Skip to main content

వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 24 :బాపు వేసిన బొమ్మలతో సహా : (అత్యద్భుతమైన ముగింపుతో)




రాయబారం చర్చ ప్రసన్న వాతావరణంలో జరిగింది.

“కళింగులపై మాకు ద్వేషం లేదు! రాజ్యాక్రమణ చేయాలనే ఉద్దేశం కూడ లేదు! కుమార భోగనాథాదులు రాజ ద్రోహులు! మా దేశానికి ప్రబల శతృవు నిశుంభునితో చేతులు కలిపి కుండిన వంశాన్ని చిన్నాభిన్నం  చేయా లని తలచాడు కుమార భోగనాథుడు. అటువంటి రాజద్రోహులకు మీ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చి, ఆదరించి, సైనిక చాలనాదికారం కూడా ఇచ్చింది! కాబట్టి మా ప్రభుత్వం ఉపేక్ష వహించడం ప్రమాదకరమని యుద్ధం ప్రకటించింది! మీరు రాజద్రోహులను ససైన్యంగా మా వశం కావించితే, మన రాష్ట్రాలకు అనుకూలమైన సంధి విధానాన్ని చర్చించుకో వచ్చు” అని చెప్పాడు చిత్రకూట రాష్ట్ర సర్వ సేనాధిపతి, ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన ప్రమథనాథుడు!

 “కుమార భోగనాథునికి మేము ఆశ్రయం ఇవ్వమని మా ప్రభుత్వం తరఫున నేను చెప్పగలను! వారిని మీరు పట్టుకోవడానికి ఎట్టి చర్యలనైనా చేయవచ్చు! మా ప్రభుత్వం ఒకమారు ఆశ్రయం ఇచ్చిన దోషం వలన వారిని స్వయంగా పట్టి ఇవ్వడానికి సందేహించ వచ్చు. ప్రస్తుతం మనం సంధి విషయాలను ప్రస్తావించుకొని ఇరు పక్షాల సైన్యాలనూ ఉప సంహరించు కొందాము” అన్నాడు వినయ చంద్రుడు.

ప్రమథనాథుడు కొన్ని క్షణాలు గంభీర మౌనముద్ర వహించాడు. నూనూగు మీసాలతో సర్వ మేచక మూర్తి అయిన ఆ యువక సైన్యాధ్యక్షుడుని వినయచంద్రుడు ఆశ్చర్యంతో చూసాడు! ‘ఈ బాలుడా! సంధి చర్చలు చేసే మేధావి!’ అని తలచాడు.

“నా మాననీయ మిత్రుని భావాన్ని గ్రహించాను. కాని సమ్మతి చూపలేనందుకు విచారిస్తున్నాను. ఆశ్రయం ఇచ్చిన మీ ప్రభుత్వం రాజద్రోహులను మా వశం చేయడానికి వెనుకంజ వేయడంలో తాత్పర్యమేమిటి? రాజ ద్రోహుల చర్యలు మీకు సమ్మతమనే దాని భావం కదా ! అలాంటి భావం మీలో ఉన్నంత కాలం మీతో సంధి పొసగదు! ఇటువంటి సందిగ్ధమైన సంధికి మా ప్రభుత్వం ఒప్పుకో నేరదు! మీకు నేను మూడు రోజులు వ్యవధి ఇస్తున్నాను. నాలుగవ రోజున ప్రాతఃకాలానికి రాజద్రోహుల నందరినీ మా వశం చేయవలసి ఉంటుంది! లేకపొతే మా ఆంధ్ర సేనావాహిని మీ కళింగ దేశంపై విచ్చలవిడిగా ప్రవహించక మానదు!” అని గంభీరంగా చెప్పాడు ప్రమథనాథుడు. అలా చెప్పి  ‘మీరు సంధికి రాలేదు, వృథా ఉబుసుపోకకై వచ్చారు’ అని ధ్వనించేటట్లు తెలియ జేసి  నిర్లక్ష్యంగా లేచి నిలబడిపోయాడు  సర్వ సేనాపతి!

 “సర్వ సేనాధిపతీ! మీరు చెప్పిన విషయాలను మా ప్రభుత్వానికి విన్నవిస్తాను. మీరు ఇచ్చిన గడువు లోగా, వర్తమానం అందజేస్తాను. సెలవు!” అంటూ వినయచంద్రుడు తన అనుచరులతో వెళ్ళిపోయాడు. కళింగులు ప్రమథనాథునితో సంధి ప్రయత్నాలు కావిస్తున్నట్లు విశాలాక్షునికి తెలిసింది. అతడు చాలాఆందోళన చెందాడు. “రాకుమారా! పరిస్థితులు తారుమారు అయిపోయాయి! కళింగులు మనకు ఇచ్చిన మాట నిలబెట్టుకో లేక పోయారు. ఇలాంటి సందిగ్ధ సమయంలో మనం ప్రచ్చన్నంగా అజ్ఞాతవాసం గడపవలసి ఉంటుంది. మనం ఈ ప్రాంతాలు వదలి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయవలసి ఉంటుంది!” అన్నాడు భోగనాథునితో!

“మామయ్యా! మనం ఎక్కడకి వెళ్ళినా లాభం ఉండదు! కాబట్టి నేను, నా మిత్రులు, నా దండనాదులు, సైని కులు, నా భార్యతో సహా ప్రమథనాథుని వశం అయిపోవడానికే తీర్మానించుకొన్నాను. నా మనస్సు మారి పోయింది!” అన్నాడు భోగనాథుడు, విరక్త భావంతో! విశాలాక్షుడు మౌనం వహించాడు.

అదే రాత్రి విశాలాక్షుడు ఒంటరిగా ఎవరికీ తెలియకుండా మారువేషంతో కళింగ రాజధానినుండి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు భోగనాథుడు, సమిత్ర, సపరివార, ససైన్య సమేతంగా, సేనాధిపతి ప్రమథనాథుని వశం కావడా నికి నిశ్చయించినట్లు మహారాజ శ్రుతసేనునికి వర్తమానం చేసాడు. అతనిని పట్టి ఇవ్వడానికి సందేహిస్తున్న  సమయంలో భోగనాథుని తీర్మానం అందుకొని సంతోషించారు కళింగులు!  

ఆంద్ర కళింగుల మధ్య సంధి కుదిరింది. ఎల్లలు మునుపటి లాగే ఉండడం, లాంగలీ నది ఆంధ్రుల ఎల్లలోది కాబట్టి, దాని నీటి హక్కులు పూర్తిగా ఆంధ్రులకే చెందడం, యుద్ధ నష్టపరిహారం క్రింద కళింగులు ఆంధ్రులకు ఐదుకోట్ల కార్షాపణాలు చెల్లించుకోవడం’ ఇవే తాత్కాలిక సంధి షరతులు!
 
విజయగర్వంతో ఆంధ్రులసేన, భోగానాథాదులను వశం చేసుకొని తమ రాజధానికి కదలింది

******************

51 వ ప్రకరణం    

ఆంధ్రవిష్ణువు మహానందిపురానికి క్రోసేడు దూరంలో సైనిక  స్కందావారాన్ని నిర్మించాడు. మరునాడు ప్రాతః కాలం నిశుంభుని యుద్ధనీతి వానికి బోధపడింది! కోటలోని రాజ వంశమూ, మహామంత్రి  గుప్తంగా పారిపోయి నట్లు కూడ తెలిసింది! కోట ఏ విధమైన ప్రతిఘటన లేక నిశుంభుని వశమయినట్లు విదితమయింది! ఇలా ఉండగా నిశుంభుడు కోటలో యుద్ధసన్నాహం చేసుకొని ఉండాలి కదా? అలా జరగలేదు! ఈ విషయాన్ని చర్చించడానికి ఆంధ్రవిష్ణువు దండనాయక సభను ఆహ్వానించాడు.

