షించ గలదు!”

ఇప్పుడు వీరసింహుని స్థితి మిక్కిలి చెడిపోయింది. సత్యప్రభ చేతి అసి పుత్రికను చూడగానే, వాణ్ని ఇంత స్థితికి తెచ్చిన కాముడు మెల్లగా జారుకొన్నాడు. చిరకాల మైత్రి కల క్రోధుడు మాత్రం తన పోషకుని, ఈ సమయంలో వదల లేదు. వాని బలాత్కరణోద్దేశం సత్యప్రభ భీషణ శస్త్రీజ్వాలలో పడి భస్మీభూతమై పోయింది.

ఇప్పుడు వాని భావి కర్తవ్యం మిక్కిలి అసహ్యమై నిలిచింది. పారిపోయిన మహావమానం; యుధ్ధం చేస్తే చంపడమో చావడమో ఒకటి జరిగి తీరాలి. చంపిన, స్త్రీ హత్యా పాతకము, చస్తే సర్వనాశనం! ఆ మదోధ్ధతుడు పారిపోలేక పోయాడు. మిగిలింది యుధ్ధమే. వాడు తన మొలలో నుండి భీకర కరవాలాన్ని తీసిన వాడయ్యాడు.

సత్యప్రభ తృటికాలమైనా వృధా చేయకుండా, సింహిక లాగు వానిపై పడి, సాయుధమైన వాని బాహువును కఠారితో తీవ్రంగా పొడిచింది. వాణ్ని చంపే ఉద్దేశం ఆమెకు లేదు, అలాంటి అభిప్రాయమే ఉంటే, ఆమె వాని హృదయం పైననే పొడిచి ఉండేది. వాని మదం భగ్నం కావాలి, వాని ప్రాణాలు పోకూడదు —ఇదే ఆమె ఉద్దేశం.

సత్యప్రభ ఆ పోటు వేగంతోనే వానిని క్రింద పడత్రోసింది.

ముందే గుప్తంగా పతితుడైనా వీరసింహుడు భూమ్యాకాశాలకు తెలిసేటట్లు సశబ్దంగా పడిపోయాడు. సత్యప్రభ, పడిపోయిన వీరసింహుని పరీక్షించింది. వాడు మూర్ఛపోయి ఉన్నాడు. ఆమె, ముందర వాని చేతిలోని ఖడ్గాన్ని లాక్కొంది. పిమ్మట వాని బాహువు నుండి నిరవధికంగా స్రవిస్తున్న రక్తాన్ని చూచింది.

 ఆ దృశ్యాన్ని చూడగానే ఆమెను కరుణ ఆవేశించింది. తన్ను తానే నిందించుకొంది. ‘పొడవకుండా, పారిపోయి ఉంటే ఎంత బాగుణ్ణు’ అని లోలోపల నొచ్చుకొంది. ఇంతలో ఆమెకు డొంకల సందులో నుండి కొన్ని పాటలు వినిపించాయి.

పారి పోవగ శక్తి పాదాలకుండ / మార చేయుచు వాని మద ముగ్ధ దృష్టి.
త్రోసి పోవగ శక్తి దోర్లత కుండ /గాసి పెట్టుచు ఘోర గర్జన వలన,

కాలంబు పొడిగింప ఘన వాణి యుండ / మూలంబు దాచుచు ముని వచ్చు వరకు,
సాధుత యెరుగని యోధ ముఖ్యునకు / క్రోధము కలిగించు రోధింప బడుచు,

పటు శతృ శోణిత పలల భోజనను / కటువౌ కఠారిని కాల దూతికను,
నిండు ప్రాణి భూజాన నీవు గ్రుచ్చితివి / చొచ్చెను లోతుగా చురకత్తి చూడ,

చచ్చునో బ్రతుకునో చపలాక్షి ! వాడు, / గాయపు చెట్టాకు కల్కము వేసి,
గాయము కట్టుము గతి గాన గలవు.

ఆ పాటలు ఉన్మత్త సిధ్ధ కవీశ్వరి ‘రాజకాళి’ వని  సత్యప్రభ తెలుసుకొంది. నలుప్రక్కలా చూసింది. రాజకాళి కన్పడ లేదు, కాని ఆమె చెప్పిన ‘గాయపు చెట్టు’ కనిపించింది. ఆమె ఆనందంతో వెళ్లి, ఒడినిండా ఆకులు కోసితెచ్చి, వాటి పసరును వీరసింహుని గాయంపై పిండి, ఆకుల కల్కాన్ని గాయంపై పెట్టి, వాని ఉత్తరీయాన్ని పీలిక చేసి, బాగా కట్టింది. ఇంతకు ముందు ప్రాణాలను అపహరింప చూసిన మారుతుడు ఇప్పుడు చామరగ్రాహి వలె వానిని ఉపచరించాడు. తరువాత సత్యప్రభ ఆశ్రమం లోపలికి వెళ్లి, జల కుంభాన్ని తెచ్చి, నీటిని వాని ముఖంపై జల్లింది. వాడు కండ్లు విప్పకుండానే నోటిని తెరచాడు. సత్యప్రభ పురిసెళ్లతో నీరు పోసింది. వాడు త్రాగాడు, అక్షోభ్య ముని వచ్చి, తనని ఉపచరిస్తున్నాడని వాని భ్రమ!

నీరు త్రాగగానే వానికి తెలివి వచ్చింది. కండ్లు విప్పి చూశాడు.. సత్యప్రభ ముఖం వానికి కన్పడింది. కొన్ని క్షణాల క్రితం ఆ ముఖం వానికి మహామాదకంగా ఉండింది. ఇప్పుడు అది అత్యంత భీషణంగా దర్శన మిచ్చింది.

“హా! రాక్షసీ!” అని ఆ యువకుడు కేక వేసాడు.

“రాక్షసునికి గర్వ భంగమైన పిమ్మట రాక్షసి వెళ్లి పోయింది. ఈమె నీ సుఖ జీవితాన్ని కాంక్షించు నీ చెల్లెలు. నీ కింక భయం లేదు, గాయాన్ని గాయపు చెట్టాకు కల్కము వేసి కట్టి ఉన్నాను. బుధ్ధిమంతుడివై  చిరకాలం బ్రతుకు. మహాముని వచ్చి నిన్ను ఇంటికి పంపగలడు.” అని చెప్పి సత్యప్రభ ఆ చోటును వీడి త్వరిత గమనంతో వెళ్లి పోయింది. వీరసింహుని ప్రాణాల కంటె విలువైన వాని కత్తిని ఆమె తీసుకొనే వెళ్లింది. ప్రియమైన కత్తితో పాటు ఘనమైన మానాన్ని కూడా  పోగొట్టుకొన్న ఆ ఉధ్ధత వీరుడు నిస్సారమైన ప్రాణాలతో శ్వాసిస్తున్నాడు. ఆ ప్రాణాలు కూడా తన శత్రువుచే దయతలచి ఉంచబడ్డాయని ఙ్ఞప్తికి రాగానే, వానిలో ఆవిర్భవించిన లజ్జాధూమం నిర్మల చంద్రికను కప్పి వేసింది.

వానికి దిక్కులు అంధకార మయములై పోయాయి

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద