Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 6 : బాపు బొమ్మలతో సహా


 వీర సింహుడు, సత్యప్రభ జన్మ గురించిన అపవాదును ముందుగా తన చెల్లెలు విలాసవతి చెవిలో ఊదాడు. ఆమె తన ప్రాణ స్నేహితురాలు కనక వల్లికి చెప్పింది. కనక వల్లి తన ప్రియ జనకుడు హిరణ్యనాభునికి తెలియ జేసింది. హిరణ్యనాభుడు తన మిత్రులలో ముఖ్యుడైన  కాణ్వ శుకనాసునికి వెల్లడించాడు.

సోమవారం పూర్వాహ్ణమే ఆ సప్రాణ వార్తా పత్రికకి (శుకనాసునికి) ఈ నూతన వార్త అందింది. ఆ ఆంద్ర నారదుడు ఆ సాయంకాలం లోపుగా వందకు తక్కువ కాని స్త్రీ పురుషులకు ఈ వార్తను చేర వేసాడు. వారు  తమకు తెలిసిన వారికి నివేదించారు! సోమవారం నాడు సూర్యాస్తమయమునకు తరువాత స్త్రీ గోష్టుల లోను, పురుష సమాజం లోను, ప్రాయికంగా ఈ వార్త దొర్లి పొరలింది. రాజ దంపతుల వరకు ఈ వార్త ఎగబ్రాకింది.

“ఎవరు కనిపెట్టారు, ఎ విధంగా కనిపెట్టారు?”అని అడిగే వారు ఎవ్వరూ లేక పోయారు! కాత్యాయనీ సులోచనులకు కూడా ఈ వార్త తెలిసింది. వారు ఆశ్చర్యపడ్డారు!

ఈ నీలి వార్త సత్యప్రభ ప్రాణ స్నేహితురాలైన రథినీ కుమారికి తెలిసింది. దీని సత్యా సత్యాలని కనిపెట్టాలని ఆమె తీర్మానించింది. రథిని కాత్యాయనిని పిలిపించింది. రాజకుమారి ఆహ్వానాన్ని మన్నించి ఆమె సేనాపతి భవనానికి రాత్రి పూర్వ యామంలో వచ్చింది. ఏకాంత మందిరంలో వారిద్దరూ సమావేశమయ్యారు.

రథిని సౌందర్యం గురించి వీరసింహ రూపచంద్రులు మనకి పరిచయం చేసే ఉన్నారు. ఆమె కవితను మనం వినే ఉన్నాము. ఆమె చదువును గురించి రాజకాళి నోటినుండి జయనాదం నిర్గమించింది. రథిని ఉభయ భాషల లోను వ్యుత్పన్నురాలు. అనేక తంత్రాలలో ఆమె స్వతంత్రురాలు. ఔపనిషద మార్గంతో కూడిన షట్చక్ర సముల్లాస విధి కూడ ఆమెకు తెలుసు. ఇన్నాళ్ళ వరకు శాస్త్ర వ్యాసంగంలో ఉండిన ఆమె తన సవతి తల్లి విజ్రుంభణాన్ని అరికట్టడానికి రాజకీయ రంగం లోనికి ప్రవేశించింది. ఆమె మంత్రాంగ బలం చేతనే, నరపతి మనస్సు పక్వమై శాంతిసేనా గజవీరుల జాబులకు ద్రవించి క్రిదటి రాత్రి మహామంత్రికి ప్రతికూలమయింది.

కాత్యాయని నలభై సంవత్సరాలు నిండిన స్త్రీ, ఇప్పటికిని ఆమె గాత్ర పటిమ చెక్కు చెదరలేదు. పది సంవ త్సరాల క్రిందటనే ఆమెకు భర్తృ వియోగం సంభవించింది. ఆమె వైద్యంలో చాల నిపుణురాలు. ఆ వృత్తిచే వచ్చిన ఆదాయంతో సొంతంగా కొనుక్కొనిన ఇంటిలో కాలక్షేపం చేస్తూంది. పరోక్షంగా ఆమెను స్వైరిణి అని నిందించు వారందరూ ప్రత్యక్షంలో ఆమెకి లొంగియే  ఉంటున్నారు! ఆమెది ఒక కొత్త మతం ! ఆమె  సిద్ధాంతాలను అంగీకరించన వారు కొలదిమందే  అయినా ఖండించే  శక్తి గలవారు మాత్రం తక్కువ !

“పిన్నీ! ఒక సంశయాన్ని తీర్చుకోవడానికి నిన్ను పిలిపించాను, అడగమంటావా?” అన్నది రథిని కాత్యాయనితో.

“కన్నతల్లీ! నన్ను తమరు ఉత్తరువు అడగాలా? తల్లి దగ్గర పిల్లకు అభ్యంతరం ఏముంటుంది?”

“ ఆ చనువు వల్లనే సాహసిస్తున్నాను. నా స్నేహితురాలు విషయంగా అడగ వలసి వచ్చింది పిన్నీ! అట్టి ప్రశ్న సాధారణంగా ఒక స్త్రీకి బాణ ఘాతంలాగ ఉంటుంది. కాని నీ వంటి స్వతంత్ర నిర్భయ వనిత తట్టుకో గలదని నా విశ్వాసం!”

“ స్వాతంత్ర్యం , నిర్భయత్వం నాలో ఉన్నాయని నేను అంగీకరించ లేను! నేనేమో మొత్తం మీద స్త్రీల  స్వాతంత్ర్య నిర్భాయత్వాల పట్ల నిందిస్తున్నానని  మీరు తలంచ రాదు. అవి నాలో తగిన స్థాయిలో లేవని మనవి చేసుకొంటున్నాను, విచారిస్తున్నాను కూడ! ఆ సంగతి అలా ఉండనీయండి. మీరే ప్రశ్న వేసినా నన్ను అది భాదించదని హామీ ఇస్తున్నాను, అడగండి!”

"శ్రీకాకుళం లోనే కాదు, మానవ జాతి లోనే ఉత్తమ కన్యక, నా ప్రాణ స్నేహితురాలు, చంపావతి గారి సత్యప్రభ, మీ సృష్టి అని ఒక వార్త విన్నాను, ఆ సంగతి సత్యమేనా?”

“కుమారీ! దుష్టులు కల్పించినది ఈ వార్త. నేనూ ఈ వార్త విన్నాను. సత్యప్రభ లాంటి కూతురే నాకు కలిగితే నేను పారవేస్తానా? నా చర్య కొంత గుప్తమని నేను ఒప్పుకొంటాను. కాని నేను పాపమని నమ్మిన దాన్ని ఏనాడూ చేయజాలను. అనాథ శిశువును పారవేయడం మహాపాపం అని నా ధృఢమైన అబిప్రాయం! స్నేహితురాలి తల్లి తెలిసి పోయిందని తమరు నిర్ణయించుకో వలదు!”

“పిన్నీ! ఈ వార్తను ఎవరు కల్పించి ఉంటారు?”

“ హేమచంద్ర, హిరణ్యనాభ, విశాలాక్షులలో ఒకరు ఈ వార్తను కల్పించి ఉండవచ్చు! ఆ మువ్వురి వద్ద ముగ్గురు చక్కని కన్యలు ఉన్నారు. వారు ముగ్గురున్నూ తమ తమ పిల్లలను తమ పెద్దన్న గారికి ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు. ఒకరి మీద ఒకరు పోటీపడి సంబంధం చేయాలని రహస్యంగా ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి! సత్యప్రభను పెద్దబాబు పెండ్లి చేసుకోవాలని తలంచి ఉండవచ్చు! దానికి విఘ్నం చేయాలని ఈ కథా కల్పన జరిగిందేమో అని నా ఊహ!”

“నిజమే, పిన్నీ! ఇప్పుడు నాకు భోధ పడింది.”

“ఇంతేనా, లేక కుమారి ఇంకేమైనా అడగాలని తలచారా?”

కాత్యాయని ప్రశ్న రథినికి కుతూహలం కలిగించింది. ఆమె మతం గురించి చర్చించి తెలుసుకోవాలనే ఆశ రథినికి పుట్టింది.

**************        
12 వ ప్రకరణం:

“పిన్నీ! నీవు చేసే ప్రసంగాలపై, అనేకులు అనేకాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నీవు వ్యభిచారం స్త్రీలకు  దోషమే కాదంటావట, నిజమేనా?”

“కుమారీ! అది దోషమన్న మాటను నేను అంగీకరిస్తాను. కాని మీరందరూ అనుకొను విధంగా దోషం కాదని నా మతం.”

“కొంచెం వివరించి చెప్పాలి, నాకు బోధపడడం లేదు.”

“ వ్యభిచరించిన స్త్రీని యమ ధర్మరాజు నరకంలో దండిస్తాడనిన్నీ, ఇహ లోకంలో అది ( వ్యభిచారం) చిత్త శుద్ధికి గొడ్డలిపెట్టు అనిన్నీ మీరందరూ నమ్ముతున్నారు!అది సంఘ నిబంధనాతిక్రమణ దోషమే అవుతుంది”

“ఈ సిద్దాంతాన్ని సాధించడానికి పిన్ని చెప్పే యుక్తులేవి?”

“ స్త్రీ పురుషులు సమాన స్వాతంత్ర్యంతో ‘సమయం’ చేసుకొని వివాహం చేసుకోవడం లేదు! పురుషుడు స్త్రీని వశపరచుకొని ఏలుకోవడమే వివాహం ఫలితమై ఉంది. అందు వలన తన స్త్రీ వ్యభిచరించకుండా నయము వల్లనో లేక భయము వల్లనో కాపాడుకోవడం పురుషుని కర్తవ్యంగా ఉండ వచ్చును. కాని వ్యభిచరించకుండా ఉండ వలసిన భాద్యత స్త్రీకి లేదు! ఆక్రమించ బడిన వ్యక్తీ దాస్య శృంఖలలో నుండి తప్పించుకోవడానికి చూడడం సహజమే కదా! భర్త యందు ప్రేమ వలన భార్య వ్యభిచరించ కుండా ఉండడం వేరే విషయం! ప్రేమించిన ప్రేమించు గాక! ప్రేమించబడ వలసిన భాద్యత ఆమెకు లేదని నేనంటాను...”    

“పిన్నీ! నీ వాద ప్రౌడిమకు సంతోషించాను. కాని నీ సిద్దాంతంలో కొన్ని లోపాలు ఉన్నాయి.”

“చూపండి, సంతోషిస్తాను. రాజకాళమ్మ శ్లాఘించిన భర్తృధారిక విద్యా ప్రతాపాన్ని నాకూ పరీక్షించాలని ఉంది!”

“పురుషులందరూ స్త్రీని వశ పరచుకోవాలనే చూస్తారు. ఆ విషయంలో పతి, ఉప పతి –వీరిద్దరిలో వ్యత్యాసమే లేదు! ఒకని అధీనతలో నుండి దొంగతనంగా తప్పించుకొని, ఇంకొకని అధీనురాలు అవడంలో స్త్రీకి గల లాభం ఏమి? పురుష సుఖమే స్త్రీకి కావాలని అనుకొంటే స్థిరంగా ఒకణ్ణి ప్రేమించి, వానికి అధీనురాలుగా  ఉండడం క్షేమం కాదా? బహు దాసీ కంటె, ఒకనికి మాత్రమే దాసీ ధన్యురాలు కాదా? ఒకనికి అధీనురాలుగాఉండడం ఇష్టం  లేని స్త్రీ నిత్య కన్యకగా ఉండాలి! నిత్య కన్యక కూడా పురుష ప్రేష్యత   లేక ఉండగలదా?తండ్రో, లేక అన్నో, తమ్ముడో, లేక ఎవరో ఒకరు ఆమెను రోధిస్తూనే ఉంటారు.”

కాత్యాయనికి, రథిని వాద సౌష్టవం బోధ పడింది. అందరి లాగు ఆమె దగ్గర బుకాయింపు మాటలు పనికి రావని తెలుసుకొంది. రథిని ప్రతి యుక్తులు చాల నేర్పుగాను, పటిష్టంగాను ఉన్నాయని తలచింది. “తన ఇష్టం వల్ల అధీనురాలు కావడం వేరు. తనను నిర్భంధించి అధీనురాలుగా చేసుకోవడం వేరు! కుమారి ఈ బేధాన్ని గమనించ లేదు! గమనిస్తే నా సిద్దాంతం అవిచాల్యత కుమారికి చక్కగా బోధపడి ఉండును”

“రాక్షస పైశాచముల సంగతి అటు ఉంచు పిన్నీ! అవి ధర్మ వివాహాలని నేను కూడ అంగీకరించను. తక్కిన వివాహాలలో గాంధర్వ ప్రాజాపత్యములు ఉభయుల ఇష్టాన్ని అనుసరించి నడుచుచున్నాయి కదా? వాటిలో నిర్భంధం వల్ల అధీనురాలు అయ్యే పద్ధతి లేదే!”

“కుమారి ఉదాహరించిన  ఆ రెండు వివాహాలు ఇప్పుడు పుస్తకాల లోనే ఉన్నాయి. ఆచరణలో ఏవీ అవి? ప్రాయికంగా ఆచరణలో కనపడేవి రెండే వివాహాలు! ఒకటి  బ్రాహ్మణము, రెండవది ఆసురము. చిన్న నిమిత్త బేధాలను మినహాయిస్తే, నామ బేధమే గాని దైవార్షములు ఈ రెండిట్లో అంతర్భూతాలు కాదగినవే! ఒక అయ్యకు పుట్టింటివారు పిల్లను ఇచ్చి వేస్తారు లేక అమ్మి వేస్తారు. దాన్నే వివాహం అని సంఘం తలుస్తోంది ! అది నిర్బంధ దాస్యం కాక మరేమవుతుంది? బ్రతికిన వానికే కాకుండా, చచ్చిన మగనికి కూడ మనం (స్త్రీలు) భక్తులుగా ఉండాలట!
సహజ బలకల్పిత ధర్మ శాస్త్ర బలములే కాక, ధన బలము కూడ పురుషుల పక్షంలో ఉంది. ప్రాయికంగా మనకు ఆస్తిలో హక్కు లేదు కదా? ‘మీకు మేమింత ముద్ద పెట్టుతున్నాం కాబట్టి, మీరు మాకు నౌకరులై పది ఉండండి.’ అని పురుషులు మనలను బెదిరిస్తుంటారు, వాస్తవమైన స్త్రీ ధర్మం మూల పది పోయింది. పురుషులు మనకు చూపిందే మనకు ధర్మం అవుతూంది! అది పురుశారాధన గాని, భగవదారాధన ఎంత మాత్రం కాదు. తన్ను తానూ ఉద్ధరించుకొనజాలని పురుషుడా మనలను ఉద్ధరిస్తాడు?”

“స్త్రీకి ఒక మగవాడు స్వాభావిక వాంఛను తీర్చడానికి ఆవశ్యకుడై ఉన్నాడు. కాబట్టి పుట్టింటి వారు పిల్లను ఇంకొక అయ్యకు అంటకట్టి తీరాలి! అది కన్యకా ఆవశ్యకత కొరకే గాని తిండి పెట్టజాలక ఇంకొకరికి నౌకరీ చేసుకొని బ్రతకమని కాదు. ఈ విషయంలో పిన్నిది ప్రౌడివాదమే అవుతుంది! పెండ్లాడిన మగవాని తాపత్రయం చూస్తె, భార్య దాస్యం దానికంటే ఏంటో నయమని తెలుస్తుంది! ఒక ఇంట భార్య భర్తకు మాత్రమె దాసి, భర్త కుటుంబం లోని వారికందరికీ దాసుడు! పిన్నీ! పరస్పర సాహయ్యకమే దాస్యమయితే, సంసారంలో దాసులు కాని వారు ఎవరు? సంఘ నిబంధనం సర్వేశ్వరుడు ప్రసాదించిన ధర్మం కాక పోవచ్చును. అయినను సంఘ రక్షణకు అది అవసరం కాదా? పతిమీద భక్తి  గల స్త్రీని రక్షింప జాలక పోవచ్చును! ఆలయంలో ప్రతిష్టితమైన విగ్రహం పట్ల భక్తిగల వారిని ‘శిల’ రక్షించునని ఎవరైనా చెబుతారా? శిలలో భావింపబడిన భగవంతుడే వారిని రక్షించుతాడు! అలాగే పతియండు భావింపబడిన భగవంతుడు స్త్రీని రక్షించుతాడు! పతి  బ్రతికి ఉండగా పతియందు భగవంతుని భావించిన స్త్రీ అభ్యాస వశం చేత, పతి గతించిన పిమ్మట కూడ స్మృతి స్థాపిత పతి రూపంలో భగవంతుని భావింప గలదు!

పతి యందు భగవంతుని భావింప జాలని స్త్రీ పాపాత్మురాలని ఎచ్చట కూడ చెప్పబడలేదు! ఆమతరించడానికి వేరే ధర్మాలు కలవని నేను అంగీకరిస్తాను. పతివ్రతలు  మాత్రం పురుష కల్పిత ధర్మ శాస్త్ర వంచితలే గాని, ప్రయోజనాన్ని పొంద జాలరని నేను అంగీకరించ జాలను!”

“కుమారీ! తమ ప్రతి యుక్తికి నేను మెచ్చుకొన్నాను. ఒక సంగతి నేను కుమారిని అడగవచ్చా?”

“ నీకభ్యంతరం లేదు, పిన్నీ, అడుగు.”

“జార పురుషుని యందు భావింపబడిన భగవంతుడు స్త్రీని తరింప చేయ జాలడా?”

“ పవిత్రంగా ప్రతిష్టింపబడిన శివలింగమందు భగవంతుని భావింపజాలక శిలా సామ్యంచే చాకిబండ యందు భగవంతుని భావింపరాదా అన్నట్లు ఉంది పిన్ని ప్రశ్న! శివలింగ ఆరాధకునికి తన భావనయే కాక, సంఘ భావన కూడ కార్య సిద్ధికి తోడ్పడుతుంది! భావనకు తన స్వతంత్ర శక్తి ఉండేటప్పుడు ఎచ్చట భగవంతుని ధ్యానించినా ఫలం కలుగుతుందని నేను అంగీకరిస్తాను. కాని తన ఆరాధన సంఘంలో విప్లవం  తెచ్చేదిగా ఉండరాదని నా మతం! కార్య సిద్ది ,ఆత్రమే ధర్మ లక్ష్యం కాదు. అది లోక సంగ్రహార్థంగా కూడ ఉండాలి! దాని వల్ల సంఘం కూడ అభివృద్ధిని పొందుతుంది. అధమ పక్షంగా సంఘానికి హాని కాకుండా ఉండాలి.”

రథినీ కాత్యాయనులు ఇట్లు మాట్లాడుకొనుచుండగా సేనాపతి ఇలుస్తున్నారని కబురు వచ్చింది. అంతటితో వారి సంవాదం ముగిసిపోయింది! మరొకమారు తిరుగ కలుసుకొంటానని చెప్పి, రథిని కాత్యాయనిని పంపించి వేసి, తన మాతామహుని శాలకు వెళ్లింది.

*********
13 వ ప్రకరణం:

ఆ సోమవారం నాడు రాత్రి చంద్రసేన నాగేంద్రుని  ఇంట ‘పరంతప సంఘ’ నాయకుల సభ కూడింది. ‘నిశంభు నాగేంద్రుడు’ సభకు అగ్రసనాధిపత్యం వహించాడు.

నిశుంభుడు పాతికేండ్ల యువకుడు. మేఘనాధుని మించిన పరాక్రమ శాలి, కుంభకర్ణుని మించిన బలవంతుడు, రావణుని మించిన ప్రభావ వంతుడు. కాలనేమిని మించిన మాయావి, శత్రు భయంకరుడైనా సర్వాకర్షక ముఖఝురి కలవాడు. తాన్త్రికుడైనా వైదిక రహస్యాలు ఎరింగిన వాడు. క్రూర స్వభావుడైనా మాట తప్పని మనిషి. ఉచ్చ్రుంఖలుడైనా పరనారీ సోదరుడు. దయారహితుడైనా వదాన్యుడు. గర్వితుడైనా పరబాల వేత్త, మహాకాయుడైనా నిరుపమాన లాఘవం కలవాడు. ఆంధ్ర సామ్రాజ్య మందలి నాగులకు అకిరీటనరపతి.  ఆ సభ లోని సభ్యులు తప్ప అతణ్ణి నిశుంభునిగా ఎవ్వరూ ఎరుగరు! ఇతరుల దృష్టిలో అతడు నీలుడనే సాధారణ నాగుడు. నిశుంభుని నామమే నాగులలో అధికారం చెలాయిస్తోంది! అతని రూపం తెలిసిన వారు పరంతపుల కార్య నిర్వాహక సంఘం వారు మాత్రమే! ఇతను మందనాథ పుత్రుడైన కుంజునాథునికి, సుముఖి అనే బ్రహ్మరాక్షసి యందు పుట్టిన వాడు. బ్రాహ్మణునకు రాక్షస స్త్రీయందు పుట్టిన వారు బ్రహ్మరాక్షసులని చెప్పబడుతారు. కాపాలికులైన అనార్య జాతి వారే రాక్షసులు! నిశుంభునిలో తండ్రి వంక నాగరక్తమున్నూ, తల్లి వంక బ్రాహ్మణ రాక్షస జాతి రక్తములున్నూ కలసి ప్రవహిస్తున్నాయి! అతను జనుల దృష్టిలో కౌళిక సులోచనుని దత్త పుత్రుడు. కార్కోటకుడు కుళికుల ఇంట పెరిగాడన్న మాట! జనుల కండ్లు కప్పుటకై అతడు రాజకీయ సేనలో ‘దశపతిగా’ పని చేస్తున్నాడు.

నిశుంభుని కుడి పార్శ్వంలో కర్ణీ సుతుడు భీమనాధుడు, కూర్చొన్నాడు. నీల, భీమనాథులు ఆబాల్య స్నేహితులు. కాలనాథ, మల్లికార్జునులతో భీమనాథునికి స్నేహం కలదు! కాని నీలునితో స్నేహం  కొంచెం మాత్రాతీతంగా ఉంది! నీల భీమనాథులకు మరొక ఆథ్యాత్మిక సంబంధం కూడ కలదు. వీరిద్దరున్నూ, ధవలాక్షికి యోగవిద్యా శిష్యులు! భీమనాథుని వయస్సు ఇరవై రెండేండ్లు.

ఇతనికిని శక్తిధరునిపై భాత్రుప్రీతి , రథినిపై భగినీ ప్రీతి కలదు. కారణమేమంటే, వారిద్దరూ ఇతనితో కలసి కర్ణి ‘చనుబాలు’ పంచుకొన్నారు! అనగా కర్ణి శక్తిధర రథినులకు దాడిగా ఉండేదన్న మాట! ఇతనికి భోగనాథునిపై ద్వేషం అధికం. లీలావతీ దేవిపై జుగుప్స అధికం.భార్యా వశంవదుడు కాబట్టి, రాజుపై ఇతనికి అసంతృప్తి! యితడు దరిద్ర పక్షపాతి. ఎక్కువ పన్నులు భరించలేని ప్రజల మొరను గమనించి ప్రభుత్వంపై క్రోధం వహించి తన ప్రియ స్నేహితుని సంఘంలో చేరాడు. మాయావిద్య ఒక్కటి తక్క, తక్కిన అన్ని విద్యల లోను నిశుంభునితో సమాన ప్రజ్ఞ కలవాడు. కొన్నిట్లో నిశుంభుని మించిన వాడు కూడ. పరంతప సంఘం వారు యాతనిని ‘చోర పరమేశ్వర’ బిరుదంతో గౌరవించారు. పరంతప సంఘంలో చోరుల గుంపునకు ఇతడే నాయకుడు. ఈ  తస్కరాణాం పతి తన బిరుదాన్ని సార్థకం చేసుకొన్నా  చరిత్ర ప్రసిద్ధుడైన దొంగ! యితడు శ్రీమంతుల పాలిటి యముడు. దరిద్రుల పాలిటి తారకమంత్రాధి దేవత! అతడు దొంగలించిన దానిలో సగం పరంతప సంఘానికి ఇస్తాడు. మిగిలిన సగం దరిద్రులకు దానం చేస్తాడు! తానూ బ్రతికేది తల్లి ఉపకార వేతనం వల్లనే! ఇతని దగ్గర నిశుంభుడు నాలుగు షరతులకు ఒప్పుకొని తన  సంఘంలో చేర్చుకో గలిగాడు!

జయించిన పిమ్మట ప్రజల పన్నులను యథాపూర్వ స్థితికి తీసుకొని వచ్చి, ఆంద్ర రాష్ట్రాన్ని కుండినులకే ఇచ్చి వేయాలి! పట్టా మహిషీ పుత్రుడు శక్తిధరుడు సింహాసనాన్ని అధిష్టించాలి! చిత్రకూట పార్వాతీయ రాష్ట్రాలను మాత్రమే తానును, (నిశుంభుడు) ఇరావతియు పంచుకోవచ్చును! శ్రీశైల మహామండలేశ్వరుని జోలికి నాగులు పోకూడదు! ఇవీ షరతులు!! సంగ్రామం అక్కర లేకుండా సంధి కుదిరిన పక్షంలో నిశుంభువు, శక్తిధరాభిషేక భాధ్యతని తాను వహించ నక్కర లేదని భీమనాథుడు అంగీకరించాడు. మహారాజుకు పంపిన సంధి సూత్రాలు కర్ణీ సుతుని పర్యవేక్షణ లోనే జరిగాయి. అస్వతంత్రంగా పార్వాతీయ ప్రాంతాన్ని ఇస్తానని నరపతి ధవళాక్షి ద్వారా పంపిన సందేశం నిశుంభునికి అందింది.

శతపతి శివకీర్తి నిశుంభుని వామ పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అతడుకాష్యప దేవకీర్తి కుమారుడు. గడ్డము, మీసములు పెంచుకొని యోగిలాగా కనబడతాడు. కాని హృదయం హాలాహలంతో నిండి ఉంటుంది. రాజ సేనలో ఇతని తండ్రి దండనాయకునిగా పని చేసి విశేషమైన కీర్తిని సంపాదించాడు. అతని అనంతరం రాజు శివకీర్తిని శతపతిగా నియమించాడు. యితడు శస్త్ర విద్యా గురుకులంలో సుశిక్షితుడేను ! యితడు నాగుల కంటే అతివాది! రహస్య సభలలో ఎల్లప్పుడూ కుండినులతో సంధికి తన అసమ్మతిని చూపుతూంటాడు. కుండినుల పక్షపాతి అయిన భీమనాథుని సంఘంలో చేర్చుకోవడం ఇతనికి ఇష్టం లేదు!

శతపతి శివకీర్తి ప్రక్కన నిశుంభుని పెంపకపు తండ్రియైన సులోచనుడు కూర్చొని ఉన్నాడు. ఇతన్నే సత్యప్రభకు తండ్రిగా అపవాదు కల్పించాడు వీర సింహుడు. కుల యోగిని యైన కాత్యాయనిని ఆరాధించు శాక్తులలో యితడు ఒకదాని వాదు!  కుళికుడనే నాగేంద్రుని వంశస్థుడు కాబట్టి ఇతనికి కౌళిక సులోచానుదని పేరు వచ్చింది. యితడు రాజకీయ సేనలో శతపతిగా ఉన్నాడు.

మూడవ వాడు జంభుడనే  కాపాలికుడు. దొంగల గుంపునకు ఉపాధ్యక్షుడు. వీనికి చొర రాక్షసుడనే బిరుదు కలదు. గదా మల్ల యుద్ధాలలో ఆరి తేరిన దిట్ట! గొప్ప బలశాలి.

నాలుగవ వాడు చంద్రసేనుడు. నాగులలో శ్రీమంతుడు. సులోచన చంద్రసేనులు సమ వయస్కులు.

ఐదవ వాడు పింగాక్షుడు. గొప్ప నాగావీరుడని ప్రసిద్ది. రాజకీయ సేనలో శతపతిగా ఉన్నాడు. అతివాది, నిర్భయుడు.

ఆరవది ఒక స్త్రీ! ఆమె పేరు ‘పర్ణిని’, చంద్ర సేనుని కుమార్తె. రూప చంద్రుడు ఈమెను పొగడి ఉన్నాడు. సంగీత సాహిత్యాలలో అసమాన పాండిత్యం గల యువతి. ‘పర్ణినే’ఇరావతి అని పింగాక్ష, శివకీర్తి, భీమనాథుల నమ్మకం!

ఆ సభలో సంభాషణ ఆరంభమయింది.

“పార్వతీయ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇస్తానని రాజు కబురు పంపాడు. మనం సంధికి ఒప్పుకో వచ్చునా?” అని ప్రశ్నించాడు నిశుంభువు.

“ముందు మనం అడిగిందే చాల తక్కువ. దానికంటె లేశం కూడ తగ్గించ కూడదు.”అని అన్నాడు పింగాక్షుడు.

“దానిని స్వతంత్రంగా ఇచ్చిన మనం అంగీకరించ వచ్చును. అచ్చట మనం ఆరూఢలమైన  పిమ్మట సామ్రాజ్యాన్ని జయించా వచ్చును. చేతిలో ఏమిన్నీ లేకుండానే మనం విప్లవానికి సంసిద్దులుగా ఉన్నాము. ఒక చిన్న ప్రాంతమైనా మనకి ఉంటె చెప్పేదేముంది?” అన్నాడు సులోచనుడు.

 “అది రాజనీతికి సరి పోతుంది. ధర్మానికి విరోధం.నమ్మించి గొంతుక కోయడం మహాపాపం.” అని చెప్పాడు నిశుంభువు.

“మనం ఆ పాటి కాలూనుతే కళింగుల  నైనా జయించి రాజ్య వృద్ధిని చేసుకోవచ్చును కదా?” అని సలహా ఇచ్చాడు సులోచనుడు.

“కళింగ విజయానికి అది తగినంత ప్రదేశం కాదు. ఆంధ్రేశ్వరునితో మనకి సంధి కుడేరు పక్షంలో , ఈ దేశపు నాగుల సహాయం మనకు దుర్ఘటమవుతుంది! సుమారు ఒక లక్షమంది నాగులు మనకి ఇప్పుడు మనకి ఉన్నారు. మనం పా ర్వతీయ ప్రాంతానికి వెళ్లి పొతే వీరిని విడిచె వెల్ల వలసి ఉంటుంది! మందు మనం సూచించిన షరతులకు ఒక అంగుళమైనా తగ్గరాదని నా అభిప్రాయం.” అని ఉపన్యసించాడు శివకీర్తి

“నాకు కూడ షరతుల్ని తగ్గించుకోవడం నచ్చలేదు.” అన్నాడు ముక్తసరిగా చంద్రసేనుడు .

 “సులోచన నాగేంద్రుని మాట బొత్తిగా త్రోసి వేయతగ్గది కాదు. పార్వతీయ ప్రాంతాన్ని స్వతంత్రంగా మనకి ఇచ్చి, ఆంద్ర రాష్ట్రం లోని పన్నులని తగ్గించినట్లయిన, మనం సంధికి ఒప్పుకోవచ్చని నా మతం.”అని అన్నాడు భీమనాథుడు.

“పార్వతీయ ప్రాంతాన్ని నిశుంభు నాగేంద్రునకు ఇచ్చిన , ఇరావతీ కుమారి మాట ఏమిటి?” అని ప్రశ్నించాడు శివకీర్తి.

“ఆమె ఇంకా కన్యకగానే ఉంటుందని నా తలంపు. ఆమె గాని మన నాయకుని పెండ్లాడితే చిక్కు విడి పోతుంది” అని బదులిచ్చాడు భీమనాథుడు.

“ఆమె ఇష్టపడక పొతే?”  అని ప్రశ్నించాడు శివకీర్తి.

“ఆమె అంత  అవివేకురాలుగా ఉండదని నా నమ్మకం. ఒక నాగ కన్యకా ఇంతకంటె అధికుని మగనిగా పొందు తుందా?” భీమనాథుని మాట విని నిశుంభువు మందహాసం చేశాడు.

“మిమ్మల్ని దూతగా పంపేయెడల మీరు ఆమె పాణిని మన నాయకునికి సాధించ గలరా?” అని నవ్వుతూ అడిగింది పర్ణిని.

“అట్టి కార్యానికి దూతలు పనికి రారు సోదరీ! దూతిక కావాలి. నాపై గాని ఆ కార్య భారం పడే పక్షంలో నిన్నే ఆ కార్యానికి నియోగిస్తాను. పట్టిన పని నెరవేర్చడంలో నీకు నేవే సాటి!”

“ఒకవేళ ఇరావతీ నిశుంభువులు దంపతులు అయినా వారికి పార్వతీయ ప్రాంతం చాలదు! పన్నులను తగ్గించు షరతునైనా మనం వదులుకో వచ్చును గాని, చిత్రకూట రాష్ట్రాన్ని మనం ఒదులుకోకూడదు.” అని ఉద్రేకంతో చెప్పాడు శివకీర్తి.

“ రెండు రాష్ట్రాలను మనం వదలి వేయవచ్చును గాని పన్నులను తగ్గించే షరతుని విడవడానికి వీఎలు లేదు” అని క్రోధంతో చెప్పాడు భీమనాథుడు.

“నాగమణీ! నీవేమంటావు?” అని నిశుంభువు పర్ణినిని చూసి ప్రశించాడు. నాగమణి అనేది పర్ణిని ముద్దు పేరు.

“మనకు సర్వం అనుకూలంగానే ఉంది. కాని మన భీమనాథ బాబు భయస్థుడైన సులోచన మామయ్యను సమర్థించడమే కష్టంగా ఉంది. అతడు గాని ఇష్ట పడితే రాజుగారి సూచనని పూర్తిగా తిరస్కరించడమే నా మతం!”

“ నన్ను భయస్థుడని మా నాగమణి చెప్పినా నాకు చింత లేదు. స్వపక్ష విపక్ష బలాలను రెండింటిని మనం సరిగా పరీక్షించాలి కదా? సేనాపతి రనంధరుడు, ఆచార్య విషమ సిద్ది, ఈ ఇద్దరూ భీష్మ ద్రోణుల వంటి వృద్ధులు! ఆరితేరిన యుద్ధ తంత్రజ్ఞులు. రాజు స్వయంగా మహా పరాక్రమ శాలి! కాలనాథ, మల్లికార్జునులు అసాదారణ పరాక్రమ సాహసాలు కల యువకులు! సైన్యమంతా సుషిక్షితంగా ఉంది. మనం ఇంకా కొన్ని వత్సరాలు వృద్ది పొందితే గాని, రాజుగారి సైన్యాన్ని ఎదుర్కొనలేము! ఈ లోపుగా వారు మన సంఘాన్ని బ్రద్దలు కొట్టకుండా ఉంటారా? ఇదంతా బాగా ఆలోచించాలి! పార్వాతీయ ప్రాంతాన్ని స్వతంత్రంగా పుచ్చుకొని మనం సంధి చేసుకొవడమే ఉచితం.” అని సులోచనుడు దీర్ఘంగా ఉపన్యసించాడు.

“శ్రీ శైల ప్రాంతం పోయినప్పటి నుంచి కుంతలేశ్వరుడు, కుండినులపై పగ బట్టి ఉన్నాడు. అతనికి నష్ట దేశం ఇస్తామని వాగ్దానం చేస్తే అతడు తప్పక మనకు సహాయుడు అవుతాడు. అతని సహాయం లభిస్తే చాలు, మనం ఇప్పుడే ఎదుర్కొన వచ్చు!” అన్నాడు శివకీర్తి గడ్డం సవరించుకొంటూ.

నిశుంభువు భీమనాథుని చూసాడు. శివకీర్తి ఉపాయం వాణికి నచ్చింది.

“కౌత్స సత్యకర్మ పరిపాలన మిక్కిలి ప్రజా రంజకంగా వింటున్నాము. కుంతలేశ్వరుని పరిపాలన ఏమీ బాగా లేదని తెలుసు. మనం స్వార్థం కోసం మంచి ప్రభుత్వాన్ని కూలద్రోసి, దాని స్థానే క్రూర ప్రభుత్వాన్ని స్థాపించడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అలాంటి అకార్యంలో నా శస్త్రం ఎప్పుడూ వినియోగ పడదు.” అన్నాడు గంభీరంగా భీమనాథుడు.

భీమనాథుని వచనోపన్యాసం శివకీర్తికి అసహ్యంగా ఉండింది! నిశుంభునికి ఆశా భంగంగా ఉండింది. భీమనాథుడు శ్రీశైల ప్రాంతం పట్ల అంత పట్టుదలగా ఉంటాడని వారు ఉహించి ఉండ లేదు. పన్నులు తగ్గించడంలో అతనికి ఉన్న శ్రద్ధ రాష్ట్రాక్రమణలో లేదని వారు బాగా తెలుసుకో గలిగారు! భీమనాథుని తమ వైపుకు త్రిప్పుకోడానికిన్నీ, ప్రజలను సంతోష పరచాడానికిన్నీ, ఆ షరతుని వారు విధించారు గాని, పన్నుల విషయంలో వారికి ఎత్తి శ్రద్ధా లేదు. వారికి కావలసింది రాజ్యం. భీమనాథుని వంటి పరాక్రమ శాలియైన మిత్రుణ్ణి వదులుకోనూ లేరు, అతని మాటలను పట్టించుకోనూ లేరు. ఇప్పుడు వారు గొప్ప సమస్యలో పడిపోయారు. కొసకు నిశుంభువు ఇట్లా చెప్పాడు.

“ఇప్పుడు మనకు కుంతలేశ్వరుని సహాయం అక్కర లేదు. భీమనాథ బాబు నాకు కోటి కుంతలేశ్వరులతో సమానం! అతనికి ఇష్టం లేని నేను చేయజాలను. అతనితోనూ, పూజ్య ధవలాక్షితోనూ నా కులగురువు  పుత్రుడు శివకీర్తి తోనూ, దీర్ఘంగా ఆలోచించి పంపిన సంధి షరతుల లోంచి నేను ఏదీ తగ్గింపజాలను. రాజుగారు  సూచించిన షరతు నాకు అంగీకర యోగ్యం కాదని ధవలాక్షీ దేవికి తెలియ జేయ వలసిందిగా చంద్ర సేన నాగెంద్రునికి అధికారం ఈయబడింది” అని చెప్పి దీర్ఘ నిట్టూర్పు వదిలాడు నిశుంభు నాగేంద్రుడు.

************
14 వ ప్రకరణము:

అంతట, “నాగమణీ ! నాగమణీ!” అని ఎవరో తలుపు తట్టారు. ఆ కంఠ ధ్వని అందరికీ సుపరిచితమే! ఆమె రాజకాళి అని అందరికిని తెలిసింది.

ఆ సభలో చాలామందికి రాజకాళి పైన పూజ్య భావం ఉంది. నిశుంభువుని అనుజ్ఞ పొంది, జంభుడు తలుపు తీసాడు.

రాజకాళి లోపల ప్రవేశించింది. పర్ణినిచే అమర్చ బడిన ప్రత్యెక ఆసనం మీద కూర్చొని ఆ కూటాన్ని ఛందోబద్ద వాణితో ఈ విధంగా ప్రశ్నించింది రాజకాళి.

“రాణి లీలావతి రాజ్యము చేయ / కోణము నందేమి కూయుచున్నారు?                                                                
మన పక్షపు రథంబు మహిమతో భువిని / చనినట్లుగా నేమి చేయనున్నారు?”

“అమ్మా! ఆ ఉపాయాన్ని మీరే ఉపదేశించాలి.” అన్నాడు శివకీర్తి.

రాజకాళి చందోబద్ధ వాణితో ---

“భూజనుల హితంబు బుద్ధిచే కోరి / రాజమ్మ యోచించే రాజకీయముల                                                               వాటిలో నున్నవి బాటలు నాల్గు / సూటిగా నున్నది సుమ్ము నా బాట,

మీ బాట నున్నది మితిలేని మబ్బు / మా బాట నున్నది మరి జారు బురద,                                                    
మీ బాట మితిలేక మింటికి నెగయు / మా బాట మతి లేక మంటిలో కలియు.”

“అమ్మా! సూటిగా ఉండు మీ బాట ఏది? మాకు బోధించమ్మా!” అన్నా శివకీర్తి మాటకు రాజకాలి తిరిగి ---

“సామమే నే జెప్పు సరియైన బాట / ప్రేమయే దానిలో వెలసిల్లు బురద !                                                            
చంద్ర బింబము నుండి, చక్కెర నుండి / చంద్రాస్య నగవుల చాయల నుండి,

చిన్న పిల్లల ముద్ద్దు చేష్టల నుండి / కన్నా తల్లుల వింత కౌగిళ్ళ నుండి,                                                          
గతి మందమై యుండు గాలుల నుండి / అతి నిర్మలంబైన అంభస్సు నుండి,

మఖవారి మగ్నుల చూపుల నుండి / మఖవాటి బాడెడు మంత్రాల నుండి,                                        
సామరస్యము చదివితి నేను / కోమల యుక్తి కన్గొంటిని నేను.” అన్నది.

“నాస్తికుడైన భోగనాధుని దగ్గర సామోపాయమా? అది మాకు సాధ్యం కాని పని!” అన్నాడు శివకీర్తి.

“కాలకంథుని నెత్తి  కంటిపై నాన / పాలించు భూదేవి పంటపై నాన!                                                          
 తెల్లని సురదంతి తెలుపుపై నాన / నల్లని మేఘాల నలుపుపై నాన!

పూజ్య  బృహస్పతి బుద్దిపై నాన / ప్రాజ్ఞ దేవేంద్రుని బలముపై నాన!                                                          
దివ్యమౌ సూర్యుని దీప్తిపై నాన / భావ్యమౌ భైరవి పదముపై నాన!

కాచిన కొబ్బరి కాయపై నాన / పూచిన మల్లియ పూవుపై నాన!                                              
అంహోయుతుండగు నా భోగనాదు / సింహాసనము పై చేర రానీను!” అంటూ ఈ పాటలను పాడి రాజకాళి తన ఆసనము నుండి లేచింది.

శివకీర్తి లేచి “ అమ్మా! మరి ఎవరితో సంధి?” అని అడిగాడు.

“మహారాజు సుచంద్రునితో” అని రాజకాళి చరచరమని పరిక్రమించింది.

“సరైన మాట!” అని భీమనాధుడు తల ఆడించాడు. రాజకాళి వెళ్లి పోయింది.

నిశుంభువు రాజకాళి మాటను పాటించలేదు. సంధి సూచనను తిరస్కరించే మరొక సారి ఆజ్ఞ ఇచ్చాడు. సభ ముగిసి పోయింది.

***************

Comments

  1. దీని తర్వాతి అధ్యాయం కథ ఏమిటౌ

    ReplyDelete
  2. మిమ్మల్ని గురించి కొంచెం చెప్పండి సార్. వాసిష్ఠ కుటుంబీకులా

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద