Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ-10 :బాపు వేసిన బొమ్మలతో సహా

 21 వ ప్రకరణము:
ధరణిని తన ఇంటికితెచ్చినరోజు రాత్రి కాలనాథుడు సత్య ప్రభను చూచుటకై చంపావతి ఇంటికి వెళ్ళాడు. సత్య ప్రభ తన గదిలో ఉన్నది. వారిద్దరును కూర్చొన్నారు. సత్యప్రభే మాట్లాడింది. “బావగారూ! కొసకు మీరు కశ్యపుల లోనే స్థిరపడి పోయారు! నా సంతోషానికి మేరలేదు”

 ‘బావగారూ!అన్న సంబోధన కాలనాథుని చెవుల్లో నూతనంగా పడింది! అనేక పర్యాయాలు తాను సత్య ప్రభను కలసుకోవడానికి వెళ్ళాడు. ఆమె తనను ఈవిధంగా సంబోధించడం ఇదే మొదటి సారి! అతని మనస్సులో అనేక ఊహలు తరంగాల వలె దొర్లిపోయాయి.

“మీరు ఆలోచించు విషయం నాకు అవగతమయింది. మీరు నాకు వరుసకు బావగారు అవుతారు! కాబట్టి అలా సంబోధించాను.” అని సత్యప్రభ అతని ఊహాగానానికి ముగింపు చెప్పింది.

“అలాగా! ఆ వరుస క్రమాన్ని వినగోరుతున్నాను.” ఉత్సాహం వెలిబుచ్చాడు కాలనాథుడు.

“వినండి! మీతండ్రిగారు నాకు మేనమామ వరుస.” అని నవ్వింది సత్యప్రభ.

“అంటే నా పెంపకపు తండ్రి కాశ్యప సుదర్శన బాబు నీకు మేనమామ అన్నమాట!”

“అది చాల దూరమైన సంబంధం! నా పెంపకపు తల్లి కాశ్యపి, తద్వారా మీరన్న డొంక తిరుగుడు సంబధం సిద్దిస్తుంది. కాని నేను చెప్పేది సూటిగా ఉన్న సంబంధం.”

“వివరంగా చెప్పితే సంతోషిస్తాను.”     “రాజకాళమ్మ  పాటలు విన్నారా?”

“ఆ! విన్నాను.”  

“నా అభిప్రాయంలో రాజకాళమ్మే మీ తల్లి! రాజకాళమ్మ నా తండ్రికి చెల్లెలు! ఇప్పుడు బోధపడిందా?”

కాలనాథునికి ఈ విషయం చాల ఆందోళన కలుగ జేసింది. దానితో పాటు ఏదో ఉత్సాహం కూడ ఉదయించింది! ఇన్ని రోజులుగా ఉంది పోయిన సమస్య ఈనాడు పరిష్కృతమై పోతుందని సంతోషించాడు. ఇల్లా అన్నాడు.      “

సత్యప్రభా! అలా అయితే నాతండ్రి ఎవరో నీకు తెలిసిందా?”

“బహిరంగ సభలో రాజకాళమ్మే చెప్పింది. ‘నా రాజు నరమౌళి నా చిన్ని మగడు’అని!”

“అది వేదాంత పరమైన వాక్కు అయి ఉంటుందేమో?”

“బావగారూ! అది వేదాంత పరం కానేరదు.చాల పాటల్లో ఆ విషయాన్నే ప్రతిపాదించింది సిద్ధ కవీశ్వరి! రథినీ కుమారి కూడ నా అభిప్రాయంతో ఏకీభవించింది. రాజకుమారి బుద్ది మీ కత్తికంటే పదునైనది! ఆమె ఊహకు అందని విషయం లేదు!”

“అయితే సత్యప్రభా! నేను రాజపుత్రున్ణా ! నాకేమో భయంగాను, సంకోచంగాను ఉంది!”

“బావగారూ! నాకూ భయం గాను, సిగ్గుగాను ఉంది!”         “నీకెందుకు  భయం సిగ్గూను?”

“మీ అంతస్తు పెరిగింది కాబట్టి! నా బోటి స్త్రీ మీ ఎదుట చనువుగా నిలవడానికి భయమున్ను, ఏదో చెప్పరాని అంతరావేశం చేత సిగ్గున్నూ కలిగాయి.”

“నా అంతస్తుతో నీ అంతస్తు కూడ పెరగ కూడదా? నాసంకోచం సిగ్గులలో నీ సిగ్గు లయం కాకూడదా?”

”ఇద్దరూ ఒకరినొకరు గోముగా చూసుకొని నవ్వుకొన్నారు. ఇద్దరూ సమాన రూపసంపత్తి కలవారు. ఇద్దరూ ఉన్నతాశయాలు కల యువతీ యువకులు! సంస్కారంచే పదును కావింప బడిన వారి హృదయ క్షేత్రాలలో వారి దృక్కులు బీజావాపన చేయసాగాయి! వారి నవ్వు పువ్వుల్లో ఆనంద మధువు తొణికిసలాడింది!

 ఇంతలో చంపావతి గదిలోకి వచ్చింది. ఆమెను చూడగానే కాలనాథుడు లేచాడు. సత్యప్రభ కూడ లేచింది. ఆ ఇద్దరినీ పరీక్షగా చూసి, చంపావతి ఇలాగన్నది. “ మీరిద్దరూ నేను చెప్పినట్లు వింటారా?” అని.

“దొడ్డమ్మా! మీ అక్కయ్యగారి మల్లికార్జున బాబు ఒకటి, నేను ఒకటి కాదు! నన్ను ఆజ్ఞాపించండి.”అన్నాడు కాలనాథుడు.

“నీ మాటేమిటి పిల్లా?” అని సత్యప్రభని ప్రశ్నించింది చంపావతి.

“అమ్మా! నేను నీవు చెప్పిన మాట ఎప్పుడు వినలేదు? మొదట అప్పుడప్పుడు వాదించినా తరువాత లొంగిపోయే దాన్ని కాదూ?”

“మీరిద్దరూ నేను చెప్పిన మాట వింటారని నమ్మకం ఉంది కాని..”

“వికల్పం దేనికమ్మా? చెప్పండి వింటాము.” అన్నాడు కాలనాథుడు.

“నాయనా! నీవు కులపరిషత్తు ద్వారా శివదత్తు సూరి తీర్పుని అనుసరించి కశ్యపుల్లో స్థిర పడ్డావు! నేను కూడ కాశ్యప గోత్రంలో  పుట్టినదాన్నే! కాబట్టి నీ పెంపకపు తండ్రి నాకు సోదరుడు అవుతాడు, కాబట్టి నీవు నాకు మేనల్లుడివి!”

సత్యప్రభా కాలనాథులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు. వారి చేష్టలను గమనించకుండా చంపావతి తన ప్రసంగాన్ని పొడిగించింది.

“ విశాలమైన ఈ విశ్వంలో నీవంటి వరుడు దొరకడం దుర్లభం! నాకు ఇద్దరు కూతుర్లు. నిన్ను ఒకనిగా లెక్కలో వేసుకొన్నాను. మరొక మంచి వరుణ్ణి ఏరి తెచ్చే పూచీ నీది!నా పిల్లలు నేను చెప్పిన మాట వింటారు! ఎవరిని ప్రేమించమంటే వారినే ప్రేమిస్తారు. సందేహం ఉండదు.” అని చెప్పి చంపావతి సత్యప్రభ వైపు చూసింది. సత్యప్రభ కాలనాథుని వైపు చూసి చిన్న మందహాసం చేసింది.

“ దొడ్డమ్మా! ఈ  ఆంధ్ర సామ్రాజ్యం లోనే కాదు, విశాల విశ్వంలో మీ కుమార్తెలకు తగిన వరులు నలుగురు ఉన్నారు! నా మాటను మినహాయించి తక్కిన వారి పేర్లను చెప్తాను. మల్లికార్జున,ఘనేంద్ర, శక్తిధరులు చాల ఉత్తమ వరులు! వీరిలో మల్లికార్జునుడు మీ కుమార్తెలకు అన్నవరుస కాబట్టి పనికి రాడు.  మిగిలిన వారు ఘనేంద్ర , శక్తిధరులు. ఎవరిని చూడమంటారో చెప్పండి. ఈ రోజే వెళ్లి చూసి మాట్లాడి వస్తాను. నేను చెప్పినప్పుడు ఎవరూ కాదని అనలేరు!”

“నాయనా! సత్యప్రభ అపవిద్ధ అయిన కారణం చేత ,ఆ  వరులు సమ్మతిస్తారో లేదో అని సందేహంగా  ఉంది.”

“దొడ్డమ్మా! ఆ సందేహం పెట్టుకోవద్దు.”

“ అలా అయితే మన సత్యప్రభ పెద్ద పిల్ల కాబట్టి, దానికి శక్తిధరున్ని చూస్తే  బాగుంటుందని అనుకొంటున్నాను. ఏమే పిల్లా! నీవేమంటావు?”

“మళ్లా నన్ను అడగడం దేనికమ్మా? నీవే చెప్పావు కదా, నా పిల్లలు నేను చెప్పిన మాట వింటారని!  అని విసురుగా చెప్పింది సత్యప్రభ.

 “చూడమ్మా! నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిను నేను కనక పోయినా, పెంచి పెద్ద చేసాను. ఉభయ కళాశాల ల్లోనూ చేర్పించి చదువు చెప్పించాను. నీమీద నాకు నా స్వంత కూతురు మణిమాలమీద  కంటే  అధికమైన ప్రేమ, అభిమానం ఉన్నాయి! కాబట్టి నువ్వు రాజపుత్రుని ఇల్లాలు అయ్యే అవకాశం ముందు పొందాలి. అర్థమయిందా , అదే నాకోరిక!”

“అమ్మా! నీకు ఎలా నా ప్రేమ ఉందొ అలాగే నాకు మణిమాల మీద అత్యధికంగా ప్రేమ ఉంది! నా చెల్లెలు రాజప్రాసాదంలో వెలగాలని కోరిక ఉందమ్మా! కాబట్టి మణిమాల విషయంగా కుమార శక్తిధర బాబు గారిని కలుసుకొని మాట్లాడమని కాలనాథ బాబు గారికి చెప్పమ్మా !”

చంపావతి కాలనాథుని వంక చూసింది.

“ దొడ్డమ్మా , కాదు అత్తయ్యా! వినండి! నేను ఇప్పుడే కుమార శక్తిధర బాబు గారిని కలుసుకొంటాను. అతనికి ఇద్దరి పేర్లని సూచిస్తాను. అతను ఎంచుకొన్న పిల్లను చేసుకొంటాడు, మిగిలిన..” అని ఊరు కొన్నాడు కాలనాథుడు.

“ మిగిలి పోయిన పిల్లను మీరే  స్వయంగా చెల్లగొడతారు, అంతేనా? నేను మీతో ఏకీభవిస్తున్నాను  కుమార శక్తిధర బాబు చాల తెలివైన వారని విన్నాను. అదే నిజమైతే  అతను తప్పకుండా మణిమాలనే ఎంచుకొంటాడు! నేను మోటు మనిషిని, మణిమాల పుష్ప సదృశ కోమలాంగి! అలాంటి సౌందర్య రాశిని ఎన్నుకొనే అవకాశం వచ్చినప్పుడు బుద్దిమంతుడైన వరుడు దానిని వదులుకోడు!” అన్నది సత్యప్రభ. చంపావతిబిగ్గరగా నవ్వింది, కాలనాథుడు లోలోపల నవ్వుకొన్నాడు.

************************

అదే రాత్రి కాలనాథుడు శక్తిధరుని కలుసుకొన్నాడు. నిజ ప్రాసాదం బహి పురంలో తన ఏకాంత శాలలో కాల నాథునికి దర్శన మిచ్చాడు శక్తిధరుడు.

శక్తిధరుడు తండ్రిని మించిన రూపసి! రూపానికి తగ్గ శరీరపుష్టి, శరీరపుష్టికి తగిన బలం, బలానికి మించిన సద్గుణాలు అతనియందు ఒప్పారుతున్నాయి. అతనికి కాలనాథుడు ప్రాణ స్నేహితుడు. కాలనాథునిపై ఉన్నంత నమ్మకం అతనికి వేరెవ్వరి మీదా లేదు!

“భర్త్రుదారక! శ్రీవారి సన్నిధిలో ఒక వరాన్ని కోరి వచ్చాను.”అని తానూ వచ్చిన పనికి పునాదిరాయి వేసాడు  కాలనాథుడు.

“కొన్ని గడియల క్రిందట దండనాయక చిత్రసేనుడు కాలధర్మం చెందినట్లు వార్త వచ్చింది.సాంప్రదాయం ప్రకారం ఒక సహస్రపతిని ఆ స్థానంలో నియమించడం ఆచారం! అప్పుడు సహస్రపతి పదవికి ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మీరు కోరుకొన్నట్లు అయితే నేను దానికి ఏర్పాటు చేయగలను. ఇదివరలో నేనెప్పుడున్నూ మా నాయనగారి దగ్గర ఎవరిని గురించి కూడ సమర్థన చేసి ఎరుగను.అందు వలన మీ విషయంగా చెప్పినప్పుడు వారు నా మాట కాదనరు!”

“అది కాదు నేను అడిగన  వరం! దానికి తగిన అభ్యర్థి మల్లికార్జునుడు.”

“మీ చెల్లెలు ధరణిని సార్వభౌముని కోడలుగా చేసుకొన గోరుచున్నారా? అది కూడ దుర్లభం కాదు.”

“నేను కోరేది అది కూడ కాదు.”

“ అయితే ఆ వరం ఏమిటో చెప్పండి.”

“మహాకవీశ్వరి, మహావీరురాలు రాథీతరి సత్యప్రభ కొరకు మీ హస్తం కోరడానికి వచ్చాను.”

శక్తిధరుడు దీర్ఘమైన నిట్టూర్పు వదలి ఇలా అన్నాడు. “మిత్రమా! నాయనగారు స్వయంగా నన్ను పిలిచి సత్యప్రభ విషయంగా ప్రయత్నించ వద్దని చెప్పారు! దేవతలు కోరినా దొరకని హస్తాన్ని నాకు ఇప్పించడానికి వచ్చారు మీరు! నేను దానికి నోచుకోలేదని భావిస్తున్నాను. మీరు చంపావతి గారి కుటుంబం గురించి చేసే శుభ ప్రయత్నంలో నేను మరొక విధంగా సహాయపడ గలను. సత్యప్రభ చెల్లెలు మణిమాలను వారు నాకు ఇవ్వడానికి అంగీకరిస్తే నేను తప్పక ఆమె పాణిని అంగీకరించగలను.”

“అది మాకు చాలును. నేను వారికి ఈ రాత్రే ఈ శుభ వార్త చెబుతాను. వారి అంగీకారం భర్త్రుదారకులకి మనవి చేసుకొంటాను. ఒకమారు ఆ పిల్లను చూసుకొంటారా?” అని సంతోషంతో ప్రశ్నించాడు కాలనాథుడు.

“కవిత్వ పరీక్షాదినం నాడు నేను ఆమెను బాగా చూసాను. ఆమె మధురమైన కవిత్వం విన్నాను.‘నిత్యమౌ మణి మాల నీతికి జయము’ అని మహాయోగీశ్వరి రాజకాళి ప్రశంసా పత్రాన్ని పొందిన వారికి వేరే గుణ పరీక్ష అక్కర లేదు!”

శక్తిధరుడు చేసిన రాజకాళి స్తుతిని విని కాలనాథుడు మిక్కిలి సంతోషించాడు. శక్తిధరుని భక్తిని పరీక్షించడానికి తరిగి అతణ్ణి అడిగాడు. “రాజకాళి అంత గొప్ప యోగీశ్వరియా?” అని.”మహాయోగి అక్షోభ్య ముని ఆమె  పాదాలకి మొక్కడం నేను చూచాను. నాయనగారి అయ్మ్డు ఆమె భగవద్బుద్ది చే  భర్త్రు భావాన్ని ఉంచుకోవడం వల్ల ఆమె పట్ల నాకు మాత్రు భావం కలిగింది!”

కాలనాథుడు సంతోషంతో రాజకుమారుని వద్ద సెలవు తీసుకొని చంపావతి గారి ఇంటికి వచ్చాడు.

చంపావతి కుటుంబస్థులు భోజన శాలలో ఉన్నారు. అధికమైన చనువుని పురస్కరించుకొని కాలనాథుడు కూర్చొన్నాడు. సత్యప్రభా మణిమాలలు భోజనం చేస్తున్నారు. వారి మడి  ముస్తాబు నిరాడంబరంగాను, పవిత్రం గాను ఉండింది. ఆ సాధారణమైన వలువల్లో కూడ వారు రమణీయంగా కనబడ్డారు!

“అన్నయ్యా! మీరు వెళ్ళిన కార్యం నేరవేరిందా ?”అని సత్యప్రభను ఓర కంటితో చూస్తూ అడిగింది మణిమాల

 చంపావతి మూలంగా ఆమెకు కాలనాథుడు ఏ పని మీద వెళ్ళాడో తెలిసింది.

“మణీ ! నేను అత్తయ్యతో చెప్తాను, నీతో చెప్పను.”

“ఏం జరిగింది?” అని ఆతృతతో అడిగింది చంపావతి.

“ రాజుగారు స్వయంగా సత్యప్రభ గురించి ప్రయత్నించవద్దని శక్తిధర బాబుతో చెప్పారట! కాబట్టి అతడు సత్యప్రభను పెండ్లాడడానికి వాక్కు  ఈయలేక పోయాడు. యాచకుడైన తన మిత్రుని ఆదరించడానికై మణి మాలను తప్పక స్వీకరిస్తానని వాగ్దానం చేసాడు! నేను మీ అందరి తరఫున స్వాతంత్రం వహించి అతనికి మణి మాలను ఇస్తానని అంగీకరించి వచ్చాను! అక్కడ మిత్రుడి  మాటను రాజకుమారుడు గడిపాడు. ఇక్కడ నా మాటను మణిమాల గడప వలసి ఉంది!”

“పెద్దల ఆశీర్వాచనాలన్నీ ఇప్పుడు ఫలించాయి నాయనా! నాకు చాల సంతోషంగా ఉంది! సత్యప్రభకు , మణి మాలకు మహోన్నతులైన భర్తలు అభించారు! ఈ రోజు పండగ రోజు బాబూ! ఈ రోజు పాలు-అన్నం ఇక్కడే తిని వెళ్ళాలి సుమా!” అని ఆనందంతో పలికింది చంపావతి.

సత్యప్రభా మణిమాలలు వంచిన తలలు ఎత్తకుండా పాల అన్నం తింటున్నారు. వారి శరీరాలు చెమర్చాయి. వారి కంచాల లోని వేడి పాలు వల్ల స్వేదం పుట్టలేదు! స్వేదం పుట్టించిన వాడు మన్మథుడు! కాని పాలవేడికి అపకీర్తి వచ్చింది!

“మణీ! నీ అభిప్రాయం చెప్పావు కాదు?” అన్నాడు కాలనాథుడు.

“ఒకదానికి వెళ్లి మరికదానికి ఒప్పుకొని వచ్చి నన్ను అడగడం దేనికి?”అని సిగ్గు దొంతరలతో చెప్పింది మణిమాల.

“పోనీ! ఒప్పుకోవడానికి ముందు అడిగాననుకో! అప్పుడేమంటావు?”

“నన్నే అడుగుతారు అక్కను అడగరేం? పోనీండి, ‘అమ్మ ఇష్టం’ అని చెబుతాను.సరేనా?”

“అమ్మ ఇష్టం నీకు తెలిసిందే!”

“అలా అయితే అందరూ సంతోషించండి. ఏం అక్కా! నీ మాటేమిటి?” అని మణిమాల అక్క భుజాన్ని ఊపుతూ  అడిగింది. “పోవే! నేను కూడ అమ్మ ఇష్టం అనే  చెబుతాను.” అంది సత్యప్రభ.

“మణీ! అమ్మ మాట అటుంచు. నీవు సంతోషిస్తున్నావా, లేదా?”

 “ పో అన్నయ్యా! నీకు హాస్యమాడడానికి చెల్లెలు దొరికింది.”

“ మణిమాలా! కాలనాథుడు నీకు అన్న కాడే! వెర్రి పిల్లా! వాడు నీకు మేనమామ కొడుకు. అదిన్నీ కాక సత్య ప్రభకు కాబోయే భర్త! నిన్ను హాస్యం చేయడానికి వానికి పూర్ణమైన అధికారం ఉంది.” అన్నది చంపావతి. ఇంతలో సత్యప్రభ తన కంచాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. మణిమాల ‘నాకూ ఇష్టమే’ అని మెల్లగా గొణిగి లేచి వెళ్ళిపోయింది.

చంపావతి వడ్డించగా కాలనాథుడు ఆ రాత్రి వారింట పాలు అన్నం తినే వెళ్ళాడు.

*********************

22 వ ప్రకరణం :

ఘోరక పుత్రుడు ప్రమథనాథుడు రహస్యార్థ పరిశోధకుడుగా ఉద్యోగంలో చేరి పదిహేను రోజులు అయింది. ఇతడు తన ఉద్యోగానికి తగినట్లు మిక్కిలి గుప్తంగా సంచరిస్తూ ఉంటాడు. ఇతన్ని ప్రత్యక్షంగా చూసిన వారు చాల అరుదు!రథినీ కుమారి మంత్రాంగం వలన ఈ క్రొత్త ఉద్యోగాన్ని సృష్టించి, ప్రమథనాథున్ని నియమించాడు మహారాజు. విప్లవకారులతో షా లంచగొండులైన అధికారులు కూడ ఇతన్ని నియమించిన తరువాత బెడురుగానే ఉన్నారు!

గురువారం రాత్రి రెండవ ఝామున ప్రమథనాథు బాబు పత్రం ద్వారా తానూ కనిపెట్టిన మూడు రహస్యాలను, నగరపాల ఘనేంద్రునికి నివేదించాడు. ఘనేంద్ర బాబు ఆ నివేదికను ఏకాకిగా తన గదిలో కూర్చొని చదివాడు.

“నగరపాల శ్రీ ఘనేంద్ర బాబుగారికి విధేయుడురహస్యార్థ శోధకుడు ఘోరకి ప్రమథనాథుడు వినయ పూర్వకముగా వ్రాసుకొన్న నివేదిక!- నేను ఉద్యోగంలో చేరిన ఈ పదిహేను రోజులలో మూడు రహస్యాలు కనిపెట్టాను.

 1 ) తాక్షక చంద్రసేనుని కీర్తిశేష భార్య రేవతియే కాకులపుత్రి శరావతి! ఇందు వలన ‘నాగమణి’అని నామాంతరం గల పర్ణినియే కాకుల  దౌహిత్రి ‘ఇరావతి’ అని వేరుగా చెప్పనవసరం లేదు! మాతండ్రి దగ్గరకు ఒక నగ తాకట్టుకి వచ్చింది! నేను ఆ నగను పరీక్షించి చూసాను. అది సాధారణ స్త్రీలు కాక, రాజ స్త్రీలు ధరించే బంగారు కడియం వలె  ఉన్నది! లేదా పుష్టి గల మగవాడు ధరించే దండ కడియమైనా కావచ్చు! విచారించగా రేవతి ఆ కడియాన్ని తమ పౌరోహిత పుత్రికి దానం ఇచ్చినట్లు తెలిసింది. దాని జత కడియం రేవతి దగ్గరే ఉంది ఉండవచ్చు! ‘ మా వారు చేయించారే గాని, బంగారు కడియాన్ని పాదము లందు ధరించడం నాకు ఇష్టం లేదు.’ అని చెబుతూ ఆమె పురోహిత పుత్రికి దానం చేసిందట! చంద్రసేనుడు రేవతికి బంగారు కడియాన్ని చేయిస్తాడని నేను నమ్మజాలక పోయాను. అది శ్రీకాకుళ రాజపత్నిది అని తెలుసుకొన్నాను. రాజపత్ని ద్వారా కుమార్తెకి సంక్రమించి ఉండవచ్చును. రేవతి పుట్టింటి వారు ఇప్పుడు ‘గణప వరంలో’ లేరు. వారు గణప వరంలో రెండు సంవత్సరాలు మాత్రమే ఉండిరట! వారు ఆ గ్రామ వాసులు కారట.

2 ) చంద్రసేన నాగెంద్రుని ఇల్లు ‘పరంతప సంఘం’ వారి కేంద్ర స్థానమని నా నమ్మకం. పర్ణిని మాత్రం ఏ కారణం చేతనో నిశుంభునికి నిశ్చయింప బడలేదని తెలిసింది. ఆమెను మన కాలనాథ బాబుకి ఇచ్చి అతణ్ణి నాగుల లోకి ఆకర్షించాలని చంద్ర సేనుడు ప్రయత్నించి విఫలుడు అయ్యాడు! ఇప్పుడు ఆ పిల్లను కర్ణి సుతుడు భీమనాథ బాబుకి ఇచ్చి అతణ్ణి తమ సంఘంలో చేర్చుకోవదానికో లేక ఇది వరకు ఉండిన వాణ్ని స్థిరపరచ డానికో ప్రయత్నం చేస్తన్నారు! రాజకాలమ్మ పాడిన పాటలలో  నుండి భీమనాథుడు జటాముని పుత్రుడని నేను గ్రహించాను. అతణ్ణి ‘బీజ ప్రథానంచే’ బ్రాహ్మణులలో చేర్చుకోవడానికి అవకాశం ఉందేమో మీరు ధర్మపాల సూరిని అడిగి తెలుసుకోవాలని కోరుతున్నాను. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ మహారత్నం మన శత్రువుల  చేతిలో పడిపోతుంది! అతడు సామ దాన భేద సాధ్యుడే గని దండ సాధ్యుడు కాదని నా అభిప్రాయము!

3 ) కౌళిక సులోచనుని పుత్రుడు దశాపతి నీలుడు ఒక్క తల ప్రహారం చేత భల్లూకాన్ని  చంపేయడం నేను చూసాను! చిట్టడవిలో అతడు ధనిర్విద్యాభ్యాసం చేయడం కూడ చూసాను. ధనస్సులో మీ చేతుల్లోని కౌశల్యాన్ని అతని చేతుల్లో కనిపెట్టాను! సహస్రపతి బలభద్రున్ని అధికార స్వరంతో గద్దించడం కూడ గమనించాను. దానిని బట్టి అతడే నిశుంభువు అని నేను అనుమానిస్తున్నాను! కుంజనాథుడు తన పుత్రున్ని పెంచడానికి సులోచనునికి ఇచ్చి ఉండనోపును. ----- చిత్తగించవలెను                                                               ఘౌరకి ప్రమథనాథుడు వ్రాలు.              
***********************

 అదే రాత్రి ఘనేంద్రుడు ఆలస్యం చేయకుండా నీలున్ని పట్టుకోవడానికి సులోచనుని ఇంటికి వెళ్ళాడు. కొలది క్షణాల క్రిందటే ఆ ఇల్లు ఖాళీ చేయబడిందని తెలుసుకొన్నాడు నగరపాలుడు. సులోచనుడు తన భార్యతోను, పుత్రుని తోనూ, కలసి రాత్రి భోజనానంతరం గణపవర గ్రామానికి రెండెడ్ల బండిలో వెళ్ళినట్లు పొరుగింటి వారు చెప్పారు. ఘనేంద్రుడు గుర్రం మీద గణపవరం వెళ్ళాడు గాని వ్యర్థ ప్రయత్నుడై వచ్చేసాడు.

గణపవరం నుండి రాగానే ఘనేంద్రుడు రాష్ట్రియుని నుండి చంద్రసేన నాగేంద్రుని గృహ శోధన నిమిత్తం ఉత్తరువు పొందడానికి మహామంత్రిగారి ఇంటికి వెళ్ళాడు. ఎట్టకేలకి రాష్ట్రియుని లేపి సంగతి మనవి చేసుకొన్నాడు. అతడు నిద్రా భంగం చేసినదానికి విసుగుతో “ఇప్పుడే ఏం మించి పోయింది? రేపు ఉదయం చూసుకోవచ్చు! పోయి నిద్రపోవయ్యా ! “ అని కసరి నగరపాలున్ని పంపించి వేసాడు.

మరునాడు ప్రాతః కాలం చంద్రసేన నాగేంద్రుని ఇల్లు శోధించడానికి రాష్ట్రియుడు భట పరివార సమేతంగా , నగరపాలునితో కలసి వెళ్ళాడు. సాడంబరంగావీల్లందరూ వెళ్ళే సరికి చంద్రసేన నాగేంద్రుడు గత రాత్రే నవోడ అయిన తన ద్వితీయ భార్యతో శ్రీశైల యాత్రకి బయలు దేరినట్లువార్త తెలిసింది. శోధన అవసర లేదని ఘనేంద్రుడు చెప్పినా వినకుండా వీరనందుడు చంద్రసేనుని ఇల్లంతా గాలించాడు. నేరం గుర్తులేవీ కనిపించ లేదు!

సులోచన, నీల, చంద్రసేనులు పరంతప సంఘం వారే అని అందరికీ తెలిసి పోయింది! ప్రమథనాథ బాబు పత్రం ఇచ్చి పంపిన వ్యక్తీ ఆ పత్రాన్ని పరంతప సంఘం లోని మనిషికి చూపి ఉంటాడని నగరపాలుడు అనుమానించాడు.

ప్రమథనాథునితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి ఘనేంద్రుడు ఘోరకుని ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ ప్రమథ నాథుడు లేడు. పరంతప సంఘీయుల ఉదంతాన్ని కనిపెట్టడానికి అతను వెళ్లి ఉంటాడని ఘోరకుడు చెప్పాడు.

చంద్రసేన నాగేంద్రుని ఇల్లు కాపలా కాయడానికి రక్షక భటులని నియమించాడు వీరనందుడు. విశేషమేమిటంటే పర్ణిని తాలూకు ఏ కొద్ది నగలో కాని, ఇంట్లో వెలగల సామాన్లేవీ కనిపించలేదు! పరంతప సంఘం వారి చురుకు తనాన్ని చూచి ఆశ్చర్య పోయాడు  ఘనేంద్రుడు.

పర్ణిని కనబడ లేదు గాని, ఒక ముసలమ్మ మాత్రం ఆ ఇంట్లో ఉంది. ఈ విధంగా రక్షి జనుల ప్రథమ ప్రయత్నం విఫలమయింది.

*************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...