“దండనాదులారా! నిశుంభుడు మాయావి! సమయోచిత ప్రజ్ఞగల యుద్ధనీతి విశారదుడు! వాడిపుడు కూట నీతిని అవలంబించాడు. తన సైన్యాన్ని గుంపులు గుంపులుగా విడదీసి అక్కడక్కడ ప్రచ్చన్నంగా ఉంచాడని నా ఊహ! వాడు శాంబర విద్యా సిద్ధుడు. మన సైన్యంలో రకరకాలైన వ్యాధులు, వ్యాపింప చేయగల వాడని మన మహారాజ్ఞి  చెప్తున్నారు! వాతావరణంలో చిత్రమైన మార్పులు సృష్టించి సైనికులను భీత చిత్తులుగా చేయ గలవాడట! ఇటువంటి దుష్ట శక్తులు కలిగి ఉన్న నిశుంభుని ఆటలు కట్టించడానికే మహారాజ్ఞి తమ సోదరుడు అక్షోభ్యమునితో పాటు కలిసి వచ్చారు! మీరందరూ మీ మీ సైనికులకు ఈ విషయం స్పష్ట పరచి ధీర చిత్తంతో వారు శత్రువులను ఎదుర్కొనేటట్లు చేయండి”అని అన్నాడు ఆంధ్రవిష్ణువు.

 “పట్టణ బహిః ప్రదేశంలో ఇంటింటా సైనికులను మారణాయుధాలతో నిలిపి ఉంటాడని నా అంచనా! కాబట్టి మన సైన్యాన్ని రెండు విభాగాలుగా చేసి, ఒకదానితో పట్టణాన్ని ముట్టడించాలి! మరొక విభాగం అప్రమత్తతతో బహిర్గతమైన సైన్యాన్ని సమయం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి!” అని చెప్పడు ఆచార్య విషమసిద్ది.

దీర్ఘకాల చర్చానంతరం ఆచార్యుడు చెప్పిన విధానం ఆమోదించబడింది. ఆ సాయంకాలమే అక్షోభ్యముని ఆధ్వ ర్యాన  హోమశాల నిర్మాణం జరిగింది. హోమశాలలో మహారాజ్ఞి దీక్ష వహించి, ‘ప్రచండ చండీ హోమవిది’ నిర్వ ర్తించడానికి పూనుకొంది. ఆమెకు సహాయంగా కాత్యాయని, అక్షోభ్య ముని దీక్ష వహించారు. హోమశాలను అయిదు వేల సైన్యంతో కాపలా కాస్తున్నాడు, మహారాజ్ఞి అంగరక్షక సేనానాయకుడు దండనాయక వాత్సాయన విష్ణుశర్మ.

దండనాయక కౌండిన్య బలభద్రుని ఆధిపత్యాన ఆంద్ర మహాసైన్యంలో ఒక భాగం మహానందిపురాన్ని చుట్టు ముట్టింది. సైన్యం లోని మరొకభాగం ఆంధ్రవిష్ణువు అధిపతిగా, దూర దూరంగా సైనిక శిబిరాలు ఏర్పాటు చేసు కొని అప్రమత్తతతో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడడానికి  సన్నద్ధం అయింది.

52 వ ప్రకరణం

ఆచార్య విషమసిద్ది ఊహించినట్లే, నిశుంభు నాగేంద్రుడు కూట యుద్ధనీతి అవలంబించాడు. దండనాయక శివకీర్తి, పింగాక్షుడు పట్టణం లోని సైన్యానికి నాయకత్వం వహించారు. నిశుంభుడు పూజలు, బలులు హోమాలు జరిపిస్తున్నాడు. ఈ ఏర్పాట్లన్నీ యోగీశ్వరి ధవళాక్షి పర్యవేక్షణలో జరుగుతున్నాయి!

ఆ రాత్రి మొదటి యామంలో యోగీశ్వరి ధవళాక్షి మహోగ్రంగా జ్వలిస్తున్న హోమకుండానికి అభిముఖంగా కూర్చొని ఉంది! ఆమెకు కుడి పార్శ్వంలో ఒక శ్వానం యూపస్తంభానికి కట్టబడి ఉంది! ఎడమ పార్శ్వంలో మహావీరుడు నిశుంభుడు రక్త చందన లేపరాజితమైన శరీరప్రభతో పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు!

“కుమారా! ఏమిటి విశేషం?” అని ప్రశ్న.

“ అమ్మా ! మహారాజ్ఞి రాజకాళమ్మ, యోగీశ్వరి కాత్యాయని, అఖోభ్యముని వచ్చి ఉన్నారట! ఆంధ్రుల  స్కంథా వారంలో కూడ హోమశాల ఏర్పాటయిందట!”

“కుమారా! ఇంకా కలహానికే నీ మనస్సు ఇష్టపడుతోందా? ఎన్ని విధాలుగా చూచినా జయలక్ష్మి మనవైపు మొగ్గుతుందని తోచడం లేదు! మన మాయోపాయాలను ఎగర గొట్టడానికి ఒక్క కాత్యాయని చాలు! ఆమెకి ఉన్మత్త  సిద్దురాలు తోడయింది!”

“నిజం కుమారా! మీ అమ్మ చెప్పిన విషయంలో అసత్యం లేదు. నీవు కలహాన్ని ఉప సంహరించుకో!” అని గంభీర నాదం వారిద్దరికీ వినబడింది! ఎదురుగా వారి కండ్లకు అమేయ ప్రతిభాశాలి, మహాయోగి, పరమ సిద్దుడ యిన జటాముని కనిపించాడు. ఇద్దరూ లేచి అభివాదం చేసారు.

“అమ్మడూ సుముఖీ! ఈ కుటుంబ కలహాన్ని ఆపు చేయడం మన విధి! ఇది మహాభారత యుద్ధంలాగ పరిణ మించింది! ఏ ప్రియురాలికై  నీ కుమారుడు మహత్తరమైన విప్లవాన్ని నడిపాడో, ఆమె దురాశాపూరితు రాలై కుంతలాదిపతిని వరించింది! ఇకనైనా కలహాన్ని పరిత్యజించడం వివేక లక్షణం! నేను సంధి ఏర్పాటు చేసి పార్వతీయ ప్రాంతాన్ని నిశుంభునికి ఇప్పిస్తాను” అని చెప్పాడు జటాముని.

సుముఖి (ధవళాక్షి) తన కుమారుడు నిశుంభుని వైపు చూసింది. “కుమారా! దైవ సమానుడైన నీ తాతగారి మాట మన్నించు!” అని చెప్పింది.

“భగవాన్! నాకు సంధి ఇష్టం లేదు. ఇరావతి ప్రవర్తనతో నా ఆశలన్నీ అడుగంటాయి! నాగులందరికీ నాయ కత్వం వహించిన నేను స్వార్థాన్ని ఉద్దేశించి ఆంధ్రవిష్ణువుతో సంధికి అంగీకరించ లేను! నా కంఠంలోఊపిరి ఉన్నంత వరకు యుద్ధం చేసి తీరుతాను! ఈ విషయంలో భగవత్పాదులైన మిమ్మల్ని కాదనడం తటస్థించినం దుకు విచారిస్తున్నాను, నన్ను క్షమించండి!” అన్నాడు నిశుంభువు.

మహర్షి దీర్ఘంగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు.

******************************

దండనాయక బలభద్రుడు పదిహేను రోజులు యుద్ధం చేసి పట్టణాన్ని ముట్టడి చేసి, శివకీర్తి, పింగాక్షులను చెదరగొట్ట గలిగాడు! ఆ కూటయుద్దంలో ఇద్దరు దండనాథులూ  వీరస్వర్గం పొందారు. మిగతా సైన్యం చెల్లా చెదురై పలాయన సూత్రం పఠించింది.

తమకు కలిగిన పరాభవం విని నిశుంభుడు కాలరుద్రుడై పోయాడు! ప్రచండ వాయువు సృష్టించి వాతావర ణాన్ని విష పూరితం కావించాడు. వెనువెంటనే తన సైన్యాన్ని నడుపుకొని ఆంధ్రవిష్ణువుపై బహిరంగంగా యుద్దంలో దిగాడు.

యూపానికి కట్టబడిన కుక్కను ఆంద్ర స్కంథావారంపై ఉసిగొల్పారు! ఆకుక్క ఆవేశంతో, సింహ సమాన లాఘవంతో ఆంధ్రుల సైన్యాన్ని సమీపించింది.

“సైనికులారా! ఆకుక్కను చంపకండి! చంపితే భయంకరమైన విశూచి మొదలైన వ్యాధులు సంభవిస్తాయి! నేర్పుగా పట్టి, కట్టివేయండి!” అని ఘోషణ కావించాడు ఆంధ్రవిష్ణువు. తమ నాయకుని ఆజ్ఞ పాటించి సైనికులు వలయాకారంగా కుక్కను చుట్టుముట్టి పట్టి బలమైన ఇనప గొలుసులతో బంధించారు!

విషపూరిత వాతంచే ఆంద్ర సైనికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు! కొంత నష్టం కూడా కలిగింది! నిశుంభువు ఆశించినట్లు, ఆంద్ర  సైనికులు దానికి భయపడి పోరుకి వెన్నివ్వలేదు! పైపెచ్చు సహనంతో నిరీక్షించి  విష వాయువులు పలచన బడగానే రెట్టింపు వేగంతో పోరు కొనసాగించారు! ఇరువైపుల దనుర్ధరులు వానజల్లుల వలె బాణాలు వెదజిమ్ముకొంటున్నారు. నిశుంభుడు తన కాలాశ్వం అధిరోహించి విలయ తాండవం కావించాడు వాని తాకిడికి ఆంద్ర సైన్యం చెల్లా చెదురు కావలసిందే కాని, అరుణాశ్వధారియై ఆంధ్రవిష్ణువు నిశుంభుని ఎదుర్కొన్నాడు! వారిద్దరి యుద్ధం వర్ణనాతీతమైన విధంగా చెల రేగింది! ఉభయ పక్షాల వారికి బాహాబాహి యుద్ధం ప్రారంభమయింది. ఆ సంకుల సమరంలో రక్త ధారలు  వరదలు కట్టాయి.

సూర్య భగవానుడు తేజః పూరితమైన తెల్లని కవచం పరిత్యజించి, ఎర్రని కంచుకం ధరించాడా అన్నట్లు, పడ మటి దిక్కున కనబడ్డాడు. అతని అరుణ కిరణాలు రక్తం చిమ్మాయో అన్నట్లు పడమటి దిక్కంతా ఎర్రబడింది!

“విష్ణు శర్మా! కుమారుడు మహామాయావి అయిన నిశుంభునితో ద్వంద్వ యుద్ధం చేస్తున్నాడు! నా మనస్సు కీడును శంకిస్తోంది! నీవు వెంటనే యువరాజుకి సహాయంగా వెళ్లు!” అని తన అంగరక్షక సైన్య దండనాధుడు విష్ణుశర్మతో మహారాజ్ఞి చెప్పింది. విష్ణు శర్మ అశ్వారూడుడై శరవేగంతో వెళ్ళాడు.

ఆంధ్రవిష్ణు నిశుంభులు అన్యోన్య జయ కాంక్షతో పోరాడుతున్నారు! వారి కత్తుల రాపిళ్ళు మెరుపులు సృష్టిస్తు న్నాయి. ఆ సమయంలో నల్లని ముసుగు వేసుకొన్న వ్యక్తి  ఆంధ్రవిష్ణువు వెనుక భాగం సమీపించి మొలలో నుంచి బాకు తీసి, యువరాజు గుర్రాన్ని పొడవడానికి సిద్ధపడుతూంది. సరిగా అదే సమయంలో విష్ణు శర్మ ఖడ్గం ఆ వ్యక్తి భుజంపై విద్యుద్ఘాతంలాగ పడింది!

“హా ! కుమారా!’ అంటూ ఆ వ్యక్తి క్రింద పడిపోయింది.

నిశుంభుడు ఆ ఆర్తనాదం విన్నాడు! ఆ నాదం వానికి చిర పరిచితం! అది తన తల్లి కంఠం!! ఒక్క క్షణం వాని ఖడ్గహస్తం కంపించింది. ఆ  ఒక్క క్షణం ఆంధ్రవిష్ణువుకి అనుకూలించింది. కంపమానమైన నిశుంభుని హస్తం ఆంద్ర విష్ణుని భయంకర కృపాణానికి  ఎర అయిపోయింది!! వెంటనే నిశుంభుడు గుర్రం మీద నుండి దుమికి ఖడ్గం ఎడమ చేతితో ధరించాడు!

 “సోదరా ! బల సంపన్నమైన నీ కుడిచెయ్యి  ప్రమాదవశం వల్ల తెగిపోయిన దానికి నేను చింతిస్తున్నాను! మా కుండినులు అధర్మ యుద్ధం చేయరు! నేను కూడా ఎడమ చేతితోనే  యుద్ధం చేయడానికి నిశ్చయించాను! ఈ దెబ్బ కాచుకో!” అని ఉద్ఘాటించి ఆంద్ర విష్ణువు వామ హస్తాన ఖడ్గం ధరించి నిశుంభునిపై ఉరికాడు.

ఇద్దరూ పాదచారులై ఖడ్గ యుద్ధం చేయసాగారు. అత్యద్భుతమైన వారి పోరు తిలకిస్తూ నిలబడి పోయాడు విష్ణు శర్మ! రక్త ప్రసారం వలన నిశుంభుని శక్తి క్షీణిస్తోంది! నాగుల సైన్యంలో హాహాకారాలు బయలుదేరాయి! కారణం! నిశుంభుడు నేలకి ఒరిగి పోయాడు!

తల్లి మృత దేహంపై వాని  తల పడిపోయింది!!

నాగ సైన్యం ఆంధ్రుల వశం అయిపొయింది!!!

********************

53 వ ప్రకరణము

ఆంధ్రుల జయపతాక ఆంధ్ర దేశమంతటా రెపరెపలాడింది! ఆంధ్రుల గృహాలన్నీ పండుగ వేడుకలతో కళ కళ లాడాయి! ముఖ్యంగా శ్రీకాకుళ నగరం దేవేంద్ర నగరిని మించిన శోభతో అలంక్రుతమయింది!

మహానందిపుర ప్రాసాదమంతా పునరుజ్జీవితమై నూతన శోభలు కులికే నవ వదువులాగ శోభించింది! కౌత్స సత్యకర్మ తన కుమార్తె రత్న ప్రభను, కాంకోల భీమనాథునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం కావించాడు. వివా హానంతరం సామ్రాట్టు ఆహ్వానించగా, భీమనాథుడు తన ప్రేయసితో కలిసి శ్రీకాకుళ నగరానికి వచ్చి చేరాడు.

శ్రీకాకుళంలో ఆచార్య భవనంది కుమార్తె, ఘనేంద్రుని అనుంగు చెల్లెలు అయిన భానుమతిని వివాహమాడాడు దండనాయక విష్ణు శర్మ.

సామ్రాజ్ఞి  నిర్మలా దేవి (రాజకాళి) ప్రోద్బలంతో మంత్రి మండలిని సమావేశ పరచి రాజద్రోహులుగా పరిగణింప బడిన వారినందరినీ పూర్తిగా క్షమించి విడచి పెట్టాడు సమ్రాట్టు!

పార్వతీయ మండలానికి మహా మండలేశ్వరునిగా కుమార భోగనాథుడు నియమితుడు అయినాడు! అతడు తన భార్య కుముదాక్షితోను, తల్లి చిన్న రాణి లీలావతీ దేవితోను రాజధాని భైరవ దుర్గానికి వెళ్ళిపోయాడు.

మాజీ మహామంత్రి సునందునికి  పూర్వపు జాగీరు తిరిగి ఇవ్వబడింది, కాని ‘నరిష్టకు’ సదసత్పతిగా చేసిన తాఖీదు మాత్రం రద్దు కావించబడింది. సునందుని కుమారుడు వీరనందుడు ఏ పనీ లేక ఇంట్లో ఉంటున్నాడు.

భ్రుంగాలక ముద్దు కొడుకు వీరసింహుడు, భర్త హేమచంద్రుడు విడుదల అయినారు. కాని వారి పదవులు తుడిచి పెట్టుకొని పోయాయి. కులయోగిని కాత్యాయని శ్రీకాకుళం త్యజించి తన గురుపాదులైన జటాముని ఆశ్రమానికి వెళ్లింది. అక్షోభ్యముని మామూలుగా తన ఆశ్రమంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితం గడుపు తున్నాడు.

దేవవాటిక, అమరావతి దుర్గాలను ఒకే సామంత మండలం కావించబడినాయి. దానికి మహా మండలేశ్వరునిగా కుమార శక్తిధరుడు నియమింపబడ్డాడు. యువరాజ కాలనాథుడు(ఆంద్ర విష్ణువు) వివాహానంతరం శక్తిధరుడు తన అర్థాంగి మణిమాల తోనూ, అత్తగారైన చంపావతి తోనూ అమరావతీ దుర్గం వెళ్ళడానికి తీర్మానించాడు.

 ఆంద్ర సామ్రాజ్య సైన్యానికి అధిపతిగా ఘనేంద్రుడు నియమితుడు అయినాడు. రాష్ట్రియుని పదవిలో దండనా యక విష్ణు శర్మ నియుక్తుడయినాడు. దూత సామంత పదవికి కాశ్యప ప్రమతిని ఎన్నుకోవడం జరిగింది.

చిత్రకూట రాష్ట్ర సింహాసన ఉత్తరాదికారి సమస్య  మరల తల ఎత్తింది! మహా మండలేశ్వర విమలుని ప్రథమ కళత్రం శాంతిసేనా దేవి కుమార్తె సత్యప్రభ యువరాజుని వివాహం చేసుకొనడానికి అంగీకరించడం వలన, ప్రమథ నాథునినే (విమలుని ద్వితీయ భార్య సౌదామిని కుమారుడు) చిత్రకూట సింహాసనానికి వారసునిగా సమ్రాట్టు నిర్ణయించాడు. కాని ప్రమథనాథుడు ఏ కారణం చేతనో ఆ మహోన్నత పదవిని ప్రత్యాఖ్యనం చేసాడు!! దానికి కారణం తెలియక అందరూ తికమక పడ్డారు.

రాజధానిలో ఆంద్ర విష్ణువు వివాహ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి! ఈ విషయమై అందరి సమక్షంలో బహిరంగ ప్రకటన కావించాలని, ఆంధ్ర సామ్రాట్టు సుచంద్ర భట్టారకుల వారు ఒక మహాసభను సమావేశ పరచ మని మహామంత్రి మల్లికార్జునునికి ఆదేశం ఇచ్చాడు!

54 వ ప్రకరణం      

బహిరంగ రాజప్రాసాద బహిః పురం లోని విశాల మంటపంలో మహాసభ సమావేశమయింది.

ఆ సభకు దళపతులు, మంత్రులు, ప్రాడ్వివాకులు, పుర ప్రముఖులు రాజకీయోద్యోగులు, ససైన్య పంక్తితో సహా దండనాధులు, సకుటుంబ సపరివార సమేతంగా పౌరులు కూడా సమావేశమయ్యారు!!

స్త్రీలకి ప్రత్యేకమైన ఆసన పంక్తులు అమర్చబడ్డాయి. వాటి మధ్య కనకాసనంపై సామ్రాజ్ఞి నిర్మలాదేవి రత్న స్థగిత కిరీటం ధరించి మూర్తీభవించిన క్షీరసాగర కన్యకలా ఉపవిష్ట  అయి శోభించింది.

సామ్రాట్ సుచంద్ర భట్టారకుడు సభ మధ్య భాగంలో స్వర్ణ సింహాసనంపై రాజ లాంచనాలతో ఉపవిష్టుడై దేవతా సభలో మహాశోభతో  వెలుగొందుతున్న మహేంద్రునిలా భాసించాడు.

మహామంత్రి వేదిక మీదకి వచ్చి, రాజ ప్రకటనను ఈ విధంగా చదివాడు. “ సామంత, దండనాద, పుర ప్రముఖు లారా! గడచిన మహా సంగ్రామంలో జయలక్ష్మిని చేకూర్చిన మీకందరికీ నా హృదయ పూర్వక అభినందనలు సమర్పించు కొంటున్నాను. ఈ ఆనంద సమయంలో నా జ్యేష్ట పుత్రుడు యువరాజు కాలనాథుని, మీరందరూ అభిమానంతో పిలుస్తున్న ఆంద్ర విష్ణువుని వివాహ విషయం ప్రకటించడానికి నేను మిక్కిలి సంతోషిస్తున్నాను!

సాధారణంగా ..కొన్ని ప్రత్యేక సందర్భాలు వదిలి పుచ్చి, సామ్రాజ్యానికి వారసుడైన వాని వివాహ విషయంలో     జన సమ్మతిని తీసుకోవలసిన సదాచారాన్ని నేను అమలు పెడుతున్నాను. ఈ సదాచారం నా అనంతరం వారు కూడ ఆచరిస్తారని నానమ్మకం! ఇలాంటి ఆచారం పెట్టడంలో నా పూర్వ జీవితపు అంధకార బంధుర వైవాహిక పథమే కారణమని నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు! ఆంగీరస విమల భట్టారక మహామండలేశ్వరుని పుత్రిక నా మేనకోడలు అయిన ‘పూర్ణాపరనామధేయ’ సత్యప్రభను యువరాజు కాలనాథునికి ఇచ్చి  వివాహం చేయాలని సంకల్పించాను. వధువు పక్షం వారు నా సంకల్పానికి దోహదం ఇచ్చిఉన్నారు. ఇక మీ అందరి సమక్షంలో వధువు తన సమ్మతి ఇవ్వాలని ఆశిస్తున్నాను! కన్యక సిగ్గువల్ల స్వయంగా తన నిర్ణయాన్ని చెప్ప లేనప్పుడు, తన సమ్మతిని తన తండ్రిద్వారా గాని, తల్లి ద్వారా గాని చెప్పాలని నేను ఆమెను కోరుతున్నాను.”

సామ్రాట్టు  ప్రకటనను చదివి మహామంత్రి స్త్రీల ఆసనాల వైపు దృష్టి సారించాడు!  సభ్యులందరూ తమ సమ్మ తిని హర్షధ్వానాలతోనూ, చప్పట్లతోను తెలియ పరచారు!

సభలో సత్యప్రభ కనపడలేదు!!

ప్రమథనాథుడు మహామంత్రిని చూచి మందహాసం చేసాడు.

మహామంత్రి కలవరపాటుతో విమల భట్టారకుల వారిని సమీపించి, “మహా మండలేశ్వరా! మీ కుమార్తెను తీసుకొని రావలసిందిగా నేను సమ్రాట్టు తరఫున ప్రార్థిస్తున్నాను” అని మెల్లగా చెప్పుకొన్నాడు.

చిత్రకూట మహా మండలేశ్వరుడు వేదికను సమీపించి ఇలా అన్నాడు.“సభలోని వారికి అందరికీ నా వందన  ములు ! శ్రీవారు నా కుమార్తెను సభలో హాజరు పరచమని ఆజ్ఞాపించడం వలన, ఈ విషయాలు సభాముఖంగా చెప్ప వలసి వచ్చింది! కొన్ని రాజకీయ కారణాల వలన నేను ద్వితీయవివాహం చేసుకొన్నట్లు నటించాను!  నిజం చెప్పాలంటే శాంతిసేనా దేవిని వదలి నేను పరారీ అయ్యనే గాని వేరొక వివాహం చేసుకోలేదు!! నాకు సత్యప్రభ తప్ప మరొక సంతానమూ లేదు!!! ఇప్పుడు మీ ఎదుట కనిపిస్తున్న ప్రమథనాథుడే, నా ఏకైక  సంతానము గాని అన్యము కాదని, సత్యప్రభయే ప్రమథ నాథుడని మనవి చేసుకొంటున్నాను!! మారువేషంతో ప్రమథనాథునిగా వ్యవహరించిన సత్యప్రభ యువరాజు కాలనాథుని వరించడానికి సిద్ధంగానే ఉందని చెప్ప డానికి ఆనందిస్తున్నాను!”

సభలోని స్త్రీ పురుషులు అందరూ, ప్రమథనాథుని దిక్కు చూసి పెద్ద కోలాహలం చేసారు! వారి చప్పట్లతో సభాంగణం  మారుమ్రోగింది!

“మహారథి (ప్రమథనాథ) సత్యప్రభా దేవికీ జై, జై, జై!!” అను నినాదాలు బయలుదేరాయి.

సర్వ మేచక మూర్తి అయిన ప్రమథనాథుడు అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసాడు.

ఆంద్ర సామ్రాట్  కౌండిన్య సుచంద్రుడు , చేష్టలు దక్కి చిత్తరువు వలె ఆసనం లోనే ఉండిపోయాడు.

ఆంద్ర విష్ణువు (యువరాజ కాలనాథుడు) తన ‘గజశుండాలోపమ దక్షిణబాహువుతో’ సత్య ప్రభా దేవి (ప్రమథనాథుని) వామ హస్తాన్ని చేపట్టాడు.  అందరూ –“మంగళం మహాత్” అని శబ్దించారు!!

(అయిపోయింది)

****************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద