Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ--సత్యప్రభ- 22 : బాపు వేసిన బొమ్మలతో సహా

43 వ ప్రకరణం:

భారద్వాజ బుద్దిసాగరుడు మహానందిపురంలో పేరు ప్రతిష్టలు కల పెద్ద మనిషి. అరవై అయుదు  సంవత్సరాలు నిండిన వృద్ధుడు. శస్త్ర శాస్త్రాలు రెండింటి లోనూ, నిష్ణాతుడు.
బుద్దిసాగరుడు రెండు సంవత్సరాల క్రిందటి వరకు శ్రీశైల మహామండల మహామంత్రిగా ఉండేవాడు! అతని కాలంలో దేశం శాంతి భద్రతలతో కళ కళలాడుతూ ఉండేది ! మహామండలేశ్వరునుకీ, అతనికీ సేనాధిపత్య పదవిని గురించి తీవ్రమైన బేదాభిప్రాయాలు కలిగినందు వలన , అతడు తన పదవికి రాజీనామా ఇచ్చి తప్పుకొన్నాడు.

‘కారవేలుడనే’ యువకుడు కుంతల దేశం నుండి వచ్చి రాజాశ్రయం సంపాదించి క్రమక్రమంగా సేనలో శతపతి పదవిని పొందాడు. ఆ సుందర యువకుడు రాజుగారికి ప్రీతి పాత్రుడై ఆయన అంగ రక్షసేనకు దండనాయకుడు అయ్యాడు. కారవేలుడు స్ఫురద్రూపి! ఆకర్షకమైన ముఖ వర్చస్సు కలవాడు. ఆయుధ విద్యలలో ఆరితేరిన వీరుడు. యుద్ధ నీతిలో కన్నా రాజనీతిలో మంచి ప్రావీణ్యం కలవాడు! 

వృద్ధ సేనాపతి సాలంకాయన యజ్ఞమిత్రుడు కాలధర్మం చెందినందున శ్రీశైల మహామండల సైన్యాధ్యక్షుని నియమన సమస్య వచ్చింది. మహామంత్రి బుద్దిసాగరుడు ఉప సేనాపతి భార్గవ సోమదత్తుడిని నియమించ వలసినదిగా మహామండలేశ్వరున్ని కోరాడు. కాని మహామండలేశ్వరుడు మహామంత్రి మాటను త్ర్సిపుచ్చి ఆ పదవిలో  దండనాయక కారవేలుని సేనాపతిగా నియమించాడు.

విదేశీయుడు, యుద్ధతంత్రం పూర్తిగా తెలియనివాడు అయిన కారవేలుని నియమనం పట్ల మహామంత్రి తన అసమ్మతిని తెలియపరచి పదవిని త్యజించాడు!

మహామంత్రి స్థానంలో కారవేలుని ఆంతరంగిక మిత్రుడు ధనగుప్తుడనే ఒక ధనాడ్యుడు నియమితుడయ్యాడు! ఉపసేనాపతి పదవిలో తనకి ప్రీతిపాత్రుడైన కామపాలుని సూచించాడు కారవేలుడు. మహామండలేశ్వరుడు ఆ సూచనను తిరస్కరించి ఆ స్థానంలో మాజీ మహామంత్రి కుమారుడు అమృతనాథుడిని నియమించాడు.

తామరకొలను తీరంపై ఉన్న మంటపం నుండి బయలు దేరిన భీమనాథుడు మాజీమంత్రి బుద్దిసాగరుని ఇంటిని సమీపించాడు. 

బుద్దిసాగరుని భవనం రాజప్రాసాదానికి చేరువలోనే ఉంది. భవనం బలమైన ప్రాకార వేష్టితమై ఉన్నది.

ప్రాతఃకాల చిహ్నాలు ప్రక్రుతి నీలిచీర మడతల్లో దోబూచులాడుతున్నాయి. కోటలోని నగారా నాలుగవ యామం ప్రారంభాన్ని సూచిస్తూ మ్రోగింది. భీమనాథుడు భవన ప్రాకారం దాటి ముందర వసారాలో కునికిపాట్లు పడుతున్న కాపలాదారున్ని సమీపించాడు.

“సోదరా!” అని పిలిచాడు భీమనాథుడు. కాపలాదారు ఉలిక్కిపడి “ఎవరు మీరు?” అని, భీమనాథుని ఉన్నత విగ్రహాన్ని చూసి ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.

“నేను మహామంత్రిగారి మిత్రుణ్ణి. అతనితో ముఖ్యంగా మాట్లాడవలసిన పని ఉంది.వెళ్లి నీ యజమానితో చెప్పు”

“అయ్యా! ఆయన ఇప్పుడు గాఢమైన నిద్రలో ఉంటారు. బాగా తెల్లవారిన తరువాత రండి.”

“తెలివితక్కువగా మాట్లాడకు! నేను వచ్చిన పని చాల ముఖ్యమైనది. నీ యజమానిని లేపుతావా? లేక నన్నే తలుపులు త్రోసుకొని లోపలికి  ప్రవేశించమంటావా?” 

కాపలాదారు కొన్ని క్షణాలు ఆలోచించి ఎదో గొణుగు కొంటూ గోడకు వ్రేలాడుతున్న త్రాడుని పట్టుకొని లాగాడు. కొన్ని క్షణాలు గతించాయి! తలుపులు తెరచే శబ్దం వినిపించింది.ఆజానుబాహుడు, సర్వఫలిత కేశుడు, గౌరవర్ణం గల ఒక పురుషుడు కనిపించాడు, అతడే బుద్దిసాగరుడు. 

“ఏమోయ్! ఏం విశేషం?” అని అతడు కాపలాదారుని ప్రశ్నించాడు.

“బాబుగారూ! యితడు మిమ్మల్ని ముఖ్యంగా చూడాలని వచ్చాడు” అని భీమనాథుని చూపించాడు.

“ఆర్య! లోపలి రండి” అని మర్యాదగా భీమనాథుని రాబట్టు కొన్నాడు బుద్దిసాగరుడు. ఇద్దరూ లోపలి వెళ్ళారు.

అది విశాలమైన శాల, నేల అంతా  రత్న కంబళాలతో కప్పబడి ఉంది. నాలుగు మూలలా రజత స్థంబాలపై ఆముదపు దీపాలు వెలుగుతున్నాయి. ఉత్తరపు గోడ ననుసరించి విశాలమైన పట్టుపరుపు వేయబడి ఉంది. పరుపుపై వరసగా పట్టుదిండ్లు అమర్చబడి ఉన్నాయి. ఆ ఎదురు గోడకు ఆనుకొని పెద్ద బీరువా ఉంది.

బుద్దిసాగరుడు తలుపులు వేసి, గడియ పెట్టి పట్టుపరుపు మీద భీమనా థుని కూర్చొండ  బెట్టి తాను పక్కనే ఆశీనుడయ్యాడు.కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. భీమనా థుడే సంభాషణ ద్వారాన్ని తెరచాడు.

“ఆర్య! నాపేరు భీమనాథుడు, శ్రీకాకుళం నా జన్మ స్థలం. ప్రస్తుతం దేశంలో రాజకీయంగా విప్లవ చర్యలు విపరీతంగా ఉన్నాయి. నాగులను లేవదీసి, నిశుంభుడనే నాగుడు భయంకర విప్లవాన్ని ప్రారంభించాడు. వాడు ఆంద్ర రాష్ట్రంలో పరంతప సంఘాన్ని నెలకొల్పి ఘాతుక కృత్యాలు చేసి ప్రజలను క్షోభ పెట్టాడు. అక్కడ కుండిన వంశంపై భక్తీ కలిగిన కొందరు యువకులు గజవీరును నాయకత్వంలో నిశుంభుని ఆటలు అరికట్ట గలిగారు! నిశుంభుడు ఇప్పుడు కార్య స్థలాన్ని శ్రీకాకుళం నుండి తప్పించి దేవవాటికా దుర్గంలో పెట్టుకొన్నాడు. “అని చెప్పి మాజీ మంత్రి ముఖాన్ని చూసాడు.

“భీమనాథ బాబూ! మీరు చెప్పిన వన్నీ నాకు తెలియనివి కావు.”

“మీతో ముఖ్యంగా ఆ విషయం మాట్లాడడానికే పిలిచాను. రేపటి దినంలోగా మనం ఏదైనా చెయ్యక పొతే శ్రీశైల మహామండలం నాగుల వశం కాక తప్పదు!”

మాజీ  మహామంత్రి ముఖం ఆందోళనా పూరితమై రంగు మారి వడిలి పోయింది. అతడు చాల ఆతురతతో “మీరు అంటున్న దేమిటి? మహానంది పురంపై శత్రువులు దాడి సలపడానికి వస్తున్నారా?” అని అడిగాడు.

“అవును, వారొక పథకం వేసారు. ఆ పథకంలో మీ రాష్ట్ర సైన్యాధిపతి హస్తం ఉంది.”

“మాజీ మహామంత్రి ఈ మాట విని దిగ్గన లేచి శాలలో అటూఇటూ పచార్లు చేయడం ప్రారంభించాడు. అతని కండ్లు చెమ్మగిల్లాయి, భీమనాథుని వైపు చూసి “నేను అప్పుడే ఊహించాను. కారవేలుడు ఇంతటి ద్రోహం తలపెడతాడని మాత్రం తలచలేక పోయాను! మహామండలేశ్వరుడు మహా శాంతుడు, తల్లని వన్నీ పాలు, నల్లని వన్నీ నీళ్లు అని నమ్మే అమాయకుడు. భీమనాథ బాబూ! ఈ ముసలివాడు మాతృభూమి కోసం ప్రాణాలు సైతం ధార పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. 

మీరు ఈ ముసలి దేహాన్ని, దీనిలో ఇమిడి ఉన్న విజ్ఞాన సంపత్తిని, వీని ధనాన్ని , ఇంకా సర్వస్వాన్ని మాతృదేశ రక్షణ నిమిత్తం వినియోగ పరచుకో వచ్చును.” అన్నాడు ఆవేశంతో బుద్దిసాగరుడు. 

“ ఆర్య ! ఉద్రేకం పొందవద్దు. ఇలాంటి పరిస్థితిలో నిదానమైన ఆలోచన అత్యావశ్యకం! కారవేలుడు మేకవన్నె పులి! వాడు కావాలనే తన స్వార్థ సిద్ధికై  రాజ భక్తులైన దండనాయకులను, సరిహద్దులకు పంపి తనకి వశ వర్తులైన వారినందరినీ రాజధానిలో ఉంచుకొన్నాడు! ఇదంతా భయంకరమైన కుట్ర! మహాపరాక్రమశాలియైన మీ కుమారుణ్ణి సరిహద్దులకు పంపాడు, ఆ దుర్మార్గుడు!”

మాజీ మహామంత్రి  భీమనాథుని ప్రక్కన కూర్చొని, “భీమనాథ బాబూ! మీరు చెప్పినదంతా వాస్తవమే! మీరు వివరంగా శత్రువుల పన్నుగడను గురించి చెప్పండి.”అని అడిగాడు.

“సావధానంగా వినండి. మహానందిపుర ప్రాంతాలలో ప్రచ్చన్నంగా ఉన్న నాగుల సైన్యం ఇప్పుడు ఒకటిగా చేయబడింది. ఎల్లుండి రాత్రి రెండవయామం దాటక ముందే అయిదు వేల సైన్యంతో నిశుంభుడు కోటని ముట్టడిస్తాడు. మొదటియామం ఆఖరు ఘడియల్లో నూరు మంది శత్రు సైనికులు దిడ్డి ద్వారం గుండా కోట లోపలికి ప్రవేశించి కాపలా సైనికులని హతమార్చి కోట ముఖ ద్వారాన్ని తెరచి ఉంచుతారు.” 

“దిడ్డి ద్వారం చాల బలమైనది. ఎంతో  ప్రయత్నిస్తేనే గాని ఊడి రాదు. అగడ్త దాటి ద్వారం తెరచుకొని రావడం సులభ సాధ్యం కాదు! అదీ కాక దిడ్డి ద్వారాన్ని కాపలా కాసేవాడు సాధారణుడు కాడు !”

“ ఆ అడ్డంకులన్నీ నిర్వర్తింప బడుతాయి.కాపలాదారు బాగా లంచం మేసినట్లు నా ఊహ! రాజకుమారి చేటిక మల్లిక దిడ్డి ద్వారం తెరచి ఉంచుతుంది!”

“కుట్ర చాల తీవ్ర స్థాయిలోనే నడిచింది. ఇప్పుడు మనమేం చేయాలి?”

 “ ఈ కుట్రలో సేనాపతి, మల్లిక .. ఇద్దరూ ప్రధాన పాత్రలు! ఇప్పుడు మనం వారినిద్దరినీ బంధించాలి. అలా చేసినప్పుడు మనకు ఊపిరి తీసుకోవడానికి కొంత వ్యవధి ఉంటుంది.”

“ భీమనాథ  బాబూ! ఆ మార్గం మీరే సూచించండి.”

“ఈ శాలలోనే ఉంది! దానిలో మా ఇంటి వెండి బంగారాలు, నగలు మొదలైన విలువైన వస్తువులు ఉన్నాయి. అది ఈ శాలలో సగం ఉంటుంది.”

“ మీకూ సేనాధిపతికి స్నేహభావం ఉందా?” 

“ మా ఇద్దరి హృదయాల్లో ఎలా ఉన్నా బయటికి మాత్రం ఇంకా మేమిద్దరం స్నేహంగానే ఉన్నాము!”

“అయితే వినండి, ఈ ఉదయం ఒకమారు కలసుకోవలసిందిగా వాణికి వర్తమానం పంపండి. శరీరంలో బాగుగా లేదని వెంటనే ఒకమారు వచ్చి చూసిపోవలసిందని వార్త పంపండి. నేను ఇక్కడే ఉంటాను, వాణ్ని బంధించిన తరువాత మల్లికను రమ్మని కబురు చేయండి. ఆమెను కూడా బంధించి వేద్దాము! 

ఇద్దరినీ పాతాళ గృహంలో అతిథులుగా కొన్ని రోజులు ఉంచుదాము. ఇంతకంటే వేరే విధానం లేదు!”

“ఈ సంవిధానం బాగుంది. అలాగే కారవేలునికి వర్తమానం పంపిస్తాను.”

వీరిట్లా మాట్లాడుకుంటూ ఉండగానే భేమనాతుని చెవులకు గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. వెంటనే  భీమనాథుడు అన్నాడు.

“ఆర్య ! ఇంటి ముందు నాలుగు గుర్రాలు వచ్చాయని నేను పసిగట్టాను.” 

“భీమనాథ బాబూ! నేను కూడా గుర్రపు డెక్కల చప్పుడు విన్నాను. కాని నాలుగు గుర్రాలు వచ్చాయని మీరు ఎలా చెప్పగలరు?” 

“ అశ్వ సైన్యంలో ఈ పరిజ్ఞానం ప్రాథమిక శిక్ష. కాబట్టి నా ఊహలో పొరపాటు ఉండదు! నా అభిప్రాయంలో మీ కాపలాదారు నమ్మకస్తుడు కాడు. మిమ్మల్ని ఒక అజ్ఞాత వ్యక్తీ వచ్చి సందిన్చాడని వాడు కారవేలునికి కబురు చేసి ఉంటాడు! నా ఊహే నిజమైతే సేనాధిపతి కారవేలుడే ఇక్కడకి ముగ్గురు యోధులతో వచ్చాడు! వాణి ఉద్దేశం మిమ్మల్ని బందించడమే అయి ఉంటుంది.”

“నేను మీతో ఏకీభవిస్తున్నాను, ఇప్పుడు మన కర్తవ్యం?”

“ మొదట పాతాళ గృహ ద్వారాన్ని తెరచి ఉంచండి. మీరు ఖడ్గ హస్తులై ఆ బీరువా వెనుక దాగి ఉండండి. ఆ వచ్చిన వారిని నేను చూసుకొంటాను.”

మాజీ మహామంత్రి మౌనం వహించాడు.

“ఆర్య! నా ప్రభావాన్ని శంకించకండి! ఈ ఇనప చేతుల చేవను మీరు మీ కండ్లతో చూద్దురు గాని! సాధ్యమైనంత వరకు కారవేలుని ప్రాణాలతో బందిస్తాను. వీలు కానప్పుడు వాణ్ని నా ఖడ్గానికి బలిగా పుచ్చుకొంటాను.”

బుద్దిసాగరుడు నేల మీద ఉన్న రత్న కంబళం క్రింద ఉన్న పాతాళ గృహ ద్వారాన్ని తెరచాడు. బీరువా తెరచి దానిలో  వ్రేలాడుతున్న  ఖడ్గాన్ని ధరించి బీరువా వెనక దాగున్నాడు.

మెట్లు ఎక్కుతున్న చప్పుడు! వెంటనే తలుపులు గుడ్డున చప్పుడు. భీమనాథుడు లేచి వెళ్లి తలుపులు తీసాడు. ఒక ఆజానుబాహుడు కృపాణ హస్తుడై లోపల అడుగు పెట్టాడు. వాడే సేనాధిపతి కారవేలుడు! వాడు పూర్తిగా లోహ కవచం ధరించి ఉన్నాడు! పంచధాతు నిర్మితమైన ఉష్ణీవాన్ని ధరించి ఉన్నాడు. వాణి వేషాన్ని బట్టి చూచినప్పుడు ఎట్టి విపరీత పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియ వస్తోంది! వాణి వెనుక ముగ్గురు సాయుథులైన యోధులు లోహకవచ ధారులై నిలబడి ఉన్నారు!

“మాజీ మహామంత్రి బుద్దిసాగర బాబుగారు ఉన్నారా?” అని ప్రశ్నించాడు కారవేలుడు.

“చిత్తం! ఉన్నారండి. వారి శరీరంలో అస్వస్థతగా ఉంది. మిమ్మల్ని ఆహ్వానించాలని వారు తలచారు, మీరే విచ్చేశారు! రండి, లోపలి దయచేయండి.” అన్నాడు భీమనాథుడు.

“మీరెవరు?” 

“నేను విదేశీయుణ్ణి. మహామంత్రిగారికి మా తండ్రిగారికి స్నేహభావం ఉంది. ఆ కారణం చేత వారి దర్శనం నిమిత్తం వచ్చాను.”

“మీరు వెళ్లి బుద్దిసాగర బాబుని పిలుచుకొని రండి. అతనితో నాకు చాల అవసరమైన పని ఉంది!” 

“ఓహో! మీరు వచ్చిన పని ఖడ్గాలతో నెరవేరేదా?  మీ  చేతి లోని నగ్న కృపాణం అభిప్రాయం ఏమిటండీ?”

“అయ్యా ! మీరు ఎవరో గాని అధిక ప్రసంగం చేస్తున్నారు.”

“నేనేమీ అధిక ప్రసంగం చేయలేదు. నా ప్రసంగం క్రమ బద్ధంగానే ఉంది. ఈ ఉషః కాలంలో సాయుధ భటులతో మీరు ఇక్కడకు రావడంలో మీయందు నాకు సదుద్దేశం కనపడ లేదు!” 

“ మీ ఉద్దేశాలతో నాకు సంబంధం లేదు. మర్యాదగా నాకు దారి ఇవ్వండి, నేను మాజీ మహామంత్రిని కలవాలి”

“దారి ఇవ్వడానికి వీలు లేదండి. మీరు వచ్చిన పని వివరంగా చెప్పి తీరాలి!”

“మూర్ఖుడా! నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసికోలేదు! నీకు నీ ప్రాణం పైన ఆశ ఉన్నట్లయితే నాకు దారి ఇయ్యి” అని హుంకరించాడు కారవేలుడు.

ఇంతవరకు మర్యాదతో ప్రారంభించిన రంగస్థలం మర్యాదని అతిక్రమించి భీభత్సంగా మారింది! మేఘ గంభీర స్వరంతో భీమనాథుడు ఇలా అన్నాడు. “ వీరత్వం లేని పశువా! నీవు శ్రీశైల మహామండల సేనా వాహినికి నాయకుడవని నాకు తెలుసు! మాత్రు దేశాన్ని త్యజించి పరదేశంలో పరాన్న భుక్కువై, నీకు గౌరవాన్ని, సంపదను, అధికారాన్ని ఇచ్చిన నీ స్వామికే ద్రోహం తలపెట్టిన నరాధముదవని కూడా తెలుసు! 

పాడి పంటల తోనూ, సుఖ శాంతుల తోనూ, కళకళ లాడుతున్న శ్రీశైల మహామండలానికి, పరమతప సంఘ నాయకుడైన నిశుంభునితో చేతులు కలిపి, కార్చిచ్చు పెట్టదలచుకొన్న  సృగాలుడవని కూడా తెలిసింది. చీపురు పుల్ల కంటే  అల్ప వీర్యం కల నీ ఖడ్గానికి ఈ భీమనాథుడు కించిత్తు కూడా చలించడు! నీకు శక్తి ఉన్నప్పుడు దారి చేసుకొని లోపలి వెళ్లు. చూద్దాం!” 

బీరువా సందులో దాగి ఉన్న బుద్దిసాగరుడు అంతా గమనించి చూస్తున్నాడు. భీమనాథుని చేతిలో ఖడ్గం లేదు, అతని ఖడ్గం ఒరతో సహా పరుపు మీద విశ్రమించి ఉంది! కారవేలుని చేతిలోని ఖడ్గం దీప కాంతిలో మిలమిల మని మెరుస్తోంది! భీమనాథుడు అపాయంలో చిక్కుకొన్నాడని తలచాడు బుద్దిసాగరుడు. ఎలాంటి సందర్భం లోనూ బీరువా ప్రక్కనుండి రావద్దని భీమనాథుడు చెప్పి ఉన్నాడు! ఇంతలో ఒక అద్భుతం జరిగింది!

కారవేలుడు తన కత్తిని ఎత్తాడు. చింతనిప్పుల వలె వాని  కండ్లలో క్రూరత్వం వాని  క్రోధంతో మిళితమై మెరు స్తోంది. కొన్ని లిప్తలు కూడా విలంబం చేయక భీమనాథుడు కారవేలుని తన బాహువుల్లో ఇమిడ్చి, కుడి చేతితో ఖడ్గ హస్తాన్ని పట్టి బలంగా మెలిపెట్టాడు. ఆ వేగంతోనే కారవేలుని ఈడ్చుకొంటూ వెనక్కు అడుగులు వేసాడు . సాయుధ పాణులైన యోధులు ముగ్గురూ తమ యజమానిని రక్షించడానికి భీమనాథునిపై ఉంకించారు.

“ఆగండి!” అని బుద్దిసాగరుడు బీరువా సందు లోంచి అరిచాడు. ముగ్గురు యోధులూ చకితులై శబ్దం వచ్చిన దిక్కు చూసారు! ఈ చిన్న అవకాశం మహాబలుడైన భీమనాథునికి సరి పోయింది! కారవేలుడు భీమనాథుని ఉక్కు కౌగిలిలో ఉక్కిరి బిక్కిరయి నొప్పి సహించ లేక చేతిలోని కత్తిని క్రింద పడవేసాడు.

భీమనాథుడు తన బలమంతా ఉపయోగించి కారవేలుని పాతాళ గృహం దగ్గరకు లాక్కు వచ్చి, ఆ బిలంలో త్రోసాడు. పెద్ద శబ్దంతో కారవేలుడు పాతాళ గృహంలో పడిపోయాడు. భీమనాథుడు ఒక కాలుతో పాతాళ గృహం తలుపు మూసి మరొక కాలుతో కారవేలుని ఖడ్గాన్ని తన ప్రక్కకు లాగుకొన్నాడు!

“బాబయ్యా! వెనక నుండి మీరు వీరి మీదకి దుమకండి. నేను వీరిని వీరి యజమానునితో కలుపుతాను” అని బిగ్గరగా చెప్పాడు భీమనాథుడు. బుద్దిసాగరుడు కత్తితో బిఇరువా పక్క నుండి బయటికి వచ్చాడు. భీమనాథుడు కారవేలుని ఖడ్గాన్ని చేత ధరించి ఇలా అన్నాడు. “ యోదులారా! కారవేలుడు రాజద్రోహి! వాణ్ని చెరలో బందించాను ! మేరు మీ ఖడ్గాలు కింద పెట్టి మహామంత్రి గారిని శరణు వేడుకోండి. మీకేమీ భయం లేదు! లేదా, నేను మిమ్మల్ని సులభంగా ఈ పాతాళ గృహంలో బందిస్తాను.”

ఆ ముగ్గురు యోధులూ ఒకరినొకరు చూసుకొన్నారు! వారు పిరికి పందాలు కారు. సమయం వచ్చినప్పుడు ప్రాణాలని అయినా ఇవ్వగలిగిన స్థయిర్యం వారికి ఉంది! అయినా, వారు ఒక విషయాన్ని కొంత మట్టుకు ఊహించుకొన్నారు! తమ సేనాపతి రాజద్రోహి అని వారికి తెలిసి పోయింది! మాజీ మహామంత్రి గారి మీద వారికి ఇంకా గౌరవం చెడలేదు! రాజుపై ద్వేషం వారికి ఏ కోశానా లేదు. అలాంటప్పుడు ప్రతిఘటించడానికి వారి హృదయాలు ఒప్పుకోలేదు! వారు సంశయిస్తూ ఉండగా మహామంత్రి వారితో ఇలా అన్నాడు.

“ సోదరులారా! మీ దేశ గౌరవానికి మీరు ప్రాణాలు అర్పించ వలసిన సమయం వచ్చింది! సేనాధిపతి కవచంలో ఇమిడి ఉన్న కారవేలుడు మహా రాజద్రోహి! రేపటి రాత్రి మన రాజుని శత్రువులకి పట్టి ఇవ్వడానికి వాగ్దానం చేసాడు. మీ రాజుని కాపాడుకోవాలని మీకు ఉంటే, ఇదిగో ఈ భీమనాథుని అనుసరించండి. లేనప్పుడు మీ ప్రాణాల పైన ఆశ వదులుకోండి. మాకు అట్టే వ్యవధి లేదు కాబట్టి మీ నిర్ణయం శీఘ్రంగా వెల్లడించండి.”

“మహాప్రభో! మేము రాజద్రోహులం కాజాలము. మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.” అని చెప్పి తమ ఖడ్గాలను భీమనాథుని పాదాల ముందర ఉంచారు!

“సైనిక సోదరులారా! మీ రాజభక్తికి సంతోషించాను. మీ కత్తులు తీసుకోండి. మాజే మహామంత్రి భవనాన్ని మీరు జాగ్రత్తగా కాపలా కాయండి. చీమను కూడా లోపలకు రానీయరాడు.” అని భీమనాథుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. పాతాళ గృహ కవాటాన్ని బంధించి తాళం వేసాడు.

అనంతరం మాజీ మహామంత్రి, భీమనాథుడు గుర్రాల మీద రాజ ప్రాసాదం వైపు దౌడు తీసారు.

44 వ ప్రకరణం   

మహానంది పురం బాలభానుని అరుణ కిరణరాజిచే చైతన్య వంతమై మేలుకొంది. ప్రాతః కాల శంఖారవం ఓంకార నినాదంతో దిక్కులతో లయిస్తోంది. కోటలోని మంగళ తూర్యారావం నగర వాసులను తట్టి లేపుతూంది.

భీమనాథ బుద్దిసాగరులు రాజప్రాసాద దుర్గ ముఖద్వారం దగ్గర తమ గుర్రాలనుండి దిగారు. మహాప్రతీహారి సంఘ మిత్రుడు మహామంత్రిని చూసి అభివాదం చేసాడు. కోటలోపలికి వారి ప్రవేశానికి ఆడు పెట్టలేదు మహాప్రతీహారి! 

“ఆర్య!మనం మొదట రాజకుమారిని కలుసుకొని జరిగిన విషయం ఆమెతో చెప్పి, ఆమె ద్వారా మహామండ లేశ్వరుని దర్శనం చేయవచ్చు. చేటిక ‘మల్లికను’ ముందుగా చూడ వలసి ఉంది.” అన్నాడు భీమనాథ బాబు.

భీమనాథుని సలహా పాటించి ప్రాసాద బహిపురం దాటి, అంతఃపురానికి దారి తీసాడు బుద్దిసాగరుడు. అంతః పుర ముఖద్వారం దగ్గర చేటీ జనాధ్యక్షురాలైన వసుంధరా దేవి కార్యాలయ భవనం ఉంది. 

వసుంధర మాజీ మహామంత్రిని మర్యాదగా రాబట్టుకొంది. అతనితో పాటు భీమనాథుడు కూడ ఆహ్వానింప బడ్డాడు. వారిద్దరూ ఆసనాలు అలంకరించారు.

“మాననీయుల రాక ఇంత  ప్రాతఃకాలంలో ఏదో విశేషాన్ని చెప్పక చెప్తోంది” అని ప్రసంగా ద్వారాన్ని తెరచింది వసుంధరా దేవి.

“ వసుంధరా దేవీ! నీ ఊహ నిజమయినదే! మన దేశానికి గొప్ప ఆపద సంభవించబోతోంది! ఆ విషయమై ముందు జాగ్రత్త వహించి భర్త్రుదారికతో కలిసి ఆలోచించే నిమిత్తం నేను వచ్చాను. ఇతడు నా మిత్రుడు భీమనాథుడు. ఇతని మూలంగానే నాకు ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ‘కుట్ర ’ తెలియ వచ్చింది.”

‘కుట్ర’ అన్న పదం వినగానే వసుంధర చాల కలవర పడింది! “బాబుగారూ! ఇప్పుడే భర్త్రుదారిక స్నానాదికం ముగించుకొని అలంకరణకు వెళ్ళారు. ఇంకొక అర ఘడియలో వారు విశ్రాంతి శాలకు విచ్చేస్తారు. నేను మీ రాక గూర్చి కబురు పెడతాను. పితృ సమానులైన మిమ్ము చూడడానికి ఆమె అంగీకరించా వచ్చును. కాని...”

“వసుంధరా! ఆమె ముఖ్యంగా భీమనాథ బాబునే చూడ వలసి ఉంది. అతడు చెప్పే విషయాలు చాల ముఖ్యమైనవి. కాబట్టి నీవు భర్త్రుదారిక మమ్మల్నిరువురినీ చూచేటట్లు చేయాలి!” 

“చిత్తం, అలాగే కబురు చేస్తాను” అని వసుంధరా దేవి ఒక గంట వాయించింది. శబ్దం విని ఒక చేటిక అక్కడకు  వచ్చింది. “మల్లికా! భర్త్రుదారిక ఇప్పుడెం చేస్తున్నారో చూచి రా! ఆమెను కలసుకొని మాట్లాడడానికి నేను వస్తున్నట్లు చెప్పు.” అని ఆజ్ఞాపించింది.

భీమనాథుని సంజ్ఞను గమనించి బుద్దిసాగరుడు “వసుంధరా! మల్లికా కుమారిని ఇక్కడే ఉండనిచ్చి, మరొక చేటికను పంపించు” అని చెప్పాడు.

మల్లిక శరీరం ఇంచుక కంపించింది. ఆమె కండ్లలో భయభావం స్పష్టంగా గోచరించింది! ఆమెనే చూస్తున్న భీమనాథుని దృక్కులను ఆ బాలిక తట్టుకోలేక పోతోంది.

వసుంధర బుద్దిసాగరుని విచిత్రమైన విజ్ఞప్తిని విని ఆశ్చర్య పోయింది. అతని ఇష్టానుసారం మల్లికను అక్కడే ఉండమని చెప్పి, ఇంకొక చేటికను పంపించింది.

“వసుందరాదేవి గారూ! నన్ను క్షమించాలి! మీరు అనుజ్ఞ ఇస్తే నేను మల్లికా కుమారిని కొన్ని ప్రశ్నలు వేయదలచి ఉన్నాను” అన్నాడు భీమనాథుడు నిదానంగా. వసుంధర లోలోపల విసుగుకొంది. ‘వీడెవడో అధిక ప్రసంగిగా కనిపిస్తున్నాడు! అంతఃపుర స్త్రీలను ప్రశ్నించడానికి  వీడెవడు?’ అని తలపోసింది. మాజీ మహామంత్రిపై ఆమెకు చాలా గౌరవబుద్ది ఉంది! ఆమెకు అంతటి పదవి రావడానికి అతనే కారకుడు. కాబట్టి బుద్దిసాగరుని సమక్షంలో భీమనాథుని కోరికను ఆమె తిరస్కరించలేక పోయింది!

“ఆర్య! నాకు ఏమీ అభ్యంతరం లేదు. అంతఃపుర మర్యాదలకు భంగపాటు లేని ప్రశ్నలు మీరు వేయవచ్చు!” అని చెప్పింది వసుందరాదేవి.

“ మల్లికా కుమారీ! ‘ఆత్మార్థం పృథివీం త్యజేత్’ అన్న న్యాయాన్ని మానవుడు తప్పుగా అర్థం చేసుకొని ఆశకు దాసుడు అవుతాడు. అది మానవ సహజమైనా, కొన్ని సందర్భాలలో మహాపాపంగా పరిణమిస్తుంది. తప్పు చేయడం కంటె చేసిన తప్పును గ్రహించక పోవడమన్నది మహాపాపం! చేసిన తప్పుని గుర్తించి పశ్చాత్తాపం పొందడం వలన ధర్మ దేవత సంతోషిస్తుంది!

 కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్నని అడగడానికి తీర్మానించాను. దానికి నీవు నిష్కపటమైన జవాబు చెప్పగోరుతు న్నాను. మిమ్మల్ని ప్రలోభ పెట్టినవాడు మిక్కిలి బాధ్యత కల ఘరానా మనిషి అయి ఉండవచ్చు! నీవు అతని చెడు ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక పోయి ఉండవచ్చు! కాబట్టి  నీవు మా అందరి సమక్షంలో నిర్భయంగా విషయం దాచకుండా వివరించి చెప్పాలి. నా ప్రశ్న విను, నీకు ‘నాగసేనునితో’ పరిచయం ఏర్పడి ఎన్ని రోజులయింది?”

మల్లిక చెవులలో ఆ ప్రశ్న మరగ బోసిన సీసంలాగ పడింది. ప్రచండ వాతోద్దూతమైన చిగురుటాకు లాగ ఆమె శరెర లత కంపించింది. ఆమె ముఖం పైన స్వేద బిందువులు ముత్యాల పోగు వలె గుమికూడి రాలుతున్నాయి. ఆమె కంపిత స్వరంతో ఇలా అంది. “ నాగసేనుడు ఎవరో నాకు తెలియదు” అని. 

భీమనాథుని కండ్లు జేగురించాయి. అతడు కఠినమైన స్వరంతో అన్నాడు “ మల్లికా! నీవు ఎంతో విపరీతమైన పనికి ఒప్పుకొని, అబద్ధం కూడా చెప్తున్నావు! నవనీతం కన్నా కోమలమైన నీ భర్త్రుదారికను, అమృతం కంటే నిర్మలుడైన నీ మహారాజుని శత్రువులకు అప్పగించడానికి పూనుకొని నీ మాత్రు దేశానికి తీరని ద్రోహం  తల పెట్టి ఇప్పుడు మా సమక్షంలో అబద్ధమాడుతున్నావు! మరొకమారు చెప్తునాను, విను నీ తప్పు క్షమించబడు తుంది. నిజం దాచ కుండా సమస్తం మాకు చెప్పాలి.” 

వసుంధరాదేవి బెదురూ బెదురుగా భీమనాథుని, మల్లికను మార్చి మార్చి చూసింది! బుద్దిసాగరుడు మౌనం వహించాడు. 

“బాబుగారూ! నన్ను క్షమించండి. నాకేమీ తెలియదు! ఏమేమో ఆశలు చూపించారు, లొంగి..పోయాను.. లేక పోతే ..హత..మార్చుతామని ..అన్నారు” అని చెప్పి మల్లిక బిగ్గరగా  ఏడుపు ప్రారంభించింది.

భీమనాథుడు మందహాసం చేసాడు.“మల్లికా! ఏడవకు, నిన్ను క్షమించాను నిజం నిర్భయంగా చెప్పు సేనాపతి కారవేలుడేనా నిన్ను మభ్యపెట్టింది?”

“ అవునండి” బెక్కుతూ చెప్పింది మల్లిక.

“నీకూ, సేనాపతికీ రహస్య సంబంధం ఏదన్నా ఉండి కదూ ?”

“ నన్ను వివాహం చేసుకొంటానని అన్నారు.”

“అదా, సంగతి! అందుకేనా రేపు రాత్రి దిడ్డి ద్వారాన్ని తెరిచి ఉంచడానికి ఒప్పుకొన్నావు?” 

“అవును అన్నట్లుగా మౌనంగా తల ఊపింది మల్లిక. 

భీమనాథుడు వసుంధరను చూసి ఇలా అన్నాడు “సోదరీ! నా ప్రశ్నలు ముగిసాయి. పాపం! మల్లికను వదలి పెట్టండి, ఆమెకి ఎట్టి శిక్షా వేయవద్దు. ఆమెను అంతఃపురం దాటి ఎక్కడకీ వెళ్ళనీయకుండా కట్టడి చేస్తే చాలు!” 

“భీమనాథ బాబుగారూ! నన్ను సోదరీ అని సంబోదించి గౌరవించారు! నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొ న్నాను! దానికి క్షమించండి. నా చేతి క్రింద ఉన్న చేటిక ఇంతటి రాజద్రోహకర మైన  కుట్రలో పాల్గొనడం నాకు చాల విచారం కలుగ జేస్తోంది! విషయం కనిపెట్టి మా రాజకులానికి మహోపకారం చేసారు! నేను మీకు కృతజ్ఞు రాలిని!” అని గాద్గదికమైన కంఠంతో చెప్పింది వసుంధరా దేవి. ఇంతలో భర్త్రుదారిక చేటీ జనాధ్యక్షురాలిని పిలుస్తున్నట్లు కబురు వచ్చింది. వెంటనే ఆమె లేచి అంతఃపురం లోకి వెళ్లింది. 

******************************     

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద