Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్య ప్రభ 18: బాపు వేసిన బొమ్మలతో సహా

  “వెంటనే ప్రవేశపెట్టు.” అన్నాడు మహారాజు.

వీరభద్రుడు ప్రమథనాథ బాబుని పడక గది లోపలి తీసుకొని వచ్చి అక్కడ వదలి వెళ్ళిపోయాడు.

ప్రమథనాథుడు రాజుకి నమస్కరించి ఆసనం పైన కూర్చొన్నాడు. ఆ మేచక మూర్తిని చూసి మహారాజు అంత  ఆందోళన లోనూ మందహాసం చేసి ఇలా అన్నాడు, “ప్రమథనాథా! ఏమిటి విశేషం?” అని.

“మహాప్రభో! నేను రాష్ట్రీయ ఘనేంద్ర బాబుతో కలసి మహామంత్రి సదనానికి వెళ్లాను.నేను వచ్చిన పని గురించి మహామంత్రికి విన్నవించాను. వారు దీర్ఘంగా ఆలోచించి శ్రీవారిని వెంటనే కలుసుకో వలసిందిగా  నాకు ఆజ్ఞ దయచేశారు. కాబట్టి ఇక్కడకి వచ్చాను. శ్రీవారికి నిద్రా భంగం చేయవలసి వచ్చింది.”

“ఈ రోజు సాయంకాలం మహామంత్రి నాతో  నీ విన్నపాన్ని గురించి వివరంగా ప్రస్తావించాడు. అది మొదలుకొని నాకు నిద్ర పట్టే అవకాశం తప్పి పోయింది. ఇక నాకు నిద్ర పట్టే రోజులు కాలగర్భంలో సుదీర్ఘమై దాగి ఉన్నాయనే చెప్ప వచ్చు. నీ రాజు ముందర ఎట్టి సంకోచం లేకుండా అన్ని విషయాలూ చెప్పవచ్చు. నేను సావధానంగానే ఉన్నాను.”

“మహాప్రభో! నేను శ్రీవారిని ఒక ప్రశ్న వేయవలసి ఉంది.”    
 
 “ప్రమథనాథా ! సందేహించ వద్దు. ధారాళంగా ప్రశ్నించ వచ్చు.”

“శ్రీవారు మంజులా దేవిని ఎప్పుడైనా ఈ మధ్య చూసారా?”

సుచంద్రుని హృదయంలో ఆ ప్రశ్న గాఢమైన సందేహాన్ని నాటింది. మంజుల అంతర్థానం అతణ్ణి వేదిస్తూంది. ఆ ప్రశ్ననే ప్రమథనాథుడు వేస్తున్నాడు. కాబట్టి మహారాజు మిక్కిలి ఆతృతతో ఇలా అన్నాడు.

“మనం చెట్టు క్రింద మాట్లాడు కొన్నది మొదలు ఇంట వరకు మంజులా దేవిని నేను చూడడం తటస్థించలేదు!”

“మహాప్రభో! సందేహం లేదు, ఆమె ఇప్పుడు బందితురాలై ఉంది!”

మహారాజు కోపంతో ఆసనం నుండి లేచాడు. అతని శరీరం కంపించింది. పెదవులు వణికాయి, కండ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఆ ఆవేసహ్మ్లో మహారాజు ఇలా అన్నాడు. “ప్రమథనాథా! ఎవరా దుర్మార్గుడు? వెంటనే చెప్పు. వాణ్ని నా ఖడ్గదారకు వెంటనే బలి చేస్తాను. ఆమెను ఎవరు ఎక్కడ బంధించారు?”

 “మహాప్రభో! శ్రీవారు ఆవేశం కొంచెం తగ్గించు కోవాలని ప్రార్థన! విషయం చాల చిక్కులతో కూడి ఉంది. నాఊహే నిజమైతే తమ అశోకవనం లోనే మంజులా దేవి బందితురాలై ఉంది!”

“అల్లుడా! నీవు ఎవరితో ప్రసంగిస్తున్నావో ఆలోచించావా? నా అశోకవనం లోనా! మా తండ్రిగారి అశోక వనం లోనా? నేను నమ్మజాలకున్నాను!”

“అవును మహాప్రభో! శ్రీవారి అశోకవనం లోని పాతాళ గృహంలో బంధింపబడి ఉంది!

“మా అశోక వనంలో పాతాళ గృహం ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది?”

“ఒక యువతి మూలంగా తెలిసింది మహాప్రభో!”                      

 “ఎవరా యువతి?”

“దూత సామంత విశాలాక్ష బాబు గారి కుమార్తె కుముదాక్షి.”

“కుముదాక్షి మూలంగానా? ప్రమథనాథా! వివరంగా చెప్పు.” అని మహారాజు బోనులో చిక్కిన మృగరాజు లాగ గదిలో పచారు చెయ్యసాగాడు!

మహారాజు ఆసనం నుండి లేవగానే ప్రమథ నాథుడు కూడ లేచి నిలబడ్డాడు. అతడు కదలకుండా శిలా ప్రతిమ లాగ నిశ్చలంగా నిల్చొనే ఉన్నాడు!

“మహాప్రభో! చాల రోజులనుండి నేను మంజులాదేవిని చూడనందు వలన నా హృదయంలో ఏదో అవ్యక్తమైన అనుమానం బాధించ సాగింది! నాకు అనుమానం పుట్టకనే పోవాలి గాని, పుట్టిందంటే దాని ఆనుపానులు తెలుసుకోనంత వరకు నిద్రపోను! సాధారణంగా అది అక్షర సత్యం అవుతుంది! మంజులాదేవి అంతర్థానానికి విశాలాక్షబాబు కారకుడై ఉంటాడని అనుమానించాను. కారణమేమంటే సాక్షరనారీ సభలో అతన్ని రాజకాళమ్మ కొంగతో పోల్చి ఆత్మగ్లానికి గురి చేసింది! నాటినుండి విశాలాక్ష బాబు ఆమెను ద్వేషించడం ప్రతీకారానికి పూనుకోవడం నేను కనిపెట్టాను. కాబట్టి మారు వేషంలో అతని ఇంటి ముందు కాపలా కాసాను. నిన్న సాయంకాలం ఇంకా సూర్యా స్తమయం కాక ముందే, ఒక కొండదొర విశాలాక్ష బాబు ఇంటి దగ్గరకు వచ్చాడు!

 విశాలాక్ష బాబుకి వాడు ఒక బుట్ట ఇచ్చి కొంత సొమ్ము అందుకొని వెళ్ళిపోయాడు. నేను వాణ్ని కలసుకొని ‘దొరా! గరళం దొరుకుతుందా?’ అని అడిగాను. వాడు ‘ఇప్పుడే విష పూరితమైన కాలసర్పాన్ని పట్టి,, అదిగో ఆ బాబుగారికి ఇరవై పనాలకి అమ్మాను. నా దగ్గర గరళం లేదు. నీకు కావాలంటే నాలుగు రోజుల్లో  సంపాదించి ఇస్తాను’ అని చెప్పాడు.నేను తరువాత వానితో ఏదో మిష పెట్టి, వాణి త్రోవలో నుండి తప్పుకొని తిరిగి విశాలాక్షి బాబు గారి ఇంటికి వెళ్లాను.

అప్పుడు వీధి గడపలో కుముదాక్షి నిలబడి, ఇటూ అటూ ఏమో దీక్షగా చ్డడం గమనించాను. నేను ఆమె దగ్గరగా వెళ్లి, “అమ్మగారూ! విశాలాక్షబాబు గారి కుమార్తె ఇంట్లో ఉన్నదా?’ అని అడిగాను. మారు వేషంలో ఉన్నందున నన్ను ఆమె పోల్చుకోలేదు. ఆమె ‘నీవు ఎవరివి? నేనే విశాలాక్ష బాబు గారి అమ్మాయిని , నాతో నీకేం పని?’అని అడిగింది. వెంటనే నేను తడుముకోకుండా ‘సత్యప్రభ అమ్మగారు మీతో మాట్లాడాలట! మీకు ఎప్పుడు అవకాశం ఉంటుందోనని కనుక్కోమన్నారు’ అని చెప్పాను. ఆమె కొంత సేపు ఆలోచించి ‘సరిగా రేపురాత్రి దీపాలు పెట్టినప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను. అప్పుడు ఆమెను రమ్మని చెప్పు. నీవు మంచి సమయానికి వచ్చావు! సత్యప్రభతో ఒక ముఖ్య విషయం చెప్పాలనే నేను తల్తున్నాను’ అంది.”

“ ఆ తరువాత ఏం జరిగింది?” అడిగాడు రాజు.

“ ఆ మరునాడు, అనగా ఈ రోజు సత్యప్రభను నేనే పురికొలిపి, నా అనుమానాన్ని వెల్లడించి కుముదాక్షి ఇంటికి పంపాను. నేను కూడ ఆమెతో కలసి నందిగ్రామం విశాలాక్షబాబు ఇంటివరకు ఆమెకి తోడుగా వెళ్లాను. ఒక గడియలో సత్యప్రభ బయటికి వచ్చి, విషయమంతా చెప్పింది.”

“ఏం చెప్పింది?”

“కుమార భోగనాథ బాబు, విశాలాక్ష బాబు కలిసి మహామారి మందిరం దగ్గర గత మంగళవారం రాత్రి పూట కపటంగా రాజకాళమ్మను బంధించి, అశోకవనం లోని పాతాళ గృహంలో పడవేసినట్లూ, ఈ రోజు ఒక కాల సర్పాన్ని ఆ గృహంలో వేయడానికి వారు నిశ్చయించుకొన్నట్లూ కుముదాక్షి చెప్పి సత్యప్రభ ఎదుట కంటతడి పెట్టుకొందట! సత్యప్రభ ఆమెకి ధైర్యం చెప్పి రాజకాళమ్మను విడిపించే పూచీ వహిస్తానని నచ్చచెప్పి ఓదార్చిందట!! ఇదే మహాప్రభో విషయం! ఇక శ్రీవారి చిత్తం!” అని ప్రమథనాథుడు ఊరుకొన్నాడు.    

 “ప్రమథనాథా! వెంటనే వెళ్లి సేనాపతిని పిలుచుకొని రా! ఈ క్షణమే ఆ ధూర్త పుంగవులని ఇద్దరినీ బంధించాలి! వెళ్లు, నాయనా! వెళ్లు! నీ మేలు నేను మరచిపోను. నీవు బంధుత్వ రీత్యా నా చెల్లెలి సవతి కుమారుడవి! నీకు మా రథినీ కుమారిని ఇచ్చి పెండ్లి చేస్తాను. నా మాట రథిని తప్పకుండా మన్నిస్తుంది! ఆ వివాహంతో పాటు నీకు కీ:శే: సేనాపతి రణంధరుని పెద్ద జాగీరుని కూడ ఇస్తాను. తెలిసిందా? వెళ్లు.” ఆని గబగబా ఆతృతతో చెప్పుకొని పోయాడు మహారాజు సుచంద్రుడు.

“మహాప్రభూ! అది రాజనీతికి విరుద్ధం! మనం మొదట రాజకాళమ్మ నిజంగా పాతాళ గృహంలో బంధింప బడి ఉందో , లేదో అన్న విషయం స్వయంగా తెలుసుకోవాలి! తొందర పడి రాజధానిలోని ఇద్దరు మహామహులను బంధించడం ఉచితం కాదు! శ్రీవారు నాకు మహాద్భాగ్యాన్ని సమకూర్చడానికి వాగ్దానం చేసారు! దానికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి !”

“సరే, నాయనా! నీ సలహా పాటిస్తాను, పద! ఇప్పుడే అశోక వనానికి వెళ్దాం.” అన్నాడు నరపతి.

*************************

36 వ ప్రకరణం:

పర్వతస్వామి భట్టారకుల వారి కాలంలో శ్రీకాకుళ నగరానికి అరమైలు దూరంలో అశోక వనం అనే పేరుతో  అన్ని రకాల ఫలజాతులతో కూడిన తోట వేయబడింది! దానికితపోవనమని కూడ పేరు. ఆ బ్రహ్మాండమైన తోట కృష్ణానది ఒడ్డున ఉన్నందున తోటలోని చెట్లు నదీజల పోషితాలై కన్నుల పండువుగా పెరిగాయి. ఆ తోటలో చిన్న రాజభవనం కట్టబడి ఉంది.

భార్యా వియోగానంతరం మహారాజ పర్వతస్వామి భట్టారకుడు ఆ భవనంలో నివసించే వాడు. రాజకార్యాలు నిర్వర్తించే సందర్భాలలో నగర ప్రాసాదానికి వస్తూ పోతూ ఉండేవాడు. అందరూ అతణ్ణి ఆంద్ర జనకుడని పేర్కొనడం మామూలు! దినంలో చాల భాగం అతడు అశోక వనంలో తపో వృత్తిలో కాలం గడుపుతూ ఉండేవాడు.

‘శైశవేభ్యస్త విద్యానాం ; యౌవనే విషయైషిణామ్!
వార్థక్యే ముని వృత్తీనాం; యోగానాంతే తనుత్యజాం!!’

అనే మహాకవి కాళిదాసు రఘువంశ రాజుల వర్ణన ప్రకారం కాలం గడిపిన రాజర్షి పర్వతస్వామి భట్టారకుడు.

రాత్రి మూడవ యామంలో మధ్య భాగం, చందమామ మబ్బుల చాటున గుడ్డి వెన్నెల వెదజిమ్ముతున్నాడు. కృష్ణా నదీ తరంగ నీలిమ వెన్నెలలో వింత శోభనిస్తూంది. మిణుగురులు రాలిపోతున్న నక్షత్రాలో అని భ్రాంతిని పుట్టిస్తున్నాయి!

ఇద్దరు వ్యక్తులు తోటను సమీపించారు. అందులో నల్లని శాలువా కప్పుకొని ఉన్నవాడు మహారాజ సుచం ద్రుడు. రెండవ వాడు ప్రమథనాథుడు. ప్రమథనాథుడు నల్లని కంబళి కవచము, నల్లని తలపాగా కలిగి సర్వ మేచక మూర్తిగా భాసిస్తున్నాడు. తోట ముఖ ద్వారంలో దశాపతి నీలగ్రీవుడు కాపలా కాస్తున్నాడు.

“ఎవరు వారు?” ప్రశ్నించాడు నీలగ్రీవుడు.

“విశ్వాసమే స్వర్గ ద్వారం” అని బదులిచ్చాడు ప్రమథనాథుడు.

వెంటనే నీలగ్రీవుడు తన క్రుపాణాన్ని ఒరలో దోపుకొని తలుపులు తెరిచాడు. మహారాజు, ప్రమథనాథుడు తోట లోకి ప్రవేశించారు. నీలగీవుడు తలుపులు మూసి తాళం వేస్తున్న శబ్దం మహారాజుకి వినిపించింది. సన్నని స్వరంతో మహారాజు, ప్రమథనాథునీతో ఇలా అన్నాడు. “ప్రమథనాథా! ప్రవేశాన్ని కలిగించే వాక్యం నీకు ఎలా తెలిసింది?”

“మహాప్రభూ! ఇందులో ఆశ్చర్యపడ వలసిన పని లేదు! కుమారా భోగనాథుడు తన మిత్ర మండలితో ఈ తోటకు తరచు వస్తూంటాడు! అలాంటి ఒక సందంర్భంలో నేను పొంచి ఉండి ఈ రహస్య మంత్రోచ్చాటన విన్నాను.”

“అయితే నీవు రాజకుమారుడిని కూడ నీ చార దృష్టిలో ఇముడ్చుకొన్నావన్న మాట!”

“మహాప్రభూ! అది నా వృత్తి! ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ తప్పక నిప్పు ఉంటుంది కదా? నాకు కుమార భోగ నాథ బాబు చర్యలపై చాల కాలంగా అనుమానంగా ఉంది.”

అశోకవనాన్ని చీకటి గుత్తకు తీసుకొంది కాబోలు, అది అంధకార బంధురంగా ఉంది. ఇద్దరూ తెల్లగా కనిపిస్తున్న కాలిబాట మీదుగా మెల్లగా అడుగులు వేసుకొంటూ భవనం సమీపించారు.

ప్రమథనాథుడు తన కవచాంతర్భాగం నుంచి దీపపు బుడ్డి, చమురు సీసా, చెకుముకి రాళ్ళు తీసాడు. చిన్న పనిముట్ల సంచిని కూడ తీసాడు. చీకటి తెరలను చీల్చుకొంటూ దీపకాంతి జ్వలించింది. భవనం తలుపుకు బలమైన తాళం వేసి ఉంది! సంచిలో నుంచి పనిముట్లు తీసి, తాళం ఊదా దీసాడు ప్రమథనాథుడు. దీపం సహాయంతో ఇద్దరూ తలుపులు తోసుకొని భవనం ముందరి శాలలో ప్రవేశించారు.

ముందరి శాల వ్యాఘ్ర చర్మాలతో, రత్న కంబళములతో అలంకృతమై రమ్యంగా కనిపించింది.

“ప్రమథనాథు బాబూ! ఇది మా తండ్రిగారి పఠన శాల, దీనిని దాటినా వెంటనే మరొక శాల వస్తుంది. అది ఆలోచనా మందిరం. దాన్ని దాటగానే విశాలమైన అరుగులు సుందర శిల్పాలతో కనిపిస్తాయి. అరుగులు దిగగానే విశాలమైన అంగణం ఉంది. అంగణమంతా రకరకాలైన పుష్ప వృక్షాల తోనూ, లతా గృహాల తోనూ, చాల సొంపుగా కనపడు తుంది. దాన్ని దాటగానే మల్లీ అరుగులు,శాలలు ఇదే విధంగా అమరి ఉన్నాయి! అంగణం దాటి అరుగుల సోపానాలు ఎక్కి వెళ్ళినప్పుడు ముందర ఉన్న శాల మా తండ్రిగారి శయన శాల. శయన శాల మధ్య భాగంలో పాతాళ గృహానికి దారి ఉంది!” అని మహారాజు చెప్పాడు.

అని తలుపులు  తెరచుకొని వారిద్దరూ అంగణం సమీపించారు. అంగణం దాటి శయనశాల తలుపులు తెరచి, లోపల ప్రవేశించారు. ఆ మందిర భాగం నయన మాదకమైన చిత్రాలతో నేత్రపర్వంగా ఉంది! అక్కడ హంస తూలికా తల్పం ఉంది. మహారాజు నేలపైన ఉన్న రత్న కంబళాన్ని లాగాడు. ప్రమథనాథునికి లోహ కవాటం  కనిపించింది. దానికి కప్ప తాళం లేదు, రంధ్రం ఉంది. తాళపు చెవి చొనిపి త్రిప్పుతేనే గాని కవాటం  తెరచుకోదు!


“మహాప్రభో! ఇది పనిముట్లకి లొంగని తాళం! దీని తాళం ఎవరి దగ్గర ఉంటుంది?” అని ప్రశ్నించాడు ప్రమథనాథుడు.

“ అవును నాయనా! ఇది చాల బలమైన తాళం. దీని మన్దమ్ ఒక అడుగు ఉంటుంది. మా తండ్రిగారి కాలంలో మా కోట తాలూకు జవహరి, వెండి బంగారు సామాగ్రులు, రత్నాలు మొదలైనవి ఈ పాతాళ గృహం లోనే ఉండేవి! ఇప్పుడవి కోట లోని పాతాళ గృహానికి తరలించ బడ్డాయి. దీని తాళం సుమారు ఒక మూర పొడవు ఉంటుంది. అది దశాపతి నీలగ్రీవుని వశంలో ఉండడం మామూలు!”

ప్రమథనాథుడు మౌనంగా కొన్ని క్షణాలు ఆలోచించాడు. వానికేదో ఊహ తట్టింది. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాడు. అతడు తిన్నగా హంస తూలికా తల్పం దగ్గరకు వెళ్లి, దానిపై ఉన్న పట్టు పరుపుని లాగాడు. ఖంగుమని చప్పుడు చేస్తూ ఒక వస్తువు బయట పడింది!

“ప్రమథనాథా! అదే పాతాళ గృహం తాళపు చెవి!” అని అరచినంత పని చేసాడు మహారాజు. పటాల గృహ కవాటం సులభంగా తెరవబడింది. లోపల మెట్లు ఉన్నాయి.

“మహాప్రభో! క్రిందన అందకారంగా ఉంది. శ్రీవారు నా వెనకనే దిగండి.” అని ప్రమథనాథుడు దిగ సాగాడు. మహారాజు అతని వెనకనే దిగాడు. ఇద్దరూ పాతాళ గృహంలోకి అడుగు పెట్టారు. దీప కాంతిలో అక్కడ వారికొక

భయంకర దృశ్యం కనిపించింది!

కొన్ని గజాల దూరంలో భయంకరమైన నల్ల త్రాచు ఫూత్కార ధ్వనితో పడగ  విప్పి వారిద్దరినీ చూస్తోంది! దాని నాలుకలు అగ్ని కీలల్లాగ మెరుస్తున్నాయి. దాని కండ్ల లోంచి విద్యుత్కిరణం లాగ కాంతి వెలికి వస్తూంది.”

ప్రమథనాథుడు రాజు దగ్గరకు వచ్చి, మెల్లగా “మహా ప్రభో! మహా ప్రమాదం! ఒకమారు మీ శాలువా ఇవ్వండి, నేర్పుగా దీన్ని బందిమ్సాను” అన్నాడు.

మహారాజు నెమ్మదిగా శాలువా తీసి ఇవ్వబోతూ ఉండగా పాటలు వినిపించాయి!

“నాగన్న మిత్రుండు నా రాజ చంద్ర / ఆగుడు వాడిట్టె అణగి పోగలడు !                                                              నాగన్న కంటెను నాలుగు రెట్లు / భోగన్న క్రూరుండు భూమండలాన!!”

మహారాజు, ప్రమథనాథుడు పాటలు వచ్చిన దిక్కు చూసారు. అక్కడే తూర్పు కోణభాగంలో ఒక వనిత కాలు చేతులు బంధింపబడి నందున పరుండి ఉంది! ఆమె నేత్రాలు మెరుస్తున్న నక్షత్రాల లాగ ఉన్నాయి.

“మంజులా!”                                      

“ప్రభూ! నేనే మీ చరణ దాసిని!”

“రాజు ఆ దిక్కుగా పరుగెత్తాడు! అతనికి పాము విషయమే జ్ఞాపకం లేదు!! ప్రమథనాథుని కండ్లు ఆర్ద్రమైపోయాయి.

మహారాజు కత్తితో మంజుల కాలు చేతుల కట్లు కోసాడు. మంజుల లేచి నిలబడింది. మహారాజు ఆమెను గట్టిగా కౌగలించుకొన్నాడు.

“ప్రభూ! ప్రమథనాథుడు ఉన్నాడు.” అని మందహాసం చేసింది మంజుల. ఆ మందహాసాన్ని చుంబించాడు  మహారాజు.

మహా సర్పం ఒక్కమారు ఆ దృశ్యాన్ని గంభీరంగా తిలకించి చరాచర ప్రాకుతూ మెట్టు ఎక్కి వెళ్ళిపోయింది!

ప్రమథనాథుడు దీపం బుడ్డితో ముందు నడిచాడు, అతని వెనుకనే మంజులా సుచంద్రులు నడిచారు.

*****************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద