ఆ రోజు వార్తా పత్రికలో పడిన సమాచారం చదివి, భూషణ్ ఆశ్చర్య చకితుడయ్యాడు.
‘ఒక హిందూ నవ నవోన్మేష నవోదయ మరాఠీ తార ‘ శరణ్య’ , బాబా షావలి’ మజారుని , ఇంత వరకు అరవై ఏడు మంది దుర్ఘటనలకి గురి అయి, ప్రాణాలు పోగొట్టుకొన్న స్థలంలో కట్టేందుకు, తద్వారా దుర్ఘటనలని నివారించేందుకు అయిదు లక్షల రూపాయల విరాళాన్ని,‘చించి పోకలీ’ లోని ‘బాబా షావలి’, మేనేజింగ్ కమిటీకి ఇచ్చింది. వివరాలు, ఆ తారతో ఇంటర్వ్యూ లోపలి పేజీలలో—అన్న వార్త అది.
ప్రక్కనే శరణ్య ఫొటో రంగులలో ముద్రించబడి ఉంది..‘ఆ ఫొటోలో అది బాగానే ఉంది, అనుకొన్నాడు, ఈ శరణ్య కేసుని మరికాస్త జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే, ఆమె తనకి దక్కే ఉండేది !’ అనుకొన్నాడు.
తన ప్రమేయం లేకుండానే నిజంగా స్టార్ అయిపోయంది ! లోపల పేజీలో ఇంటర్వ్యూ చదివాడు భూషణ్. ఆమె మొదటి సినిమా ఇంకా రిలీజు కాక ముందే, నటిస్తున్న సినిమా , ‘రషెష్’ చూసి అప్పుడే మరో రెండు మరాఠీ సినిమాలకి ఆమెని బుక్’ చేసేసారట, అక్కడి నిర్మాతలు !
అందులో ఒకతను,బాలీవుడ్ ప్రొడ్యూసర్ కూడానట! ముందుగా మరాఠీలో చిన్నబడ్జెట్టు సినిమా తీసేసి,ఆ తరువాత ,హిందీలో సినిమా నిర్మిస్తాడట ! ఆ హిందీ వెర్షన్’కి కూడా ఆమెనే ‘హీరోయిన్’ పాత్రలో పెట్టుకొంటానని అన్నాడట ! ఇవన్నీ అదే చెప్పింది ‘ప్రెస్’తో ! అయిదు లక్షలు విరాళం ఇచ్చి, ప్రాణాపాయాన్నీ తప్పించుకోవడమే గాక,పేరు ప్రతిష్టలని కూడా ఆర్జించుకొంది ! తన హోటల్’కి వచ్చి, తన పీకమీద సవారీ చేసి ఇప్పుడు ఏకు మేకై కూర్చొంది.
మేకు అనగానే అతనికి, తన చుట్టూ రేప్ చేస్తానంటూ చుట్టూరా తిరిగిన, కొరకంచులో ఇనప మేకు’ గుర్తుకి వచ్చి, ఒళ్లు జలదరించింది. వెంటనే ఇక భరించలేక , బీహారీ బద్మాష్ నన్కీ యాదవ్’కి ఫోను చేసాడు.
“హలో భూషణ్ భాయ్ ! నేను నన్కీని మాట్లాడుతున్నాను.”
“హలో నన్కీ భాయ్ ! ఈ రోజు పేపర్లో శరణ్య గురించిన వార్త వచ్చింది చూసావా ?”
“చూసాను, దాని ఫొటో కూడా ఇచ్చారు, ‘మంచి మాల్’’ భూషణ్ భాయ్ ! కొంచెం జాగ్రత్తగా పట్టాల్సింది.”
“నేనూ అదే అనుకొన్నాను, గాని జరిగిపోయిన దాని గురించి కాదు. చేయాల్సిన దాని గురించి ఆలోచించు నన్కీ ! మనలో ఇద్దరు మిత్రులని అది పొట్టన పెట్టుకొంది. నా సర్వస్వం హరించింది.”
“నేను ఇంత సేపూ దాని గురించే ఆలోచించాను భాయ్ , నాకో ఉపాయం తోస్తోంది ! ”
“ఏమిటది ?”
“అది సినిమా స్టూడియోలకి వెళ్తూనే ఉంటుంది కదా దారి కాచి, ‘ కిడ్నాప్’ చేసేస్తే ---- ”
“అలా కుదరదు నన్కీ, దాని వెనక ఆడ దెయ్యం సపోర్టు ఉందని మరిచి పోతున్నావ్ !”
“దెయ్యం ఇంట్లోనే ఉంటుంది కదా భూషణ్ భాయ్ ! సినిమా స్టూడియోలకీ, షూటింగులకీ దానిని తీసుకెళ్లదు కదా, అందుకని, కిడ్నాప్ సక్సెస్ అయిపోతుందనే నా నమ్మకం !”
“నిజమే ! అది రాత్రి ఇంటికి రాకపోతే ఆ ఆడ దెయ్యానికి అనుమానం వస్తుంది. దాంతో అది మన మీద విరచుకొని పడుతుంది.”
“దానిని కిడ్నాప్ చేసేసి, దేవాలయంలో దాచేద్దాం ! దెయ్యానికి తెలిసినా, ఆ దెయ్యం, ఆలయం లోపలికి రాలేదు కదా ?
“నిజమే కదా ?” అంటూ నవ్వాడు భూషణ్.
నన్కీ కూడ శృతి కలిపాడు, “ నేను ఆ పనిలో ఉంటాను, ఫికిర్ మత్ కరో భాయ్ !’ అన్నాడు.
అవినాష్ , ఆలీ, శ్యాం, నరేంద్రలు, శరణ్యతో ఆమె ఇంట్లో సమావేశమయ్యారు.అవినాష్ తన పరిశోధన గురించి చెప్పాడు. రాఖీ , జాకీలు మరొక నరేంద్రని తయారు చేసారని, మరో రెండు వారాలలో అమెరికా నుండి రాబోయే, తమ తమ్ముడికి ఆ డూప్లికేట్’ని అప్పగిస్తారని తెలియ జేసాడు.
‘‘ అవినాష్ ! దీనిని బట్టి అర్థమవుతోందేంటంటే,వాళ్లు పోలీసు రిపోర్టు ఇవ్వలేదు.ఏ రిస్కూ తీసుకోకుండా, డూప్లికేట్’ నరేంద్రని తయారు చేస్తున్నారు.అందువల్ల మనకి ఉన్నగడువు రెండు వారాలు!! ఈ లోపుగా మనం ఈ కుట్రని బద్దలు కొట్టాలి” అంది శరణ్య.
“ కంపు బాబాయితో నేను అమెలికా వెళ్లను. అక్క దగ్గలే ఉంటాను. క్రొత్త నలేంద్లనే తీసుకొని పొమ్మను” అన్నాడు నరేంద్ర.
నరేంద్ర మాటల లోని నిప్పులాంటి నిజం వారికి అతని పైన జాలిని, ఆ రాఖీ, జాకీల పైన కోపాన్నీ కలిగించింది.
“శరణ్యా! ఏమాలోచించావ్ ? ఎలా ప్రొసీడ్ అవుదాం ?”
“డూప్లికేట్ నరేంద్ర వైపు నుండి పరిశోధన చెయ్యాలి. ఆ అబ్బాయి ఎవరు, వాడిని ఎక్కడ నుండైనా ఎత్తుకొని వచ్చారా, లేక ఎవరైనా దిక్కులేని తల్లి తండ్రుల దగ్గర కొనుగోలు చేసారా ? అన్న విషయం తెలుసుకోవాలి”
“నిజమే ! పోలీసు స్టేషన్’కి వెళ్లి, ఏవైనా పిల్లల మిస్సింగ్ రిపోర్టులు ఉన్నాయేమో చూడమంటావా ?”
“అలా చెయ్యవచ్చు, కాని వర్కవుట్ అవదు. రాఖీ జాకీలు పోలీసులని సైతం తమ స్కీములో కలిపేసుకొని ఉంటారు. పోలీసులు, లేక గుండాల సహాయం లేనిదే, ఒక కుర్రవాడిని ఎత్తుకొచ్చి, వాణ్ని రోగిష్టి వాణ్ని చేసి, రహస్యంగా పెంచడం కుదరదు.” అంది శరణ్య.
“అమ్మా ! మీ మాటల లోనే ఒక విషయం బయట పడుతోంది.” అన్నాడు ఆలీ.
“ ఏమిటది ఆలీ ?”
“ పోలీసులు, లేక గుండాల సహాయం లేనిదే ఈ పని చెయ్యలేరని మీరు అన్నారు కదా! బహుశా అవినాష్’ని కొట్టబోయిన గుండాలు వాళ్లకి సహాయపడి ఉండవచ్చు.”
“ నిజమే ఆలీ ! మంచి విషయమే గుర్తు చేసావ్ ! అవినాష్ వాళ్లని నువ్వు చూసావు కదా, వాళ్లు బహుశా ఏదో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండి ఉంటారు ! దగ్గర లోని ఆస్పత్రిలో విచారించి, వాళ్లని కలిసి, ఆకుర్రవాడి విషయం నయాన్నో, భయాన్నో రాబడదాం. పద, బయలుదేరు ” అంది శరణ్య.
“ ఇంత చిన్న విషయానికి నువ్వు రావడం దేనికి శరణ్యా ? నేను వెళ్లి కనుక్కుంటాలే ?”
“ ఇది చిన్న విషయం కాదు, అవినాష్ ! ఆ గుండాలకి నరేంద్ర కొరకంచు చేసిన గాయం చాల పెద్దది ! అది అంత త్వరలో మానేది కాదు. ఆ గుండాలకి , రాఖీ జాకీలు ఆస్పత్రి ఖర్చులు పెడతారని నేను అనుకోను. ఇక్కడే మనం స్కోరు చెయ్యాలి.
ఆ కుర్రవాడి గురించిన సమాచారం రాబట్టాడానికి నువ్వు ప్రయత్నిస్తూంటే, రాఖీ జాకీలు వాళ్లని నీ మీద ఉసిగొల్పారని, అంతే తప్ప వాళ్ల మీద మనకి శతృత్వం లేదనీ చెప్పి, ఆ ఆస్పత్రి ఖర్చులు మనం భరిస్తే చాలు, ఆ గుండాలు మన మంచితనానికి పడి పోతారు.” అంది శరణ్య.
“ నిజమే, శరణ్యా ! అయితే బయలు దేరుదామా ?” అంటూ లేచాడు అవినాష్.
మరి కొంత సేపటికి శరణ్య, అవినాషులు, ఆలీతో పాటు కారులో బయలు దేరారు.
నెరుల్ లోని డి.వై. పాటిల్ ఏక్సిడెంటల్ ఆస్పత్రి, చాలా ప్రముఖమైనది. ముందు రోజు ఇద్దరు రోగులు తొడల మీద నరాలు తెగి అక్కడ జాయన్ అయ్యారా, లేదా అని ఎంక్వైరీ చేసిన వెంటనే, ఆ రోగుల పేర్లు , చిరునామాలతో పాటు వాళ్ల కేసు హిస్టరీ బయట పడింది.
వాళ్ల పేర్లు సలీం అక్తర్. వాలీ సావంత్ ! కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే జరిగింది ! ఆపరేషన్ అవసరం ఉంది, కాని ఆ రోగుల ఫేమిలీ ఇంకా డబ్బు సమకూర్చ లేదు.వాళ్లు రౌడీ షిట్టర్లు కాబట్టి ఆ ఫేమిలీలకి ఇరుగు పొరుగు సహాయం కూడా దొరక లేదు !
(ఇంకా ఉంది)
Comments
Post a Comment