Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ 4 : బాపు వేసిన బొమ్మలతో సహా

 8 వ ప్రకరణం.

మరునాడు మహారాఙ్ఞి లీలావతీ దేవిగారి వర్ధంత్యుత్సవం జరిగింది. ప్రాతఃకాలంలో మహావైభవంతో ఆయుష్య హోమం నెరవేర్చబడింది. హోమానంతరం కోటలోని మైదానం ముందు, ఆమె పురస్త్రీలందరికీ దర్శన మిచ్చింది. మధ్యాహ్నం బీదలకు, బ్రాహ్మణులకు సంతర్పణలు జరిగాయి. భోజనానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత అంతఃపురం లోని పెద్ద కచ్చేరి సావిడిలో సాక్షర నారీ సభ సమావేశ మయింది. ఆ వర్షపు వర్ధంతిలో భగవతి శుభ్రాంగి గురుకులంలో చదువుకొని కవిత్వం చెప్పగల కన్యకల కవిత్వ పరీక్ష జరుగునని ముందే చేటీ జనాధ్యక్షురాలు భృంగాలక ప్రకటించి ఉండింది..రాజధానిలోని చదువుకొన్నస్త్రీలందరూ సభలో సన్నిహితులయ్యారు.

నారీ సభా ప్రేక్షణార్థం కూడిన పురుషుల ఆసన పంక్తులు ఒక ప్రక్కగా ఉన్నవి. పదునేడుగురు పెద్ద మనుష్యులు ఆ భాగం మొదటి పంక్తిలో ఆసీనులై ఉన్నారు ఆ పంక్తిలో మధ్య మహారాజ సుచంద్ర భట్టారకుడు కనక సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. అతని దక్షిణ పార్శ్వమందు కుమార శక్తిధరుడు, వామ పార్శ్వమందు కుమార భోగనాధుడు కూర్చొని ఉన్నారు..భోగనాధునికి కుడివైపుగా చిత్రకూట మహా మండలేశ్వరుని కుమారుడు దండనాయక రణేశ్వరుడు, మహామంత్రి సునందుడు, రాష్ట్రీయుడు వీరనందుడు, మహా సమాహర్త హేమచంద్రుడు, కోశాధ్యక్షుడు గుణాకరుడు, దూతసామంతుడు విశాలాక్షుడు, దండనాయక చండసేనుడు, కూర్చొని ఉన్నారు. శక్తి ధరునికి ఎడమవైపు వరుసగా సేనాపతి రణంధరుడు, పురోహితుడు వాణీధరుడు, మహా ప్రాడ్వివాక సత్యవ్రతుడు, సచివ రూపచంద్రుడు, బ్రహ్మకుల పరిషత్పతి ధర్మపాలుడు,ఆచార్య విషమ సిధ్ధి, ఆచార్య భవనంది కూర్చొన్నారు.

నారీ సభలో ప్రత్యేకంగా అమర్చ బడిన వేదికలో మధ్యన కనకాసనమున లీలావతీ దేవి కూర్చొని ఉన్నది. ఆమె దక్షిణ పార్శ్వమందు భగవతి శుభ్రాంగి, వామ పార్శ్వమున యోగిశ్వరి ధవలాక్షి కూర్చొని ఉన్నారు. ఇద్దరు చేటికలు చామరములతో రాణిగారికి విసురుతున్నారు.

సమ ప్రదేశంలో వేయబడ్డ ఆసన పంక్తులలో మొదటి పంక్తిలో పదముగ్గురు స్త్రీలున్నారు.మధ్యన ఉన్నత కనకాసనంలో రథినీ కుమారి కూర్చొని ఉంది. ఆమె కుడి పార్శ్వములో వరుసగా ఉన్మత్త సిధ్ధ కవీశ్వరి రాజకాళి, సత్యప్రభ, మణిమాల, మధువాణి, ఆమె సవతి తల్లి కాంతామణి, నాగకన్య పర్ణిని కూర్చొని ఉన్నారు.సత్యప్రబా రథినుల ప్రయత్నం వల్ల రాజకాళి ఆ సభకి వచ్చింది. ఆమె మాటిమాటికీ వెళ్లి పోవడానికి ఉంకిస్తున్నా, సత్యప్రభా రథినులు ఆమెను ఆపుచేస్తున్నారు.

రథినీ కుమారికి ఎడమ వైపున వరుసగా ఫలిని, భానుమతి, వీర సింహుని చెల్లెలు విలాసవతి, కనక వల్లి, విశాలాక్ష పుత్రి కుముదాక్షి, ధరణి, కూర్చొన్నారు. భృంగాలక, ధారావతి, ఙ్ఞానేశ్వరి, చంపావతి, పద్మాక్షి, కాత్యాయని, కామసేన మొదలైన పురనారీ మణులు కూర్చొని ఉన్నారు.

ఒక్క ఆంధ్ర సామ్రాజ్యమే కాదు, భరత ఖండ మంతటి సౌందర్యం ఆ నారీ సభ యందు కేంద్రీకృత మయిందని చెప్పవచ్చును. సౌందర్య తత్త్వఙ్ఞుడైన రాజసచివుడు రూపచంద్రుడు ఏమంటున్నాడో (స్వగతంగా) గమనిద్దాం.

‘ఈ రథినీ కుమారి 'శరీర ప్రభ జ్యోతిర్మయామృతం అని చెప్పక తప్పదు. ఈమె ముఖం శీతల దివాకర మండలం అని చెప్పడం సరి అయినది. ఈమె తన జ్యోతిస్సుతో సభాశాల నంతటినీ ముంచి వేస్తూంది ! ఈమె సౌందర్యం మనుష్య జాతి దుర్లభం. ఈమెను ఒకమారు చూసిన మహేంద్రుడు తన వేయి కండ్లు సార్థకాలయ్యాయని తలంచ గలడు.’

‘ఈ సత్యప్రభ' చక్కదనం మాత్రాతీతం. వ్యాయామ విభక్తాలైన ఈమె అంగాల సౌష్టవం నిరుపమానం. ఈమెకు స్వయంవరమే చాటిస్తే, ఇంద్రాగ్ని యమ వరుణులు మరొకమారు భూమికి దిగక మానరు. శ్రీశైల మహా మండలేశ్వరుని ఏక పుత్రి రత్నప్రభను పెండ్లాడి, మహామండలేశ్వర పదవి పొందడం కంటె, ఈమెను పెండ్లాడి సామాన్య గృహస్థునిగా ఉండడమే మహాభాగ్యమని నా తలంపు.’

‘ఈ మణిమాల' బ్రాహ్మణ జాతికి కీర్తి తెచ్చిన దివ్య లావణ్యవతి. వికసించిన పద్మం లాగ ఉన్న ఈమె ముఖమందు మహాలక్ష్మి వాసం చేస్తూంది. చతుర్ముఖుడు గాని ఈమెను చక్కగా నిదానించి చూస్తే, అతనికి తిలోత్తమ స్మరణకి రాక మానదు.’

‘ఈ ఫలిని' పోతపోసిన శరశ్చంద్ర చంద్రిక. భూమికి దిగిన భారతీ తేజోంశము. మూర్తీభవించిన ప్రసన్నత. ఈమెను మహేశ్వరుడు వీక్షిస్తే చిరకాలం నుండి తాను తలపై మోస్తున్న గంగాదేవిపై కొంచెం అవఙ్ఞత వహించకుండా ఉండలేడు.’

‘ఈ మధువాణి' స్థిరయై భూమిపై సంచరించు విద్యుల్లత. ప్రాణాలతో వెలసిన బంగారు బొమ్మ. బంగారనికి కాఠిన్యమనే దుర్గుణం ఉంది. ఈ కొత్త బంగారం అత్యంత సుకుమారం. ఈమెనే గాని నారాయణుడు ఒకసారి అవలోకిస్తే తాను వక్షప్రదేశంలో ధరించు మహాలక్ష్మిని పరిహసింపక మానడు.’

'ఈ ధరణి 'అధికాలంకారాలు లేక పోయినా, చక్కగా అలంకరించుకొన్న సంపన్న కన్యలను మించి శోభిస్తూంది. ఈమె జ్యోతిష్మద్విశాల నేత్రాలు ఈమె ముఖానికి అలంకారాలు. ఈమె శ్యామలంగా ఉన్నా లావణ్య తరంగ మాలిని. కృష్ణ ద్వైపాయన ముని ఈమెను ఒకసారి చూస్తే., తన జయేతిహాస నాయిక పాంచాలి ఇంకొకసారి భూలోకానికి దిగిందని వర్ణింపక మానడు.’

'ఈ పర్ణిని' స్వర్గము నుండి మన లోకానికి పంపిన అచ్చర. ఈమెను చూసినా, ఈమెతో మాట్లాడినా ఈమె సంగీతాన్ని విన్నా, మనుష్యుల పుణ్యఫలం కొంత వ్యయం కాక మానదు. ఈమెను ఒకసారి దర్శించునెడల నలకూబరుడు రంభపై ఇంచుక అనాదరణ చూపక మానడు.’

‘ఈ భానుమతి' వేదిగతాగ్ని జ్వాలవలె పవిత్ర మూర్తి. ఈమెను చూస్తే చాలు వైశ్వానరుడు‘ తన ప్రియకాంత స్వాహాదేవి అని భ్రమ పడక మానడు.!’

‘ఈ కనక వల్లి' అభిమాన దేవత వలె సౌందర్యన్ని పోషిస్తూంది. ఈమె కోటీశ్వరుని ఏకైక పుత్రిక కాబట్టి ఈమెకు చెంద వలసిన మహా సంపద ఈమె సౌందర్యపు వెలను హెచ్చిస్తూంది.’

‘ఈ కన్యా నవకం 'శ్రీకాకుళ నగరంలో అమూల్య రత్ననవకం. నగరంలోని యువకులు వీరిలో ఒకరినైనా చూడని దినం దుర్దినమని తలస్తారు. వీరి ప్రభావం వల్ల శుభ్రాంగీ గురుకులానికి కీర్తి వచ్చింది. మహిమ హెచ్చింది. జనులకది యాత్రా స్థలమైంది. కృష్ణానదీ యాత్రకు వచ్చిన ప్రతీ వ్యక్తిన్నీ ఈ తొమ్మిది దేవతా విగ్రహాలని దర్శించి పోవలసిందే !’.

’ఈ కుముదాక్షి' నయవేత్త విశాలాక్షుని చేతి జృంభకాస్త్రము. ఈమె చూపులు మదన జృంభకాస్త్ర జ్వాలలే అగును..విశాలాక్షుడీ అస్త్రాన్ని కుమార భోగనాధుని సాధించుటకై దాచి ఉన్నాడు. ఈమె తండ్రి వద్దనే సర్వ విద్యలను అభ్యసించింది. గురుకులం లోని తొమ్మిది రత్నాలకి తీసిపోని పదవ రత్నమిది !’

‘ఈ రాజకాళి 'సౌందర్యం మలిన వేషం వల్ల నివురు కప్పిన నిప్పు వలె ఉంది. ఈమె నోరెత్తిన చెవులు కల వారందరూ లొంగి పోవలసిందే! ఈ మె కంఠంలో సర్వేశ్వరుడుంచిన మాధుర్యం అపారం! ఈమె విశాల నేత్రాల లోని జ్యోతిస్సు, ఆకర్షణ శక్తి అత్యద్భుతం. ఈమె కవిత్వం లోని భావాలు అత్యంతం రమణీయాలు!’

‘ఉన్నత వేదికపై కూర్చొన్న మువ్వురిలో ఒకతె (లీలావతి ) తన సౌందర్య ప్రతాపంఛే ఆంధ్రేశ్వరుని వశం చేసుకొని ఈ గొప్ప సామ్రాజ్యాన్ని ఏలుతూంది.

మరొకతె ( ధవలాక్షి ) తన సుందర ముఖభాగ్యం చేతనే ఆబాల గోపాలాన్ని శాసిస్తూంది. కీర్తి మాత్రం ఈమె యోగ మహిమకు వచ్చింది ! ఈమె ఇంకా అవివాహితగా ఉండడం చింతాకరం !

ఇంకొకతె ( శుభ్రాంగి ) జటావల్కల ధారిణియై, మూర్తీభవించిన విరక్తవలె కన్పడుతూంది. అలా ఉన్నా ఈమె సౌందర్యం నేత్ర్ర పారణ కావించుతూనే ఉన్నది.!’

9 వ ప్రకరణం:

కవిత్వ పరీక్ష ఆరంభించబడింది.

రాజకాళి, మహారాజ్ఞిని చూసి “దేవీ! ఈ సభ ఎ పనిమీద కూడింది? ఆ ప్రక్కన కూర్చొన్న పెద్ద మనుష్యులకు మన రాజధాని లోని రత్నాల పోగుని ప్రదర్శించే నిమిత్తమేనా?” అని ప్రశ్నించింది.

అందరూ నిశ్శబ్దంగా నవ్వుకొన్నారు.

“నారీ కవుల కవిత్వ పరీక్ష కొరకు ఈ సభ కూడింది. నీవు గొప్ప నారీ కవియిత్రివని ప్రసిద్ది. అందుచే పరీక్షని చూచే నిమిత్తం నిన్ను పిలిపించాను” అన్నది రాణి.

“గొప్ప మాటేను!”

“ సభా కార్యానికి ముందుగా నీవేదైనా మంగళాచరణం చేస్తే బాగుంటుంది.”

“ఓ తప్పకుండా! మంగళాచరణం చేయ వలసిందే! రేపు మంగళ వారం మంగళాచరణానికి మంచి రోజు. కాని ఒక రోజు ముందుగా కర్తవ్యమ్ ముగించడంలో దోషం ఉండదు.” ఇట్లు చెప్పి, చేతులు జోడించి---

“ అకళంక శుభ్రాంగి ఆత్మకి జయము / సుకుమారి మధువాణి  శోభకి జయము.
పగలేని ఫలినమ్మ నగవుకు జయము / వగలాడి కాంతమ్మ వగలకు జయము.

సత్యమౌ సత్యమ్మ (సత్యప్రభ) శక్తికి జయము / నిత్యమౌ మణిమాల నీటికి జయము.
మన భానుమతి బోధ మహిమకు జయము / ఘనకేషి ధరిణమ్మ కవితకు జయము.

చెన్నైన కనకమ్మ వన్నెకు జయము / చిన్ని  విలాసమ్మ చేష్టకు జయము.
వనజాక్షి పర్నిని వాణికి జయము / జననాధు సుందరి జన్మకు జయము.

అని కిన్నెర నాదంతో రాజకాళి జయ గీతాన్ని ఆలాపించింది. రూప చంద్రుడు లేచి ఇలా అన్నాడు. ‘ మహా కవీశ్వరీ!జయనాదమంతా ఆ ప్రక్కకే గాని, ఈ ప్రక్కకు దానిలో భాగం లేదా?” అని.

“లేకేమి చారు చంద్రుడా? కావలసినంత ఉంది” అని రాజకాళి తన తర్జనితో నిర్దేశించి చూపుతూ అన్నది.

“ఇలభారమును మ్రోయు నెద్దుకు(సుచంద్రుడు)జయము
దళముల నడిపించు దంతికి(రణంధరుడు) జయము.

వరనీతి తెలిసిన వరడుకు( సునందుడు) జయము.
 పరిపుష్టి నొందిన పందికి (వీరనందుడు) ఇయము.

 నలు దిక్కులను జూచు నక్కకు (రూప చంద్రుడు) జయము.
కులమున గొప్పదౌ కుక్కకు (గుణాకరుడు) జయము.

 మేదిని తిరిగెడు మేకకు (హేమచంద్రుడు) జయము.
బూదిలో పొరలెడు పోతుకు (చండ సేనుడు) జయము.

చిన జంతువుల మేటి చిరుతకు ( భోగానాధుడు) జయము.
కొనగొమ్మ గూర్చొండు కోతికి ( భవనంది) జయము.

పెదపేరు ధరియించు పిల్లికి ( రణేశ్వరుడు) జయము.
పెదజాతి  సింగంపు కొదమకు(శక్తిధరుడు) జయము.

కాలము మీరిన కాకికి (పురోహిత వాణీధరుడు) జయము.
గాలికి లొంగని గ్రద్దకు ( మహా ప్రాద్వివాక సత్యవ్రతుడు) జయము.

అందరు మెచ్చెడు హంసకు (ధర్మపాలుడు) జయము.
కొందరు పొగడెడు కొంగకు (విశాలాక్షుడు) జయము.

ఘోరనఖంబగు కోడికి ( విషమ సిద్ది) జయము.
 స్ఫారమౌ మా రాజు పంక్తికి జయము.

రాజకాళి జయగానాన్ని విని స్త్రీలందరూ ఒక్క పెట్టున నవ్వారు. ఉపమాన స్వారస్యం చేత భోగనాధ, శక్తిధరుల న్యూనాదిక్యాలు, చెప్పబడడం లీలావతీ దేవికి కంటకమయింది. రణేశ్వరుడు పిల్లిగా చెప్పబడుట ఆమెకి చాల నొప్పిని కలిగించింది. ఆమె ముఖారవిందాన్ని బట్టి మహారాజు ఆమె మనః క్లేశాన్ని గమనించాడు.

శుభ్రాంగి, మహారాజ్ఞిని చూసి “ఇక పరీక్ష ఆరంభించ వచ్చునా?” అని ప్రశ్నించింది.

“కానియ్యండి” అని రాణి పలికింది. నా శిష్యులు ఆరుగురు కవిత్వంలో పరీక్షింప బడుతారు” అని ఉద్ఘాటించింది శుభ్రాంగి.

“భగవాన్ జటాముని శిష్యురాలిని, నన్ను కూడా పరీక్ష చేసిన గాని నేను అంగీకరించను” అని చెప్పింది రాజకాళి.

“ అలాగే కానీ! నీతో వాదించి జయించుట చాల కష్టం. ఒక్కొక్కరు  పరనారీ   పరామర్శమును, ప్రత్యక్షంగా  గాని,  తాత్పర్యంద్వారా  గాని  నిషేధిస్తూ  రెండేసి  ద్విఫదలు  చెఫ్ఫవలెను. సత్యప్రభ, మణిమాల, ధరణి, మధువాణి, ఫలిని, రథినీ కుమారి, రాజకాళి—వీరు వరుసగా తమ తమ పద్యాలు చెప్పవలెను.”

“అలా వీల్లేదు, నా ద్విపదలు రెండూ, నేను ముందే చెప్పి వెళ్ళిపోతాను. నాకు చాలా పనులు ఉన్నాయి” అని తొందర పడింది రాజకాళి.

“అదేమి పనమ్మా, రాజకాళమ్మా! పిల్లలని ఓదార్చాలా మగనికి సేవ చేయాలా?” అని అధిక్షేపించింది రాణి.

“నాకు పని లేకేమి?—

మనుషులతో కూడ మాటాడ వలయు / వన జంతువులతో తోడ వాదించ వలయు.
ఉద్ధత పుత్రుల నోదార్ప వలయు / సిద్ధుల నథితుల సేవింప వలయు.

తక్కువ కానట్టి తరుణ వీరులకు / చక్కని కన్యల సమకూర్చ వలయు.
ప్రజల కష్టంబులు పరికించ వలయు / సుజనుల సౌఖ్యంబు చూడగ వలయు.
రాజకాళికి  లేని రాజ కార్యములు / రాజులకే లేవు రాకేందు వదన!”

“ పతి లేని నీకు పుత్రులు ఎచ్చటి నుండి వచ్చారమ్మా!”

“నాకు కావలసినంత మంది పతులున్నారు, మహారాణీ!”

“కావలసినంత మందా ? ఎందరు?”

‘పదిమంది.”

“ వారి పేర్లని వినవచ్చునా?”

“వినమ్మా, విను! పాపాలు పోతాయి.”

“వజ్రము ధరియించు వాడు నా మగడు / వజ్ర రూపిణి చండిపరగ నా సవతి.
ఆహులు వహియించునయ్య నా మగడు / స్వాహా సరోజాత వదన నా సవతి.

గగన పాంథుండగు గాలి నా మగడు /  భగణ చాలక శక్తి భామ నా సవతి.
భువనముల్ వెలిగించు బూత నా మగడు / భవము మ్రొక్కెడు సంధ్య నా సవతి.

చక్కని కల్వల సామి నా మగడు / చుక్కలలో  మేటి చుక్క నా సవతి.
పాపుల దండించు పాశి నా మగడు / పాపహారిణి విశా వనిత నా సవతి.

పలుజీవుల సృజించు నలువ నా మగడు / పలుకుల రానియౌ వాణి నా సవతి.
నా రాజు నరమౌళి   నా చిన్ని మగడు / నా రాణి లీలమ్మ నా ముద్దు సవతి.

పదిరూపులు  ధరించు పరము డొక్కరుడే / పది నామముల నాకు భార్తయియా వెలసె.
మగువులలో మేటి మగువయౌ నాకు / మగవారిలో మేటి మగవాడు మగడు.

సవతికి నా నాథు శయ్య నర్పించి / భువి తిరుగాడెడు పురుషిని నేను!
పురుషుల మించిన పురుషిని నేను / తరుణుల మించిన తరుణిని నేను!
మగని నామమే నాకు మధు మధురంబు / మగని రూపము నాకు మదినున్న జాలు!”

దేవతల శ్రేణిలో తన పేరు చేర్చుటచే సుచంద్రునికి సంతోషమయింది. లీలావతికి మాత్రం తనకొక భయంకర వచ్చినట్లే అయింది. ‘పిచ్చిదాని పాటలకి నేనింత భయ పడడమెందుకని’ తన్ను తాను  సమాధానం చేసుకొని రాజకాళిని ఇట్లు అడిగింది రాణి.

“ ఈ పది నామములలో నీవు మిక్కిలిగా భజించే పేరేది?”

“ కోమలాంగీ! నీకు గుట్టు చెప్పెదను / నా మానసము మెచ్చు నామ మింద్రుండు !
సానులు పాడెడి నామదేయమది!  నా మగని పవిత్ర నామదేయమది!

కామములిచ్చెడు నామదేయమది! క్షేమము నొనగూర్చు నామదేయమది!
జయమును సమకూర్చు నామదేయమది! భయమును బోగొట్టు నామదేయమది!

శక్తుల నొసంగెడు శక్త నామమది! ముక్తి నొసంగెడు ముఖ్య  నామమది!
జీవుల రక్షించు చిత్ర నామమది! దేవతలు జపించు దివ్య నామమది!
పాడెద దానిని వాడల లోన / ఆడేద నంతట హర్షంబు తోడ!” అన్నది రాజకాళి.

“ ఆ భగవంతుని ఎప్పుడైనా చూసావా?”

“ నాలుగు పదార్థాలలో అతని దివ్య రూపాన్ని చూస్తున్నాను”

“ ఏవమ్మా, ఆ పదార్థాలు?”

“ అనలునం దక్షియం దర్కుని యందు / జనపతి యందుని జగదీశు జూతు!
అగ్నిలో బరమేశు నాలోకమున / భగ్నంబులై పోవు పాపంబులన్ని!

 మరువక కంటిలో మా నాథు జూడ / గురి చక్కగా నిల్పు గుట్టు చెప్పితిని!
రవి కిరణంబుల రాణువ చూడ / దివినేలు భూపాలు దీప్తి బోదపడు!
అఘ వర్జితుండగు నాంద్రేశు జూడ / మఘవంతుని శరీర మాధురి తెలియు!” అన్నది రాజకాళి.

ఈ పాటలు విన్నంతనే నరపతి భావం రాజకాళిపై మరింత ప్రసన్నమయింది. అతడా కవీశ్వరిని చూచి ఇలా అన్నాడు. “సిద్ద కవీశ్వరీ! కవిత్వ పరీక్ష ముగించే వరకు సభలో ఉండి, సభను జయప్రదంగా జరుగునట్లు సహాయం చెయ్యాలి. అలా చేస్తే, నీ ఆంధ్రేశ్వరుని మనస్సు మిక్కిలి సంతోషిస్తుంది.”

“అనలునైన గ్రసింతు నవలీల నేను / జననాథు నాజ్ఞను జవదాట లేను!
మన రేని మాటకు మారాడ లేను / మన చక్రవర్తిని మన్నింతు  నేను!” అని పాడింది రాజకాళి!

“సిద్ధ కవీశ్వరి మాకిచ్చిన చక్రవర్తి బిరుదం సార్థకమవుగాక!” అని అన్నాడు రాజు సంతోషంతో.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద