Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 8 :బాపు బొమ్మలతో సహా

 14 వ ప్రకరణము:

అంతట, “నాగమణీ ! నాగమణీ!” అని ఎవరో తలుపు తట్టారు. ఆ కంఠ ధ్వని అందరికీ సుపరిచితమే! ఆమె రాజకాళి అని అందరికిని తెలిసింది.

ఆ సభలో చాలామందికి రాజకాళి పైన పూజ్య భావం ఉంది. నిశుంభువుని అనుజ్ఞ పొంది, జంభుడు తలుపు తీసాడు.

రాజకాళి లోపల ప్రవేశించింది. పర్ణినిచే అమర్చ బడిన ప్రత్యెక ఆసనం మీద కూర్చొని ఆ కూటాన్ని ఛందోబద్ద వాణితో ఈ విధంగా ప్రశ్నించింది రాజకాళి.

“రాణి లీలావతి రాజ్యము చేయ / కోణము నందేమి కూయుచున్నారు?                                                                  మన పక్షపు రథంబు మహిమతో భువిని / చనినట్లుగా నేమి చేయనున్నారు?”

“అమ్మా! ఆ ఉపాయాన్ని మీరే ఉపదేశించాలి.” అన్నాడు శివకీర్తి.

రాజకాళి చందోబద్ధ వాణితో ---

“భూజనుల హితంబు బుద్ధిచే కోరి / రాజమ్మ యోచించే రాజకీయముల                                                                వాటిలో నున్నవి బాటలు నాల్గు / సూటిగా నున్నది సుమ్ము నా బాట,

మీ బాట నున్నది మితిలేని మబ్బు / మా బాట నున్నది మరి జారు బురద,                                                     మీ బాట మితిలేక మింటికి నెగయు / మా బాట మతి లేక మంటిలో కలియు.”

“అమ్మా! సూటిగా ఉండు మీ బాట ఏది? మాకు బోధించమ్మా!” అన్నా శివకీర్తి మాటకు రాజకాలి తిరిగి ---

“సామమే నే జెప్పు సరియైన బాట / ప్రేమయే దానిలో వెలసిల్లు బురద !                                                             చంద్ర బింబము నుండి, చక్కెర నుండి / చంద్రాస్య నగవుల చాయల నుండి,

చిన్న పిల్లల ముద్ద్దు చేష్టల నుండి / కన్నా తల్లుల వింత కౌగిళ్ళ నుండి,                                                            గతి మందమై యుండు గాలుల నుండి / అతి నిర్మలంబైన అంభస్సు నుండి,

మఖవారి మగ్నుల చూపుల నుండి / మఖవాటి బాడెడు మంత్రాల నుండి,                                          సామరస్యము చదివితి నేను / కోమల యుక్తి కన్గొంటిని నేను.” అన్నది.

“నాస్తికుడైన భోగనాధుని దగ్గర సామోపాయమా? అది మాకు సాధ్యం కాని పని!” అన్నాడు శివకీర్తి.

“కాలకంథుని నెత్తి  కంటిపై నాన / పాలించు భూదేవి పంటపై నాన!                                                                తెల్లని సురదంతి తెలుపుపై నాన / నల్లని మేఘాల నలుపుపై నాన!

పూజ్య  బృహస్పతి బుద్దిపై నాన / ప్రాజ్ఞ దేవేంద్రుని బలముపై నాన!                                                            దివ్యమౌ సూర్యుని దీప్తిపై నాన / భావ్యమౌ భైరవి పదముపై నాన!

కాచిన కొబ్బరి కాయపై నాన / పూచిన మల్లియ పూవుపై నాన!                                               అంహోయుతుండగు నా భోగనాదు / సింహాసనము పై చేర రానీను!” అంటూ ఈ పాటలను పాడి రాజకాళి తన ఆసనము నుండి లేచింది.

శివకీర్తి లేచి “ అమ్మా! మరి ఎవరితో సంధి?” అని అడిగాడు.

“మహారాజు సుచంద్రునితో” అని రాజకాళి చరచరమని పరిక్రమించింది.

“సరైన మాట!” అని భీమనాధుడు తల ఆడించాడు. రాజకాళి వెళ్లి పోయింది.

నిశుంభువు రాజకాళి మాటను పాటించలేదు. సంధి సూచనను తిరస్కరించే మరొక సారి ఆజ్ఞ ఇచ్చాడు. సభ ముగిసి పోయింది.

***************
పరంతప సంఘం సభ జరిగిన మరుచటి దినం సాయంకాలం రాజకాళి స్త్యప్రభ ఇంటికి వచ్చింది. వచ్చిన రాజకాళిని మర్యాదతో రాబట్టుకొంది సత్యప్రభ. రాజకాళి ఇంటిలోపలికి వెళ్ళకుండా విశాలమైన ఆ ఇంటి అరుగు మీద కూర్చొంది. సత్యప్రభ కూడ ఆమె దగ్గరే కూర్చొని రాజకాళిని ఈ క్రింది విధంగా ప్రశ్నించింది.

“అత్తయ్యా! ఈ రోజున నిన్ను ఒక మాట అడగుతాను. స్పష్టమైన భాషలో నాకు బదులు చెప్తావా?”

“అది స్పష్టమో, అస్పష్టమో నాకు తెలియదు. నాకు తెలిసిన భాషలో మాట్లాడుతాను.”

“సరే! అట్లాగే కానీ! మీ తండ్రి క గ చ జ బాబు ఎవరు అత్తయ్యా?”

“సత్యా! వైజయంతి అత్తయ్యగారింటి అరుగుపై పడుకోవడానికి వెళ్లాను. మరదలు భానుమతి నన్ను రాబట్టుకోలేదు. సేనాపతి గారి ఇంటికి వెళ్లాను. సావిడిలో ఎవరూ పరుపు వేసి ఉంచలేదు. రథినీ కుమారి తాతతో ఏమో రాజకార్యాలు మాట్లాడుతోంది కాబోలు! అందు వలన నేను మా వదిన గారింటికి వచ్చేసాను.”

“అత్తయ్యా! మా ఇంట పరుపు వేస్తానంటే ఒప్పుకోవు! సేనాపతి గారి ఇంట పరుపు వెయ లేదని వచ్చేశావు, నీ విచిత్ర చర్య నాకు అర్థం కావడం లేదు?”

“ఇది నా పుట్టిల్లే పిల్లా! మా అన్నయ్య సత్యరథ బాబు వేయించిన చల్లని అరుగు నాకు వేయి పరుపుల మెత్తదనం ఇస్తుంది.”

“సరేగాని, అత్తయ్యా! నా ప్రశ్నకు ఇదేనా సమాధానం?”

“ ఏం ప్రశ్న సత్యా?”

“ అదే! మీ తండ్రి క గ చ జ బాబు ఎవరు?”

“సత్యా! ఇదీ తెలీదా? కనుపాపలో నుండు క గ చ జ బాబు!”

“ అంటే వివరంగా చెప్పు అత్తాయ్యా !”

“ కకారుడు, గకారుడు, చకారుడు, జకారుడు వీరు నలుగురు కలిసిన సమిష్టికి క గ చ జ బాబు అని అర్థం.”

“అలా అయితే మీ అమ్మకు నలుగురు భర్తలా?”

“మా అమ్మ భర్త ఒకడే! వాని  పేరు గకారుడు. కకారుడు మీ నాయనమ్మ సిద్దేశ్వరి పెనిమిటి. చకారుడు అక్షోభ్య ముని తల్లికి మగడు. జకారుడు కర్ణికి రమణుడు. ఈ ముగ్గురుకి నామ భేదమే గాని, వ్యక్తి  భేదం లేదు సుమా!”

“అక్షోభ్య భీమనాథులు నా పిన తండ్రులా? ఆశ్చర్యాన్ని వింటున్నాను!”

“ మరొక ఆశ్చర్యాన్ని కూడ విను. శాంతిసేన భర్త ఆంగిరస విమలుడును, నేనున్నూ ఒక తల్లి పిల్లలం. అతడు గకారుని కుమారుడు. అతడు నీకు మరొక పినతండ్రి. ఇట్లు సత్యరథ విమలులు నా అన్నలు!”

“విమలుని గురించి సత్యప్రభకు ఎన్నో సంగతులు తెలుసు. కాని అతడు తనను పెంచిన సత్యరథుని  తమ్ముడని తెలియదు! తన తల్లికి (పెంచిన) కూడ విమలుని పరిచయం ఉన్నట్లు వింది. ఆమెకు కూడ ఈ రహస్యం తెలిసి ఉండదు! ఉన్నచో తనతో చెప్పకుండా ఉండదు.సత్యప్రభ ఆశ్చర్య సంభ్రమాలతో ఇలా పలికింది.”

“ అత్తయ్యా! మీ తండ్రి గాకారుడు ఆంగీరస గణదాసా? చిత్రకూట రాష్ట్ర పు నందాపురంలో సుప్రసిద్ధుడై వెలసిన గణదాసా గకారుడు?” మా తాత కంకోలుని అపర వేషమా గణదాసు! మేఘస్వామి భట్టారకుని అల్లుడు విమలుడు నీకు సాక్షాత్తు సోదరుడా?”

“అవునే పిల్లా! కంకోలుడే గణదాసు. విమలుడు నాకు సాక్షాత్తు సోదరుడే!”

“గణదాసుకి వేరే సంతానం ఉందా?”

“గణదాసు మొదటి బిడ్డ విమలుడు. రెండవది నిర్మల. ఆ పిల్ల చిన్న తనం లోనే వరదల పాలు అయింది. మా తల్లి వనదుర్గ, మా తండ్రి ఇద్దరూ ఆ పిల్ల నష్టురాలై పోయిందని తలచారు! మా తల్లి తన జీవిత కాలంలో ఆ పిల్లను చూడలేదు. మా అన్నా విమలుడు కూడ ఇది వరకు కనిపెట్ట ఉండలేదు. విజాతీయుల గృహంలో అజ్ఞానాంధ కారంలో మునిగి ఉండిన ఆ పిల్లను కొసకు జటాముని కనిపెట్టి వెలుతురులో వేసాడు. ఆవిడే ఇప్పుడు నీకు ఎదురుగా మాట్లాడుతూంది.”

“ అత్తయ్యా! మా కుటుంబానికి ఈ రోజు గొప్ప నష్ట ద్రవ్య లాబం అయింది. ఈ విషయం అమ్మతో చెప్పడానికి అనుజ్ఞ ఇస్తావా?”

“చెప్పుకోవే , అభ్యంతరం లేదు.”

“ విమలబాబు కనిపిస్తే ఈ విషయం చెప్పవచ్చా?”

“ చెప్పుకో, నాకేం భయమా?”

“ సత్యప్రభ కంకోలుడే జతామిని అని ముందే గ్రహించింది. స్పష్టార్థం తిరిగి రాజకాళిని ఇట్లు ప్రశ్నించింది.”

“ అత్తయ్యా! జటాముని ఎవరు?”

"జటాముని తెలియదూ? వాడే జకారుడు. అతడు నీ తాత! నా తండ్రి, దక్షిణాపథం లోని యోగి బృందానికి అంతటికిని గురువు.”

“ అత్తయ్యా ! నేను ఇప్పుడు రథినీ కుమారికన్నా గొప్పదాన్నని గర్విస్తున్నాను. భగవాన్ జటాముని నా తాతా?”

“అవును సాక్షాత్తు నీ తాతే!”

“అత్తయ్యా! చకారుడు ఎవరు?”

“ సంస్కృత శ్లోక పాదాలను పూరించు మహానుభావుడు. పాత పుస్తకాలలో నిరర్తకుడే అయినా, ఈ కాలం లోని కవులు వాడిని సముచ్చయార్థంలో తరుచుగా ఉపయోగిస్తూ ఉంటారు.”

“భాష లోని చకారును గురించి నేను అడగలేదు అత్తయ్యా! క గ చ జ బాబు లోని చకారుని గురించి అడిగాను.”

“అక్షోభ్య ముని తన తన తండ్రిని గురించి నీకు చెప్పలేదా?”

“తన అసలు పేరు సోమదత్తుడనిన్నీ భగవాన్ జటాముని తన గురువు అనిన్నీ చెప్పారు.”

“ అతని తండ్రి పేరు వైరూప చక్రధరుడు. రాథీతర కంకోలుడే తన భార్య గతించిన పిమ్మట, ఆంగీరస గణదాసుగా మారాడు. అంగీరస గణదాసే తన రమణి  అస్తమించిన తరువాత విరూప చక్రధరుడు అయ్యాడు. విరూప చక్రధరుడే  తన ప్రేయసి మరణించిన తరువాత పేరులన్నిటినీ విడిచిన పెను జడధారి అయ్యాడు. అతన్నే జటాముని అని అందరూ వ్యవహరిస్తారు. అతని ఏకరాత్ర కళత్రమే కర్ణి. ఒకసారి ఆ మహాపురుషునికి కోరి శరీరమర్పించిన కర్ణి మరెన్నడూ  ఎచ్చట కూడ ఎంగిలి పడలేదు! లోకాపవాదాన్ని లక్ష్య పెట్టక, రుషి సేవా ఫలితమైన తన గర్భాన్ని దాచుకోకుండా  లోకోత్తర పరాక్రముడైన భీమనాథుని కనింది. తండ్రి ఆమెను బహిష్కరించాడు.

స్వసంఘ బహిష్కృతు రాలు అయిన ఆ నాగాంగనను కరుణావతి అయిన మహారాజ్ఞి చారుమతీ దేవి ఆశ్రయం ఇచ్చి కాపాడింది! మా తల్లుల్లో ఆమే ఇప్పుడు మిగిలి ఉంది. ఇప్పుడా తల్లీ కొడుకులను నాగులు నెత్తిపై పెట్టుకొని పూజిస్తున్నారు! ఆమెపై ప్రయోగించిన బహిష్కారాస్త్రాన్ని సంఘం వారు ఉపసంహరించుకొన్నారు. ఆమె మాత్రం ఎవరినీ అంటకుండా ప్రత్యేకంగా ఉంది.”

“అత్తయ్యా! ఆమెను ఒకరాత్రి అనుగ్రహించిన మహా పురుషుడు జటామునే అని తెలుసుకొందా?”

“పెంకి పిల్లవే సత్యా నువ్వు! నీకు అన్ని భోగట్టాలు కావాలి. కర్ణికి తెలుసు! కాని ఆ సంగతిని ఆమె ఎవరికీ చెప్పలేదు. నాకు ఈ విషయాన్ని నా తండ్రే చెప్పాడు.”

“చక్రధరునికి వేరు  పిల్లలు కలరా?”

“ ఇద్దరు ఆడ పిల్లలు కలరు. పెద్దది సుముఖి. ఆమె బ్రాహ్మణ వేషధారి అయిన ఒక నాగునిచే వంచించబడి ఒక కొడుకుని కనింది. వాడేనమ్మా ఇప్పుడు పరంతప సంఘాన్ని నడిపిస్తున్నాడు!!”

ఈ వార్త వినగానే సత్యప్రభ శరీరం కంపించింది.

“ఏమే, పిల్లా! వణికి పోతున్నావు? భయపడ వద్దు.భగవాన్ జటాముని ఆకాశ గమనాది సిద్ధులు పొందిన మహా సిద్ధుడు. మీ తీక్ష్ణ మైన కత్తులను బందు కలహం లోకి దింపడు. ఒకవేళ పరోక్షంలో కించిత్తు రక్తం చిందినా మహాముని అడ్డు వచ్చి శాంతిని స్థాపిస్తాడు.”

“అత్తయ్యా! సుముఖి ఏమై  పోయింది?”

“ బ్రతికే ఉంది. ఆమె ఉనికి జటామునికి  తెలుసు.”

“ నీకు తెలియదా?”

“ ఊహా మాత్రంగా తెలుసుననుకో! ఆ మాత్రం ఊహ నీకూ ఉంది.”

“ఉహించాను, ఇప్పుడు....”

“ సత్యప్రభ నోటికి తన హస్త తలాన్ని నొక్కి పెట్టి, “ దుడుసు నాగమ్మా! బయటకి చెప్పకు. నీ హృదయ పేటికలోనే ఉండనీ!” అంది రాజకాళి.”

“అత్తయ్యా! మరొక విషయం..”

“అడగవమ్మా , అడుగు ఈ రోజు నేను నీదానిని అయిపోయాను.”

“రాథీతరుడైన మీ తండ్రి ఆంగీరసుడనిన్నీ, వైరూపుడనిన్నీ,రెండు సార్లు గోత్ర నామాలు మార్చుకోవడానికి కారణం ? అతనికి అంత  గోప్యం ఎందుకో?”

“ ఆపద్ధర్మాన్ని ఉద్దేశించి ఒక గొప్ప ఇంటి విధవాంగనను గుప్తంగా వివాహమాడ వలసి వచ్చింది! వివాహమైన తరువాత ఈ రాజధానిని వదలి, వారు వెళ్లి పోయారు. ఆ రహస్యాన్ని కాపాడడానికి పేర్లు మార్చుకో వలసి వచ్చింది. పేర్లు మారినప్పుడు గోత్ర నామాలూ మారాయి! రథీతరులు  అంగిరోగణం లోని వారే కదా! మా తల్లి పోయిన తరువాత అతను పూర్వ నామాన్నే దరించ వలసింది! కాని మరొక చెడ్డ లంపటం తటస్తించినందువల్ల వేరు గోత్ర నామాన్ని పెట్టుకో వలసి వచ్చింది. అతని మూడవ భార్య ఈ కాలంలో బ్రాహ్మణులు పెండ్లాడ తగిన జాతిలో పుట్టలేదు! ఆమె కాపాలిక జాతికి చెందిన యువతి. వారినే మన పూర్వీకులు రాక్షసులని చెప్పేవారు! ఆవిడ పేరు భైరవి! ఆమెతో కాపురం చేస్తున్నప్పుడే విరూప చక్రధరునిగా మారిపోయాడు మా తండ్రి! విరూపులు కూడ రథీతర గణం లోని వారే కదా! విరూప రుషే రథీతరులకు మూల పురుషుడు.”

“అక్షోభ్య ముని బ్రహ్మ రాక్షసుడా?” సంభ్రమంతో అడిగింది సత్యప్రభ.

“ భయపదకే సత్యా! అతడు బ్రహ్మరాక్షసుడే అయినా, కాపాలికుల క్రూర గుణాలు అతనికి అబ్బలేదు.”

‘ అనంతరం –వనదుర్గ పూర్వ నామం ఏమిటి? నిర్మలా అపరాజితలకు పెండ్లి జరిగిందా లేదా? వారికి పిల్లలు ఉన్నారా?’—ఇత్యాది ప్రశ్నలు అడగాలని తలచింది సత్యప్రభ. కాని రాజకాళి పాత పాడ నారంభించింది.

“అండంబులో నుండు  అచ్చ దెయ్యంబు / పిండం బులో నుండు పిచ్చి పుల్లయ్య,                                                   కుండంబులో నుండు కుంభోధరుండు / కాండంబులో నుండు కామేశ్వరమ్మ,

 శ్లోకంబులో నుండు లోకాల యవ్వ / శోకంబులో నుదు శుభాదేవి అక్క,                                                     వర్షంబులో నుండు వజ్రాల దేవి / హర్షంబులో నుండు అంభోజ హస్త,

మన చూపులో నుండు మకరధ్వజుండు / కను పాపలో నుండు కగచజ బాబు1!”

16 వ ప్రకరణము:

 సుచంద్ర భట్టారకుని రాజ్యారంభ కాలంలో సుదర్శునుడనే  సుప్రసిద్ధ బ్రాహ్మణ వైద్యుడు కాలకేశి అనే తన భార్యతోగూడ ఇంద్ర తీర్థమనే గ్రామంలో   సుఖ జీవనం చేస్తూ ఉండేవాడు. అతడు ఒకనాడు తెల్లవారు ఝామున వీధి తలుపు తీసి చూసే సరికి, వీధి అరుగు మీద ఒక స్త్రీ శవం ఉంది. ఆ శవం ప్రక్కన నిద్రిస్తున్న ఆరు మాసాల ప్రాయం గల మగ శిశువు ఉంది.

ఆ స్త్రీ రూప వేషాలను బట్టి ఒక భూసురాంగనగా తలచాడు. స్త్రీ శవాన్ని పరీక్షించి పంచాయితీదార్ల తీర్మానంపై సుదర్శన పురస్సరులైన గ్రామస్తులు దహనం కావించారు. ఆమె ఒంటి మీద ఆభరణాలను, ఆమె మొలలో పైట కొంగులో ముడి కట్టుకొని దాచుకొన్న జాబును  సుదర్శనుడు తీసి ఆమె జ్ఞాపకార్థం జాగ్రత్త చేశాడు. ఆ జాబులో ఈ క్రింది విధంగా వ్రాయబడి ఉంది.

“ప్రేయసీ! పిల్లవానితో గూడ శ్రీకాకుళ  నగరికి వచ్చి వేయుము. నేను నిన్ను విడిచి వెళ్ళిన వాణ్ణి తిన్నగా ఇక్కడకే వచ్చాను. నీవు మొదట నగరం ధర్మశాలకు వచ్చి బస చేయుము. ఏ ఇల్లూ వెతక నక్కర లేదు. నేను ప్రతిరోజూ ధర్మశాలకు వచ్చి నీ రాకకు ఎదురు చూస్తూ ఉంటాను. కాబట్టి నిన్ను నేనే స్వయంగా ధర్మశాలలో కలుసుకో గలుగుతాను. ఇంద్ర తీర్థం దగ్గర నది దాటు. అచ్చట అన్ని వేళలా పడవ ఉంటుంది. కలుసుకొన్న  తరువాత సమస్తం మాట్లాడుకోవచ్చును. ........... కౌ.సు. వ్రాలు.  సుదర్శనుడు ఆ పిల్లవాన్ని పెంచుటకై  తన భార్య చేతికి ఇచ్చాడు.

ఆమె మిక్కిలి వాత్సల్యంతో పిల్లవాన్ని పెంచింది. ఆ పిల్లవానికి సుదర్షునుడు ‘కాలనాథుడు’ అని పేరు పెట్టాడు. జాబులో సంతకం చేసిన కౌ.సు. ఎవరో కనుక్కోవడానికి సుదర్శునుడు ప్రయత్నించాడు. మూడు సంవత్సరాలు దొర్లి పోయాయి. కాలకేషి సుదర్శునిని వల్ల ‘ధరణి’ అనే కుమార్తెను కన్నది. ధరణి పుట్టిన కొలది రోజులలో సుదర్శునుడు నిండుగా ప్రవహిస్తున్న కృష్ణా నదిలో ఈదుతూ బలవత్తరమైన సుడిలో తగుల్కొని ఆ మహానదిలో మరణించాడు. భర్త మరణ వార్తా వినగానే కాలకేశి మంచం పట్టింది. ఆ జబ్బు ఆ సాధ్వి అవసానాన్ని చూసింది. ఆమె తన అవసాన కాలంలో గ్రామ పెద్దలను పిలిపించి తన భర్త ఆస్తిలో సగం ధరణికిన్నీ,  సగం కాలనాథునికిన్నీ ఇప్పించమని వేడుకొంది. కాలకేశి  అంత్య క్రియల్ని ఇంద్ర తీర్థ వాసులే చేశారు.                                                                                      

అనాథలై పోయిన ధరణీ కాలనాథులను పొరుగుంటి బ్రాహ్మణ కుటుంబం ఆదరించి ఒక మాసం పెంచారు. శ్రీకాకుళ నగరిలో  నుండిన వారి (శిశువుల) బంధువులకు అన్ని సంగతులు వివరంగా వ్రాసి పంపాడు, ఇంద్ర తీర్థపు పెత్తనదారు.  కాలకేశి చెల్లెలు నీలకేశిన్నీ, సుదర్శునుని పిత్రువ్య పుత్రుడు ప్రమతిన్ని తమ కుటుంబాలతో ఇంద్ర తీర్థం వెళ్లి, ఆ పిల్లలను శ్రీకాకులానికి తీసుకొని వచ్చేసారు.మగపిల్లవాడైన కాలనాతున్ని ప్రమతి పెంపకానికి తీసుకొన్నాడు. సుదర్శనుని ఆస్తి మొత్తం పదివేల కార్షాపణాలు (రూపాయలు) నీలకేశి భర్త పతంగావధాని, కాలనాథుని ఆస్తికి ప్రమతి ధర్మకర్తలు అయ్యారు.

మన కథా కాలానికి రెండు సంవత్సరాల క్రిందట ప్రమతి కాలనాథుని సొత్తు తాలూకు వడ్డీని పెట్టి మంచి ఇంటిని కొని,  ప్రౌడుడైన కాలనాథుని స్వతంత్రంగా జీవించడానికి పంపించి వేశాడు.అసలు అయిదు వేలు చేతికి ఇచ్చే పంపాడు. పిల్లవాని సంరక్షణ క్రింద అతడేమిన్నీ తీసుకో లేదు. వేరుపరచడానికి కారణముంది. ప్రమతి భోగనాథునికి గురువు గాను, అంతరంగ మంత్రి గాను వ్యవహరిస్తున్నాడు. కాలనాథుడు భోగానాథునికి ఇష్టుడు కాడు! ఆ కారణం చేత కాలనాథుని వేరే పంపడానికి నిశ్చయించాడు ప్రమతి.

ఇప్పుడు కాలనాథుడు మంచి ప్రౌడుడయిన యువకుడు.అతడు ఆచార్య విషమ సిద్ది గురుకులంలో సర్వాయుధ విద్యల లోను సుశిక్షుతుడై ఆంద్ర సామ్రాజ్య వీర వర్గంలో మొదటి శ్రేణి యందు వెలుగుతున్నాడు. ఆచార్య భవనంది గురుకులంలో ఉభయ భాషా ప్రవీణత సంపాదించి, కామ్కూల యోగ శాస్త్రాన్ని అభ్యసించి, సామ్రాజ్యం లోని మేధావులలో అగ్రగణ్యుడై  కీర్తింపబడుతున్నాడు. ఆ కాలంలో సత్యరథుని తండ్రి కంకోల భట్టాచార్యునిచే (జటాముని) రచింప బడిన యోగ శాస్త్రం, పఠన పాఠనంలో ఉండింది.

 అప్పుడప్పుడు నీల భీమనాథులతో కలసి ధవళాక్షి చేయు యోగావిద్యోపన్యాసాలను వినడంలో పాల్గొనేవాడు. రాజకాళి మీద అతనికి యోగ సిద్దురాలని నమ్మకం. అతడు కృత విద్యుడే కాదు, కార్య సాధకుడు కూడ! అతడు ఉద్రేకవంతు డైన వక్త!  ప్రాప్త కాలజ్ఞుడైన సాహసి! నిరాయుధుడై సింహ వ్యాఘ్రాది మృగాలను డీకొనగల సాహసి! ఆకర్షుడగు రూపసి! ఉచ్చ్రుంఖల యువక సహవాసి అయినా, దుర్వ్యసన వర్జితుడు! స్నేహితులను తన ఆత్మ కంటే అధికంగా ప్రేమించే స్వభావం కలవాడు! నీవు అని అంటే రక్షణకు నడుము కట్టే సరళ స్వభావుడు!. పగబట్టితే హతమార్చే నిరంకుశుడు! యితడు ఇప్పుడు రాజకీయ సేనలో శతపతిగా  పని చేస్తున్నాడు. పెంచిన తండ్రి నుండి వేరు పడినప్పటి మొదలు తన అసలు తల్లి తడ్రులను గురించి ఏంటో శోధించి, కొసకు ఇట్లు కొన్ని విషయాలు కనిపెట్టాడు.

తన తల్లి బ్రాహ్మణ వనిత, తన తండ్రి ఒక నాగుడు ! అతని సపూర్ణ నామం కౌళిక సులోచనుడు! శ్యామలా సులోచానులు ఇంద్రతీర్థ గ్రామంలో వసిస్తూ వచ్చారు. శ్యామల బ్రాహ్మణ కన్య అయినా రాగాతిషయం చేత, ప్రతి లోమముగా నాగును వివాహం చేసుకొని స్వకుల భ్రష్ట అయింది! తానూ షాన్మాసిక శిశువుగా ఉన్నాపుడు సులోచనుడు గ్రామాంతరం వెళ్ళిన వాడు శ్రీకాకుళ నగరానని చేరాడు. అప్పుడు నగరిలో దసరా పండుగలు వైభవంగా జరుగుతున్నాయి! అనేక స్థలాల నుండి జనులు గుంపులు గుంపులుగా వచ్చారు. సులోచనుడు ఇంద్ర తీర్థం నుండి వచ్చినట్టి తనకి తెలిసిన చాకలివాని చేత ఓక్ జాబు ఇచ్చి, తన భార్యకు ఇమ్మని చెప్పి పంపాడు! ఆ జాబుని ఒక బ్రాహ్మణ లేఖకుని చేత వ్రాయించి తానె పొడి అక్షరాలతో సంతకం పెట్టాడు! ఉత్సవం చూసుకొని మరలిన చాకలి ఆ జాబును శ్యామల చేతికి ఇచ్చాడు.

శ్యామల ఆ జాబును చదివించుకొని తన శిశువుతో గూడ ఇంద్ర తీర్థం విడిచి బయలు దేరింది.ఆమె ఇంద్ర తీర్థ గ్రామంలో సుదర్శునుని వీధి అరుగు మీద పడుకొని ఆకస్మికంగా హృదయ చలనం ఆగి చనిపోయింది! సులోచనుడు శ్యామల చనిపోయిన కొలది రోజులలో ఒక పడవ ఇంద్ర తీర్థం దగ్గర మునిగి పోయి, చాలామంది ప్రయాణీకులు చనిపోయారని, వారిలో ఒక తల్లి పిల్లవాడు ఉన్నారని తెలుసుకొన్నాడు. ఈ వార్తని బట్టి తన భార్యా పిల్లవాడు కృష్ణలో మునిగి చనిపోయారని నిశ్చయించుకొన్నాడు. ఇంతలో సులోచనునికి రాజుగారి సేనలో ఉద్యోగం దొరికింది. ఒక అనగా కన్యకా వానీ వరించింది. ఆ సంతోషంలో అతడు తన పాత భార్యా పుత్రులను తన తలంపు లోంచి నెట్టివేసాడు. పిమ్మట ఆ విషయం గురించి అతను తలపెట్ట లేదు!

కాలనాథుని పరిశోధన ఈ విధంగా ముగిసింది ! సులోచనుడు కాలనాథుడు తన ప్రథమ భార్యా పుత్రుడని కనుగొన్నాడు, వెంటనే అతడు కాలనాథుని వద్దకు వచ్చి, నీవు పుట్టిన కులములో చేరి దానికి వన్నె తెమ్మని
 వేడుకొన్నాడు. ప్రమతి దానికి విఘ్నంగా నిలిచాడు! ప్రమతి సులోచనుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. కాలనాథుడు సులోచనున్ని చూసి ఇలాగన్నాడు.

“ఇపుడు నేను కాశ్యప సుదర్శన బాబుకి కృత్రిమ పుత్రునిగా ఉన్నాను. ప్రమతి బాబు నాకు యథావిధిగా బ్రహ్మోపదేశం చేసి, సంస్కరించాడు ! నేను జనకునికే పుత్రున్ని అవుతానో, లేక పోషకునికే పుత్రున్ని అవుతానో ఆ సంగతిని ధర్మాసనం నిర్ణయించ వలసినది. అందు వలన నన్ను మీ పుత్రునిగా ప్రకటింప గోరుతూ మహాన్యాయ  స్థానానికి విన్నపం పంపుకోండి.

మీ ఇద్దరి తాలూకు వాద ప్రతివాదనలను  విని ధర్మాసనం ఎత్తి నిర్ణయం చేసినా నేను దానికి బద్దున్ని  అవుతాను.”కాలనాథుని సూచన ప్రకారం సులోచనుడు మహాన్యాయ స్థానానికి విన్నపం పంపుకొన్నాడు.

ప్రమతిప్రతి విజ్ఞప్తిని దాఖలు చేసాడు. కాలనాథుడు వాది , ప్రతివాదులలో ఎవరి తోనూ చేరకుండా మధ్యస్తున్నిగా ఉంది ధర్మాసన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వ్రాసి పంపుకొన్నాడు. ప్రాడ్వివాక శివదత్తుడు వ్యాజ్యాన్ని విచారణ చేసాడు. ఉభయ పక్షాల విచారణ ఆదివారం నాటికే ముగిసి పోయింది.  ఇంకా తీర్పు చెప్పలేదు. ఆ  దీర్ఘాలోచనాపరుడైన తీర్పు చెప్పక కాలనాధున్ని ఈ విషయంలో ఒక ముఖ్య ప్రశ్న గురించి ఆఖరి సాక్ష్యం కోరుతూ బుధవారం నాడు ప్రాతః కాలానికి ఒక సూచనా పత్రం (నోటీసు)  పంపించాడు. సులోచనుని జనకునిగా నీ అంతరాత్మ చెబుతోందో లేదో ఆ సంగతిని గురించి సాక్ష్యం చెప్పడానికి మరునాడు గురువారం పూర్వాహ్ణం తన ధర్మాసనమునకు హాజరు కావాలని దానిలో ఉన్నది.

ఇట్లు న్యాయస్థానం వారిచే కాలనాథుడు తీర్పు ముందు ఆఖరి సాక్షిగా కోరబడ్డాడు! ఈ సమాచారం ఇరు పక్షాల వారికీ తెలిసిపోయింది! అంత  మాత్రంతో ఊరకుండ లేదు! పట్టణంలోని  అనేక ప్రముఖ వర్గాల వారికి కూడ తెలిసింది! ఈ వ్యాజ్యపు పర్యవసానం ఎట్లుంటున్దో అని కనిపెడుతున్న కాణ్వ శుకనాశునికి ఈ సూచనా పత్ర  భోగట్టా తెలియడమే ఇంత  వ్యాప్తికి కారణం అయింది.

*****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద