Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ--14 :బాపు వేసిన బొమ్మలతో సహా

30 వ ప్రకరణము:


రహస్య సమావేశానంతరం మరునాడు రాత్రి సుచంద్ర భట్టారకుడు అంతఃపురం ప్రవేశించాడు. పూర్ణ చంద్రుని క్షీరాబ్ది వీచిక వలె ‘భ్రుంగాలక’ అతనిని ఎదుర్కొని సామ్రాజ్ఞి దగ్గరకి తీసుకొని వెళ్లింది. మహారాణి ప్రత్యుత్థానం చేసి, తన వల్లభుని రెండు చేతులను గ్రహించి హంస తూలికా తల్పం పైన కూర్చొన బెట్టింది. భ్రుంగాలక వారి ఎదుట వేత్రాసనం పైన కూర్చొన్నది.రాష్ట్ర  సౌందర్యమంతా శ్రీకాకుళ నగరియందు కేంద్రీకరింపబడినది! శ్రీకాకుళ నగర రామణీయక మంతా ప్రాసాదంలో  సంగ్రహింప బడింది. ప్రాసాద కమనీయ సారమంతా రాజ దంపతుల శయన శాలలో ఇమడ్చ బడింది.


ఆ సుందరమైన ఏకాంత శాలలో రాజ దంపతుల  సన్నిధిలో భ్రుంగాలకకు మాత్రమే ప్రవేశముంది! అధికార రీత్యా చేటీ జనాధ్యక్షురాలుగా ఉన్నా, ఈమె హస్తక్షేపం చేయని రాజకార్యమే ఉండదు! చక్కదనంలో ఈమె లీలావతీ దేవికి సమానురాలు, గడుసుదనంలో అధికురాలు! కొన్ని విషయాలు లీలావతీ దేవి ప్రసక్తి లేకుండానే ప్రభువుకు చెప్పుకొనే చొరవ ఈమెకి ఉంది! ఈమె కుమారుడు వీరసింహుడు, కాలనాథాదుల కంటె ఏంటో తక్కువవాడైనా, పథమంగానే రాజకీయ సేనలో సహస్రపతిగా నియమింపబడ్డాడు. అధికార వర్గం వారందరూ ఈమె దగ్గర వినయం గానే ఉంటారు! ఈమె హేమచంద్రుని చేపట్టిన కాలంలో అతడు సాధారణ సంపన్నుడు! ఇప్పుడు పదిలక్షల వరాలకు అధిపతి.


లీలావతీ దేవి సునందుని రెండవ కుమార్తె. ఆమెకు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు ఉంటాయి! ధవళాక్షి ఇచ్చిన రసాయన సేవనం వలన ఇప్పటికీ ఆమె యౌవనం సురక్షితంగానే ఉంది. నిత్య స్మేర విలసితమైన ముఖకమలం ఆమెది! విశాలమైన ఆమె కనులు ఎప్పుడూ ప్రేమను ఉద్గారించుతుంటాయి. ఆమె సుకుమారాంగకా లలో లావణ్యవారి నయన పర్వంగా ఉన్నది! ఆమె చక్కగా అలంకరించుకొని ‘ఊదారంగు చీర కట్టి, సింధూరారుణ మైన కంచుకం ధరించి ఉన్నది. దవలాక్షి దగ్గరనుండి గ్రహించిన వశీకరణ మూలికను ధరించిన తరువాత ఆమె ఇప్పుడే తన నాధుని కలసుకొన్నది!


రాజు కాలనాథ గజవీరులతో ఎన్నో విషయాలు మాట్లాడి లీలావతీ దేవి పక్షం అధికారాన్ని తలక్రిందులు చేయడానికి అంగీకరించి వచ్చాడు! ప్రేమ వశంవదుడైన ఆ నరపతి ఇప్పుడు ఎవరికీ అపకారం చేయ తలపెట్టాడో, ఆ కాంతను సమీపించాడు! ఇప్పుడు ఆమె బలవత్తరమైన వశీకరణ శస్త్రం ధరించి ఉన్నది! దాని ప్రభావం వలననో, లేక స్వభావ ప్రేమ పరిణామం వలననో గాని, ఆమె ముఖం ఆ రోజు సార్వభౌమునికి మిక్కిలి రమణీయంగా కన్పట్టింది !


ఇది వరలో రాణి ప్రమత్త  అయి ఉండలేదు! తన అధికారాన్ని భంగ పరచే శక్తులు పనిచేస్తున్నాయని ఆమె కనిపె ట్టింది! ఆమె విశాలాక్షుని పిలిపించి చాల సేపటి వరకు మాట్లాడింది. ఆమె మనస్సును బాధించేవి రెండే రెండు సమస్యలు! మొదటిది సింహాసన ఉత్తరాదికారి సమస్య. రెండవది చిత్రకూట రాజ్య సమస్య. ఈ రెండింటిలోనూ పతిని తన ప్రక్కకు త్రిప్పుకో లేనప్పుడు ఇన్నాళ్ళూ తాను చేసిన అధికార ఆడంబరమంతా హాస్యాస్పదం అవుతుంది!


మహారాణి కైకేయి వలె కోపించి పతిని సాధించి ఎరుగదు! సత్యభామ వలె ఒక్కొక్కప్పుడు ప్రణయ కలహంతో నాధుని వశపరచు కొంటూ ఉంటుంది. ఆమె ప్రదానాస్త్రం ప్రేమ, సేవించడం, తృప్తి పరచడం దాని అంగాలు!


“భ్రుంగాలకా! మీ అబ్బాయి బాహు వాతం నిమ్మళించిందా?” అని మహారాజు ప్రశ్నించాడు.

“పూర్ణంగా నిమ్మళించింది, ప్రభో! ఈ దినమే పనిలో ప్రవేశించాడు.”

“దండనాయక చిత్రసేనుడు స్వర్గస్థుడయ్యాడు. అతని దండనాయక పదవి ఖాళీ ఏర్పడింది! ఎవరిని నియమిస్తే బాగుంటుంది?” అని అన్నాడు రాజు.

“సహస్రపతులలో నుంచి నియమించవలసి ఉన్నప్పుడు నా కుమారుణ్ణి శ్రీవారు మరచి పోకూడదని ప్రార్థన!” అన్నది భ్రుంగాలక.

“ప్రేయసీ! నీవేమంటావు?” అని నరపతి తన కాంతను ప్రశ్నించాడు.

“పెద్దనాన్నగారి అభిప్రాయమేమిటో?” అన్నది లీలావతి.

“ వారిని నేను అడగ లేదు, అడుగ దలచుకో లేదు కూడ! నీవు చెప్పిన వాణ్ని నియమిస్తాను”

“లీలావతికి ఇలాంటి మాటలు వేరు సందర్భాలలో అయితే ప్రియంగా ఉండేవి, ఇప్పుడు రుచించలేదు! తన కెన్నో అపకారాలు చేయ తలపెట్టి , ఈ చిన్న ఉపకారాన్ని చీయడానికి చూస్తున్నాడు రాజు. ఆమె ఉద్దేశంలో అసత్యం ఏమిన్నీ లేదు.


“మహాప్రభో! రాజ కార్యాలలో అనవసరంగా జోక్యం చేసుకొంటున్నానని నాకు వాడు వచ్చింది. కాబట్టి ఇలాంటి విషయాలు నన్నేమీ అడగకండి! నేను శ్రీవారి పాదసేవ చేసుకొంటాను” అని బుంగ మూతి పెట్టింది లీలావతి. అప్పుడామె ముఖం ముకుళించుకొన్న కమలం లాగ శోభించి ఉంది!


“భ్రుంగాలకా! చాల వేళ అయింది. నీవు ఇంటికి వెళ్లిపోవచ్చును.” అని రాజు భ్రుంగాలకను చూసి చెప్పాడు. భ్రుంగాలక వెంటనే రాజ దంపతులకు అభివాదం చేసి నిష్క్రమించింది.


భ్రుంగాలక వెళ్ళిన తరువాత సుచంద్రుడు బుజ్జగింపుగా లీలావతిని దగ్గరకు లాగుకొన్నాడు. లీలావతి అతని విశాలమైన వక్షం మీద తల వాల్చింది. తిరిగి వారిద్దరి మధ్య సంభాషణ ఆరంభమయింది.

“ నా ప్రియమైన లీలా! నీపై అలాంటి వాదు పుట్టడం వాస్తవమే! మీ తండ్రి మీద కూడ – శాఖామంత్రుల మాట ఏమీ చెల్లనీయకుండా తాను  సర్వాధికారిగా రాజును  వశపరచుకొని ప్రజలను బాదిస్తున్నాడని వాదు  ఉంది.”

“చిన్న  బంట్రోతుని కూడ మా నాన్న తిట్టి ఎరుగడు! అతడా ప్రజా బాధకుడు! అసూయాపరుల కల్పనలకు మేర ఉండదు! ఇంతకూ మా వారికి అదృష్ట దినాలు గడిచి పోయాయి. ప్రజలేమన్నా నాకు లక్ష్యం లేదు! కాని మీ చిత్తం మా వారిపై కరుణా విరహితమై పోయింది!”

“ప్రేయసీ! నీవు భ్రమ పడుతున్నావు. నా చిత్తం మీ వారి పైన యథాపూర్వకం గానే ఉంది! కాబట్టే రాష్ట్రీయ అధికారాన్నుంచి తప్పించినా వీరనందునికి తత్తుల్యమైన వేరే అధికారాన్ని ఇచ్చాను.”


“ఔను లెండి, అధిక ప్రసంగం చేసినదానికి నా తమ్ముడు పదవీచ్యుతుడయ్యాడు! అదే అపరాధానికి ఒక సామాన్య ప్రతీహారికి పది పానాలు జుల్మానా పడింది! పది మందిలో అవమానం పొందిన నా తమ్మునికి మరొక ఉద్యోగం కల్పించి ఇవ్వడం కండ్లు తుడవడం కాక మరేమిటి చెప్పండి?”


“ నా ప్రాసాదానికి మహోపకారం చేసిన వీర ప్రతీహారితో నేను మాట్లాడుతున్నప్పుడు, అతడు కోరిన వరం ఇస్తానో లేదో తెలుసుకోక పూర్వమే, సార్వభౌముని గౌరవాదికారాలను ఏమాత్రం కూడ అర్థం చేసుకోకుండా నీ తమ్ముడు ప్రతీహారిని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు, అది చాల సాహసం! ఆ సమయంలో ఆ దిక్కర్తను ఉపేక్ష చేసి ఊరుకొంటే పట్టణమంతా నన్ను స్యాలక దాసునిగా కీర్తిసారు! అది అలా ఉండనీ! నీ తమ్ముడు మరొక ఘోరమైన తప్పు చేసినట్లు నాకు తెలిసింది! నీ తమ్ముడు నిన్నూ భ్రుంగాలకను గుర్రపు బండిపై ఎక్కించుకొని చిట్టడవి మీదుగా ‘గణపవరం’ వరకు వాహ్యాళి వెళ్ళినట్లు తెలిసింది!

ఆ బండిని  మరలి వస్తుండగా మధ్యేమార్గంలో దొంగలు అడ్డగించారని, చేతిలో కట్టి ఉంది కూడ నీ తమ్ముడు దొంగలచే చెట్టుకు కట్టుబడినాడనీ విన్నాను.అప్పుడు సత్యప్రభ వచ్చి ఆ గుంపుతో యుద్ధం చేసినట్లూ, కాలనాథుడు ఆ సమయంలో అక్కడకి వచ్చి ఆ సంహార కేళిలో తోడ్పడినట్లూ విన్నాను. నీ ఆజ్ఞను పాటించి ఆ ఇద్దరు వీర నారీ నరులు ఈ సంగతిని వేరే విధంగా ప్రకటించారని విన్నాను. ఈ ఉచ్చ్రుంఖల శ్యాలకుడు చేసిన పని ఎంత అపరాధమో నీవే ఆలోచించి చూడు. కత్తి చేతిలో ఉండి  కూడ స్త్రీ మాన ప్రాణాల రక్షణకు ప్రాణాలు సరకుగొనక యుద్ధం చేయడం అటుంచి స్వప్రాణ రక్షణ  కోసం శత్రువులకు  లొంగి పోయిన నీ తమ్ముని దుచ్చర్యని తలచుకొన్నప్పుడల్లా నా శరీరంలో మంట పుడుతూంది.

అనావ్రుత ప్రదేశంలో  శయనించి ఉన్న ‘పెద్దబాబుని’ తస్కరించుకొని పోవడానికి వచ్చిన  శత్రువుల గుంపును చీల్చి చెండాడారు. మహాప్రతీహారి, అతని కొడుకు! ఆ సందర్భంలోనూ మహాప్రతీహారికి తన ప్రభువు ఎలాంటి అనుగ్రహం చూపిస్తాడో, ఏ మాత్రం యుక్తాయుక్త జ్ఞానం లేకుండా పశువు లాగ ప్రవర్తించాడు నీ తమ్ముడు! ఇన్ని అపరాధాలు చేసినా నేను నీ తమ్ముణ్ని క్షమించాను! దేనికి? వాడు నా ప్రేయసి సోదరుడనే కదా? అదృష్ట వశం వలన సత్యప్రభ అడ్డుపడింది గాని లేకుంటే నా గతేం కాను!?”

లీలావతి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఆమె బిక్కు బిక్కుమని తన నాథుని చూస్తూ ఇలా అంది. ”

శ్రీవారికి ఈ కథనం ఎవరు చెప్పారు?”

“ఎవరిని మీరు నమ్మారో ఆ రథ చోదకుడే ప్రతీహారితో ఈ సంగతి చెప్పాడు, ప్రతీహారి నాకు చెప్పాడు.”

లీలావతి మరేమీ మాట్లాడలేక పోయింది.

“నా ప్రియమైన లీలా! జరిగిందేదో జరిగి పోయింది! ప్రభు సేవకు బహుమానంగా చిన్న మామయ్యకు ఒక జాగీరు ఇవ్వడానికి తీర్మానించాను. ఆ జాగీరుతో సామంత పదవిని కూడ ఇస్తాను. ఆ కార్యాన్ని రేపే నెరవేరుస్తాను.’ ఇట్లా చెప్పి నరపతి బిగువుగా తన ప్రేయసిని గుండెలకు హత్తుకొన్నాడు.

లీలావతికి చాలాకాలం నుండి తన తండ్రికి ఒక జాగీరు ఇప్పించాలని ఉంది. ఇప్పుడు రాజే స్వయంగా ఇస్తానని చెప్తున్నాడు! ఆమెకు సంతోష  ఆశ్చర్యాలు కలిగాయి. ఆమె ముఖం వికసించింది. “ఒక సంస్థానమా? పెద్ద నాన్నగారి (సేనాపతి రణంధరుడు) జాగీరు అతని తరువాత ఎవరికి ఇవ్వాలని తీర్మానించారు?”

ఈ పశ్న ద్వారా ఉత్తరాదికారి సమస్యలో రాజుగారి భావం ఎలా ఉందో  గమనించాలని లీలావతి యత్నం, అది సఫలమయింది.

“పెద్ద మామయ్యగారి సంస్థానం ఆయన అనంతరం మన చిన్న బాబుకి సంక్రమిస్తుంది. ఒక వేళ మహా మండలేశ్వర సత్యకర్మ తన కుమార్తెను చిన్న బాబుకి గాని ఇస్తే, పెద్ద మామయ్యగారి సంస్థానం అతని అనంతరం మన పిల్ల రథినీ కుమారికి వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను, చిన్న బాబు సింహాసన ఉత్తరాదికారిగా నిర్ణయింప బడడానికి అవకాశాలు తక్కువ!”


తన ప్రియుని ఉపన్యాసం అతనిపై చేరబడి ఉన్న లీలావతికి అమృత వర్షంలాగా అయింది! ఆ మాటలు వినగానే ఆమె తన సర్వాంగాల తోనూ దగ్గర పది ఇట్లా పలికింది. “ చిన్నబాబు సింహాసనోత్తరాదికారి అయే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటారా?”

“99 వంతులు జ్యేష్ట పక్షానికే జయం కలుగుతుంది! ఒకవేళ నా ప్రాడ్వివాకులు ధర్మపాల సూరి వాదనని విని పట్టమహిషి  పుత్రుని  పక్షంలో తీర్పు ఇస్తే పెద్దబాబుని పార్వతీయ మహామండలానికి అధీశ్వరునిగా చేస్తాను! ప్రేయసీ! నీ సంతతి రాజ్యం లేక హీన స్థితిలో ఉంటుందని నీవెంత మాత్రం భ్రమ పొందవద్దు!”

నరపతి తనకి ఇంత అనుకూలునిగా ఉండడం మూలికా ప్రభావమని ఆమె తలంచింది! ఆమె సుందర కోమలాం గకాల స్పర్శ ప్రభావమే అని మన్మథుడు అంటాడు. సుచంద్ర భట్టారకులవారు కొత్తగా నేర్చుకొన్న రాజనీతి ప్రభావమని గుట్టు తెలిసిన వారు అంటారు! జ్యేష్ట పక్షానికే జయం కలుగుతుందని అతడు చెప్పిన మాట నిష్క పటమే! అతని మనస్సులో ఉన్న జ్యేష్టుడు కాలనాథుడే గాని భోగనాథుడు కాదు! నూరవ వంతు ప్రాతికూల్యం జయించినప్పుడు అతని ఉద్దేశంలో తాను ఇస్తానన్న మహామండలమే నూరు వంతులు నిర్ణీతమై ఉంది!

“నా పతి దేవులు ఇచ్చిన ఈ వరాలు కొంగున మూటకట్టుకొంటాను”

“నేను ఎప్పుడూ నీకు ప్రతికూలున్ని కాదు, మనశ్శాంతితో ఉండు!”

ఈ మాటలు లీలావతిని చల్లబరచాయి. అఆమే ప్రసంగానంతరానికి దాటుతూ ఇలా అంది. “ చిత్రకూట రాష్ట్రాదికారం విషయమై శాంతిసేన ప్రభుత్వానికి పంపిన విన్నపం గురించి ఏమి చేస్తారు?”

“శాంతిసేన రాజ ధర్మాసనంలో వ్యాజ్యం తెస్తుందని తెలిసింది. అప్పుడు మేము తప్పకుండా విచారించి తీరాలి!”

“అసలు శాంతిసేన కాలధర్మం చెందిందట! విమలుడు వేరే పెండ్లి చేసుకొన్నాడట! అతడు తన రెండవ భార్యనే శాంతిసేన అనే పేరుతొ ముందు పెట్టి ఈ నాటకం ఆడుతున్నాడని విన్నాను!” ( ఇది అంతా విశాలాక్షుని బెత్తా యింపు).

“విచారణ సందర్భంలో ఆ విషయం బయట పడక మానదు! శాంతిసేన మాకెవరికీ అజ్ఞాత వ్యక్తి  కాదు! ఆమె తానూ శాంతిసేననని ఋజువు పరుచుకొంటే వ్యాజ్యం ముందుకు సాగుతుంది!”

“నేను సూచించిన రాజీ మాట ఏమయింది?” శాంతిసేన కుమార్తెను, తన చెల్లెలు కుమారునికి ఇచ్చి పెండ్లి చేస్తే ఈ సమస్య అంతమొందుతుందని సూచించినది లీలావతే!

“ఇప్పటికేమీ తెలియలేదు! ప్రయత్నిస్తాను.” అని రాజు అబద్ధమే నేర్పుగా ఉద్ఘాటించాడు.

“గొప్ప పదవి ఇచ్చి చిరకాలం అనుభవించిన తరువాత లాగుకొనడం ధర్మం కాదు!”

“ప్రేయసీ! అది నా దానం కాదన్న మాట గుర్తుంచుకో! వీరేశ్వర బాబు మా పినతండ్రికి అపవిద్ధ పుత్రుడని నమ్మి అతనికి చిత్రకూట రాష్ట్ర సింహాసనాన్ని ఒప్పగించాను.”

“అపవిద్ధ పుత్రుడు కాదనా శాంతిసేన వాదన?”

“ఔను, దాన్ని శాంతిసేన రుజువు పరచాలి. ఆ బాధ్యత ఆమెకు ఉంది.”

“రుజువైతే!”

“అప్పుడు ఆమె తండ్రి సింహాసనాన్ని ఆమెకు ఇచ్చివేయాలి! నీ చెల్లెల్ని అనాథగా వదలి పుచ్చను సుమా! పూర్వగౌరవం చెడకుండా మంచి సంస్థానాన్ని ఆమెకి ఇచ్చి కాపాడుతాను. నా  ప్రియమైన లీలా! నీ అసంతృప్తికి నేను ఎంతగా భయపడతానో, అంత కంటె అధికంగా అధర్మానికి భయ పడతాను!”

“పోనీ, శాంతిసేనకే ఒక సంస్థానం ఇచ్చి తృప్తి పరచ కూడదా?”

“ప్రయత్నిస్తానే గాని, బలాత్కరించ లేను!” ఈ మాట లీలావతిని సమాధాన పరచడానికే రాజు చెప్పాడు. మనస్సులో అతడు తన పినతండ్రి జాబు ప్రకారం అమలు పరచడానికే తెర్మనించి ఉన్నాడు!

“మా తండ్రికి ఇచ్చే జాగీరులో నౌకరీ షరతు ఉంటుందా?”

తన తండ్రికి జాగీరు ఇచ్చి రాజుగారు మహామంత్రి పదవిని పరంపరాగతంగా చేస్తారనే భ్రాంతితో ఉంది లీలావతి. ఆ ప్రశ్న రాజుగారి ఉత్తర ప్రసంగానికి మంచి సందు కల్పించింది. అవసరం వచ్చినప్పుడే బుద్దిమంతుల బుద్ది సాధనోపాయాలను వెతుకుతుంది! ఇన్నాళ్ళూ కాంతా వశంవదుడై  సంచరించిన ఆ నరపతి ఇప్పుడు తన కాంతను మోసగించడానికి యత్నిస్తున్నాడు! ఆ పనికి తగిన వచనోపన్యాసం అతనికి సిద్ధించింది. అతడలాంటి స్ఫూర్తితోనే ఇలా అన్నాడు.

“ ఒక నౌకరీ కల్పించి దానితో పాటు సంస్థానాన్ని వంశ పారంపర్యంగా చేయాలనే నా ఉద్దేశం! ఇప్పుడు రాజధా నిలో ‘నరిష్ట’ అనే మహాసభ ఉంది! ఆ నరిష్టకు చిన్న మామయ్యను శాశ్వత సదసత్పతిగా చేసి, పోరా సామంతుడనే బిరుదు ఇస్తాను. ఆ పదవి వంశ పరంపరాయత్తం కావిస్తాను. ఇప్పుడున్న సదసత్పతి శ్రీమాన్ కాశ్యప ప్రమతి ఉపసదసత్పతి అవుతాడు!”

వ్యవహార జ్ఞానం కించిత్తూ లేని మహారాణి ఇలా ప్రశ్నించింది. “ మహామంత్రిగా ఉంటూనే నరిష్టా సదసత్పతిగా ఉండవచ్చా?”

“అది బాగుండదు, మామయ్య లిద్దరికీ విశ్రాంతి తీసుకోవాలని చెప్తాను. విశ్రాంతి కాలంలో నీ తండ్రి చేసిన సేవకు ప్రతిఫలంగా సంస్థానం, కొత్త గౌరవం రెండూ లభిస్తాయి.”

ఆ రాత్రి నరపతి మూలికా ప్రభావం వలన తనకు వశుడై పోయాడని తలచింది రాణి లీలావతి. తనను ఇంత కాలం బాధిస్తున్న సింహాసన ఉత్తరాదికారి సమస్య అనుకూలంగా జ్యేష్ట పక్షానికే సిధ్ధించ నున్నది! చిత్రకూట రాష్ట్ర సమస్య తనకు పూర్తిగా అనుకూలం కాకున్నా, తన చెల్లెలికి ఒక సంస్తానమైనా వస్తుండి కదా అని కొంత తృప్తి పడింది రాణి. తన తండ్రి వృద్ధుడై పోయాడు! ఎంతకాలం మహామంత్రిగా ఉండగలడు? ఇప్పుడు శాశ్వ తంగా, వంశ పరంపరా గతంగా సంస్థానం సిద్దిస్తుంది! ఒక విధంగా మహారాణి తృప్తి పొందింది. అంతవరకు వ్యవహార రంగ స్థలంగా ఉండిన ఉన్న ఆ ఏకాంత శాల శృంగార రంగ స్థలంగా మారి పోయింది.

********************************

31 వ ప్రకరణము:

విజయ సంవత్సర జ్యేష్ట శుద్ధ ద్వాదశీ భాను వారం నాడు మధ్యాహ్న వేళ వరకు రాజకీయ రంగస్థలం ప్రశాంతంగా ఉండింది! మధ్యాహ్న భోజనానంతరం విశ్రాంతికి పిమ్మట సార్వభౌముని వద్ద నుండి ఆజ్ఞా పత్రాలు ఆరున్నొక్కటి వెలువడ్డాయి!

మొదటి పత్రం ద్వారా గౌతమ సునందుడు పౌర సామంత బిరుదంతో నరిష్టకు స్థిర సదసత్పతిగా నియమింప బడ్డాడు! కాశ్యప ప్రమతి ఉప సదసత్పతిగా మార్చబడ్డాడు! అతడే కార్య నిర్వాహకుడుగా కూడ చేయబడ్డాడు. ఈ ఆజ్ఞా పత్రానికి అనుబంధంగా ఒక సంస్థానం ఇచ్చే సన్నదు ఒకటి గౌతమ సునండునికి పంపబడింది. దానాలో అతని వంశ పరంపరాదికారం వివరించ బడింది. మహామంత్రి పదవి నుండి విశ్రాంతి పొంద వలసిందిగా వేరే పత్రం ద్వారా చెప్పబడింది!

రెండవ ఆజ్ఞా పత్రం ద్వారా దండనాయక చండసేనుడు తాత్కాలిక సేనాపతిగా నియమింప బడ్డాడు. పాత సేనాపతికి విశ్రాంతి వేరే పత్రం ఇచ్చింది.

మూడవ ఆజ్ఞా పత్రం ద్వారా సహస్రపతి వీరసింహుడు చందసేనుని స్థానే తాత్కాలిక దండనాయకునిగా నియమింపబడ్డాడు.

నాలుగవ ఆజ్ఞాపత్రం వలన సహస్రపతి కామపాలుడు చిత్రసేనుని స్థానే దండనాయకునిగా నియమింప బడ్డాడు.

ఐదవ ఆజ్ఞా పత్రం ద్వారా శతపతి కాలనాథుడు, కామపాలుని స్థానే సహస్రపతిగా నియమింపబడ్డాడు.

ఆరవ ఆజ్ఞాపత్రం ద్వారా వలన వాత్సాయన విష్ణుశర్మ వీరసింహుని స్థానే తాత్కాలిక సహస్రపతిగా నియమింప బడ్డాడు.

ఏడవ ఆజ్ఞా పత్రం అత్యంతం ప్రాముఖ్యం కలది ! దానివలన శతపతి మల్లికార్జునుడు ఆంద్ర సామ్రాజ్యానికి మహామంత్రిగా నియమింపబడ్డాడు.

ఈ మార్పు ప్రజలకి ఆశ్చర్యం కలిగించింది! ఇరవై రెండు సంవత్సరాల కాలం రాజ్యాన్ని ఏకాధ్వరంగా ఏలుతుండిన వ్యక్తి సంస్థానాన్ని బలి తీసుకొని రాజకీయ రంగం నుండి తొలగి పోయాడని రూపచంద్రుడు హర్షించాడు! ఇది సామ్రాజ్యానికి క్షేమంకరమైన మార్పు అని ఆచార్య విషమసిద్ది పలికాడు. శత్రువులు దీని వలన కంపించక మానరని వచించాడు ధర్మపాల సూరి. సుచంద్రునికి సమయంలో మంచి బుద్ది పుట్టిందని ఆచార్య భవనంది  శ్లాఘించాడు . సామ్రాజ్య చరిత్రలో ఇది ఎన్నదగిన దినమని కాశ్యప ప్రమతి భాషించాడు. భీష్ముని మించిన వీరుని, విదురుని మించిన ప్రజ్ఞావంతుని, ఆంద్ర సామ్రాజ్య లక్ష్మి మహామంత్రిగా తన భాగ్య పరిపాకం వలన పొందిందని చెప్పాడు రాష్ట్రీయ ఘనేంద్రుడు. బహుడిన సంకల్పితమైన శివంకర సంఘ కోరిక ఈడేరిందనీ కాల నాథుడు సంతసించాడు. ఇక కుందినులకి భయం లేదని సత్యప్రభ నిర్ణయించింది. ఈ నియమనం చాల బాగుందని భీమనాథుడు వచించాడు. ఇన్నాళ్ళకు నా తండ్రి స్వతంత్రించి మంచి పని చేశాడని రథినీ కుమారి ఆనందించింది. లక్షణ జ్ఞానంలో గొప్ప చెయ్యే గాని, క్రియాచారణలో ఎలా ఉంటుందో అని విశాలాక్షుడు సందే హించాడు! గుణాకరునికి ఆ సందేహం లేదు. హేమచంద్రుడు మాత్రం కుర్రవాళ్ళ రాజ్యం ఆరంభమయిందని విలపించాడు. పురజనల శ్లాఘన ధ్వనిలో ఆ విలాపం ఎవరికీ వినిపించ లేదు! తాను  చిరకాలం బ్రతికినందుకు నేడు మంచి వార్త విన్నానని చెప్పాడు సేనాపతి రణంధరుడు!

క్రొత్త సంస్థానపు సంభ్రమంలో సునందుడు కొట్టుకొంటున్నాడు!

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద