Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంధ్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ 16 :బాపు వేసిన బొమ్మలతో సహా




33 వ ప్రకరణం:      

“పెద్దనాగూ!” అని ఎవరో పిలిచినట్లు అయింది! కర్ణి ధ్యానం భగ్నమయింది. ఆమె దిగ్గని సంభ్రమంతో లేచి వీధి తలుపు తీసింది.

ఎదురుగా ఆజానుబాహుడైన జడధారి!!

అతని నిడుపాటి సగం నెరసిన గడ్డం బొడ్డు వరకు వ్యాపించి ఉంది. అతని పింగళమైన జటలు పృష్ట భాగాన్ని ఆవరించి ఉన్నాయి. అతని శరీరం శుష్కించి ఉన్నా చాల పటుత్వంగా కనపడుతూంది! అతని ఫాలం అర్థ భాను బింబం వలె తేజోపూరితంగా ఉంది. అతని కండ్ల లోని తేజస్సు దుర్నిరీక్ష్యంగా ఉంది! అతని ఉన్నత నాసిక ముఖానికి గంభీరత ప్రసాదిస్తూంది. అతని దేహప్రభ ధవళం, ఉత్తి ధవళమే కాదు, కాంతివంతం. అతడే పెను జడధారి జటాముని. అతని కుడి చేతిలో పెద్ద కమండలం ఉంది. ఎడమ చేతిలో నిడుపాటి చేతి కర్ర ఉంది. అతడు కాషాయ వస్త్రాలు దరించి ఉన్నాడు.

‘నాథా, ధన్యురాలిని!” అని కర్ణి మొదలు నరికిన అరటి చెట్టు లాగ అతని కాళ్ళపైన పడిపోయింది! పడిపోవడం తోనే కర్ణి మూర్చితురాలయింది. సంతోషాదిక్యంచే ఆమె శరీరం లోని వాయువు స్తంభించి పోయింది! జడధారి గారాబంతో ఆమెను తన రెండు చేతులతో ఎత్తాడు! ఎడమ చేతితో ఆమెను పట్టుకొని తన గుండెలకి ఆనించు కొని, తన కుడి చేతి కమండలోదకాన్ని ఆమెపై జల్లాడు.రెండు క్షణాలు గడిచాయి. కర్ణి తన విశాలమైన కండ్లని తెరచింది.

“స్వామీ!  భక్తురాలిని! దయ ఉంచారు, అదినాకు చాలు.” జడధారి తన కమండలాన్ని క్రింద ఉంచి కరణిని దగ్గరకి తీసుకొని గాఢమైన కౌగిలిలో బంధించాడు! కర్ణికి ఆనంద భాష్పధారలు కాలువ కట్టాయి.

“నా ప్రియమైన నాగూ! నీవు కాదు, నీను ధన్యుణ్ణి.  నీవు నా భాగ్యవశం చేత  ఏక రాత్ర కళత్రంగా నాకు లభ్య మయ్యావు! నీవు నీ పవిత్ర ప్రేమ చేత దైవత్వాన్ని పొందావు. నీ దివ్య ముఖ సందర్శన భాగ్యం నాకీ రోజు  లభించింది. నేను చాల దూరం నుండి వస్తున్నాను. నా ప్రాణ ప్రియా! నీ పైన నా అనురాగం భక్తిగా మారింది. నేను ఇప్పుడు ఐహిక వాంచలను నిషేదించుకొన్న వానప్రస్థునిగా ఉన్నాను. నేనిప్పుడు నా కౌగిలి తప్ప మరెట్టి ఆనందాన్ని నీకు సమకూర్చ జాలకున్నాను. నన్ను క్షమించు నాగూ!” అన్నాడు జటాముని.

జటాముని కౌగిలి లోనే ఆనంద తరంగ డోలాయమానురాలై ఉన్న కర్ణి తన నాధుని చూసి ఇలా అంది. “ప్రభూ! నేను ఎంతో పుణ్యం చేసుకొన్నాను. మీరు నాకు కలలో దర్శనమిచ్చి నన్ను మీ కౌగిలిలో కరిగించి వేసారు! ఇప్పుడు ప్రత్యక్షంగా ఏ మానవ యువతి పొంద జాలని భర్త్రు సుఖాన్ని నాకు ప్రసాదించారు! ఇది నాకు కోటి జన్మలకు సరి పోతుంది! నేను మీ వానప్రస్థాశ్రమ నియమాలకు ప్రతిబంధకంగా ఎన్నడూ ఉండను. నేను మే పాదసేవ చేసుకొంటూ మీ ఆశ్రమంలో ఉండాలని కోరుతున్నాను. నా కోరికను మీరు మన్నించండి.”

“నాగూ! తప్పకుండా నీ కోరిక మన్నిస్తాను. వెళ్లు, ఆ గదిలో చిరంజీవులు రథినీ భీమనాధులను బంధించి ఉంచావు! వాళ్ళను బయటకు రమ్మను” అని చెప్పాడు జటాముని.

కర్ణీ, జటామునుల సంభాషణ వింటున్నరథినీ భీమనాధులు మిక్కిలి ఆశ్చర్యాన్ని పొందారు! ‘తమ ఉనికిని జటాముని ఎట్లు గ్రహించ గలిగారు?’ ఇదే వారి ఆశ్చర్యానికి కారణం!

కర్ణి కి ఎలాంటి ఆశ్చర్యం కలగ లేదు. ఆమె దృష్టిలో జటాముని సర్వజ్ఞుడు. పరదేవత! “పిల్లలూ! నాన్నగారు పిలుస్తున్నారు బయటికి రండి.” అన్నది కర్ణి.

రథినీ భీమనాధులు తలుపు తీసుకొని బయటకు వచ్చారు. రథినీ కుమారి జటామునిని చూడడం ఇదే మొదటి సారి! ప్రథమ సందర్శనం లోనే ఆమె అతణ్ణి పరమ సిద్దుడని తెలుసుకొంది.

భీమనాధుడు సాష్టాంగంగా నేలపై బడి తన జనకునికి నమస్కరించాడు. జటాముని అతణ్ణి ఆప్యాయంగా ఎత్తి తన కుడి ప్రక్కన వ్యాఘ్రాసనంపై కూర్చోండ నియమించాడు.

రథిని  వంగి జటాముని పాదాలు స్పృశించి ఇలా అంది. “ మహారాజ పరమేశ్వర కౌండిన్య సుచంద్ర భట్టారకుల వారి పుత్రిక, ‘రథిని’ నమస్కరిస్తున్నది, భగవాన్! ఆశీర్వదించండి.” అని.

“కుమారీ! భగవాన్ ఇంద్రుని కృపచే నీకును, నీ తండ్రికిని శుభం చేకూరాలని ఆశిస్తున్నాను. చిరంజీవి కుమార శక్తిధరుడు క్షేమమేనా? రా! ఇలా వచ్చి కూర్చో!” అన్నాడు జటాముని.

రథిని జటాముని ఎడమ ప్రక్కన కూర్చోంది. కర్ణి పండ్లు, పాలు ,పాలకోవా పళ్ళెరంలో తెచ్చి జటాముని ముందు పెట్టింది.

జటాముని తన ప్రియురాలిని తృప్తి పరచే నిమిత్తం ఫలహారం కావించాడు తరువాత తన కుమారుని చూసి ఇలా అన్నాడు.“భీమా! నీ స్నేహితుడు నిశుంభుడు ఇప్పుడు అమరావతీ దుర్గంలో ఉన్నాడు. పర్ణిని కూడా అక్కడే ఉంది. వీర నందుడు రాష్ట్రియునిగా ఉన్నంత కాలం వాడు నిర్భయంగా శ్రీకాకుళంలో ఉంటూ వచ్చాడు. ప్రమథ నాథుడు రాష్ట్రీయ ఘనేంద్రుడు నగర శోధనలో చొరబడగానే తన సంఘ కేంద్రాన్ని ఇక్కడ నుండి ఎత్తి వేసాడు. నేను వాణ్ని కలుసుకొన్నాను. వాడిప్పుడు స్వతంత్రాభిప్రాయాలను కలిగి ఉన్నాడు. నా ఉపదేశాలు వాణికి నచ్చలేదనే తలంచాను. నీ గురించి ప్రసంగం వచ్చింది...”

 “..భీముని కోరిక సిద్ధించింది. కాబట్టి వాడు ఇకమీద నీ సంఘంలో సభ్యుడుగా ఉండలేడు. కుండిన వంశ పతనాన్ని వాడు ఎన్నడూ సహించ లేడు! నీవు వానిపై పెట్టుకొన్న ఆశకు తిలాంజలి ఇవ్వ వలసె ఉంటుంది. అని స్పష్టంగా చెప్పాను. నేను నీకు ఒక ఆదేశాన్ని ఇవ్వడానికి వచ్చాను. నీవు నీ ధర్మభగినికి (రథినికి) పరంతప సంఘంలో నుంచి విడుదల అయిపోయినట్లు చెప్పుకో! దాన్ని కోరే ఈ దినం ఈ పిల్ల ఇక్కడకి వచ్చింది. నేవు రేపు ప్రాతః కాలం ఈ నగరాన్ని వదిలి శ్రీశైలం వెళ్ళవలసి ఉంటుంది! అక్కడకి నీవు వెళ్ళిన తరువాత నీ కర్తవ్యం  బోధపడుతుంది! రేపు సాయంకాలం లోపుగా నీవు ప్రయాణం చేయాలి” అని అజ్ఞా స్వరంతో చెప్పాడు జటాముని.    

 “భగవాన్! మా కుండినులకు ఈ రోజు పర్వదినం!! అద్భుత పరాక్రమ ధనియైన అన్నయ్య మా పక్షంలో చేరాడు.” అని జతామునితో చెప్పి, రథిని భీమనాధుని చూసి ఇలా అంది. “ రేపు ఉదయం నన్ను కలుసుకో! శ్రీశైల ప్రయాణానికి కావలసిన సరంజామా అంటా మనం మాట్లాడుకొని ఏర్పాటు చేసుకోవచ్చును” అని.


“భీమా! బ్రహ్మ కుల పరిషత్తుకు నీవు రేపు విన్నపం పంపుకో! నిన్ను తప్పకుండా బ్రహ్మ కులంలో వారు చేర్చుకొంటారు. “

“అలాగే చేస్తాను నాన్నగారూ!” అన్నాడు భీమనాధుడు.

“కుమారీ పద! నేను నిన్ను దిగబెడతాను.” అని జటాముని తన కమండలాన్ని, చేతి కర్రను పట్టుకొని లేచాడు. అదే సమయానికి కొన్ని పాటలు వినిపించాయి.

“మేటి జటాముని మేలంచు పలికే / దాటెను కష్టాలు ధరణి నాథునకు.                                                                    రథినమ్మ నడిపింప రాజకీయాలు / కథ లెల్ల బాగయ్యే కౌండిన్యులకును!

పెదనాగు పాలించె పెనుదీక్ష నేడు / పెద జోగి తలనొగ్గె బెదురు లేదింక.                                                               జడధారి తల దూర్చె జగడాల మారి / పెడదారి త్రోక్కంగ విడిపోయె చిక్కు.”

“నాగూ! వెళ్లి తలుపు తియ్యి, వేర్రిపిల్ల వచ్చింది.” అన్నాడు జటాముని. రాజకాళి అక్కడకి వచ్చిందని వీధి వైపు ఆశ్చర్యంతో చూసారు రథినీ భీమనాధులు. కర్ణి సంభ్రమంతో వెళ్లి తలుపు తీసింది.

రాజకాళి లోపలి ప్రవేశించింది. లోపలికి రాగానే జటాముని కాళ్ళపై శిరస్సు మోపి నమస్కరించింది.

“బిడ్డా!లే! నిన్నే వెతుక్కొని వద్దామని తలంచాను. నీవే వచ్చావి.” అన్నాడు జటాముని.

“భగవాన్! కుండలో నూనె సలసలమని మరుగుతూంది.”

“దానితోనే పాప ప్రక్షాళన అవుతుందమ్మా! ఏ కాలంలో ఏది జరగాలో అది నడిచే తీరుతుంది.”

“సంద్రయ్య గోపనం ఎన్నాళ్ళు  తండ్రీ?”                      “దాని కాలం కూడ దగ్గర పడిందమ్మా!”

“కాలయ్య అపేక్షను ఏమంటారు?”                           “నీ అభిప్రాయం ప్రకారమే జరుగుతుంది.”

“ దయ్యాల గృహంలో వాణ్ని దగ్గరకు తీసుకొని మెనూ నిమరాలని ప్రార్థన!”

“ ఎప్పుడు?”                                               “జంగముడు స్థావరాన్ని విదిలినప్పుడు.”

“అలాగే! కాళీ! ఇదుగో చూడు, రథినీ కుమారిని ఆమె తాతగారింటికీ క్షేమంగా చేర్చి వస్తావా?”

“దయ్యాల రాజు ఆదేశం పాటించి తీరాలి. మరచిపోయాను! అమ్మణ్ణి పాదాలు ముట్టుకోనే లేదు! ఎంత అపరాధం జరిగింది?” అని రాజకాళి కర్ణి పాదాలు ముట్టుకొని నమస్కరించింది.

కర్ణి బిక్కు బిక్కుమని జటామునిని చూసింది. ఆమెకు రాజకాళి పరిచయం ఉంది కాని, ఆమె తన కుమార్తె అన్న విషయం తెలియదు!

“నాగూ! కాళి నీ పిల్లే! దాన్ని కట్టుకొని ఆదరించు” అని చెప్పాడు జటాముని.

*********************************

34 వ ప్రకరణము:

విజయ సంవత్సరంలో మార్గశీర్ష మాసం ప్రారంభించింది. మామిళ్ళు పూత పట్టాయి, పగటిపూట ఎండ, రాత్రి పూట నిర్మల నభోమండలం,శరీరాలను జలదరింప చేసే శీతల పవనం, ఉభయ సంధ్యల యందు మంచు తెరలు, వీటితో ప్రకృతి సుఖ దుఃఖ మిశ్రితమైన జీవితాన్ని మానవ కోటికి ప్రసాదిస్తోంది.

శ్రీకాకుళం లోని రాజకీయ వాతావరణం కూడా విభిన్నమైన పరిస్థితిలో అల్లకల్లోలంగా ఉంది. మేధా సంపన్ను డైన ఆంగీరస మల్లికార్జునుని యాజమాన్యం పైన ప్రజలలో తృప్తి హెచ్చినందున రాష్ట్రంలో చాల మట్టుకి శాంతి నెలకొంది. ఆంద్ర రాష్ట్రంలో విప్లవ చేష్టలు పలుచ బడినాయి.

కాశ్యప కాలనాథుడు సేనాపతిగా నియమింపబడ్డాడు. ముందు సర్వ సేనాపతిగా ఉండిన చండ సేనుడు ఉప సేనాపతి అయినాడు. ఈ మారుదల సైన్యం లోని యువక వర్గానికి చాల ఉత్సాహం పుట్టించింది. కొందరు వృద్ధ దండనాయకులు అసూయచే హర్షించ లేక పోయారు.

ఇతర రాష్ట్రాలకూ ఆంద్ర రాష్ట్రానికీ ఉన్న సరిహద్దు ప్రాంతాలలో నూతన సైనిక దళాలు సంరక్షణకై నిలువరింప బడ్డాయి. శివంకర సంఘానికి చెందినా సుశిక్షితమైన సైన్యమే సరిహద్దు దుర్గాలకు పంపబడింది. రాష్ట్రం లోని

మూలబలం కొత్త పద్ధతుల మీద పటిష్టం చేయబడుతూ ఉంది . పై రాష్ట్రాల  నుండి వీస్తున్న విప్లవ వాతాల వల్లనే ఈ మార్పులన్నీ చెయ్యబడినట్లు అభిజ్ఞ వర్గాల అంచనా!

చిత్రకూట రాష్ట్ర సమస్య మహా న్యాయస్థానంలో వచ్చింది. చంద్ర ప్రభాదేవిపై కాక, ఆమె చెల్లెలు చంద్ర ముఖిపై అభియోగం మోపబడింది. మహాన్యాయ స్థానం కాలదోష సమస్యను చర్చించ వలసిన అవసరం లేదని మహారాజ సుచంద్రుడు తన అసాధారణ అధికారం ప్రయోగించి తీర్మానం చేసినందు వల్ల మహా ప్రాడ్వివాకుల పూర్తి  సదస్సు అభియోగ విచారణకు పూనుకొంది. మహారాజు సుచంద్రుడు ఆ సదస్సుకు అధ్యక్షత వహించాడు.

ఇంతలో పూర్తి విచారణ లేకుండానే ఒక అద్భుతం సంభవించింది! చంద్ర ప్రభా దేవికి తన కీ:శే: భర్త స్వయంగా వ్రాసిన ఉత్తరం లోని విషయం తెలిసింది. ఆమెకు తన భర్తపై విశేషమైన గౌరవం ఉంది. వెంటనే ఆమె తన అపవిద్ధ పుత్రునితో కలిసి మంతనం సలిపి సుచంద్ర భట్టారకునికి ఒక విన్నపం పంపుకొంది. ఆ విన్నపంలో తానే స్వయంగా తన చెల్లెల్ని ప్రోత్సహించి వీరేశ్వరుని పెంచుకొన్నట్లూ, తన రాజ్య కాంక్షే దానికి కారణమనీ, న్యాయ స్థానం వారు ఏ విచారణా లేకుండా శాంతిసేనా దేవికి సర్వహక్కులతోనూ రాజ్యం స్వాధీన పరచ వలసినదిగా వ్రాయించి చేవ్రాలు పెట్టింది. న్యాయ స్థానం వారు ఆ విన్నపం మన్నించి శాంతిసేనా దేవిని చిత్రకూట మహామండలేశ్వరిగా ప్రకటించారు!

శాంతిసేనా దేవి, చంద్ర ముఖి దంపతులపై తాను తెచ్చిన అభియోగాన్ని ఉపసంహరించుకుంది. ఈ విధంగా చాల అలజడి కలిగించిన చిత్రకూట రాజ్య సమస్య సుఖాంతంగా పరిణమించింది. మహారాజు, లీలావతీ దేవికి ఇచ్చిన మాట ప్రకారం, ఆంధ్ర చిత్రకూట రాష్ట్రాలకి మధ్యన ఉన్న ‘సింహగడ’ దుర్గానికి సామంత దండనాయకు నిగా వంశ పారంపర్య  హక్కులతో స్థిర పరచాడు.ఆహోయోగ పరిష్కారానంతరం విమలుడు శాంతిసేనా దేవితో కలిసి చిత్రకూట రాష్ట్రానికి వెళ్లి పోయాడు. అతడిప్పుడు మహామండలేశ్వర అంగీరస విమల భట్టారక నామంతో చిత్రకూట ప్రాసాదంలో తన రాణి శాంతిసేనతో ఉన్నాడు.

వృద్ధ సేనాపతి రణంధరుడు  శ్రావణ మాసారంభం లోనే మరణించాడు. రథినీ కుమారి ఆ కారణం చేత రాజ ప్రాసాదానికి వచ్చి వేసింది. అతని సంస్థానం ఇంకా ఎవరికీ నిర్ణయింప బడలేదు.రథినీ కుమారి ఆలోచన లేనిదే మహారాజు ఏ పనీ చెయ్యడం లేదు. తన కుమార్తె సమయోచిత బుద్ది మీద అతనికి గొప్ప నమ్మకం కుదిరింది. ఒకనాడు మహారాజు సింహసనోత్తరాదికారి సమస్య గూర్చి కుమార్తె సలహా అడిగాడు. అప్పుడామె నరపతితో ఇలా అంది. “ నాన్నగారూ! దేశం లోని రాజకీయ వాతావరణం విష పూరితంగా ఉంది. కాబట్టి మీరు మహామంత్రిని పిలిపించి అతని అభిప్రాయాన్ని తెలుసుకొనడం ఉచితం !” అని.

వెంటనే మహారాజు మహామంత్రిని ఆహ్వానించాడు. అది సాయంకాల సమయం. ఇంకా పూర్తిగా సూర్యుడు అస్తమించ లేదు.

మల్లికార్జునుడు బహిపురం లోని రాజుగారి అభ్యంతర మందిరానికి వచ్చాడు. ఆ సమయంలో రథినీ కుమారి కూడ సన్నిహిత అయి కూర్చొని ఉంది. మల్లికార్జునుడు రాజ పుత్రికకు అభివాదం చేసి, తనకు వేసి ఉన్న వేత్రాసనం పైన ఆశీనుడు అయ్యాడు.

గురు కులంలో జరిగిన వీర పరీక్షలలో స్త్రీలకు ప్రత్యేకింప బడిన వితానంలో రథినీ కుమారి కూర్చొని  మల్లికా ర్జునిని చూసింది. ఆ తరువాత అతనిని చూచే సందర్భం ఆమెకు కలుగలేదు. ఆమె ఇప్పుడు మల్లికార్జునిని మనోహర రూపునిగా గుర్తించింది. ఆ భావం ఆమె హృదయంలో ప్రవేశించగానే ఆమె సిగ్గుతో ఎర్రబడింది. కండ్ల లోని నిర్మల తేజస్సు, దృఢమైన అవయవాల పొంకం, బుద్ది వికాశంచే మెరుస్తున్న ఫాలభాగం, పున్నమి నాటి చంద్రుని వంటి ఆహ్లాదకరమైన శరీర  ప్రభ కలిగిన ఆ సుందర యువకుడు రథిని మనస్సుని ఆకర్షించాడు.

మల్లికార్జునుడు కూడ అంత దగ్గరగా రథినీ కుమారిని చూచి ఉండలేదు. తన ప్రియ మిత్రులైన కాలనాథాదులు మహా సుందరిగా వర్ణించిన ఆమెని చూసాక వారు వర్ణించిన దానిలో అసత్యం లేదని అతని మనస్సు ఉద్ఘాటిం చింది. ఆ ఘోషణ వలన వాణి మనస్సులో అవ్యక్తమైన తీయని స్పందన ఏర్పడింది. కాని ఆ ధీర చిత్తుడు అతి వేగరం తన్ను తాను సమాధాన పరచుకొని, తానె ముందుగా ప్రసంగ ద్వారం తెరచాడు.

“మహాప్రభో! నేనే ప్రభువు వారిని సందర్శించాలని తలచాను. అదే సమయంలో శ్రీవారి ఆహ్వానం నాకు అందింది.

“మహామంత్రీ! సింహసనోత్తరాదికారి సమస్యా పరిష్కారం చేసి, రాజపుత్రుల మధ్య అంతః కలహం రాకుండా చేయాలని సంకల్పించాను. దానికి సమయమా, కాదా, నీ అభిప్రాయం చెప్ప గోరుతున్నాను.”

 “మహాప్రభో! ఇప్పుడా సమస్యను చర్చకు తీసుకొని రావడం వలన కొన్ని చిక్కులు సంభవిస్తాయి.”

“ఏవి, ఆ చిక్కులు?”

“దేవ వాటికా అమరావతీ దుర్గాదిపతులు రహస్యంగా కార్కొటక నిశుంభువుతో సంధి చేసుకొని భయంకర విప్లవానికి దోహదం చేస్తున్నట్లు నాకు నిన్ననే రహస్యార్థ శోధకుడు ప్రమథనాథ బాబు రాష్ట్రీయ ఘనేంద్రుని ద్వారా సందేశం పంపి ఉన్నాడు.

 ఇప్పుడా రెండు దుర్గాలలో పరంతప విప్లవ సంఘస్తులు దిన దినమూ  పెరిగి ప్రోగవుతున్నట్లు వర్తమానం పంపాడు ప్రమథ నాథుడు. మన రాష్ట్రంలో నుంచి అనేక నాగ ప్రముఖులు ప్రయాణమై వెళ్లుతున్నట్లు కూడ అతను గమనించాడు. కాకుల దౌహిత్రి ఇరావతి కుంతల దేశానికి పయనమై వెల్లినట్లూ, ఆమె ప్రయాణంలో ఏదో గూఢమైన అంతరార్థం ఉన్నట్లూ అతడు అనుమానిస్తున్నాడు!

ఇదే కాక శ్రీశైలం ప్రాంతం నుండి ఒక వర్తమానం వచ్చింది. అది నేరుగా సర్వసేనాపతి కాలనాథునికి వచ్చింది. భీమనా థుడు దానిని వ్రాసి పంపించాడు. ఆ జాబు తెచ్చాను. ప్రభువుల వారు చిత్తగించండి.” ఇట్లు చెప్పి మల్లికార్జునుడు ఒక జాబు తీసి మహారాజుకి ఇచ్చాడు.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద