Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ -17: బాపు వేసిన బొమ్మలతో సహా

  మహారాజు జాబుని రథినీ కుమారికి ఇచ్చి చదవమన్నాడు. దానిని రథిని ఈ ప్రకారం చదివింది. ప్రియ మిత్రమా! శ్రీ శైలం మంచు కంటె దట్టమైన దూమంతో ఆవృతమై ఉంది. వాతావరణం అనుకూలంగా లేదు. నాలుగు వందల చేతులు ఉన్నా మానవునికి ఇక్కడ సుఖంగా ఉండదనే నా తలంపు. అయోధ్రుడము లైన నా రెండు చేతులు వ్యక్తిగతంగా సరి పోవచ్చు. కాని నాతొ కలసి ఉన్న యాత్రికుల సదుపాయాన్ని కూడ చూడాలి కదా? గ్రహించ వలెను. వ్రాయడానికి ఏముంది? ఏమీ లేదు. నీవు నాకు ఉత్తరం వ్రాయాలంటే ఈ క్రింది విలాసానికి వ్రాయవచ్చు. శివదత్త శర్మ; చందన వాటిక; శ్రీశైల మండలం. భగిని ధరణిని చాలా అడిగినట్లు చెప్పు, భవదీయుడు కంకోల భీమనాథుడు వ్రాలు. 



“కుమారీ! నీ అన్న భాష దక్షిణా మూర్తి భాషలాగ ఉంది!” అని నవ్వాడు రాజు.
“నాన్నగారూ! అన్నయ్య చాల నేర్పుగా వ్రాశాడు. ధూమం అంటే శత్రువుల సంచలనం అని అర్థం. చిట్టపులులు అంటే పరంతప సంఘం వారు. నాలుగు వందల బాహువుల్లోనే అన్నయ్య గొప్ప తెలివిని చూపెట్టాడు. నా అభి ప్రాయంలో అన్నయ్యకు రెండు వందల మంది సైనికులు సహాయం నిమిత్తమై కావాలి కాబోలు! “ అని చెప్పింది రథినీ కుమారి.

 “భర్త్రుదారిక బుద్ది చాల నిశితమైనది! ఇప్పటి వరకు మా బుర్రలు ఆ అద్భుత నిర్ణయానికి రాలేక పోయాయి!” అని అభినందించాడు మల్లికార్జునుడు.

“శ్రీశైల మహామండలేశ్వరుడు సత్యకర్మతో భీమనాథుడు సంప్రదించ వచ్చునే!” అని సందేహం వెలిబుచ్చాడు మహారాజు.

“శ్రీశైల  మహామండలేశ్వరుడు రాజనీతి తెలియని సాదు పుంగవుడు. అతని సైనిక శిక్షణ ఏమీ బాగుండడం లేదని ప్రమథ నాథుడు చెప్తున్నాడు.”

“ ఈ ప్రమథనాథుడు సహస్రాక్షుని వలె ఉన్నాడే?”

“నాన్నగారూ! అతడు ఎట్లా సహస్రాక్షుడో అట్లానే యుద్ధ సమయంలో సహస్ర బాహువు కూడ కాగల సమర్థుడు. గజవీరుడంటే సామాన్యుడా మరి!” అన్నది రాజకుమారి.

“మహాప్రభో! చిత్తగించండి. వీటిని బట్టి చూస్తే విప్లవం చాల తీవ్రంగానే సంభవిస్తుందని నా అంచనా! ఇప్పుడు గనుక సింహసనోత్తరాధికారి సమస్య మనం తెచ్చి పెట్టుకొంటే మన రాష్ట్రంలో రెండు తెగలు ఏర్పడుతాయి. అట్టిది ఇలాంటి సందర్భంలో అవాంఛనీయమని నాతలంపు.”

మహారాజ సుచంద్రునికి సింహసనోత్తరాధికారి సమస్యపై ఏ మాత్రం శ్రద్ధ లేదు! తన ప్రియురాలి ఒత్తిడి వల్ల అతడు దానిని రాజకులంలో తేవాలని తలంచాడు. ఇప్పుడు అతని భావం మహామంత్రి సూచన వలన అణగారి పోయింది! అతడు సాభిప్రాయంగా తన కుమార్తె వైపు చూసాడు.

మహామంత్రి గారి సూచన చాల ప్రాముఖ్యం వహించి ఉంది నాన్నగారూ! ప్రస్తుతం శ్రీవారు ఆ చర్చకు అవకాశం ఇవ్వడం మంచిది కాదనే న అభిప్రాయం!” అని మహామంత్రిని సమర్థించింది రాజకుమారి.

“మల్లికార్జున బాబూ! దూతసామంతునికి విదేశ సంబంధమైన విషయాలు తెలిసి ఉండాలి! అయినప్పటికీ అతను మౌనంగా ఉండడానికి కారణం అతని అజ్ఞానమా లేక  ఉపేక్షా?”

“మహాప్రభో! దూత సామంతుల వారికి స్వార్థం పైన ఉన్న శ్రద్ధ  రాజకీయంలో లేదు.దీన్ని శ్రీవారికి మనవి చేసుకోవాలనే తలంచాను. బాద్యత గల ఒక మంత్రి తన బాద్యతని గుర్తించక పోవడం చాల అపరాధం! మనకు బాధ్యతా తెలిసిన ప్రమథనాథ బాబు వంటి మేథావి ఉన్నందు వల్లనే కదా, సమయానికి ఈ విషయ సామగ్రి లభించింది! లేకుంటే ఎంతైనా ప్రమాదకర పరిస్థితిలో పడిపోయి ఉండుము” అన్నాడు కటువుగా మహామంత్రి.

“నిజమే! అయినా ఇలాంటి ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ లేనంత స్వార్థ చింత దూత సామంతునికి ఏముందనే నేను ఆలోచిస్తున్నాను”

“మహాప్రభో! నేను మిక్కిలి బాధ్యతా గల పని నిర్వహిస్తున్నాను. కాబట్టి ఎంత కటువుగా ఉన్నా సత్యాన్ని ఉద్ఘా టించడంలో వెనుకంజ వేయజాలను. గౌరవాగౌరవాలు, మొహమాటాలు, మెర మెచ్చుల మాటలు చెప్పడం గాని, పాటించడం గాని కూడని క్లిష్టమైన రోజులివి. దూత సామంతుడు తన ధర్మం విస్మరించి తన కుమార్తెను భావి మహారాజ్ఞిగా చేయడానికి, కుమార భోగనాథుని ఉత్తరాదికారిగా సమర్థించే నూతనమైన కక్షను సృష్టించి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కుమార శక్తిధరబాబు,వివాహం పైన ఆధారపడిన దూతసామంతుని సహాయాన్ని  ప్రత్యాఖ్యానం చేసినందు వలన, కుమార భోగనాథుని పైన ఆధారపడి ఉన్నాడు విశాలాక్షుడు.ఉత్తరాదికారిగా ఉన్న రాజకుమారుడు తన కుమార్తెను చేపట్టాలని అతని దీక్ష. ఇది  స్వార్థం కాక మరేమవుతుంది?”

“విశాలాక్ష బాబు కోరిక చాల వింతగానే ఉంది. రాజకుమారుని తన అల్లునిగా చేసుకోవడానికి ప్రయత్నించడం తప్పేమీ కాదు! కాని దీనికి రాజకీయ కక్షను లేవదీయడం చాల ద్రోహకరమైన విషయం!”

“ప్రభో! కొంచెం స్వతంత్రించి  చెబుతున్నందుకు క్షమించాలి. దూత సామంతుడు నన్ను కూడా తన పక్షం లోనికి లాగడానికి ప్రయత్నించాడు. మహారాణి ద్వారా నా తల్లికి ఈ విషయం చెప్పి నన్ను తన పక్షానికి తిప్పుకోవడానికి ప్రయత్నం చేసాడు. అతను ఇలాంటి కృత్రిమ మార్గం అవలంబించడం చాల శోచనీయం.”

మహారాజు మనస్సు  చాల ఆందోళనా వశమై పోయింది. విద్యా బుద్దులలో అతి శ్రేష్టుడైన విశాలాక్ష బాబు ఇలాంటి నీచమైన పనికి పూనుకోవడం నరపతి హృదయాన్ని వేధించింది. రథినీ కుమారి తన తండ్రి భావం గ్రహించి ఇలా అంది.

“ మహామంత్రి గారితో ఈ విషయంలో నాకు తోచిన సలహా ముచ్చటించాలని తలంచి ఉన్నాను.” ఈ మాట అని రాజకుమారి మహామంత్రిని చూచింది.

“భర్త్రుదారిక నిర్భయంగా మాట్లాడ వచ్చును. అలాంటప్పుడు భర్త్రుదారిక ఒక ముఖ్య విషయం విస్మరించ రాదు. మహామంత్రి  వ్యక్తిగతంగా సలహాదారుడే గాని, క్రియాచరణలో శ్రీవారే బాధ్యులు” అన్నాడు మహామంత్రి మందహాసంతో.

”క్షమించండి, మీ వ్యాఖ్యానం సరి అయినది కాదు. మహారాజు ఎట్టి క్రియను ఆచరణలో పెట్టినా, మహామంత్రి మూలం గానే చేయడానికి అర్హుడవుతున్నాడు! అది మా కుండినుల  రాజకీయ సాంప్రదాయమని మహామంత్రికి విన్నవించు కొంటున్నాను.”

మహారాజు తన కుమార్తె యుక్తి పాటవానికి గర్వించాడు!

“మా సత్యప్రభ భర్త్రుదారిక బుద్ది విశేషాన్ని చాల పొగుడుతుంటుంది. ఇప్పుడు ఆ పొగడ్త బూటకం కాదని తెలుసుకొన్నాను. భర్త్రుదారిక ఇక మాట్లాడ వచ్చును.”

 “మాననీయ విశాలాక్ష బాబు గారు చాల గొప్ప రాజ భక్తులు, ఆ విషయంలో సందేహానికి తావు లేదు! ‘ఆత్మార్థం పృథివీం త్యజేత్’ అని అంటారు పెద్దలు. ఆశకు బద్దులు కానివారు ఎవరున్నారు? కాని ఆశకు కూడ ఒక చెలియలి కట్ట ఉంటుంది. కాబట్టి  విశాలక్ష బాబు అ చెలియలి కట్టని ఉల్లంఘించి చరించడం చాల గొప్ప తప్పిదమని నేను ఒప్పుకొంటాను. అతణ్ణి సరియైన మార్గంలోకి మళ్లించడానికి ఒక ఉపాయం ఉంది.”

“భర్త్రుదారిక బుద్ధికి ఏదైనా కొత్త ఉపాయం తోస్తే ధారాళంగా చెప్పవచ్చును.”

“మా అన్నయ్య భోగనాథుని వివాహం శీఘ్ర కాలంలో జరిపించడమే ఆ ఉపాయం. అతని వివాహం జరిగిపోయి నప్పుడు విశాలాక్ష బాబు చిత్తం మన ప్రక్కకు సహజంగా మరలి పోతుంది.”

“భర్త్రుదారిక ఉపాయం అమోఘంగా ఉంది! అదే ఉత్తమమైన మార్గం!”

“ వధువు ఎవరయితే బాగుంటుంది?”

“ ఆ విషయం కూడ భర్త్రుదారికే నిర్ణయించడం మంచిది.”

“మీ సత్యప్రభ మా అన్నయ్యను పతిగా వరించ గలదా? చెప్పండి. నేను రాజుగారి తరఫున మా అంగీకారం చెప్పగలను. వెంటనే వివాహం జరిపిద్దాం.”

రాజు తన కుమార్తె సమయోచిత ప్రజ్ఞకి చాల సంతోషించాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలే యుక్తికరమైన పద్ధతిని రథిని అవలంబించిందని తలంచాడు నరపతి. కుమారి తన  సొంత సోదరుని విషయంలో ఉపేక్షా భావం వహించి భోగనాథుని పక్షానికి దోహదం చేయడమే మహారాజు ఊహకు అందరానిదిగా ఉంది.

మహామంత్రి కొన్ని లిప్తలు ఆలోచనలో ఊగులాడాడు. అతడు కూడ మహారాజు పడిన అవస్థ లోనే పడిపోయాడు.

రథిని మాత్రం నిశ్చలంగా ఉంది! సత్యప్రభ కాలనాథుని ప్రేమించిందన్న విషయం ఆమెకు తెలియనిది కాదు! తానూ చేసిన వివాహ ప్రస్తావన కేవలం ద్రవిడ ప్రాణాయామమే! ఈ ప్రసంగం ద్వారా విశాలాక్షుని కుమార్తె కుముదాక్షినే భోగానాథునికి జత కూర్చాలనేది ఆమె మనసులో మెదిలిన విచిత్రమైన పథకం! సర్వ జ్యేష్టుడు కాలనాథుడు అనేది  ఆమెకు తెలిసిన విషయం. అది మహారాజుకి కూడ తెలుసు! సింహాసనోత్తరాదికారి సమస్య శక్తిధర, కాలనాథులకే గాని భోగనాథుని ప్రసక్తి ఏమాత్రం ఉండదు. జ్యేష్టుడే ఉత్తరాధికారి అవుతే కాలనాథుడు యువరాజు అవుతాడు. పట్టా మహిషీ పుత్రుడు ఉత్తరాదికారి అని తేలినప్పుడు శక్తిధరుడు యువరాజు అవుతాడు. ఈ రెండూ ఆమెకి ఇష్టమే! కాబట్టి ఉత్తారాదికారి సమస్య విషయంలో రథినికి ఎత్తి చింతా లేదు.

“భర్త్రుదారిక ఉదార ప్రకటనకు మా కుటుంబం కృతజ్ఞత కలిగి ఉంటుంది. మా సత్యప్రభ ప్రాజ్ఞత కల కనక! ఆమె వివాహ విషయంలో నేను ఎట్టి మాటా ఇవ్వలేను! ఒకవేళ నాకు సత్యప్రభ విషయంలో పూర్తి అధికారం ఉన్నా, నా చెల్లెలి పాణిని కుమారా భోగానాథునికి కూర్చడానికి సమ్మతించ లేను”

“మహామంత్రి యుక్తమైన సంబంధం ఏదైనా ఉంటే సూచించవచ్చును.”

“దూత సామంతుని కుమార్తెనే కామారా భోగానాథునికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం! అప్పుడతడు (విశాలాక్షుడు ) చాల సంతోషంతో రాచకార్యాలలో చురుకుగా పని చేయగలడు.”

“నాన్నగారూ! మహామంత్రి చెప్పింది నాకు చాల సమ్మతంగా ఉంది.”

“సరేనమ్మా! నేను ఈ  దినమే ఆ పనిని నెరవేరుస్తాను.” అని కుమార్తెతో చెప్పి, మహామంత్రిని చూసి రాజు ఇలా అన్నాడు. “ మల్లికార్జున బాబూ! నీవు సర్వ సేనాపతితో కలిసి నన్ను రేపు సాయంత్రం సప్త భూమికా విమానం లోని ఏకాంత మందిరంలో కలుసుకో గోరుతున్నానని చెప్పు.”

“చిత్తం మహాప్రభో!” అని ఆసనం నుండి లేచాడు మహామంత్రి.

***********************

35 వ ప్రకరణం:

మహారాజ సుచంద్రుడు మహామంత్రితో మాట్లాడిన రోజు రాత్రి అంతఃపురంలో మహారాజ్ఞి లీలావతీ దేవిని సంద ర్శించాడు.ఆ సమయంలో భ్రుంగాలక సన్నిహితంగా ఉంది. భ్రుంగాలక సన్నిధానం లోనే రాజు భోగనాథుని వివాహ విషయంగా ప్రసంగం మొదలు పెట్టాడు. “భ్రుంగాలకా, విశాలాక్షి బాబు గారి కుమార్తె కుముదాక్షిని నీవు చూచావా?”

“మహాప్రభో! కుముదాక్షిని నేను బాగా ఎరుగుదును.”

“ఆమె ఇప్పుడు గణనీయమైన వధువుల పట్టికలో అగ్రశ్రేణిలో ఉన్నట్లు విన్నాను నిజమేనా?”

భ్రుంగాలక మహారాజు హృదయగత భావాన్ని తెలుసుకోవడానికి తబ్బిబ్బులయింది. ఇలాంటి ప్రసంగం మహారాజు ఇదివరలో ఎప్పుడూ చేసి ఉండలేదు!

“మహాప్రభో! కుముదాక్షి సుందర కన్యలలో ఎన్నదగినదే ! ఆమెను చదువుల సరస్వతి అని నగరంలో అందరూ చెప్తారు, కాని ఆమెలో ఒకే ఒక దోషం ఉంది. ఆమె శ్యామలాంగి!”

“కోడలు నలుపైన కులమెల్ల నలుపు అని అంటారు. నీవేమంటావు లీలా?”

“”శ్రీవారు చెప్పింది సామాన్యోక్తి! అది అన్ని చోట్లా వర్తించదు. నల్లని కోడళ్ళు ముత్యాల వంటి పిల్లల్ని కనడం లేదా? నా అభిప్రాయంలో ఒక యువతికి అవయవ సౌష్టవం, జిగిబిగి యౌవనం, మధురమైన ఆరోగ్యం, తొణికిస లాడే లావణ్యం ఇవే ప్రధానంగా ఉండాలి. అన్నిటినీ మించినది ఉత్తమ శీలగుణం. ఇవన్నే కుముదాక్షిలో పూర్ణంగా ఉన్నాయి.”

 “ఏం, భ్రుంగాలకా ! నీ అభిప్రాయమేమిటి?”

“నేను రాణి గారితో ఏకీభవిస్తున్నాను. ఇంతకూ శ్రీవారు ఇట్లా అడగడంలో ఉద్దేశమేమిటో?”

“ఆ పిల్లను మా కోడలుగా చేసుకొందామని తలంచాను. దీనికి ముఖ్య కారణం విశాలాక్ష బాబు గారి రాజ సేవే! అతని సేవకి ప్రతిఫలంగా అతని కుమార్తెను కోడలుగా చేసుకోవాలని ఉంది.”

“ శ్రీవారు ఆ పిల్లను ఎవరికీ చేసుకొంటారు, చిన్నబాబుకా, పెద్దబాబుకా?”

తాను అడగదలచు కొన్న ప్రశ్నను భ్రుంగాలక అడిగినందుకు మహారాణి సంతోషించింది. విశాలాక్ష బాబు తన కుమార్తెను, తన కుమారునికి ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అతడనేక పర్యాయాలు ఆ విషయం తనతో ప్రస్తావించి ఉన్నాడు. ఉత్తరాదికారి సమస్య విషయంలో అతని సలహాపై తాను ఆధారపడి ఉంది.రాజధానిలో అతనికి చాల పలుకుబడి ఉంది.తనకు కూడ కుముదాక్షిని కోడలుగా చేసుకోవాలనే అపేక్ష ఉంది. తన ఉద్దేశాన్ని మహారాజు ముందర పెట్టడానికి చాల రోజులుగా ప్రయత్నించింది కాని పెట్టలేక పోయింది. ఇప్పుడది తలవని తలంపుగా మహారాజు ముఖతః  వెలువడింది!

“పెద్దవాని వివాహం ముందుగా జరగాలి. తరువాతే చిన్నబాబుది! కుముదాక్షిని పెద్ద కోడలుగా చేసుకోవడానికే  ఇష్ట పడుతున్నాను. కుముదాక్షి రాజనీతి బాగా చదువుకొన్న పిల్లట! అలాంటి కన్యకే భావి మహారాణిగా ఉండడం వాంచనీయం. నీవేమంటావు లీలా?”

“నిజమే! నాకు కూడ సమ్మతమే, నేను పెద్దబాబుతో చెప్పి సమ్మతింప చేస్తాను.”

“ భ్రుంగాలకా! నీవు మన పురోహితులు వాణీధర బాబును కలుసుకొని శీఘ్రంగానే ముహూర్తం పెట్టించు!”

 “చిత్తం మహాప్రభో!” అని భ్రుంగాలక లేచింది.

********************

మహారాజ సుచంద్రుడు ప్రేయసితో కొంత వరకు లోకాభిరామాయణం ముచ్చటించి అంతఃపురం వదలి, బహిపురం లోని తన శయనాగారానికి వచ్చాడు. మహారాజు ముఖ కవళికలు కనిపెట్టి తన భర్తను ఆ రాత్రి తనతో గడపమని అడగడానికి జంకి ఊరుకోండి లీలావతీ దేవి. పార్థివుని ముఖచ్చాయలో ఏదో ఆవేదన దాగుకొని ఉండడం ఆమె గమనించింది. ఒకవేళ అతని శరీరంలో అస్వస్థత ఉందేమో అని ఆమె భయపడింది.

మహారాణి తలచినట్లే మహారాజు మనస్సు సరిగా లేదు. మహామంత్రి శత్రు సంచలనం గురించి చెప్పిన మాటలు అతని హృదయంలో ఆందోళన కలిగించాయి. శాంతి కాముకుడైన ఆ నరపతి తన కాలంలో భయంకర యుద్ధం తటస్థిస్తుందేమో అని భయపడ్డాడు.

విశ్రాంతి పొందిన మహామంత్రి సునందుడు, రాష్ట్రియుడై ఉండిన సునంద పుత్రుడు వీరనందనుడు స్వార్థం గమనించడం లోనే తెలివి ఉపయోగించుకొన్నారు గాని, విప్లవ సంఘాన్ని ఏ మాత్రం కూడ గమనించి ఉండలేదు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఉంటే పరంతప సంఘం ఇంత  పటిష్టంగా రూపొందడానికి అవకాశం ఉండదు. ఇలాంటి ఆలోచనలతో అతడు పరితపిస్తున్నాడు. విశాలాక్షుడు స్వార్థం కోసం దేశ క్షేమాన్ని విస్మరించడం పార్థివుని మనసుని మరింత కల్లోల పరచింది.

శివంకర సంఘ ప్రతినిధి అయిన కాలనాథునితో మాట్లాడిన తరువాత నుండి, మంగళ వారం రాత్రులు తనను మహామారీ మందిరంలో కలసుకోవడం మానేసింది! ‘మంజుల’ తనకు అత్యంత ఆనందాన్ని కలిగించే మంజుల తనను ఎందుకు కలుసుకోవడం లేదో అనే తలంపుతో మహారాజు బరువెక్కిన హృదయంతో తన శయనా గారంలో  ప్రవేశించాడు.

మహారాజ సుచంద్రునికి నిద్ర పట్టలేదు. పడక గది వదిలి, గది ముందరి విశాలమైన డాబాపైన వచ్చి నిలబడి నిర్మలమైన ఆకాశం వంక చూడసాగాడు. దశమి నాటి చంద్రుడు నక్షత్ర గణాలతో నభోమండలంలో ప్రకాశిస్తు న్నాడు. చిన్న చిన్న తెల్లని మబ్బులు మంచు తెరల వలె చంద్రుని రాసుకొంటూపయనిస్తున్నాయి. ప్రదేశ మంతా చిక్కని వెన్నెల కాంతిలో ప్రశాంతం గాను, మనోహరం గాను ఉంది. అప్పుడప్పుడు కోట కాపరుల పహారా నినాదాలు తప్ప వేరే అలజడి లేదు.

ఆ సమయంలో మహా ప్రతీహారి వీరభద్రుడు .. ఘోరకుని స్థానే కొత్తగా నియమింప బడినవాడు మహారాజుని సమీపించి చేతులు మొగిడ్చి ఇలా అన్నాడు. “మహాప్రభో! శ్రీవారి దర్శనార్థం ప్రమథనాథ బాబు క్రింద వేచి ఉన్నారు. శ్రీవారితో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలట!”

సుచంద్రుని ఆత్రుత హెచ్చింది. ఇంత రాత్రి పూట ఏదో ముఖ్యమైన విషయం ఉంటేనే గాని, రహస్యార్థ శోధకుడు రాదని మహారాజుకి తెలుసు!

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద