Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ - సత్యప్రభ 12 :బాపు వేసిన బొమ్మలతో సహా

                                                                                                    
రాజాజ్ఞ వినగానే వీరనందుడు కంపిస్తున్న హస్తంతో   తన     రాష్ట్రీయాదికార చిహ్నమైన మహాఖడ్గాన్ని ఘనేంద్రుని చేతికి అందించాడు. ఘనేంద్రుడు దానిని వినయంతో ముట్టికాలు వేసుకొని స్వీకరించి, వీరమర్యాదని అనుసరించి మహారాజుకి నమస్కరించాడు. ప్రతీహారులంతా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పడ్డారు,

సుచంద్ర భట్టారకుడు మహామంత్రికి కబురు పెట్టాడు.

ఘోరకుని కనుసంజ్ఞను  గ్రహించి ప్రతీహారులు ఆసనాలు తెచ్చి సింహద్వారం ముందర వేసారు. అందరూ ఉపవిష్టులయారు. ఘోరకుడు మాత్రం నిలిచే ఉన్నాడు!

మహామంత్రి సునందుడు అక్కడకి వచ్చాడు. రాష్ట్రియుని ఖడ్గం ఘనేంద్రుని చేతిలో ఉంది! మహారాజు పాదాల వద్ద ఘోరకుని మహాఖడ్గం  పడి ఉంది! ఆ ప్రదేశమంతా కళేబరాలతో భీభత్సంగా ఉంది. ప్రతెహారులందరూ కాగడాలు పట్టుకొని నిలుచుని ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసి ప్రథాన మంత్రి చకితుడై మహారాజుకు అభివాదన చేసాడు! రాజ ప్రేరితుడయిన  ప్రతీహారి మహామంత్రికి జరిగిన సంఘటనని క్లుప్తంగా నివేదించాడు.

మహామంత్రి మహారాజుచే  అనుజ్ఞాతుడై ఆసనం అలంకరించాడు. అనంతరం సింహద్వారం దగ్గరే మహామంత్రి తోనూ, క్రొత్త రాష్ట్రియుని తోనూ రాజకుఅలాన్ని ఏర్పరచి, శివంకర సంఘం గురించి ముందు చేసిన ప్రకటనను రద్దు పరచడానికి ఆలోచించాడు మహారాజు!

అప్పటి ప్రభువు స్థితిని కనిపెట్టి మహామంత్రి ప్రతికూలంగా ఏమీ చెప్పలేక పోయాడు. ఘనేంద్రుడు మహారాజు సూచనను సమర్థించాడు. పూర్వ ప్రకటన రాజకులం మూలంగా రద్దు చేయబడింది. పునః ప్రకటనను ఘనేంద్రుడు అక్కడే వ్రాశాడు. మహారాజు , మహామంత్రి దానిపైన సంతకాలు చేసారు. రాష్ట్రియుడు ఘనేంద్రుడు కూడ సంతకం చేసాడు. ప్రకటన పత్రం శివంకర సంఘంపైన ఉన్న ఆంక్షలను తొలగించింది.

మహామంత్రి కుటుంబాన్ని తూలనాడినందుకు గాను ఘోరకునికి పది పానాలు జుల్మానా వేసి, అతని ఖడ్గాన్ని అతనికి ఇచ్చివేసాడు మహారాజు. తానూ కోరిన బహుమతి లభించినందున ఘోరకుడు మహారాజుకు సైనిక పద్ధతిలో నమస్కరించాడు.

“ఘోరక బాబూ! నీవు కోరిన బహుమానం నీకు ఇవ్వబడింది. నీ కుమారునికి మంచి బహుమతి ఇవ్వనిచ్చ గించున్నాను! అతనికి నగరపాల పదవిని ఇస్తున్నాను” అన్నాడు మహారాజు.

“మహాప్రభో! ఇప్పుడు వాణికి సర్కారు వారు ఇచ్చిన ఉద్యోగమే ప్రీతికరమయినది. పూర్ణంగా ప్రాంతప సంఘాన్ని, వారి చర్యలని కనిపెట్టి రాష్ట్రానికి అమూల్యమైన సేవ చేయాలని వాని సంకల్పం! వాణ్ని ప్రస్తుతం ఉన్న పదవిలోనే ఉంచండి. పని పూర్తీ అయిన తరువాత వానికి శ్రీవారు గొప్ప బహుమానం ఇప్పించ వచ్చును.” అన్నాడు ఘోరకుడు వినయంగా.

మహారాజు ఘోరకుని సూచనను అంగీకరించాడు. వీరనందునికి ‘ప్రాసాద కార్యదర్శి’ అను కొత్త పదవిని నూతనంగా సృష్టించి ఇచ్చాడు. ప్రాసాద కార్యదర్శి జీతం మంత్రుల జీతంతో సరి సమానంగా ఉంటుందని మహారాజు చెప్పాడు.

“మహాప్రభో! ఒక సంగతి నేను అడుగ వలసి వచ్చింది. అధిక ప్రసంగం అని ఎంచక శ్రీవారు కటాక్షించాలి.’” అని కోరాడు ఘోరకుడు.

“నిర్భయంగా అడగవచ్చును.”

“వీరనంద బాబు కొత్త ఉద్యోగంలో మహాప్రతీహారి తన బహిః పుర ప్రతీహారి వర్గంతో పాటు, అతని చేతిక్రిమ్డ ఉండవలసి ఉంటుందా?”

“నీకు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న?”

“అలాగయితే ఈ ఉద్యోగాన్ని మానుకోవడానికి.”

“ఎందుకు మానుకోవాలి?”

“కారణం చెప్పుతే నాకు మరికొన్ని కార్షాపణాలు జుల్మానా పడవచ్చు.”

మహారాజు సుచంద్రుడు నవ్వాడు. సునంద వీరనందు లిద్దరికీ కనుల వెంట నీరు లేని ఏడ్పు వచ్చింది!

“ఉండనక్కరలేదు! మహాప్రతీహారి మహారాజుకి మాత్రమే బాధ్యుడు.” అని సమాధానం చెప్పాడు మహారాజు.” మహారాజు సభ ముగించి అంతః పురానికి వెళ్ళిపోయాడు. మ్లానవదనాలతో సునంద వీరనందులు   ఆ స్థలాన్ని విడిచి వెళ్ళారు! ఘనేంద్రుడు తన రక్షి జనుల సహాయంతో శత్రువుల శవాలను అడవికి తోలించి దహన క్రియ కావించాడు. ప్రతీహారులందరూ మహా కోలాహాలంతో రక్త పంకిలమైన సింహద్వార స్థలాన్ని కడిగి శుభ్రం చేసారు.

*************

25 వ ప్రకరణం:

 సులోచనుడు పరాక్రమ విషయంలో అల్పుడే అయినా, పరుగేత్తడంలో అసాధ్యుడు! ధావనంలో వానికి తీసిపోని వాడు ప్రమథనాథుడు. సులోచనుడు ప్రమథనాథున్ని అనేక వీధులు తిప్పాడు. ఎప్పటికైనా వాడు అలసిపోడా అని సులోచనుని భావం. ఎప్పటికైనా సులోచనుడు అలసిపోయి తనకి పట్టుబడడా అని ప్రమథ నాథుని ఆశ!

ఇట్లా పరుగెత్తుతూ సులోచనుడు ఒక సందు మలుపులో చొరబడ్డాడు. ప్రమథనాథుడు ఆ సందు లోకి వచ్చే సరికి సులోచనుని జాడ అగుపించ లేదు! ప్రమథనాథుడు ఆశ్చర్యంతో రెండు నిమిషాలు నిలబడి అటూ ఇటూ చూసాడు. అన్ని ఇండ్ల తలుపులు మూయబడే ఉన్నాయి! ఇంట వేగిరం వాడొక ఇంటిలో దూరడం సాద్యం కాని పని. ప్రమథనాథుని దృష్టి ఒక ఇంటి వీధి అరుగు మీద ఉన్న ‘ముట్లు గది’ ఆకర్షించింది! వెంటనే అతడు అరుగు ఎక్కి ముట్టు  గది తలుపు త్రోసి చూసాడు. లోపల గడియ వేసి ఉంది.

సులోచనుడే లోపలికి దూరి గడియ పెట్టుకొన్నాడేమో అని అని ఉహించాడు ప్రమథనాథుడు. ఒకవేళ ఆ ఇంటి యజమానురాలే ఆ గదిలో ఉన్నదేమో అనే సంశయం కూడ అతనికి కలిగింది. అతడు సందిగ్ధావస్థలో పడి పోయాడు. ‘సరే, ఏమైతే అదే కానీ ఇక్కడే కొంత సేపు నిలబడి చూద్దాం’ అని తలంచి ప్రమథనాథుడు తలుపు దగ్గర నిలబడ్డాడు.

నిజంగా ఏమి జరిగింది? సులోచనుడు ఆ  సందులో ప్రవేశించగానే ముత్తు గది తలుపు తెరచే ఉంది. వెంటనే వాడు ఆ చీకటిలో మెల్లగా ఆ గదిలోకి చొరబడి తలుపు గడియ పెట్టాడు. కొంత సేపు ఆ గదిలో కాలక్షేపం చేస్తే ప్రమథ నాథుడు తన ప్రయత్నం వ్యర్థం అయిందని తలంచి వెళ్లి పోతాడని ఆశించాడు సులోచనుడు. ఎలాంటి సందర్భం లోనూ మొక్కవోని బుద్ది ప్రమథనాథునిదని వానికి ఎట్లు తెలుస్తుంది?

తన తొందరలో సులోచనుడు గమనించ లేదు గాని, ఆ ఇంటి యజమానురాలు ఆ గదిలో పండుకొని ఉంది. ఉక్కగా ఉన్నందున తలుపులు వేసుకోలేదు ఆమె! సులోచనుడు లోపలికి వచ్చి గడియ పెట్టగానే ఆమెకు మెలకువ వచ్చింది. ఎవడో దొంగ ప్రవేశించాడని భయపడింది.

ఎవరామె ? వీరభద్రావధాని భార్య మనోహారిణి ఆమె! కాశ్యప దేవకీర్తి చెల్లెలు మనోహారిణి ఆమె! ఆమె మిక్కిలి గుండే దిటవు గల స్త్రీ ! అత్యంత నిర్భయురాలు! చాందసుని పత్ని అయినా మిక్కిలి నెరజాణ. అనుమానం ఆవేశించగానే కుంపటిని ఊది ఈనాపుల్లతో దీపం వెలిగించింది. ఆమె కంటికి కనిపించాడు సులోచనుడు. వాణ్ని చూడగానే భయ జుగుప్సా సంభ్రమాలు ఆమెకు కలిగాయి!

సులోచనుడు మనోహారిణిని చూసాడు. ఆమెను చూడగానే తాత్కాలికంగా వాని భయం అంతర్హితమై పోయింది! ఇంత  సేపు తాను  పొందిన దావనాయాసం వల్ల అలసట  మటుమాయమయింది. తన వెనుక తన ఘోర శతృవు ప్రమథనాథుడు ఒకడు ఉన్నాడన్న జ్ఞాపకం నశించింది. ఆ మనోహారిణి వానికి తన హృదయ మనోహరిణిగా కనిపించింది!          

 “శ్యామలా! నా ప్రియమైన శ్యామలా! నీవిక్కడా ఉన్నావు? నీవు చనిపోయావని తలంచాను సుమా!  బ్రతికే ఉన్నావా? ప్రాణేశ్వరీ! ఈ చాందసుని ఇంటనా నీవు ఉన్నావు?”  ఇవీ  అప్రయత్నంగా సులోచనుని నోటి నుండి వెలువడిన మాటలు! అవి ద్వారా ద్వార దేశమందు నిలబడి ఉన్న ప్రమథనాథుని చెవిన బడ్డాయి. పిమ్మట మనోహారిణీ సులోచనులకు ఈ క్రింది విధంగా సంభాషణ జరిగింది! ప్రమథనాథుడు నిల్చోనే వినసాగాడు!

“ నీవెవడవు ? దుర్మార్గుడా! శ్యామల ఎవతె? నేను ఎవరిని అనుకొన్నావు. తలుపులు తీసుకొని నేరుగా వెళ్తావా, కేకలు వేయమంటావా?”

“ అదిగో ఆ స్వరం కూడ శ్యామలదే!”

“ అరె! నీవు త్రాగి వచ్చావా ఏమి?”

“సులోచనుడు ఎన్నో తప్పులు చేసాడు. కాని ఎన్నడూ త్రాగి ఎరుగడు. వాణి కండ్లు వేలమందిలో ఉన్నా తన ప్రియమైన శ్యామలను గుర్తించ గలవు. అతని చెవులు చీకటిలో కూడ శ్యామల స్వరాన్ని పోల్చగలవు.

“నీ పేరు సులోచనుడా?”

“ నన్నొక క్షణం కూడ చూడక పొతే నిలువలేని రోజులు కాల గర్భంలో లీనమై పోయాయి! ఇప్పుడు నీవు సులోచనుని పేరు కూడ తెలియనట్లు నటిస్తున్నావు! నా ప్రియమైన శ్యామలా! బాభ్రవ్యుని కామ తంత్రాన్ని నేను నీకు నేర్ప లేదా? నీ భర్త సులోచనున్ని మరచినా, నీ గురువు సులోచనున్ని మరచి పోయావా?”

“నీవు రూప సాదృశ్యాన్ని బట్టి భ్రాంతి చెంది ఉంటావు! నేను కాశ్యప దేవకీర్తి చెల్లెల్ని. వీరభద్రావధాని  భ్హర్యని. నా పేరు మనోహారిణి! నీ శ్యామల ఎవరో నాకు తెలియదు. ఇట్టి సమయంలో ఈ అర్థ రాత్రి వేళ నా గదిలో ప్రవేశించడం ఘోరమైన తప్పిదం! నీవు తక్షణమే ఈ గది వదలి బయటికి నడు! వెళ్ళక పొతే కేకలు వేస్తాను. ఇంటి వారినందరినీ లేపుతాను!”

“ రూప సాదృశ్యమే కాదు, స్వర సాదృశ్యము కూడ ఉంది. ఎంత విన్నా తనివి తీరని స్వరం అది! ఎంతచ్చూసిన తనివి తీరని రూపం ఇది! అవి నేను ముద్దుపెట్టుకొన్న చెక్కులే! అవి నేనుచేతితో సవరించిన ముంగురులే! ఇంకా ఆ ముఖం లోని కళ చెక్కు చెదర లేదు! మనోహారిణియే శ్యామల అనే పేరుతో కొన్నాళ్ళు నన్ను ఏలింది! ఆ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకొన్నాను. నా మనోహారిణీ ! నన్ను వదిలి వేరు మగని పెండ్లాడడం ధర్మమేనా? నేనీ ఘోరాన్ని తాలజాలకున్నాను.నా దగ్గర కత్తి  ఉంది, ఇంద! తీసుకొని నన్ను నరికి పారేయి! నా రక్త వారితో నా దుఖం చల్లారుతుంది.”

“నీకేం పిచ్చి పట్టిందా సులోచన బాబూ! నేను ఎంటే మాత్రం నీ శ్యామలని కాను!!”

“ఆ మాట నేను నమ్మను. నీవు ‘నేను శ్యామలని’ అని అంగీకరించినా, నిన్ను ముట్టుకొను. భయపడ నవసరం లేదు, నా కొడుకుని ఎక్కడ పారవేసావో చెప్పు.”

“నీ కొడుకుని నేను పారవేయడ మేమిటి? నేనేం చెప్పినా నన్ను వదలి వేల్లవేం ? నేను తలుపు తీసుకొని వెళ్లి కాలనాథ బాబుతో నీ అత్యాచారాన్ని చెబుతాను. అతడు నీకు తగిన బుద్ది చెప్తాడు” అంటూ మనోహారిణి లేచింది. ప్రమథనాథుడు ఈమ్సమ్వాదమన్తా విని ‘మనోహారిణి శ్యామలయా!’ అని ధృఢమైన సందేహానికి
 లోనయ్యాడు!

మనోహారిణి స్వయంగా తలుపు తీసింది.దీపపు వెల్తురులో వారిద్దరూ ప్రమథనాథుని చూసారు! మనోహారిణి చాల సిగ్గుపడి తల వంచుకొంది. సులోచనుడు భయపడ్డాడు.

ఆ భయంలో సులోచనునికి ఎక్కడ లేని వేగం పుట్టుకొని వచ్చింది! ఒక్క త్రుటి కాలమైన వ్యర్థం చేయకుండా మనోహారిణిని, ప్రమథనాథునీపై త్రోసి అరుగు మీదనుండి గెంతి పరుగెత్త సాగాడు. ప్రమథనాథుడు తనపై పడి పోయిన మనోహారిణిని పట్టి నిలబెట్టే లోపుగా సులోచనుడు తప్పించుకొని పోయాడు. మళ్లీ ధావన కాండ ఆరంభించింది!

మనోహారిణి వీరినిద్దరినీ చూచి ఆశ్చర్య పడింది! వారే గతిలో ఉన్నా, సులోచనుని బారి నుండి తాను  తప్పించుకొన్నందుకు సంతోషించింది.

సులోచనుడు కొన్ని వీధులు దాటి అలసిపోయి ప్రమథనాథుని చేత పట్టుబడడానికి తయారయ్యాడు


 వాని వేగం తగ్గిపోయింది. ఇంతలో ఒక ఇంటి తలుపు తెరువబడింది! ఆ అవకాశాన్ని జార విడుచుకో లేదు సులోచనుడు. ద్వార ప్రదేశంలో ఒక స్త్రీ వని కంటికి కనిపించింది. శరవేగంతో సులోచనుడు ఆ ఇంటి లోపలి దూరి “శరణు, శరణు! కాత్యాయనమ్మా! నన్ను రక్షించు” అని బిగ్గరగా అరిచాడు.

 “వాడు రక్షించదగిన వాడు కాడమ్మా! వాడు దుర్మార్గుడైన రాజద్రోహి!” అని చెప్పుతూ ప్రమథనాథుడు లోపల ప్రవేశించాడు.

“ప్రమథనాథు బాబూ! కాత్యాయని శరణాగతుల్ని విడువదు! నీకు ఆ మనిషే కావాలంటే నన్ను చంపి లోపలి వెళ్లు.”అన్నది కాత్యాయని.

ప్రమథనాథునికి కాత్యాయని పైన మిక్కిలి గౌరవం ఉంది. తన తండ్రి ఘోరకుడు కాత్యాయని మహిమను గొప్పగా కొనియాడడం విని ఉన్నాడు! ఆమె మంచి విద్వాంసురాలని విన్నాడు. స్త్రీల స్వాతంత్య్రం గురించి ఆమె ప్రవచనాలను అనేక సార్లు విన్నాడు! అట్టి ఉత్తమ నారిని ఉల్లంఘించి లోపలి ఎట్లా వెళ్ళగలడు?

“అమ్మా ! మీరు రక్షింప నెంచిన వానిని నేను పట్టుకో లేను. వానితో ముఖాముఖీ మాట్లాడాలని కోరుతున్నాను. వాడు తానూ ఒక మహావీరున్నని బడాయి కొట్టుకొంటున్నాడు! అలాంటివాడు ఒక స్త్రీ ద్వారా రక్షణ పొందడం ఎంత గౌరవ హానికరమో వానికి నేను నచ్చచెప్పాలి.”

“వీడు ఎన్ని టప్పాలు కొట్టినా, తన కార్య సాధన కొరకు గడ్డి తినడానికి కూడ వెనుకంజ వేయని తుచ్చుడు. వీన్ని పట్టుకొన్నంత మాత్రాన నీ కీర్తి ఎంత మాత్రమూ వృద్ది చెందదు!నీవు అధిక్షేపించినంత మాత్రాన వీడు సిగ్గు పడతాడని తలచ వద్దు. శుర్యం వీసమంత లేని వాడికి సిగ్గు ఎక్కడ నుండి వస్తుంది? వీడు బ్రతికి ఉన్న చచ్చిన వారిలోనే జమ!

ఈ రాత్రే వీడు ఒక ఆడుదాని కత్తికి భయపడి పారిపోయాడు! ఇపుడు చేతిలో కత్తిని ధరించి కూడ ఒక ఆడుదానిని శరణు వేడుకొంటున్నాడు!” అని కాత్యాయని ప్రమథనాథునితో చెప్పి, సులోచనుని వైపు తిరిగి వానితో ఇట్లా చెప్పింది.

“అభాగ్యుడా! నీకు శస్త్రం దేనికి? దానిని ప్రమథనాథునికి ఇచ్చి అతని కాళ్లు పట్టుకొ, నీకు విముక్తి కలుగుతుంది. ఈ రాత్రే కాదు, నీవు బ్రతికి ఉండగా అతడు నీ జోలికి రాదు!” అని.

“నేను నిన్ను శరణు వేడాను, నీవు రక్షింప లేనప్పుడు శాత్రవుని శరణు పొందుతాను.” అని సిగ్గు విడిచి చెప్పాడు సులోచనుడు.

“అయితే ఆ కత్తిని నాకు ఇచ్చేయి.” అని ఆజ్ఞాపించింది కాత్యాయని. సులోచనుడు తన క్రుపాణాన్ని కాత్యాయని కాళ్ల ముందు పెట్టాడు!  ప్రమథనాథుడు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్య చకితుడు అయ్యాడు.

ఇంతలో రాజకాళి అక్కడ ప్రత్యక్షమయింది. “పిన్నమ్మా! చంపమ్మ వదినె ఇంట నాకు నిద్ర పట్టలేదు! నీ ఇంట్లో పడుకోవడానికి వచ్చాను”.అంటూ.  “నీకు ఇన్నాళ్ళకు కాత్యాయని ఇళ్లు గుర్తుకొచ్చిందా?”

“అవును” అని చందోబద్ధ వాణిని ఆశ్రయించి రాజకాళి ఈ విధంగా పాటలు పాడ నారంభించింది.

“ నశ్యమైన ప్రపంచ నాటక మందు / దృశ్యాలు చూడంగ తిరుగు చున్నాను.                                                           ఈ రాత్రి ఈ ద్రుశ్యమీక్షించు కొరకు /మీ రాజకాలమ్మ మీ ఇల్లు చేరె!

కత్తిని కలకంఠ కాళ్ళపై నుంచి /  నెత్తిని వంచిన నీచ దృశ్యంబు.                                                                    భీరువు శరణన్న పిరికిని గాయ / వీరుని  నిలిపిన ధీర దృశ్యంబు.

 చూడంగ వచ్చితి సుందరీ ఇపుడు / పాడంగ వచ్చితి భామినీ ఇపుడు.                                                              ఒళ్లు బాగున్నది ఉహాలు పాడు / కళ్ళు మంచివి గాని కథ బాగులేదు.

కాళ్లలో బలమస్తి కరములో నాస్తి / కరములో నాస్తి.                                                                                            నీటిలో తిరుగాడు నీచ సర్పమిది. “

కొసకు ప్రమథనాథుడు కాత్యాయని దగ్గర సెలవు తీసుకొని వెళ్లి పోయాడు. తరువాత సులోచనుడు బ్రతుకు జీవుడా అని దీన వదనంతో నిష్క్రమించాడు.

ఆ రోజు రాత్రి రాజకాళి కాత్యాయని ఇంట్లోనే పడుకొంది.

****************************

26 వ ప్రకరణం:  

అంతఃపురిలో పార్థివుడు సాయంకాల కాలకృత్యాలు తీర్చుకొని తన ఏకాంత శాలలో రథినీ కుమారితో ప్రసంగించాడు.

సాక్షర నారీ సభ జరిగిన మరుచటి రోజు నుండి మహారాజు తన కుమార్తెతో కలసి ప్రతి దినం సాయంకాల వేళ లందు మాట్లాడడం పరిపాటి అయింది. మహారాజు తన కుమార్తె బుద్ది సూక్ష్మతను బాగా గమనించాడు. రాజకీయాలలో ఆమె అమూల్యమైన సలహాలను పార్థివునికి నిర్భయంగా చెప్పి మెప్పు పొంద గలిగింది.

“ఇంకా రాజధాని భోగట్టాలు ఏమిటి?” అని కుమార్తెను ప్రశ్నించాడు సుచంద్రుడు.

“సింహాసనాదికారం జ్యేష్ట పుత్రునిదా, లేక పట్టమహిషీ పుత్రునిదా అనే సమస్య గురించి రాజధానిలో చాల చోట్ల చర్చలు జరుగుతున్నాయి. మా తాతయ్యగారి ఇంట్లో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి నాన్నగారూ!”

“ఈ సమస్యను అనుసరించి రాజధానిలో రెండు పక్షాలు ఉన్న మాట నాకు తెలిసింది. కన్నతల్లీ! నగరంలో ఏ పక్షానికి బలం ఎక్కువ ఉంది?”

“అధికార వర్గంలో పెద్దబాబు పక్షానికిన్నీ, సామాన్య ప్రజలలో చిన్నబాబు పక్షానికిన్నీ బలం ఎక్కువగా ఉంది.”

“కన్నా! నీ అభిప్రాయం ఏ పక్షానికి చెందినదమ్మా?” అని మందహాసం చేసాడు నరేంద్రుడు .

“ నాన్నగారూ! మా స్త్రీలకు నిష్పక్షపాతంగా విమర్శించి ఒక పక్షాన్ని స్వీకరించ తగిన విశాల హృదయం ఎక్కడ నుండి వస్తుంది? అది నిజమో కాదో గాని నేను నా సాగర్భ సోదరుని ఔన్నత్యాన్ని కోరుతున్నాను.”

రథినీ కుమారి తన తండ్రి స్వభావాన్ని బాగుగా గుర్తించిన జాణ! చనువు తీసుకొని నిర్భయంగా అభిప్రాయాలు వెల్లడిస్తే పార్థివునికి చాల ప్రీతికరమనే సత్యాన్ని ఆమె గుర్తించింది. ఆ సంవిధానాన్ని అనుసరించే ఆమె మహారాజు మనస్సుని తన వైపు మళ్ళించుకొంది.

“ఇది చాల క్లిష్ట సమస్యే!”

“నాన్నగారూ! కాశ్యప ప్రమతిన్నీ, కౌన్డిన్యస ధర్మపాలుడున్నూ కలిసి ఒక విన్నపం తయారు చేశారట! ఆ విన్నపం రాజ ధర్మాసనానికి ప్రాయికంగా రేపో, ఎల్లుండో వస్తుంది! పౌరులను కలవార పరిచే ఈ ఉత్తరాధికారి సమస్యను గురించి రాజ ధర్మాసనం బాగా ఆలోచించి నిర్ణయం చేయాలని వారు ఆ విన్నపంలో కోరారట!

 ప్రమతి పెద్దబాబు పక్షం లోను, ధర్మపాలుడు చిన్నబాబు పక్షం లోను వాదిస్తారట.”

“ అది బాగానే ఉంది! మూతముప్పిడిగా వ్యవహారాన్ని ఉంచితే, తరువాత పిల్లల్లో అన్యోన్య కలహం పుట్టి , సామ్రాజ్యం అధోగతి పాలు కావలసి వస్తుంది. నేను ఆ విన్నపాన్ని రాజ ధర్మాసనంలో విచారించేతట్లు ఉత్తరువు ఇస్తాను.”

 “అదే మంచి మార్గం నాన్నగారూ!”

సుచంద్రుడు ఈ ప్రసంగం కొనసాగించ దానికి ఇష్టపడ లేదు. కాబట్టి ప్రసంగాంతరం దాటితూ ఇలా అన్నాడు. “కుమారీ! సాక్షర నారీ సభలో రాజకాళి తన తండ్రి గురించి చెప్పిన మాటలు నీకు ఏమైనా అర్థమయ్యాయా?”

మహారాజు ఈ ప్రస్తావన తీసుకొని రావడం రాతినీకుమారికి ఉత్సాహాన్ని పుట్టించింది. ఆమె ఇట్టి ప్రస్తావనకే ఎదురు చూస్తోంది! “ఆమె చెప్పిన క గ చ జ బాబు నాలుగు పేర్లు ధరించిన ఒకే వ్యక్తీ! కకారుడు కంకోల భట్టాచార్యులు. గకారుడు ఆన్గేఎరస గణదాసు. చకారుడు విరూప చక్రధరుడు. ఇక జకారుడు జటాముని. కంకోలుని కొడుకు కీ.శే. దండనాయక సత్యరథ బాబు అని అందరూ ఎరిగిన విషయమే! గణదాసు పిల్లలు విమలుడు, నిర్మల. విమలుడే శాంతిసేన అత్తయ్య పెనిమిటి. నిర్మలే రాజకాళి అనే పేరుతో తిరుగుతూంది! చక్రధారిని పిల్లలు సుముఖి, అపరాజిత, అక్షోభ్యముని అట! ఈ సంగతంతా సత్యప్రభ నాతొ చెప్పింది. ఆమెకి రాజకాళియే  స్వయంగా చెప్పిందట! “

“సుముఖి అపరాజిత ఎక్కడ ఉన్నారు?”

“అపరాజిత చిదంబరంలో తపస్సు చేసుకొంటూ ఉందట! సుముఖి దండకారణ్యంలో ఉందని చెప్పింది సత్యప్రభ. వీరిద్దరి గురించి ఆమెకి అధికంగా తెలియదో లేక తెలిసి ఉండీ రహస్యమని చెప్పలేదో తెలియదు!”

 “సత్యప్రభ జన్మను బట్టి ఒక వార్త పుట్టిండి కదా? ఆ విషయంలో నీకు ఏమైనా తెలుసునా?”

“అది సర్వాబద్ధం! ఎవరో దుష్టులు కల్పించినది ఈ వార్త!”

“అది అబద్ధమే కావచ్చు! కాని ఆ పిల్ల అపవిద్ధ కాబట్టి పరిగ్రాహ్య కాదని నేను కుర్రవాళ్ళని పిలిపించి ఆదేశించాను.”

“అపవిద్ధ అయిన సీతా దేవిని శ్రీ రాముడు పెండ్లాడ లేదా?”

“ప్రాచీన ఇతిహాస రహస్యాలు మంకు తెలియవు. సీతాదేవి భూమిపై అయోనిజగా పుట్టిందని చెప్తారు. రావణునికి వేదవతి యందు పుట్టిన పిల్ల అని కొందరు కథనం. అస్మదాడులకు మొదటి పక్షమే మంచిదిగా కనబడుతుంది.”

“ సత్యప్రభ కూడ అయోనిజ అని మనము ఏల భావించకూడదు నాన్నగారూ?”

“ సీత అవతార స్త్రీ కాబట్టి ఆమెను గురించి ఎన్ని చెప్పినా సరిపోతుందమ్మా! ఆ శ్రద్దే మన భావనలకు బలాన్ని ఇస్తుంది.”

“సీత అవతార స్త్రీ  అయితే సత్యప్రభ కూడ అవతార స్త్రీ అవుతుంది. ఇది వరకు సత్యప్రభ వంటి స్త్రీ గురించి మనం విన్నామా?”

“ ఆ సంగతిని తరువాతి తరాల వారు చెప్పవలసి ఉంటుంది. దానికేమి గాని, సత్య ప్రభ పరిగ్రాహ్య అనే నీ భావమా?”

“అవును నాన్నగారూ! అన్నలలో ఎవరు సింహాసన ఉత్తరాదికారి అవుతారో, అతనికి మనం ఆమెని మాట్లాడవచ్చని నా మతం. మా అన్నలకు మీరు ఇచ్చిన ఆదేశాన్ని ఇప్పుడు తిప్పుకోవద్దు! ఉత్తరాధికారి సమస్య  మొదట పరిష్కారం కానీయండి.”

“పరిష్కారం ఒక్క రోజులోనే అయిపోతుందమ్మా!”

“ ప్రజల సాక్ష్యాలని ఎన్నో తీసుకోవాలట  నాన్నగారూ!”

“ఇది కేవలం న్యాయ సమస్య. దీనిలో ప్రజల సాక్ష్యాలు తీసుకోవలసిన అవసరం ఉండదని అనుకొంటాను. వ్యక్తుల గుణ తారతమ్యాలని బట్టి దీన్ని తేల్చకూడదు! ఆ చర్యకే అవకాశాన్ని ఇవ్వను.”

రాజుగారి నిర్ణయం రథినికి నచ్చింది! పెద్ద మనుష్యులని పేరు పెట్టుకొన్న భోగనాథ ఈ బలం ఎక్కువగా ఉంది! వారు లీలావతీ దేవి ఉప్పు తిన్నవారు ఆమె అనుగ్రహం వల్ల మంచి స్థితికి వచ్చారు! వారు సమయమందు ఆమెకి ద్రోహం చెయ్యరు. సాధారణ ప్రజలలో శక్తిధరుని పక్షం వారు ఎక్కువ మంది ఉన్నారు! వారిలో నుండి సాక్ష్యానికి పిలువతగిన  వారు చాల తక్కువగా ఉన్నారు. కాబట్టే రథినీ కుమారి విచారాన్ని శీఘ్రంగా ముగించాలనే మనస్సులో నిర్దేశించు కొని ముందు పీఠిక వేసుకొంది! “అదే సరి నాన్నగారూ!”

“ ఒక సంగతి గురించి సత్యప్రభ నీతో చెప్పిందా?”                “ఏ సంగతిని గురించి?”

“ అదేనమ్మా, రాజకాళి పెళ్లిని గురించి!”

“ ఆ విషయం గురించి సత్యప్రభ చెప్పనవసరం లేదు నాన్నగారూ! ఆమే స్వయంగా సాక్షర నారీ సభలో  మహారాజే తన భర్త అని చెప్పుకొంది. ‘నా రాజు నరమౌళి నా చిన్ని మగడు,  నా రాణి లీలమ్మ నాముద్దు సవతి’ అని! ఏ సంబంధం లేనిదే ఆమె అలా చెప్పగలదా?”

“ అది భావనామాత్రమేమో!”

“నాకు భావనామాత్రంగా తోచలేదు! సరిగా జ్ఞాపకం తెచ్చుకోండి నాన్నగారూ! ఇలాంటి స్త్రీ మీకు ఎప్పుడైనా తెలుసా?”                                                 “ లేదు పిల్లా !”

“మా తల్లులిద్దరు కాక మీకు వేరే కన్యను ఎవటేను కూడ మీరు వివాహం చేసుకోలేదా?”

“నీకు ఎందుకు ఇలాంటి సందేహం వచ్చింది?”

“ మీరు ప్రతీ మంగళవారం రాత్రి ఎక్కడికో ఒంటరిగా వెళ్ళడం నేను గమనించాను. అదే నా సంశయానికి కారణం.”

ఇట్టి నిర్భయ ప్రసంగం నరపతిని చాల సంతోష పెట్టింది. అతడు తన కుమార్తెను దగ్గరగా తెసుకొని ముద్దు పెట్టుకొని ఇలా చెప్పాడు. “ పిల్లా! నీ పరిశోధనకు సంతోషించాను. నాకు మరొక భార్య ఉండడం వాస్తవమే! అది మాత్రం మానవురాలు కాదు! అది ఒక యక్షిణి!, దాని పేరు మంజుల.”

రథిని మిక్కిలి ఆశ్చర్యం పొందింది. ఆ యక్షిణే కాలనాథుని తల్లేమో అని శంక పుట్టింది! గతదినం రాజకాళి కాలనాథుని ఇంటిముందు పాడిన పాటలని తన సఖి పద్మాక్షి ద్వారా తెలుసుకొని ఉంది రథిని. తాను పాటలను విన్న సంగతి తండ్రికి తెలియజేసింది.

“ఎవరా పాటలను విన్న సఖి?”

“వీరభద్రావధాని గారి పద్మాక్షి, ఆమెకు శ్రుతధరత్వ శక్తి సహజంగా ఉంది! ఆమె రాజకాళి పాటలను విని జ్ఞాపకం ఉంచుకొని నాకు చెప్పింది. వీరభాద్రవధాని ఇల్లు కాలనాథుని ఇంటికి ఎదురుగా ఉందట!”

“ ఆ పాటలు నీకు వచ్చునా?”

“ నేను వ్రాసుకొన్నాను, ఇదిగో చూడండి” అని తండ్రి చేతికి కాగితం ఇచ్చింది రథిని.

సుచంద్రుడు దీక్షగా వాతిని  చదువుకొన్నాడు. కాలనాథుడు న్యాయస్థానంలో తన జన్మ గురించిన వ్యాజ్యంలో ఏమి సాక్ష్యం చెప్పాలో అని ఆలోచిస్తున్న సమయంలో రాజకాళి పాడిన పాటలవి! “మనం దీని గురించి బాగా శోధించాలి.” అన్నాడు రాజు.

“నాన్నగారూ ! క్షమించండి అధిక ప్రసంగం చేస్తున్నానని అనుకోవద్దు! మంజుల ముఖాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా?”

“ఎన్నడూ చూడలేదమ్మా!”                                          “ ఆమె మాటలైనా విన్నారా?”

“ఎన్నడూ వినలేదు తల్లీ!”                                            “ చాల ఆశ్చర్యంగా ఉంది, నాన్నగారూ!”

“అతి మధుర భాషిణి, అతి లావణ్య పూరిత అయిన లీలావతి కంటె, మౌనవతి అంధకార ప్రచ్చన్న రూపం గల మంజులే నీ తండ్రికి ఆనంద సందాయని సుమా!”

“ అది యక్షిణి కాదు నాన్నగారూ! యక్షినులు తమ రూప వాక్కులను దాచుకోవలసిన అవసరం ఏముంటుంది?”

“మరెవరు దెయ్యమా?”

“యక్షిణి అన్నా ఆడ దెయ్యమన్నా ఒక్కటే అని, భూత విధ్యాభిజ్ఞుల్లో శ్రేష్టులైన కంకోల భట్టాచార్యుల వారు తన గణపతి తంత్రంలో వ్రాసి ఉన్నారు. ఆమె మానవి అనే నా అభిప్రాయం!”

“ మానవియా?” అని ఆశ్చర్యంతో అడిగాడు సుచంద్రుడు.            “అవును నాన్నగారూ!”

“భూరమావర ఆంధ్ర భూమి భూషణము / మా రాజకాళియే మంజులా దేవి!                                                          వీరుని జనయిత్రి వీరుని పత్ని / మా రాజకాళియే మంజులా దేవి!                                                                  

రాయల మనసుని రంజిల్ల జేయు / మాయల మారియౌ మా రాజకాళి!                                                                 కరము సమర్థమౌ కయ్యాల భామ  / మా రాజకాళియే మంజులా దేవి!

ధర రాజకాళియే దయ్యాల రాణి / భువి తిరుగాడేడు భూతాల సాని!                                                                  కవి రాజ్ఞియే గాని ఘన యక్షి కాదు! వనజ పత్రాక్షుడు / మనుజోత్తముండు                                                          మన కాలనాథుడే  మంజులా సుతుడు.”  

తరువాత ఆ తండ్రీ కూతుర్లు రాజకాళి ని గురించి చాల సేపు మాట్లాడుకొన్నారు.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద