23 వ ప్రకరణం:
శుక్రవారం పూర్వాహ్ణం కాలనాధుడు శక్తిధరునితో మణిమాల ప్రదాన విషయంలో చంపావతమ్మ పూర్ణ సమ్మతిని తెలియ చేసాడు.
ప్రమతి, ధర్మపాలుల విన్నపం ఆ పూర్వాహ్ణమే రాజ ధర్మాసన సన్నిధికి వచ్చింది. మహారాజు దానిని విచారణీయంగా అంగీకరించి, పౌర్ణమీ బుధవారం విచారణ దినంగా నిర్ణయించాడు. భోగనాథ, శక్తిధరులకు ప్రమతి ధర్మపాలులు కాక వేరు న్యాయవాదుల ద్వారా తమ తమ వాదాలను పోషించుకోవడానికి అభ్యనిగ్న ఇవ్వబడింది.
ఉత్తరాదికారి సమస్యా విచారణావతరణమువల్ల లీలావతీ దేవి మనస్సు బరువెక్కి పోయింది. ఇట్టి సమయంలో మహారాజు వీరనందుని రాష్ట్రీయ పదవి నుండి తప్పించి ప్రాసాద కార్యదర్శి పదవికి మార్చుటకై ఆలోచన అడిగి, ఆమెను మరింత ఖేదపరచాడు. అట్టి మార్పు తన తమ్మునికి అవమానకరమని ఆమె అభిప్రాయ పడింది! ఆ విషయంగా మరునాడు మాట్లాడుకోవచ్చని వాయిదా వేసింది మహారాణి. రథినీ కుమారే స్వతంత్రించి రాజేంద్రుని వశ పరచుకొని తన కుటుంబంపై దండయాత్ర సాగిస్తూందని తలంచింది.
ఇదివరకు సుచంద్రుడు లీలావతిని ఎన్నో విధాలుగా ఆరాధించాడు. ఆమె ఇష్టులకు ఉద్యోగాలు ఇచ్చాడు. అయిష్టులను ఉద్యోగాలనుండి తొలగించాడు. సుమారు పది లక్షల వరాలు విలువ చేసే ఏడూ వారాల రత్నా భరణాలు చేయించాడు. ఎంత చేసినా ఆమెకిప్పుడు లాభం లేనట్లే తలంచింది. ఉత్తరాదికార సమస్యా
విచారణకు అవకాశం కల్పించడం ఆమె మనస్సును చాల వ్యధలో ముంచింది.రాజుగారికి ఇష్టం ఉంటే భోగ నాథున్ని యువరాజుగా ప్రకటించడం కష్ట మైన పనేమీ కాదు! జన్మ జ్యేష్టుడే ఉతరాదికారి అని ఒక శాసనాన్ని ప్రకటించడం రాజుగారికి సంభవమే!
పుండు మీద దెబ్బ అన్నట్లు శాంతిసేనా కుమారి విన్నపానికి కూడ మహాన్యాయ స్థానంలో విచారణకు అవకాశం కల్పించాడు మహారాజు. తనకూ, పితృ కుటుంబానికీ పరమ శత్రువులైన శివంకర సంఘం ప్రతినిధితో మాట్లాడడానికి ఒపుకొన్నాడు. ఇవన్నీ ఇలా ఉండగా తన తమ్ముణ్ని రాష్ట్రీయ పదవి నుండి తీసివేయడానికి తీర్మానిస్తున్నాడు! తన కన్నీరు తుడిచే నిమిత్తం ప్రాసాద కార్యదర్శి పదవిని సృష్టించి వాణ్ని అందులో కూలవేయడానికి చూస్తున్నాడు!
లీలావతీ దేవి తన కష్టాలను సఖి భ్రుంగాలకకు చెప్పుకొని వాపోయింది. ఉత్తరాదికారి సమస్య విషయంలో ఇద్దరు ప్రాడ్వివాకులు జ్యేష్టుని పక్షం లోను, ఇద్దరు పట్టమహిషీ పుత్రుని పక్షం లోను ఉంటారని భ్రుంగాలక అంచనా!
రాజుగారు ఎవరిని ఆమోదిస్తే ఆ పక్షం జయిస్తుందని ఆమె అభిప్రాయం. తన సఖి అనుమానాన్ని లీలావతీ దేవి ఆమోదించింది. ఇక తాను ముఖ్యంగా పతిని తన వశం చేసుకొని తీరాలి! లేనప్పుడు చాల ప్రమాదం సంభవిస్తుంది.
ఇన్నాళ్ళూ పని చేసిన తన నిశాత దృక్కులని లీలావతి నమ్మజాలక పోయింది. చాల కాలం నుండి తాని విశ్వసించి గౌరవిస్తున్న యోగీశ్వరి ధవళాక్షిపై, లీలావతి సంకల్పం ప్రసరించింది. ఆమె యోగీశ్వరి మాత్రమె కాదు, గొప్ప మాంత్రికురాలని భ్రుంగాలక లీలావతి సకల్పానికి దూపం వేసింది. అనేక విచిత్ర శక్తులు గల మూలికలు తెలిసిన తాంత్రికురాలని భ్రుం గాలక క్రొత్త ఆశను లీలావతిహృదయంలో రేకెత్తించింది,ఆమె దగ్గర వశీకరణ మూలికలని తెచ్చుకోవాలన్న సంకల్పం లీలావతికి కలిగింది.
మహారాజ్ఞి తన తండ్రిని చూసి వస్తానని మిష కల్పించుకొని, సాయంకాలం ప్రాసాదాన్ని విడిచి బయలుదేరింది. తమ్ముని క్రొత్త ఉద్యోగ విషయంగా ఆమె తన తండ్రితో మాట్లాడుతుందని తలంచి రాజు , ఆమె ప్రసాదం వదిలి వెళ్ళడానికి అనుమతించాడు.
తండ్రిగారి ఇంటి నుండి పొద్దు గ్రుంకిన తరువాత సాధారణ మైన ఉడుపులు ధరించి, భ్రుంగాలకతో కలసి గుర్రపు బండిపై ధవళాక్షి ఆశ్రమానికి బయలుదేరింది మహారాజ్ఞి. తమకు తోడుగా రాష్ట్రీయ వీరనందున్ని వెంట తీసుకొని వెళ్లింది. వారందరూ సకాలంలో ధవళాక్షి ఆశ్రమానికి చేరుకొన్నారు. లీలావతి కోరిక ప్రకారం ధవళాక్షి పతీ వశీకరణార్థం ధార్యమైన ఒక మూలికను ధూపం వేసి ఇచ్చింది. మరునాడు ప్రాతఃకాలం మరొక సారి ధూపం వేసి, మేడలో కట్టుకో వలసిందిగా చెప్పింది. లీలావతి యోగీశ్వరికి దక్షిణ సమర్పించ బోయింది గాని ఆమె స్వీకరింప లేదు! ధవళాక్షి అనుజ్ఞ పొంది వరు తిరుగ బండి ఎక్కి పట్టాణాభిముఖంగా వెళ్ళారు.
బండి చిట్టడవి గుండా మహావేగంతో వస్తోంది! వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఆ ప్రదేశాన్ని ఆవరించి నయనోత్సవంగా ఉంది! హఠాత్తుగా ఉన్నట్లుంది బండి ఒక్క కుదుపుతో ఆగింది!
“ఏమోయ్! బండిని ఎందుకు ఆపావ్?” అని అధికార స్వరంతో సారథిని ప్రశ్నించాడు వీరనందుడు. “ ప్రభూ! దొంగల గుంపు బండిని అడ్డుకొంది “అని చకిత స్వరంతో బదులు చెప్పాడు సారథి.
వీరనందుని మొలలో భయంకరమైన కరవాలం ఉంది! అయినప్పటికీ వని గుండెల్లో ధైర్యం శూన్యం! భుజాల్లో త్రానం మృగ్యం ! అయినా అతడు సామ్రాజ్యం లోని తలవరుల కెల్లా సర్వాధికారిగా ఉన్నాడు. ఆజ్ఞలు ఇవ్వడానికి పెద్ద నోరు మాత్రం అతనికి ఉంది. అతడు రథం దిగీ దిగాక ముందే అతణ్ణి నలుగురు బలవత్తర పురుషులు రథం నుండి క్రిందకి లాగారు. వారిచే అతడు అతి సులువుగా నిరాయుధుడు కావించ బడ్డాడు! లోపల ఉన్న స్త్రీలను దొంగలు ముట్టుకోలేదు.
నలుగురు గుర్రాలను ఆపి ముందు నిలబడ్డారు. వారిలో ఒకడు బండికి ప్రక్కగా వచ్చి మిక్కిలి మృదువుగా భయంకరమైన తమ నిశ్చయాన్ని స్త్రీలను ఉద్దేశించి ఇలా చెప్పాడు!
“ మాననీయ నారీమణులారా! మీలో స్వర్ణ దేహ ప్రభ కలిగిన సుందరీమణి ఆంద్ర మహారాజ్ఞి అని, పాటల దేహ ప్రభ కలిగిన వనిత చేటీ జనాధ్యక్షురాలు అనిన్నీ మము ఎరుగుదుము! మేము పరంతప సంఘం లోని వారము! మా నాయకుడు నిశుంభు నాగేంద్రుడున్నూ, మా నాయకురాలు ఇరావతీ దేవియున్నూ తమను మిక్కిలి మర్యాదతో తోడ్కొని రావలసిందిగా మాకు ఉత్తర్వు ఇచ్చి ఉన్నారు! కాబట్టి మీ దర్శనం నిమిత్తం మేము వచ్చాము. మిమ్ము నిర్భయంగా ఈ బండిలోనే మేము అచ్చటికి తీసుకొని పోగలము!
మీ మానం గురించి గాని, మీ ప్రాణాలు గురించి గాని భయపడ వలసిన పని లేదు! అవి రెండూ సురక్షితంగానే ఉంటాయి. మహారాజుగారితో మాకు సంధి కుదిరే వరకు, మీరు మా ప్రతుఎక వసతి గృహంలో విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది! మీకు కావలసినంత రక్షకుల సిబ్బందిన్నీ, పరిచర్య నిమిత్తం కోరినంత పరిచారికా వర్గాన్నీ ఏర్పాటు చేస్తాము! మీ ఉపచారాలకు ఏ లోటూ ఉండదు! పరంతప సంఘం బాల సంపత్తిని మీ కండ్లతో ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం కల్పించ బడుతుంది!”
మహారాజ్ఞి భయంతో మ్రాన్పడి పోయింది. భ్రుంగాలక బిక్కచచ్చి పోయింది. ఇద్దరి కండ్లలో నుంచి వేడి కన్నీటి
ధారలు కాలువలు కట్టాయి.
ఇంతలో ఒక మెరుపు మెరిసినట్లు అయింది! ఆ మెరుపు ఎట్టిది? వారిద్దరూ మౌనంతో ఆ మెరుపు వెంటే తమ ఆర్ద్ర దృక్కులని సారించారు!
ఒక జగన్మోహన రూపిణి అయిన స్త్రీ విగ్రహమే ఆ మెరుపు! ఒకసారి చూస్తే చాలు ఎన్నటికిని మరుపురాని విగ్రహం! దేవ పురుషుల కండ్లకి కూడ ఆశ్చర్యం కలుగచేయ తగిన విగ్రహం! శక్తికి నివాస రూపమైన స్త్రీ విగ్రహం! ఆమెయే సత్యప్రభ!
మహారాణి, భ్రుంగాలక ఆ వచ్చిన యువతి చంపావతి గారి సత్యప్రభ అని పోల్చుకొన్నారు. ఆమె కూడ పరంతప సంఘంలో సభ్యురాలేమో అని ఇద్దరూ భావించారు. కాని వారి భావనకి అంతరాయం కలిగింది.
“త్రుటి కాలంలో సత్యప్రభ మొలనుండి కాల సర్పం వలె బుసకొడుతూ వెన్నెట్లో మెరుస్తున్న భీకర కరవా లాన్నితీసింది! “ ఓ మాననీయ వీరుడా! నీ గుఒపును తీసుకొని వెనక్కి వెళ్ళిపో! పరంతప సంఘం వారు మా
ఆంద్ర సామ్రాజ్ఞిని బందీగా తీసుకొని వెళ్ళడం సంభవమని తలంచడం చాల పొరపాటు! కుండినుల అధికారాన్ని కాపాడే నిమిత్తం ఈ విశాల సామ్రాజ్యంలో ప్రతి మూల జాగ్రత్త వహించే శక్తులు ఎన్నో ఉన్నాయి!” అనికంచు గంటతో సమానమైన నాదంలోధృఢమైన కంఠంతో పలికింది సత్యప్రభ.
“ ఓ సుందరీ! నీ చక్కని ముఖం నుండి వచ్చే మాటలను మన్నించడానికి ఇది శృంగార రంగ స్థలం కాదు! వీర రంగం.” అని బదులిచ్చాడు వాడు.
“ ఈ మాటలను నా సుందర ముఖం చెప్పడం లేదోయి! నా సఖడ్గ హస్తమే చెప్తోంది! ఆ మాట ప్రకారం నీవు నీ ఆడవానిచో అది (సఖడ్గ హస్టం ) నీ గుంపును చెదర గొట్ట గలదని సత్యం నీతో చెప్తోంది!”
సత్యప్రభ ధైర్య సాహసాలను చూసి లీలావతీ, భ్రుంగాలకలు పరమాశ్చర్యం పొందారు!
“ఈ ఉద్ధత నారి చేతిలో నుండి ఖడ్గాన్ని లాగి వేయండి” అని ఆ పురుషుడు తన అనుచరులని ఆజ్ఞాపించాడు. ఆ గుంపు ఒక్కుమ్మడిగా సత్యప్రభపై లంఘించారు.
కనురెప్ప పాటులో మూడు తలలు ఎగిరి త్రుళ్ళిపడ్డాయి! వాటి రక్తధారలతో ముందు ఆకాశం, పిమ్మట భూమి ఎర్రబడ్డాయి! వెన్నెట్లో సింధూర రేఖలు తళుక్కుమని మెరిసినట్లయంది. ఆ మువ్వురు వీరులను నరికి
తగినంత సందు చేసుకొని సత్యప్రభ ఉచ్చస్వరంతో ఆ యువకునిఏ విధంగా హెచ్చరించింది,
“ ఇప్పుడైనా పారిపో! వృథాగా నా కత్తికి ఈ మేకలను బాలి ఇవ్వకు!” అని.
ఆమె లాఘవానికి, పరాక్రమానికి మహారాజ్ఞి మిక్కిలి సంతోషించింది. భ్రుంగాలక ఈర్ష్య పడింది!
ఆ గుంపుని నడిపిస్తున్న పురుషుడు దిగులు చెంది పెద్దపెట్టున తనవారిని హెచ్చరిస్తూ కేక వేసాడు. ఆ చుట్టూ ప్రక్కల తుప్పల చాటున దాగుకొని ఉన్నవారంతా కలిసి సత్యప్రభ మీద కత్తులు దూసి కలియబడ్డారు. వారందరూ కలసి షుమారు ఏభై మంది ఉంటారని మహారాణి భయపడింది! ఇప్పుడు సత్యప్రభ ఏభై మందితో పోరవలసి వచ్చింది! ఒక స్త్రీ అంతమందితో యుద్ధం చేయడం విని ఎవరూ నమ్మరు! కాని అసాధారణ వ్యక్తుల విషయంలో అంతా సాధ్యమే అవుతుంది. ఇటువంటి అసాధారణ సంఘటనలు మన భారత దేశ చరిత్రలో కొల్లలుగా ఉన్నాయి!
సత్యప్రభ నిరుపమ లాఘవంతో, నిస్సదృశ మండల ప్రచారంతో, నిస్తుల సాహసంతో, నిస్సమానవత్వంతో , నిష్ప్రతిమాన కౌశలంతో ఆ గుంపుతో యుద్ధం చేసింది!! లీలావతీ భ్రుం గాలకులు ఆమె మహాశక్తి అవతారమని తలంచారు! సగం మంది చనిపోయారు, తక్కినవారు వెనుకకు తగ్గకుండా మీదిమీదికి దుముకుతున్నారు. ఇంతట
వెనుక నుండి మరియొక భయంకర పరిస్థితి తటస్థించింది. అది సాధారణమయింది కాదు! భీకర కదన తాండవంతో ఒక మహావీరుని ముట్టడింపు అది!! సత్యప్రభా వీరపురుషుల కత్తుల మధ్య, ఆ గుంపులోని వారు అడకత్తెరలో పోకచెక్క వలె చితికి పోయారు! ఒక్కడు మాత్రం తప్పించుకొని కాలికి బుద్ది చెప్పాడు. వాడేవడు? వాడే రసిక వీరుడు కౌళిక సులోచనుడు ! రంగమంతా తెగిన మొన్దాలతోను, భిన్నమైన శిరస్సులతోను, రక్తసిక్తమై ఉంది. ఆ నిశ్శాత్రవ రంగమందు జయించి నిలిచిన ఇద్దరూ అన్యోన్యం స్నేహార్ద్ర వీక్షణాలతో తర్కించుకొంటూ నిలబడి ఉన్నారు!
ఆ వచ్చిన పురుషుడు కాలనాథుడు అని మహారాణి గుర్తుపట్టింది. సత్యప్రభా కాలనాథులు పరస్పర ప్రతాప పరిచయంతో, అత్యంతాదరంతో ఒకరినొకరు చూసుకొన్నారు. ఇదివరలో పెద్దల చేత రాగార్ద్రం చేయబడిన వారి హృదయాలు ఇప్పుడు ప్రేమభరితాలై మిక్కిలి తియ్యని భావాలతో స్పందించాయి. వారి దృక్కులు మౌనంగా చాల సేపు మాట్లాడుకొన్నాయి!!
కాలనాథుడు విజయానంతరం చెట్ల వద్దకు వెళ్లి, వీరనంద, రథ సారథుల కట్లు ఇప్పి, నోటిలో కుక్క బడిన గుడ్డలు తీసి విడిపించాడు. వీరనంద బాబు లజ్జచే తల వంచుకొన్నాడు.రథ సారథి చెదిరిపోయిన గుర్రాలను తెచ్చి రథానికి పూన్చాడు.
మహారాజ్ఞి ఆజ్ఞను పాటించి సత్యప్రభా కాలనాథులు రథారోహణ కావించారు. వీరనంద బాబు అక్కగారి ఆజ్ఞ ప్రకారం రథసారథి ప్రక్కన కూర్చొన్నాడు. బండి కదలింది.
“సత్యప్రభా! నీవు సమయంలో సామ్రాజ్ఞికి గొప్ప సేవ చేసావు! ఈ సేవను మహారాజ్ఞి ఎన్నటికిని మరచిపో జాలదు!” అని చెప్పింది భ్రుంగాలక.
“అది నాకర్తవ్యం! కర్తవ్యాన్ని నెరవేర్చడం గొప్ప సేవేమీ కాదు!” అతి వినయంతో బదులిచ్చింది సత్యప్రభ.
“సత్య ప్రభా నువ్వు ఎక్కడనుంచి వస్తున్నావు?” అని ప్రశ్నించింది మహారాణి.
“అక్షోభ్య మును ఆశ్రమం నుండి వస్తున్నాను. తిన్నగా మరొక మార్గం గుండా వెల్లవలసినదాన్ని ఏదో బుద్దిపుట్టి అడ్డుగా ఈ త్రోవవెంట వచ్చాను.”
“నీవు ఎక్కడనుంచి వస్తున్నావు నాయనా!” అని కాలనాథుని చూసి ప్రశ్నించింది మహారాణి.
“నారాయణ పురం నుంచి వస్తున్నాను.”
“శాత్రవులను ఎదురు చూడనండున ప్రమత్తున్నై, వారి చేత చిక్కి పోయాను” అని వీరనందుడు తన్ను తానె సమర్థించుకొన్నాడు. ఆ హీన స్వరం వాని అసమర్థతని కప్పి పుచ్చలేక పోయింది! “ప్రమాదో ధీమతామపి” అని సరిదిద్దాడు కాలనాథుడు.
“ఇప్పుడు జరిగిన సంభవం కాని వెల్లడిస్తే, మహారాజు గారి మనస్సు మిక్కిలి వ్యాకులత చెందుతుంది. కాబట్టి దీనిని ఎవరు కూడా వెల్లడించకుండా ఉండడం మంచిదని నా అభిప్రాయం! సత్యప్రభను దొంగలు ముట్టడించి నట్లును, ఇంతలో కలనాతుడు వచ్చి ఆమెకు సహాయం చేసినట్లుని ప్రకటన చేస్తే సరిపోతుంది!”అని చెప్పింది మహారాణి.
అందరూ మహారాణి సూచనను ఆమోదించారు. రథం రాజధానిని సమీపించింది.
“బావగారూ! మీరుగాని సమయంలో వచ్చి ఉండక పొతే నాకు శత్రు విజయం శ్రమసాధ్యమై ఉండును. ఈ ఉపకారం నేను జన్మలో మరువజాలను” అని చెబుతూ కొత్తపేటలో రథం దిగింది సత్యప్రభ.
“రాథీతరీ! నీ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందించాను. తానూ పెంచిన కూతురు పరాక్రమాన్ని విని ఆనం దించడానికి మహావీరుడైన సత్యరథ బాబు లేరని చాలా విచారిస్తున్నాను. అత్తయ్య చంపావతమ్మకు నా నమస్కారాలు చెప్పు. కుండినుల వంశాదికారాన్ని కాపాడడానికి నీ అసిధార తోడ్పడు గాక!” అని చెబుతూ కాలనాథుడు కూడ రథం దిగి వేరే దారి పట్టాడు.
భ్రుంగాలక రాజ వీధిలో విషన్న వదనంతో తమ ఇంటికి దారి తీసింది! దారావతి తన కూతురు ఫలినిని కాలనాథునికి ఇవ్వాలని సంకల్పించిన మాట భ్రుంగాలకకు తెలిసింది. ఆమెకి గాని లీలావతి తోడూ అయితే తన సోదరుడు దండనాయక చండసేనునికి ఆ సంబంధం ఆపు చేసే శక్తి చాలదు! తమకది మహానష్టదాయకమైన విషయం.
లీలావతి తన కుమారునికి ఫలినిని దక్కకుండా చేస్తుందేమో అని ఆమె భయపడింది! ఆ విచారంతో ఆమె ఆ రాత్రి సరిగా నిద్ర పోలేక పోయింది.
మహారాణి తన ప్రసాదానికి వెళ్లింది. సత్యప్రభను తన కుమారునికి చేసుకొంటే బాగుండునని తలంచింది. సత్యప్రభ అపవిద్దగా ఉన్నంత మాత్రం చేత నష్టం ఏముందని తర్కించింది. మహారాజుతో చెప్పి సత్యప్రభను తన కోడలుగా చేసుకోవాలనే తియ్యని తలపులతో కలత నిద్రని అనుభవించింది ఆంద్ర సామ్రాజ్ఞి.
************************
24 వ ప్రకరణం:
అదే రోజు రాత్రి కౌళిక సులోచనుడు తన ప్రథమ ప్రయత్నం విఫలమైనా, ఊరకుండలేదు! చిట్టడవి లోని శవాలని అతి నేర్పుగా దహనం కావించి, వాడు కొందరు వీరులని కూడ తీసుకొని రాజ ప్రసాదానికి వచ్చాడు! బహిఃపురంలో శయనించి ఉన్న కుమార భోగనాథుని బందీగా చేయాలని వాణి సంకల్పం!వాని విపరీత సంకల్పానికి రెండు కారణాలు ఉన్నాయి! ఒకటి – చిట్టడవిలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనాలి. రెండవది - చిట్టడవిలో జరిగిన సంభవం వలన ఆ రాత్రి వేరే ఇతర శత్రు చేష్టలకు అవకాశం ఉండదని రక్షిజనులు ప్రమత్తులై ఉంటారు! ఆ రెండు కారణాలచే కౌళిక సులోచనుడు భోగనాథ అపహరణకి పథకం వేసుకొన్నాడు.
సంప్రదాయానుసారం సింహ ద్వారం పూర్తిగా మూసి ఉండదు! చిన్న దిడ్డి ద్వారం ఉంటుంది. అది రాత్రులు తెరవబడే ఉంటుంది. పండ్రెండు గడియల రాత్రి నుండి బ్రాహ్మముహూర్తం వరకు ఆ ద్వారాన్ని మహా ప్రతీహారి
ఘోరకుడు కాపలా కాస్తూ ఉంటాడు. అర్థ రాత్రి పూట వెళ్లి మహాప్రతీహారిని వధించి వాని వేషంలో ఒకడు సింహద్వారంలో ఉండడానికిన్నీ మిగతావారు మెల్లగా భోగనాథుని శయనాగారం సమీపించి అచ్చటి ప్రతీహారిని చంపి రాజకుమారుని అపహరించుకొని రావదానికిన్నీ పథకం వేయబడింది.
ఈ పథకం చాల సులభంగా ఉందని సులోచనుని అంచనా!ఉహించడానికి ఈ సంవిధానం బాగుంది, కాని ఆచరణలో మిక్కిలి కష్ట సాధ్యం! ఇద్దరు మువ్వురు ప్రతీహారులని వధతో కార్యమంతా సరిపడుతుందని ఉహించాడు సులోచనుడు. ప్రతీహారుల కోలాహలంచే కోటలోని వేలకొలది యోధులు గడియలో గుమికూడుతారన్న విషయాన్ని సులోచనుని తల ఉహించలేక పోయింది!
మహాప్రతీహారి సామాన్యుడని సులోచనుడు తలవడం కూడ పొరపాటే!రాత్రి మూడవ ఝామున సులోచనుడు తన రెండవ దళంతో సింహద్వారాన్ని సమీపించాడు. వాణికి అక్కడ ఘోరకుని మూర్తి గోచరించింది. ఘోరకుడు ఘనీభవించిన మేచక మూర్తి, గహనమైన శ్మశ్రుపటలంలో అతని సగం ముఖం మునిగిపోయి ఉంది. అతని వదనచ్చాయాంధకార మధ్యమున వాని విశాల నేత్రాలు మిరమిట్లు గొలుపుతూ వింత శోభను ప్రసాదిస్తున్నాయి.
అతని చేత భయంకర కృపాణం నగ్నంగా మెరుస్తోంది! అతణ్ణి చూడగానే సులోచనుడు తన భటులకు సంజ్ఞ చేసాడు. భటులు ముప్పై మంది ఉన్నారు. అందరూ ఆరితేరిన యోధులు! ప్రాణాలకు తెగించి పోరాడే స్వభావం కలవారు.
ఘోరకునికి వారి అభిప్రాయం భోధపడింది! ప్రతిఘటనకు సిద్ధపడ్డాడు.
ఒక పావుగంట పోరు మహా ఘోరంగా సాగింది! ఘోరకుని ఖడ్గ నాట్యానికి బలవంతులైన సులోచనుని భటులు బాలి అవుతున్నారు. ఇంతలో ప్రమథనాథుడు వెనకనుండి వారిని ముట్టడించాడు! ఆ తనదీ కొడుకులు సులోచనుని భాతులలో ఒక్కరిని కూడ మిగల్చకుండా హతమార్చారు! సులోచనుని ధైర్యం కూడ శరీరం నుండి వేరుపడింది. వాడు పిక్కబలం చూపాడు. సులోచనున్ని తరుముతూ ప్రమథనాథుడు వెంటపడ్డాడు.
శత్రు వధానంతరం ఘోరకుడు తన బూరాతో కోట అదిరేటట్లు సింహనాదం చేసాడు. కోటనుండి ప్రతీహార వర్గమంతా సిహద్వారం దగ్గరకు వచ్చి గుమికూడారు. ఆ వార్త కొద్ది క్షణాల్లో కోటంతా మారు మ్రోగింది.
ఆ కల్లోలం విని మహారాజు స్వయంగా సింహద్వారం దగ్గరకు వచ్చి రణ రంగాన్ని చూసాడు. పార్థివుడు సచివుని ద్వారా సత్యప్రభా కాలనాధుల ప్రతాపాన్ని విని ఉన్నాడు! రాణి ధవళాక్షి ఆశ్రమానికి వెళ్ళిన సంగతి కూడ అతనికి తెలిసి పోయింది! రథసారథి మూలంగా సచివుడు విషయాన్ని రాబట్టి మహారాజుకి విన్నవిం చాడు! ఇప్పుడు ఘోరక, ప్రమథనాథుల పరాక్రమాన్ని తన కండ్లతోనే చూసాడు.
తక్షణం ఆ స్థలానికి రాష్ట్రియుడు వీరనందుడు, నగరపాలక ఘనేంద్రుడున్నూ పిలిపించబడి వచ్చారు. “ఎవరైనా తప్పించుకొని పారిపోయారా? అని ఘనేంద్రుడు ఘోరకున్ని ప్రశ్నించాడు.
“ఒక్కడు పారిపోయాడు. వాణ్ని ప్రమథనాథుడు తరుముకొని వెళ్ళాడు. వాడు పాతాళంలో చొరబడినా మా వాడు వదలడు.” అని సగర్వంగా చెప్పాడు ఘోరకుడు.
“వాడు కౌళిక సులోచనుడేనా?” అని అడిగాడు నగరపాలుడు.
“అవును’ అని బదులిచ్చాడు మహాప్రతీహారి ఘోరకుడు.
“వాడు శతపతిగా మన సేనలో చేరి మనుప్పు తింటూ మనకే ముప్పు చేయ సాహసించాడు” అని అన్నాడు మహారాజు.
“వాడు బహు దుర్మార్గుడు. ఆదిలో శ్యామల అను విప్రకన్యను పాడు చేసాడు. ఇప్పుడు కాత్యాయని అనే విపర విధవాంగనను ఉంచుకోన్నాడట! వాణి అత్యాచారాలకు మితిలేదు. వాడిప్పుడు దొరికిన పక్షంలో శిరచ్చేదమే వానికి తగిన దండన.”అని బిగ్గరగా చెప్పాడు వీరనందుడు.కాత్యాయనీ నిందను ఘోరకుడు సహించ లేక పోయాడు.
కాత్యాయని కులయోగిని అని ఘోరకునికి ఆమెపై మిక్కిలి గౌరవ బుద్ది కలదు. అతడు సావహేలనగా వీరనందుని చూచి ఇలా అన్నాడు. “ అయ్యా , మీకు రాజ సన్నిధిలో మహానుభావురాలైన కాత్యాయని పేరుని మలినపరచారు! ఆమె కూర్చొన్న చోట నిలబడడానికి కూడ మీకు యోగ్యత లేదు. మీ నిందని మీరు ఉపసంహరించుకొంటారా, లేక నాతొ ద్వంద్వ యుద్ధానికి సిద్ధమవుతారా?” చెప్పండి.
“మీకత్తి ప్రతాపాన్ని కాన్వ శుకనాసునిపై ప్రయోగించండి. అతడు చెప్పగా నేను విన్నాను. నేనేమీ ఈ వార్తని సృజించలేదు!”అని సమాధానం ఇచ్చాడు వీరనందుడు.
ప్రభువు అనంతరం జోక్యం చేసుకొని ఆ ప్రసంగాన్ని ఆపు చేసాడు.
“ప్రమథనాథునికి తోడగునట్లు కొంతమంది రక్షిజనులను పంపించడం మంచది” అని వీరనందుడు నగరపాలునితో చెప్పాడు.
“అక్కరలేదు, ఒకణ్ణి పట్టుకోవడానికి చాలమంది మనుష్యులు అవసరం లేదు!” అన్నాడు ఘోరకుడు.
“ఘోరక బాబూ! మీరిద్దరూ – తండ్రి కొడుకులు చేసిన పనికి నేను మిక్కిలి సంతోషించాను. దానికి ఉచితమైన బహుమానాన్ని మీకు అవశ్యం ఇస్తాను. మా కోశాధ్యక్షునికి ఉత్తరువు కూడ ఇస్తాను.” అని మహారాజు సుచంద్రుడు అన్నాడు.
“శ్రీవారు మాకు బహుమానం ఇవ్వడానికి సంకల్పించారు. దానికి నేను చాల కృతజ్ఞుణ్ణి. కాని ఆ బహుమానం ధన రూపంగా ఉంటే మేమంతగా సంతోషించ లేము! నాకు సర్కారు వారు ఇచ్చే జీతం మా కుటుంబం పోషణకు సరి పోతుంది.”
“మరి ఏమి కావాలో కొరుకోండి.”
“కోరమని సెలవైతే కోరు కొంటాను.”
“తప్పకుండా, కోరుకోండి.”
“మహాప్రభో! శివంకర సంఘం వారు రాజ ద్రోహులని, మహామంత్రి సునంద బాబుగారును, రాష్ట్రియుడు వీరనందబాబు గారును నిర్ణయించి రాజకుల శాసనాన్ని పుట్టించారు! నేను ఆ శివంకర సంఘంలో సభ్యుడుగా ఉన్నాను! వారు చేసే సేవను శ్రీవారు దయగల చిత్తంతో గుర్తించి శివంకర సంఘం వారిని దేశ భక్తులుగా ప్రకటించి కఠినమైన రాజశాసనం నుండి కాపాడండి!
“ఘనేంద్ర బాబూ! వీడు తాను శివంకర సంఘ సభ్యున్నని రాజ సమక్షంలో అంగీకరించాడు. శివంకర సంఘం రాజ ద్రోహ సంఘంగా రాజకులం నిర్ణయించబడింది. అందువలన ఇప్పుడు వీనిని పట్టి బంధించాలి. బాధ్యత కల రాజకీయాదికారులపై వీని కటు ప్రయోగం క్షంతవ్యం కానేరదు!” అని ఆజ్ఞాపించాడు వీరనందుడు .
“భట్టారకుల వారు కోరమన్నారు, అతడు కోరుకొన్నాడు. వారి సంవాదంలో మనము జోక్యం చేసుకోవడం భావ్యం కాదు.” అని మృదువుగా అన్నాడు నగరపాలుడు.
“నీవు కూడ శివంకర సంఘం లోని సభ్యునిగా కనిపిస్తున్నావు. నా ఆజ్ఞను పాలించకుండా ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు”అని చుర చుర చూస్తూ పలికాడు వీరనందుడు .
“ఆంద్ర సామ్రాట్టు మాట ఒకటి తప్ప, ఈ భూ ప్రపంచంలో ఘోరకుని బంధించే శక్తి మరియొకటి లేదు వీరనంద బాబూ!”అని తీవ్ర స్వరంతో పలికాడు మహాప్రతీహారి.
“ఘోరక బాబూ! శివంకర సంఘం నిషిద్ధ సంఘమనే రాజకుల ప్రకటన ఇంకా రద్దు కాలేదు! ఆ ప్రకతంన సరియునడా, కాదా అనునాడు వేరు విషయము. నీవు శివంకర సంఘ సభ్యున్నని చెప్తున్నారు కాబట్టి, నీవు అపరాదివే అగుచున్నావు! అందు వలన నీవు లొంగి పోవలసిందే! పిమ్మట నీ ప్రార్థన గురించి ఆలోచించ బడుతుంది.” అని అన్నాడు మహారాజు.
ఘోరకుడు నిరుత్తరుడు అయ్యాడు! రక్త సిక్తమైన తన భీకర కరవాలాన్ని మహారాజు చరణముల ముందర ఉంచి చేతులు కట్టుకొని నిలుచున్నాడు.
“వీరనంద బాబూ! మీ ప్రభువు ఒకరితో మాట్లాడుతూ ఉండగా మధ్య చొరబడి మాట్లాడనీయకుండా ప్రభువు చేయ వలసిన పనిని మీరే చేయబూనుకోవడం రాజ ధిక్కార నేరం అవుతుంది! ప్రభువు కోరిన వానికి వరమిచ్చునొ లేదో తెలుసుకోకుండా మీరు మిక్కిలి బాధ్యతతో కూడిన రాష్ట్రీయాదికారాన్ని నిర్వహించలేరు! మేరు మీ రాష్ట్రీయ ఖడ్గాన్ని మహా వీరుడైన ఘనేంద్ర బాబుకు ఇచ్చి వేయండి.”
అని ఘనేన్ద్రుని వంక చూసి, “ ఘనేంద్ర బాబూ! నిన్ను మా ప్రభుత్వం రాష్ట్రియునిగా నియమిస్తోంది. దీనిని నేను న అసాధారణ అధికారంతో శాసిస్తున్నాను.” అని మహారాజు చెప్పాడు.
***********************
Comments
Post a Comment