Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ -- సత్యప్రభ 13:బాపు వేసిన బొమ్మలతో సహా

28 వ ప్రకరణము:


                 
       
సమావేశం ముగిసిందని ఊహించి కాలనాథుడు రాజాజ్ఞ పొంది సప్త భూమికా విమానం వదలి వెళ్ళడానికి నిశ్చయించుకొన్నాడు. ఆ భావాన్ని పార్థివుడు కనిపెట్టి ఇలా అన్నాడు.

“కాలనాథ బాబూ! వ్యవహార కాండ ముగిసింది. కాని నీ రాజు నీవు మరికొంతసేపు కూర్చోవాలని కోరుతున్నాడు. కొంత లోకాభిరామాయణం ముచ్చటించుకొందామని తలస్తున్నాను.

“చిత్తం మహాప్రభో!”

“కొసకు నీ తల్లి తండ్రులు శ్యామలా సులోచనులు కారని నీ మనస్సాక్షికి స్ఫురించిందా?”

“సూటిగా మహారాజు వేసిన ప్రశ్న కాలనాథుని చకితునిగా చేసింది. ఏదో ఆపదలో పడిపోతున్నట్లు ఒక భావం వానికి పుట్టింది! ఆ భావోద్రేకం వల్ల వాణి శరీరం కించిత్తు వణికింది. తన్ను బాగా సమాళించుకొని పార్థివుని చూసి ఇలా అన్నాడు. “ నిజమే ప్రభో!”

“తిరిగి అసలు తల్లి తండ్రులను శోధించడానికి ప్రయత్నిస్తావా?”

కాలనాథుడు గతుక్కుమన్నాడు! తన్ను తాను  సమాధాన పరచుకొని “మహాప్రభో! విస్తారం శోధన అక్కర లేకుండానే నా తల్లి తండ్రులు ...నాకు ..తెలిసి ..పోయారు!”

“కాలనాథ బాబూ! వారి పేర్లు వినవచ్చునా?”

అంతట కాలనాథుడు సిద్ధ కవీశ్వరి రాజకాళి పాడిన పాటలను మంద్ర స్వరంతో పాడి వినిపించాడు! తరువాత ఇలా అన్నాడు. “మహాప్రభో! యోగీశ్వరి రాజకాళమ్మ పాడిన పాటల వలన నేను అంధకారం నుండి బయట పడ్డాను! వాటి వలన శ్యామల కాక వేరు అమానుష వ్యక్తీ ఎవరో నా తల్లి అని నాకు ముందుగా బోధపడింది! మొన్న రాత్రి నేను చంపావతమ్మ గారి ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో రాజకాళమ్మ కూడ అక్కడకి వచ్చింది. ఆమె నన్ను చంపావతమ్మకు చూపి, ‘ వీడు నిజంగా నీ ఆడపడుచు కొడుకే!’ అని చెప్పి ‘కంకోల, గణదాస, చక్రధర, జటాముని నామములతో విలసిల్లే మహాపురుషుని కొమారితే వీని తల్లి!’ అని వెల్లడించింది. రాజకాళమ్మతననే పరోక్ష భాషలో అలా చెప్పుకొందని ఊహించుకొన్నాను. మహాప్రభో! నేను ఇట్లా ఒక ఉన్మత్త సిద్ధ కవీశ్వరి కుమారున్ని! ఆమె ప్రేమించిన మహాపురుషుడు నా కన్నతండ్రి అయి ఉండాలని నేను తలం చాను! అనంతరం సత్యప్రభ ఆ సందేహాన్ని పరిష్కరించుకొనే సంకల్పంతో రాజకాళమ్మని ‘కౌండిన్యస సుచంద్ర భట్టారకుల వారు కాలనాథుని జనకులా?’ అని సూటిగా ప్రశ్నించింది.”

“ఆమె ఏమి బదులు ఇచ్చింది?” అని ఆతురతతో ప్రశ్నించాడు రాజు.

“ ఆప్రశ్నకి ఆమె, ‘అవును’ అని చెప్పింది! నా తండ్రిని అయిదు పాటలలో వర్ణించింది.”

”కాళింగు గెలిచిన కరవాల ధారి / లీలమ్మతో నాడు లీలా నరుండు.                                                                    కాయజు మించిన కమనీయతముడు / మాయావిహీనుడౌ మహనీయ తనుడు.

మందారమును మించు మాన్యుడౌ దాత / వందారు జనులను పాలించు  త్రాత!                                                ఆడి తప్పని వాడు హరినామ పరుడు / నాడును కాపాడు నాయక వరుడు.

రాజమ్మ ప్రేమించు రాజాధిరాజు / పూజితుడౌ తండ్రి పురుషోత్తమునకు!” వీటిని బట్టి నేను నా తండ్రి మహారాజ పరమేశ్వర శ్రీ కౌండిన్య సుచంద్ర భట్టారకుల వారని గ్రహించాను!”

రథినీ కుమారితో మహారాజు రహస్య సంభాషణ కావించినప్పుడు కాలనాథుడు తన కుమారుడని, రాజకాళమ్మే మంజుల అనీ తెలుసుకొని ఉన్నాడు! కాలనాథునికి కూడ ఈ రహస్యం తెలియదేమో అన్న భ్రాంతి ఇప్పుడు అతణ్ణి పూర్తిగా వదలిపోయింది! ఇప్పుడు కాలనాథుడు వినిపించిన రాజకాళమ్మ  పాటలు విన్న తరువాత ఆ నృపతి మనస్సు సంశయ రహితమైపోయింది!

“ఔను కుమారా! నీవు నా పుత్రుడవే, సంశయము లేదు! ఈ సంగతి రథినీకుమారి నాతొ ముచ్చటించింది. ఇప్పుడా విషయం బాగాస్థిర పడిపోయింది. నా తండ్రీ! నీ తల్లి మాయల వల్ల నిన్ను తెలుసుకోలేక పోయాను!” అని ఆర్ద్రమైన కండ్లతో చెప్పాడు నృపతి.

కాలనాథుడు లేచి సాష్టాంగంగా తండ్రికి నమస్కరించాడు.

సుచంద్రుడు తన కుమారుణ్ణి లేవనెత్తి తన విశాలమైన ఆసనం పైన కూర్చోబెట్టుకొన్నాడు. ప్రపంచంలో ఎదురు లేని మహావీరుడు శిశువుగా మారిపోయాడు! తండ్రి కొడుకు లిద్దరూ సంతోష పారవశ్యంచే భావోద్రేకం వలన ‘వల వల ఏడ్చుకొన్నారు!!

“నీ తల్లి అంతః పురం అలంకరించకుండా భిక్షురాలు వలె వీధుల్లో తిరుగుతోంది!” అని గడగడ కంఠంతో చెప్పాడు మహారాజు.

“శైశవం నుండి నాతల్లి కష్టాలే అనుభవిస్తోంది!” అని విలపించాడు కాలనాథుడు.

“నిన్ను నా కుమారునిగా ప్రకటిస్తాను! అప్పుడు సింహాసనోత్తరాదికారి సమస్య మరి తల ఎత్తనేరదు!” అని ఉత్సాహంతో పలికాడు మహారాజు.

“నాన్నగారూ! ఇప్పుడు ప్రకటించడం చాల క్లిష్ట సమస్యలు తేవడానికి కారణం అవుతుంది! భగవాన్ జటాముని సహాయం ముఖ్యంగా మనకి ఉండాలి! నాతల్లి రాజకాళమ్మ ఉద్దేశమేమిటో తెలుసుకోవాలి! కాలం చాల విపరీతంగా ఉంది! కాబట్టి ఈ రహస్యాన్ని ఇప్పుడు వెల్లడించకూడదు. అంతర్విప్లవం శాంతించడానికి  నేను బయట అజ్ఞాతంగా ఉంటేనే మంచిది.” అని చెప్పాడు కాలనాథుడు.

“కుమారా! నీవు అన్నట్లుగానే కానియ్యి! ఈ రాత్రి గజవీరుని తీసుకొని వస్తావని నమ్ముతాను.”

“తప్పకుండా తీసుకొని తెస్తాను. ఇప్పటికి నాకు సెలవిప్పించండి.” అని లేచాడు కాలనాథుడు.

“కుమారుని గాఢమైన కౌగిలిలో బంధించాడు మహారాజు, తిరిగి చాల సేపటికి ప్రస్తుతానికి వచ్చి వదిలాడు మరొక మారు తండ్రి పాదాలకు నమస్కరించి కాలనాథుడు ఆ గదిని వదలి బయటకు వచ్చాడు.

*********************

29 వ ప్రకరణం:

రాత్రి వెన్నెల కాస్తున్నది. ఎచ్చట చూచినా నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ నిశ్శబ్దాన్ని కీచురాళ్ళు శబ్దం జోల కొడుతునట్లు ఉంది! మధ్య మధ్య నక్కల ఊళలు తరంగాయమానమై శూన్యంలో కలిసి పోతున్నాయి.

మహామారి మందిరం దగ్గర ఉన్న బ్రహ్మాండమైన వట వృక్షం క్రింద ఇద్దరు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకరు మహారాజు శ్రీ సుచంద్ర భట్టారకులవారు, ఇంకొకరు అతని ఆంతరంగిక సచివుడు రూపచంద్రుడు. నెల అంతా గోమయంతో అలకబడి ఉంది. వట వృక్షానికి చుట్టూ వలయాకారంగా నల్లసాన రాళ్ళతో వేదిక కట్టబడి ఉంది!

వేదిక మీద కూర్చొన్నాడు మహారాజు సుచంద్రుడు. అతనికి ఎదురుగా నేలపై కూర్చోన్నాడు రూపచంద్రుడు. “ఇంకా గజవీర కాలనాథులు రాలేదు! మనం ముందుగ వచ్చాము కాబోలు!” అన్నాడు రాజు.

“మహాప్రభో! మనం జాగ్రత్తగా ఉండడం మంచిది!”

“ఇది కుట్ర అయి ఉంటుందని సందేహిస్తున్నావా?”

“అనుమానం పాపశంకి కదా మహారాజా!”

“అలాంటి అనుమానానికి కారణం లేదు! కాలనాథుడు ఎంతటి వీరుడో  అంతటి పెద్దమనిషి!”

“శ్రీవారు గజవీరుడు ఎవరయి ఉంటారని అనుమానిస్తున్నారు?”

“నీ ఊహ ఏమిటి?”                                            “ఘనేంద్రుడు అయి ఉంటాడని నా అంచనా!”

“దానికి కారణం ఉండాలి కదా?”

“ఉంది కాబట్టే చెప్తున్నాను! విమలుడు ఘనెంద్రునికి మేనబావ అవుతాడు. కాబట్టి విమలుని కుటుంబ విషయంలో పాటుబడడం సహజం కదా?”

“ఘోరకుడే గజవీరుడని నా అంచనా! తన తల్లి తండ్రులకు తెలియకుండా ఘనేంద్రుడు గుప్త సంఘంలో చేరడు. ఘోరకునికి విమలునితో గుప్త సంఘం ఉండ వచ్చునని నా అనుమానం!”

ఇట్లా వారిద్దరూ మాట్లాడుకొనుచుండగా ఇద్దరు వ్యక్తులు ఆ చోటుకు వస్తున్న చప్పుడు వినిపించింది. రూప చంద్రుడు లేచి నిలబడ్డాడు. ఆ ఇద్దరూ వారిని సమీపించారు. వచ్చిన ఇద్దరూ ముట్టికాలు వేసుకొని మహారాజుకి నమస్కరించి మర్యాదగా నిలబడ్డారు. మహారాజ, రూపచంద్రుల అంచనాలు పెడదారిన పడ్డాయి! గజవీరుడు వారు అనుకొన్నట్లు ఘనేన్ద్రుడూ కాదు, ఘోరకుడూ కాదు! వాడొక లేతప్రాయపు యువకుడు! వాడే ఘోరక పుత్రుడు ప్రమథనాధుడు!

“ఇతడేనా శివంకర సంఘ నాయకుడు?” ప్రశ్నించాడు మహారాజు.

“అవును మహాప్రభో!’ అని జవాబు ఇచ్చాడు కాలనాథుడు.

“పదహారు- పంతొమ్మిది సంవత్సరాల బాలకుడా, ఏబది మందికి నాయకుడు?”

“మహాప్రభో! విశ్వామిత్రుని యజ్ఞ రక్షణ కాలమందు శ్రీ రాముని వయస్సెంత? భారత యుద్ధ కాలంలో అభిమన్యుని వయసు ఎంత? కారణ జన్ములైన తేజోవంతులకు వయస్సుతో పని లేదు! ముందు అతని తండ్రినే మాకు నాయకు నిగా ఉండమని కోరాము, కాని తన రాజకీయోద్యోగం ఎక్కువ తీరుబడి లేనిది కాబట్టి, అతడు నాయకత్వం వహించ డానికి తన కుమారుని చూపించాడు!”

“గజవీర బాబూ! మేము నీతో కొంత మాట్లాడవలసి ఉంది. మనము మాట్లాడేటప్పుడు రూపచంద్ర, కాలనాథులు ఉండవచ్చునా?”                              

“ఉండకూడదు!”

ఆమాట విని రూపచంద్ర కాలనాథులు దూరంగా వెళ్లి పోయారు. గజవీరుడు నేలపై కూర్చొన్నాడు.”

“మా ప్రభుత్వానికి శివంకర సంఘంతో సంధి కుదిరడానికి మీ ప్రతినిథి చెప్పిన మూడవ షరతు అడ్డంకిగా ఉంది 99 వంతులు న్యాయస్థానం శాంతిసేనా దేవికి అనుకూలంగా ఉండవచ్చును! ఒకవేళ ప్రతికూలంగా ఉంటే, మా చెల్లెలు పార్వతీయ మహామండలం స్వీకరించి సంధికి అంగీకరిస్తుందా?”

“మహాప్రభో! మాకు న్యాయస్థాన విచారణ అక్కరలేదు! శ్రీవారు మా ఆధారాన్ని ఒకసారి చిత్తగించి, ఎట్లా చేయమని ఆజ్ఞ ఇస్తే మేము శిరసావహించి అట్లా ఆచరిస్తాము!”

“ఏదీ ఆ ఆధారం! వెంట తెచ్చారా?”

“ నా దగ్గర ఉంది. నేను ఆ పత్రాన్ని తీసుకొనే వచ్చాను. దానీ చదవడానికి దీపం కూడ తెచ్చాను”  ఇలా చెప్పి గజవీరుడు తన కవచాంతర్భాగంలో నుంచి ప్రమిద, వత్తి, నూనె బుడ్డి, చెకుముకిరాళ్ళు  బయటికితీసి దీపం వెలిగించాడు. తరువాత అతడు ఒక కాగితం తీసి, మహారాజుగారికి అందించాడు! దీపపు వెలుగులో మహారాజు ఆ పత్రాన్ని ఈ క్రింది విధంగా చదివాడు.

“మహామండలేశ్వర శ్రీ కౌండిన్య మేఘస్వామి భట్టారకుల వారు తమ దండనాయకులైన నందాపుర దుర్గ పాలకులు నందిసేన దొరగారికి వ్రాయించిన ఉత్తరము.

మీ ఉత్తరం మా అంతరంగ మంత్రి  మాకు చదివి వినిపించాడు. చిరంజీవి శాంతిసేనా కుమారిని  శ్రీశైల మహామండ లేశ్వరుని కుమారునకు ఇచ్చి పెండ్లి చేయుటకు చిన్న మహాదేవి గారు ప్రతత్నిస్తూ ఉండడం వాస్తవమే! చిత్రకూట సింహాసనోత్తరాదికారిణిని దూరదేశంలో ఉన్న వరునకు ఇచ్చి పెండ్లి చేయడం మాకు ఇష్టం లేదు! ఆ విషయంలో మీరు భయపడ నక్కర లేదు! చిన్న మహాదేవి గారు పెంచిన వీరేశ్వరుడు మాచే యౌవ రాజ్యానికి అభిషేకించ బడతాడని మీరు భ్రమ పొందవద్దు! అది పొరపాటు! రహస్యంగా చిన్న మహాదేవి గారి ప్రేరణచే పారవేయబడిన తన చెల్లెలి కుమారున్నే ఆమె పెంచుకొందన్న విషయం కొన్ని నిదర్శనాల ద్వారా మేము తెలుసుకొనే ఉన్నాము.

అయినప్పటికిన్నీ అనపత్యురాలైన మహారాణి ఒకణ్ణి పెంచుకొని పుత్ర సౌఖ్యం అనుభవిస్తూ ఉండగా మేము దానిని భంగపరచ వలసిన అవసరం కనపడ లేదు! ఆ పిల్లవానికి ఒక జాగీరు వ్యయ పరచడం అంత నష్టమైన విషయం కాదు!                          గ్రహింపవలెను.

ప్రజోత్పత్తి నామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్థీ సోమవారం ప్రభువు వారి ఎరుక భార్గవ సోమనాథుడు వ్రాసింది.”

“చెట్టుక్రింద న్యాయ విచారణ జరుగుతోంది” అని రూపచంద్రుడు కాలనాథునితో చెప్పాడు.

రాజుగారు జాబు ముగించి ఆలోచనా ముద్రలో పడిపోయారు. అప్పుడతని ముఖ కవళికలను చూసి గజవీరుడు మహారాజు మనస్సు తనకి అనుకూలంగా ఉన్నదని భావించాడు.

“గజవీర బాబూ! కాలదోష సమస్య గురించి మీరు భయపడ నక్కరలేదు. శాంతిసేనా దేవిచే వ్యాజ్యాన్ని తెప్పించండి! తప్పక ఆమె సంస్థానం ఆమెకు ఇప్పిస్తాను! స్వర్గస్థులైన మా పినతండ్రిగారి ఆశయం నేను నెరవేర్చి తీరతాను. నా అసాదారణాదికారం ఉపయోగించి ఈ సమస్యకు కాలదోషం గమనింపబడరాదని ఉత్తర్వు ఇస్తాను. అసాధారణ సందర్భాలలో మాకు అట్టి అధికారం ఉంది!”

“చిత్తం!”                             “ఇక మనకు సంధి కుదిరినట్లేనా?”

“చిత్తం, కుదిరినట్లే! దానికి సూచనగా నా సంపూర్ణ సంఘంతో సార్వభౌముని ప్రభుత్వానికి కింకరుణ్ణి అయ్యానని నేను విన్నపం పంపుకొంటాను. ఆవిన్నపాన్ని అంగీకరించినట్ల శ్రీవారు నాకు ఒక ప్రత్యుత్తరం దయ చేయించండి !”

“అట్లే కానీ, అందరూ కలసి మీ సంఘం కార్య నిర్వాహక మండలి వారు ఎందరున్నారు?”

“అధ్యక్షుడు కాక, శ్రీకాకుళ నగరిలో నలుగురు – అక్షోభ్యముని, ధర్మపాల సూరి, కాలనాథ బాబు, మా అమ్మ సౌదామిని. చిత్రకూటంలో నందిసేన దొర పుత్రుడు వీరసేన దొర సర్వాధికారిగా ఉన్నాడు.”

“మీ తండ్రి కొడుకులకు శాంతిసేన విషయంలో ఇంత  శ్రద్ధ దేనికి?”

“మహాప్రభో! అది రహస్యమైన విషయం!  ఆరహస్యం తెలిసిన వారు మా అమ్మ, అక్షోభ్య ముని మాత్రమె! కార్య నిర్వాహక సభ్యులకు కూడ తెలియదు. సత్యరథ బాబుగారి సత్యప్రభకు తెలుసు !”

“పోనీ, అంత రహస్యమైనప్పుడు నీకు నీవు చెప్పనవసరం లేదు!”

“మా ప్రభువులయిన మీకు చెప్పకూడని రహస్యం మాకు లేదు. శాంతిసేన భర్త విమలుడును, మా తండ్రి ఘోరకుడు వేరు వ్యక్తులు కారు! దురదృష్టం వల్ల తన భార్య దూషణ వాక్యాలు సహించ లేక ఆమెను విడచి పెట్టి వీరవల్లి గ్రామంలో సౌదామిని అనే కన్యకను వివాహం చేసుకొన్నాడు. ఇప్పుడు మా తండ్రి తన ప్రథమ భార్యను కలసు కొన్నాడు. బహుకాల వియోగానంతరం వారిద్దరు కలుసుకొన్నండున అన్యోన్యం తాము చేసిన దోషాలను మరచి, ఒకటిగా ఉంటున్నారు.”

 “ఘోరకుడే మహావీరుడైన విమలుడా? మా మేనబావ, మా భగినీపతి విమలుడేనా మహాప్రతీహారిగా పని చేస్తున్నాడు?!”ఆనాడు మహారాజు ఆశ్చర్యంగా.

“అవును మహాప్రభో! పరమ శివునికి నంది వలె ఆంధ్రేశ్వరునికి విమలుడు మహాప్రతీహారిగా ఉన్నాడు. అన్ని రాజ సేవల కంటే దానినే అతను ఎంచుకొన్నాడు!”

“పూర్ణను జటాముని ఎవరి ఇంట పెంపకానికి ఇచ్చాడు? నీకు తెలుసునా?”

“తెలుసును, ఇతరుల ఇంటికి ఏమీ ఇవ్వలేదు! తన పెద్ద కుమారుడు సత్యరథుని చేతికే పెంపకానికి ఇచ్చాడు. ఈ శిశువు ఫలానావారి పిల్ల అని సత్యరథ దంపతులకు తెలియదు! తెలుసుకోవడానికి వారు ప్రయత్నించనూ లేదు! సత్యప్రభ శ్రీకాకుళ కన్యకా మణులలో ప్రథమురాలు! నా సోదరిని ప్రసంగావశాత్తు  పొగడుతున్నందుకు శ్రీవారు మన్నించాలి! ఆమె తలకు భేదింప శక్యము కాని విషయమే లేదు! ఆమె వాక్కుకు గోచరింపని తత్త్వ రహస్యమే లేదు! ఆమె శస్త్రం అతి భీకరం, కౌళిక సులోచనుడు ఏబది మందితో ఆమెపై తలపడి ఒక్క గాయం కూడ చేయలేక పోయాడు! శివంకర సంఘ సభ్యులు ఆమెను శ్వేతకాళి గాను, వీర సరస్వతి గాను గౌరవిస్తున్నారు! పరంతప సంఘ నాయకుడు నిశుంభువు, ఘనేమ్ద్ర కాలనాథ, మల్లికార్జునుల కంటే ఆమెకే ఎక్కువ భయపడుతాడు! జతామునికి తన పిల్లల కంటే ఆ మనుమరాలి మీదనే ఎక్కువ ప్రేమ! శాంతిసేన మహావీరుడైన విమలుని వలన ‘లాంగలీ నదీ తీరంలో’ ఆమెను కన్నది.

ఆమెను పెంచిన తండ్రి ఆమెకి పెట్టిన పేరు ‘సత్యప్రభ!’ ఆమె శరీర ప్రభ సత్యము. ఆమె కరవాలప్రభ సత్యము. కాబట్టి ఆమె నిజంగా సత్యప్రభ అయింది!

కన్న తండ్రి ఆమెకు పెట్టిన పేరు పూర్ణ. ఆమె బలమందు పూర్ణ. విద్యయందు పూర్ణ. ప్రజ్ఞయందు పూర్ణ. గుణము లందు  పూర్ణ. కాబట్టి ఆమె సార్థక నామధేయ పూర్ణ. పరమాత్మ ప్రకాశమే సత్యప్రభ! ఆ పరంధాముని వ్యాపక విచ్చక్తియే పూర్ణ ! భేదం లేదు, మహాప్రభో!”

“గజవీర బాబూ! దుష్టులు పూర్ణను గూర్చి ఏమేమో కల్పించారు! ఇప్పుడు యదార్థం తెలిసింది. లక్ష్మి క్షీరాబ్దిలో కాక, మరి ఎక్కడ పుడుతుంది? ఈ రోజు మా జీవన చరిత్ర లోనే ధన్యమైన రోజు! నా బంధువులు నాకు తెలిసి రావడమే కాక, వారితో సంధి కూడ కుదిరింది. ఇంక రూపచంద్ర కాలనాథులను పిలుచుకొని రా!”రాజాజ్ఞ ప్రకారం గజవీరుడు దూరంలో కూర్చొన్న సచివ కాలనాథులను సమీపించి వారిద్దరినీ రాజ సన్నిధికి తోడ్కొని వచ్చాడు.

“రూపచంద్రా! శివంకర సంఘంతో మాకు సంధి కుదిరింది. మల్లికార్జునిని మహామంత్రిగా నియమించడానికి మనము ముందే ఒప్పుకొన్నాము కదా! శాంతిసేన వ్యాజ్యాన్ని అసాధారణంగా అంగీకరించి కాలదోష సమస్య అడ్డుపడకుండా విచారించడానికి కూడ మేము సమ్మతించాము. ఇక సేనాపతి నియామకాన్ని సావకాశంగా చేయ వచ్చును.”

“ సేనాపతిని మనం వెతుక్కోనక్కర లేదు మహాప్రభో! “ అని చెప్పాడు గజవీరుడు.

“ఎవరతను?”

"అతను ధర్మనిష్ఠ యందు యుధిష్టురుడు! బాహు బలమందు భీముడు! ధనుర్విద్యయండు అర్జునుడు! నిష్కపట నీతియందు సహదేవుడు! ఔదార్యమున కర్ణుడు! వ్యూహా జ్ఞానమందు ద్రోణుడు! స్వసైన్య రక్షా తంత్రంలో భీష్ముడు! పరసైన్య విదారణ పద్ధతిలో అశ్వత్థామ! అశ్వహృదయ జ్ఞానంలో శ్రీకృష్ణుడు! కాలో కూడ అబద్ధమాడి ఎరుగడు. సప్రేమ మహాసుందరీమణుల వివక్త సన్నిధిలో కూడ చలించని అకళంక బ్రహ్మచారి! స్వార్థ త్యాగానికి పేరుపడ్డ పెద్దమనిషి! అతనే మన కాలనాథ బాబు మహాప్రభో !”

“గజవీర బాబూ! నీవు  చెప్పినది అక్షరాలా సత్యమే! రెండు మాసాలలో కాలనాథుణ్ణి దండనాయక పదవికి ఎక్కించి తరువాత శాశ్వత సేనాపతిగా నియమిస్తాను!”

వారందరి ఏకాంత సభ ముగిసింది. అందరూ లేచి మెల్లగా నడక సాగిస్తున్నారు. వారి వెనుకనుండి ఈ విధంగా పాటలు వినిపించాయి!

“ పెద్ద వృక్షము క్రింద పెనుభూతమొకటి / మద్దెల వాయించు మానిసి తోడ,                                                           చిన్న దేవత ఇంట చిత్ర భూతంబు / మన్నన చూపెడు మన్నీని తోడ,

ఘోరమౌ అడవిలో గొప్ప దయ్యంబు / వీరులలో మేటి వీరుని తోడ,                                                                  రాముని కరుణచే రహి మిత్రమాయె / భీమ పిశాచంబు భూమి పాలునకు.

సతి భార్య దయ్యంబు,  సఖుడు దయ్యంబు / మతిగల రేనికి మరి చిక్కు లేదు!                                                     తెల్లని వీరుడు తెలుపును త్రోవ!  నల్లని వేరుడు నడుపును సేన!

జాడలు కనిపెట్టు జన్మ శూరుండు / పాడును సత్యము ప్రాణేశు రాణి,                                                                 మేటి జటాముని మేలంచు పలుకు / సాటి ఎవరు రాజచంద్రుని కింక!"

ఆ పాటలు పాడింది రాజకాళమ్మ ! ఆమెను చూడాలని వారందరూ వెనుతిరిగి చూసారు. కాని ఆమె జాడ కనిపించ లేదు!

*************************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద